బాలల కథలు
అందరి దేవుడు ఒకడే
రాము వాళ్ళ పాఠశాలలో గ్రంథాలయం ఉంది. వాళ్ళ టీచరు
చదువుకోడానికి వాళ్లకి ఒక మంచి కథల పుస్తకం ఇస్తూ ఉంటారు. రాము అందులో చదివిన కథని
గుర్తుపెట్టుకుని ఇంటికి వచ్చాక తన స్నేహితులకి చెప్తూ ఉంటాడు. అది వాళ్ళకి ఒక
అలవాటుగా మారింది. అందుకోసం ప్రతి రోజు సాయంత్రం అందరూ ఒక చోట కలుసుకుంటారు. ఆ
రోజు అందరూ శరత్ వాళ్ళ వరి పొలంలో ఉన్న గడ్డిమేటు దగ్గర కలుసుకున్నారు. అందరూ
కాసేపు కబుర్లు చెప్పుకుని కథ వినడానికి
సిద్ధమయ్యారు. రాము కథ చెప్పడం మొదలుపెట్టాడు.
శరత్! ఈ కథ వల్ల మనలో ఇంకా ఐకమత్యం
పెరుగుతుంది. మనం పెద్దవాళ్ళమయ్యాక కూడా విడిపోకుండా కలిసి మెలిసి ఉంటాం. కథ వినండి మరి...మనం వాయుదేవుడు,
అగ్నిదేవుడు, సూర్యదేవుడు అంటూ చాలామంది దేవుళ్ళ గురించి వింటున్నాం. అలాగే అసలు
దేవుడు ఒకడే ఉన్నాడని కూడా వింటున్నాం. దాన్ని గురించే ఇప్పుడు ఈ కథ ద్వారా
తెలుసుకుంటున్నాం.
ఒకసారి రాక్షసులకి, దేవతలకి మధ్య యుద్ధం
జరిగింది. దేవుళ్లందరూ కలిసి బాగా యుద్ధం చేసి రాక్షసుల్ని ఓడించారు. రాక్షసుల్ని
జయించిన సంతోషంతో దేవుళ్లందరూ వాళ్ళని వాళ్ళే అభినందించుకున్నారు. అందరూ ఒకచోట కలిసి
సంబరం చేసుకోవాలని కూడా అనుకున్నారు.
వాళ్ళ ఆనందానికి అంతులేకుండా పోయింది.
రాక్షసుల్ని ఓడించడానికి తమ బలపరాక్రమాలే కారణమని, తమ కష్టంతోనే రాక్షసుల్ని
ఓడించగలిగామని విర్రవీగి పోతున్నారు. వాళ్ళు ఓడించింది మమూలువాళ్ళని
కాదుకదా...రాక్షసుల్ని! ఎంత కష్టం? అందుకే అంత అహంకారం. ఇదంతా అసలు దేవుడు చూస్తున్నాడు.
వీళ్ళందరు తమకున్న బలంతోనే రాక్షసుల్ని ఓడించామని అనుకుంటున్నారు...దేనికైనా
భగవంతుడి సహకారం అవసరమని, అది వాళ్ళకి ఉంది కాబట్టే రాక్షసుల్ని ఓడించగలిగారని
వీళ్ళకి తెలియట్లేదు. అది తెలిస్తేనే గాని వీళ్ళ అహంకారం తగ్గదు అనుకున్నాడు.
అసలు దేవుడు ఒక సాధువు వేషంలో వచ్చి వాళ్లకి
కొంచెం దూరంలో కూర్చున్నాడు. దేవుళ్ళు అతణ్ణి చూసి ఈ సాధువు ఎవరో, ఇక్కడికి ఎలా
వచ్చాడో, అతడికి ఉన్న శక్తి ఏమిటో తెలుసుకోవాలి అనుకున్నారు. అగ్నిదేవుణ్ణి పిలిచి
“అగ్నీ! నువ్వు వెళ్ళి అతడి
విషయం ఏమిటో పూర్తిగా తెలుసుకుని, మన పరాక్రమం గురించి కూడా చెప్పిరా!” అన్నారు.
అగ్నిదేవుడు సాధువు దగ్గరికి వెళ్ళి “నువ్వెవరివి, ఇక్కడికి ఎందుకు వచ్చావు?” అని దర్పంగా అడిగాడు. సాధువు అగ్నిదేవుడికి
సమాధానం చెప్పకుండానే “అసలు నువ్వెవరు?” అని ఎదురు ప్రశ్న వేశాడు.
అగ్నిదేవుడు గట్టిగా నవ్వి “నేనెవరో తెలియదా నీకు? నాపేరు అగ్నిదేవుడు” అన్నాడు దర్పంగా. “అయితే నీకు ఉన్న శక్తి ఏమిటో చెప్పు” అని అడిగాడు సాధువు. “ఈ భూమి మీద ఉన్న ఏ వస్తువునైనా సరే నేను నా వేడితో కాల్చి మసి చేసెయ్యగలను” అన్నాడు అగ్నిదేవుడు గర్వంగా.
సాధువు ఒక గడ్డిపోచని కింద పెట్టి “దీన్ని మసి చేసి చూపించు!” అన్నాడు. ఇంతేనా అనుకుని వేడిగా ఉండే తన
ఊపిరితో గడ్డి పోచని కాల్చి మసి చెయ్యాలని గట్టిగా ఊదాడు. ఎంత ఊదినా అది మాడలేదు.
