కవిత -
"పిల్లతెమ్మెర సాక్షిగా.....!"
ప్రకృతే నేనన్నావు పరవశించానన్నావు
ఆ తేనె మాటలకు నేను పులకరించి పోయాను
నీ అడుగుల సవ్వడి నా హృదయంలో సుడినుడి..
నా హృదయ పీఠం మీద కట్టిస్తాను నీకు గుడి!
చేసేదీ నీవే...చేయించేదీ నీవే...
అక్కడ..ఇక్కడ..ఎక్కడైనా జీవిస్తున్నది నీతోనే!
ప్రతి రాత్రి నీకోసమే శివరాత్రి జాగారం
నీకు లేనే లేదు నాపై మమకారం!
చెట్టు కింద..పుట్ట కింద..గుట్ట కింద చెప్పిన
మథురమైన ఊసులెన్నెన్నో...!
భూత భవిష్యత్తు వర్తమానాల్లో...ఎప్పుడైనా..
పిల్ల తెమ్మెర సాక్షిగా...ఎప్పుడూ ఇదే మాటనీ...!
ఏకవచనం నాకు లేదనీ...
ప్రకృతివి నీవయితే పరమాత్మను నేనని
నమ్మబలికిన నీ మాటను ఆత్మలో నమ్మి
పరమాత్మవు నీవని కలిపాను నా జీవాత్మను నీలో!
అమాయకపు నా ఆతురత.. నీ చతురతకు లోబడి
భజనల ప్రవాహంలో ఈదులాడి మునకలేసి
చన్నీటి జలాల చల్లబడి నురుగునై ఒడ్డుకు అడ్డుపడి
చుట్టూ ఉన్న నురుగుని చూసి అసలు నిజం తెలుసుకుని
పరమాత్మకు ఒక్కటేమిటి?... లోకమంతా పనియని
ఏకవచనం పరమాత్మకే సొంతం..
జీవకాంతులు పెక్కులనీ....!
నిద్రలో మెలుకువలో పనిలో విశ్రాంతిలో
విన్నవన్నీ భ్రమయనీ .. మదిని తెలిసి
చెప్పనివెన్నో మదిలోనే ఒక్క గుటకతో
మింగేసి!
ప్రకృతే పరమాత్మ..,పరమాత్మే ప్రకృతనీ
విశ్వమంతా పరమాత్మే...నా ఉనికే భ్రమయని
ఆత్మలో నిన్నే నిలుపుకుని మమేకమై
నిన్నే పలవరించే నేను...నా ఉనికినే మరిచాను!!
No comments:
Post a Comment