నాటి సాయిపథం _ నేటి బాబాలపథం
“సాయికి భక్తుల పూజ _ భక్తులకు బాబాల పూజ “
అందరి మంచిని
కోరే బాబా,సమాజం మంచి మార్గం వైపు పయనించాలని భావించేవారు. ఈర్ష్య, ద్వేషం వదిలి
అపకారం చేసిన వాళ్ళకి కూడా కీడు తలపెట్టక ప్రతి పాణిలోను భగవంతుణ్ణి చూడమన్నారు.
యాగాలు, వ్రతాలు నోములతో పని లేదన్నారు. యాగాలు చెయ్యడం, పంచాగ్నుల మధ్య
కూర్చోవడం, మ౦త్రాలు చదవడం, జపాలు వేదాధ్యయనం ,అష్టాంగ యోగం వంటివి కొంత మందికే
పరిమితం. సామాన్యమానవుడు భగవన్నామాన్ని ఉచ్చరించడంతోనే మోక్షాన్ని
పొందవచ్చు.ఇంద్రియ సుఖాలు, ప్రాపంచిక విషయాలు కష్టాలు,దు:ఖాలు భగవంతుడికే వదిలేసి
భగవన్నామాన్ని మాత్రమే వదలకుండా పట్టుకోవాలి అన్నారు.సాయినామన్ని జపించిన వారిని
తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తూ అన్ని విషయాలలోను ఆదుకున్నారు బాబా.
భక్తుల్ని
ఉద్ధరించడానికి భగవంతుడే సిరిడీలో బాబాగా మానవ రూపంలో జన్మించాడని ఆనాటి భక్తులు
నమ్మారు. అంతేకాదు, అయనతో కలిసి జీవించిన తమ జన్మ సార్ధకమయిందని భావించి భగవంతునికి
ఆసనం సమర్పిస్తూ చిన్న పరుపుని వేశారు. కదలకుండా పీఠం వేసుకుని కూర్చునే బాబాకు
అనుకునేందుకు ఒక దిండును అమర్చి, అత్తర్లు, గంధం పూసేవారు. పాటలు పాడి వాయిద్యాలు
వాయించేవారు. విసిని కర్రలతోను,నెమలి ఈకలతోనూ విసిరి బాబాకు అలుపు లేకుండ
చూసేవారు. కొంత మంది చేతులు, పాదాలు కడిగితే మరి కొంత మంది నైవేద్యం పెట్టి
తాంబూలం ఇచ్చేవారు. సర్వాంతర్యామి అయిన భగవంతుడు తమ కోసమే బాబాను పంపించాడని
నమ్ముతూ శస్త్రోక్తంగా బాబాను పూజించేవారు.
భక్తులు తన కోసం
ఏమి చేసినా అన్నిటినీ పరమేశ్వరుడికే అర్పితం చేసేవారు శ్రీ సాయినాథుడు!
********
భక్తుల మంచిలోనే తమ మంచి ఉంటుందని గుర్తించిన
నేటి బాబాలు భక్తుల మంచినే కోరుతున్నారు. సమాజం ఎటు నడవాలని అనుకున్నారో అటువైపే
నడిపించడానికి భక్తుల సహకారం ఎంతైనా అవసరం. అది తెలిసిన నేటి బాబాలు తాము నడుస్తున్న
మార్గం లోనే భక్తుల్ని కూడా నడిపించి సమాజ శ్రేయస్సుకి కృషి చేస్తున్నారు.ఈర్ష్య
ద్వేషాలు వదిలి తమ భక్తుల్ని అన్నిదేశాల్లోనూ దర్శించుకుని వస్తున్నారు.
భగవన్నామం ఉచ్చరించడానికే
సమయంలేని సామాన్య మానవుడు పెద్ద పెద్ద పూజల గురించి ఎలా ఆలోచించ గలడు? అలాగే సంపాదనలో
తలమునకలు అవుతున్న మర మనిషికి ప్రతి నిముషం విలివైనదే కనుక అతడు ఆలోచించలేక పోవడం
కూడా సహజమే! ప్రాపంచిక విషయాలు, కుటుంబ విషయాలు గాలిదేవుడికి వదిలేసి ఇంద్రియ
సుఖాల్ని గట్టిగా పట్టుకుని పయనిస్తున్న భక్తుల కోసం అంతర్జాలంలో ఉండి పూజలు
జరిపిస్తున్నారు.ఆ విధంగ చేయిస్తున్నందుకు నేటి బాబాలకు భగవదనుగ్రహం ఉందో లేదో తెలియదుగాని,
భక్తుల నుంచి మాత్రం భక్తానుగ్రహం పొందుతున్నారు.
పూజ చేయించేవాడు
అంతర్జాలంలో ఉండి, పూజింప బడేవాడు అంతర్ధానంలో ఉన్నా..చేసే పూజ మాత్రం
శాస్త్రోక్తంగానే జరుగుతోంది. భక్తుడికి తక్కువయింది సమయం గాని, భక్తి కాదుగా!
ఆసనం వెయ్యడం దగ్గర్నుంచి నైవేద్యం వరకు యథావిధిగా భజనలు, మంగళ హరతులు, దక్షిణలతో
వైభవో పేతంగా జరిపిస్తున్నారు.
భగవంతుడి ద్వారా
భక్తుడు ఏం పొందుతున్నాడో గాని, భక్తుడు బాబాలకిచ్చింది మాత్రం “పరమేశ్వరార్పణం!”
No comments:
Post a Comment