మంటల్ని సృష్టించి దాన్ని మాడ్చాలని ఎంత ప్రయత్నించినా ఆ గడ్డిపోచ మాడలేదు. అగ్ని
సిగ్గుపడి తల వంచుకుని మిగిలిన దేవుళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి జరిగిన విషయం
చెప్పాడు.
ఈ సారి దేవుళ్ళందరూ మాట్లాడుకుని వాయుదేవుణ్ణి
సాధువు దగ్గరికి పంపించారు. వాయుదేవుడు సాధువు దగ్గరికి వెళ్ళి “ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు?” అని అడిగాడు. అది విని సాధువు సమాధానం చెప్పకుండా. “అసలు నువ్వు ఏంచేస్తుంటావు? నీకు ఉన్న శక్తి ఏమిటి?” అని తనే ఎదురు ప్రశ్న వేశాడు. “నా పేరు వాయువు. నేను వాయుగుండాలు, తుఫాన్లు సృష్టించగలను” అన్నాడు ధీమాగా.
సాధువు ఒక గడ్డి పోచ తీసి కింద పెట్టి, “అయితే నీ బలంతో దీన్ని కదుపు” అన్నాడు. వాయుదేవుడు దాన్ని చూసి ఇంతేనా అనుకుని,
తన శక్తినంతటినీ ఉపయోగించాడు కాని ఆ గడ్డి పోచ మాత్రం కదల్లేదు. సిగ్గుపడి వెనక్కి
వెళ్ళిపోయి జరిగిన విషయం మిగిలిన దేవుళ్ళకి చెప్పాడు.
ఈ సారి సాధువు సంగతేమిటో తెలుసుకుని రమ్మని
వాళ్ళు ఇంద్రుణ్ణి పంపించారు. తమ దేవుళ్ళకి సహాయం చెయ్యడానికి ఇంద్రుడు బయలుదేరి వెళ్ళగానే
సాధువు అక్కడి నుంచి మాయమైపోయాడు. ఇంద్రుడు అయోమయంగా అన్ని వైపులకి చూస్తున్నాడు.
తను వచ్చిన పని పూర్తి చెయ్యాలంటే సాధువు కనిపించాలి. అంతలో అక్కడ సాధువుకి బదులు ఒక
దేవత ప్రత్యక్షమైంది.
ఇంద్రుడు దేవతని చూసి “ఇంతవరకు ఇక్కడ ఉన్న సాధువు ఎవరు? ఏమయ్యాడు?” అని అడిగాడు. దేవత ”ఇంద్రా! అతడే అసలు దేవుడు. మీరందరు భగవంతుడి సహకారం
లేకుండా ఏ పని జరగదు అనే విషయాన్ని మర్చిపోయారు. రాక్షసుల్ని ఓడించడానికి మీకున్న
బలమే కారణం అనే భ్రమలో ఉన్నారు. మీకందరికీ సహాయం చేస్తున్న దేవుడు ఒకడు ఉన్నాడని,
అతడి వల్లే మీరు కూడా అన్ని పనులు చెయ్య కలుగుతున్నారని తెలుసుకోలేక పోయారు. ఆయన
సహకారం లేనప్పుడు గడ్డి పోచని కూడా కదిలించలేక పోయారు. అది తెలియ చెప్పడానికే
భగవంతుడు సాధువు రూపంలో ఇక్కడికి వచ్చాడు. ఆ నిజాన్ని తెలుసుకున్న వాళ్లల్లో నువ్వు
మొదటివాడివి, నీ తరువాత అగ్ని, తరువాత వాయువు” అని చెప్పి వెళ్ళిపోయింది దేవత.
అందుకే దేవతల్లో మొదటివాడు ఇంద్రుడు, తరువాత
అగ్ని, తరువాత వాయువు అని చెప్తుంటారు. రాక్షసుల్ని చంపడానికి అవసరమైనంత శక్తిని వాళ్ళకి
దేవుడు ఇచ్చాడు. అంటే దేవుడు ఒక్కడే అన్నమాట. దేవుడు ఏ రూపంలో ఉంటే మనకి ఇష్టమో ఆ
రూపంలో మనం దేవుణ్ణి కొలుస్తున్నాం. ఎవరికీ కనిపించని ఆ దేవుడు మంచివాళ్ళని ఎప్పుడూ
రక్షిస్తూనే ఉంటాడు. మతాలు ఎన్ని ఉన్నా...రూపాలు, పేర్లు ఎన్ని ఉన్నా...మేమే
దేవుళ్ళం అని ఎంతమంది చెప్పుకున్నా కూడా దేవుడు మాత్రం ఒక్కడే!! అని ఈ కథ వల్ల తెలుస్తోంది
కదా! అందుకని మనమందరం పెద్దవాళ్ళమయ్యాక కూడా మంచిపనులు చేస్తూ కలిసిమెలిసి ఉందాం! “ అని తను చెప్తున్న కథని పూర్తి చేశాడు రాము.
భమిడిపాటి బాలాత్రిపురసుందరి
ఫిబ్రవరి 2016 ఆంధ్రభూమి
సంచారవాణి: 9440174797
ఆంధ్రభూమి మెరుపులో
పడింది.
No comments:
Post a Comment