నాటి సాయిపథం – నేటి బాబాల పథం
‘సాయి నేర్పిన యోగా _
బాబాలు నేర్పుతున్న యోగా “
ఆనాటి బాబాకి చెప్పడమే కాదు,చెయ్యడం
కూడా తెలుసు.మోక్ష సాధనకే కాదు, మానసిక, శారీరక ఆరోగ్యానికి కూడా యోగా వెల
కట్టలేని సాధనం. యోగాభ్యాసం సక్రమంగా చేసినవారికి వైద్యునితో పని ఉండదు.భగవద్దర్శనం
కూడా కలుగుతుంది అన్నారు శ్రీ సాయినాథుడు.
శ్రీ ఆంజనేయస్వామి కూడా యోగాభ్యాసం
చేశాడు. తల్లి సీతాదేవి, తండ్రి శ్రీరామచంద్రుడే గురువులుగా యోగవిద్యని
అభ్యసించారు. నిరంతర సాధనతో దృఢచిత్తుడై
సీతారాముల్ని తన హృదయంలోనే నిలుపుకో గలిగాడు. చిరంజీవిగా మిగిలాడు. అలాగే బాబా కూడా దృఢమైన మనస్సు, ఆరోగ్యవంతమైన
శరీరంతో ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉండేవారు.ఆరోగ్యంగా ఉండాలనుకున్న ప్రతి వ్యక్తి
ప్రశాంత చిత్తుడై ఉండాలి. దానికి యోగా ఒక సాధనం కాగలదు.
ఏ విద్యకయినా గురువు ద్వారా శిక్షణ
అవసరం. ధౌతి, ఖండయోగము,సమాధి అని మూడు విధానాల్ని అనుసరించారు బాబా. క్రమ శిక్షణతో
యోగాభ్యాసాన్ని చేసినవారు అనారోగ్యాన్ని, ముసలితనాన్ని జయించడమే కాదు, ఆయుష్షు
పెంచుకుని ఆత్మసాక్షాత్కారాన్ని కూడా పొందవచ్చు. ఇంద్రియ నిగ్రహం, ఆహార నియమం,
స్థల నిర్ణయం తప్పనిసరిగా పాటించాలి. గురువు చెప్పిన విధంగా నేర్చుకుని ఆచరణలో పెట్టినవారు
చక్కటి ఆరోగ్యంతో పాటు నిండు నూరేళ్ళు జీవించవచ్చన్నారు బాబా.
********
ఈనాటి బాబాలకు శిష్య బాబాలు ఎక్కువ. యోగాభ్యాసం
విషయం పక్కన పెడితే....బాబాల యోగాభ్యాసం గురించి శిష్యుల ప్రచారం మాత్రం ఎక్కువే!
ఎంత ఎక్కువ మంది శిష్యులుంటే అంత గొప్ప యోగం బాబాలది. ఈనాడు యోగాభ్యాసం చేస్తున్న
వాళ్ళు పొందుతున్న లాభం సంగతేమోగాని, ఆభ్యసింప చేస్తున్న వాళ్ళకి మాత్రం యోగా
అందిస్తున్నది పసిడే!
యోగాభ్యాసం చేసిన ఆంజనేయుడు తన
గురువులయిన సీతారాముల్ని హృదయ ఫలకంలో ప్రతిష్టిస్తే, ఈనాటి శిష్యులు తమ బాబా
గురువుల నిలువెత్తు చిత్ర పటాలకి దండలేసి నిలబెడుతున్నారు. చిత్రపటంలోంచి
బయటకొచ్చి బాబాల ఆకారాలు శిష్య బాబాలకు కనిపించాలంటే ’లకారాలు’ ఉండాల్సిందే! వారికి తగినట్టు జన సేకరణ, నిధుల
సేకరణ, భారీగా ప్రచారాల హోరు, మంచి బందోబస్తు అమర్చకపోతే శిష్యులకి యోగా గురించి
తెలియనట్టేగా మరి! యోగా బాబాల్ని చూడగానే శిష్యులు ఇంద్రియ నిగ్రహాన్ని
పాటిస్తారో... కోల్పోతారో వాళ్ళ వాళ్ళ అభ్యాసాన్ని బట్టే ఉంటుంది.
కాలం వేగంగా పరుగెడుతున్న రోజులివి.
ఇంటిదగ్గర రెండు నిముషాలు కళ్ళు మూసుకుని కూర్చునే సమయం లేదు. అందుకే గంట అయునా
సరే ప్రయాణం చేసి వెళ్ళి మరీ నేర్చుకుంటున్నారు. అంత దూరం ప్రయాణం చేసి అలసట
పోయేదాక కళ్ళు మూసుకుని ప్రాణాయామం చేసి అలసట తీరగానే మళ్ళీ ప్రయాణం. దక్షిణ ముందే
ఇస్తున్నారు కాబట్టి వెళ్ళడమేగాని, మెడిటేషన్ పేరుతో నేర్చుకున్న దాన్ని ఎప్పుడైనా
ఎక్కడైనా చెయ్యచ్చు. మధ్యలో ఒక కునుకు పట్టినా మెడిటేషన్లో సర్దుకుపోతుంది.
యోగాభ్యాసం చేసే వయస్సు ’కాళ్ళూ చేతులూ కూడగట్టుకోలేని పెద్ద వయసులోనే’ అని భ్రమించి ప్రారంభిస్తే అనారోగ్యాన్ని, ముసలితనాన్ని జయించడానికి పడే
ప్రయాస శ్వాసనే ఆపేస్తుందేమో...ఎటు పోయి ఎటొచ్చినా జరుగుతున్నది భగవద్దర్శనమే!
chaalaa baagaa vraashaaru
ReplyDelete