నమ్మకానికి మరో పేరు
ఆమె చాలా
సామాన్యమైన స్త్రీ, కాని, ఆమె నమ్మకం చాలా గొప్పది. ఆ నమ్మకంతోనే ఆమె జీవితంలో
అసాధ్యమైనదాన్ని సాధ్యామయినదాన్నిగా చేసుకోగలిగింది.
ఆమె ఎవరో కాదు శబరి. ఆమె కథ భారతీయులందరికీ తెలుసు. శబరి అనగానే ఆశ్రమం
తలుపు దగ్గర ఎవరి కోసమో ఆతృతతో ఎదురు చూస్తూ నిలబడిన ఒక వృద్ధురాలి చిత్రం మన
మనస్సులో మెదులుతుంది.
అప్పుడు
శబరి చాలా చిన్నపిల్ల. ఆమెకి చదవడంకాని, రాయడంకాని రాదు. అంకితభావంతో సేవ చెయ్యడం
మాత్రమే ఆమెకి తెలుసు. బాల్యంనుంచి ఆమె జీవితం అడవిలో చెట్లు, పక్షులు, జంతువులతో
గడిచి పోయింది. గుహల్లోను, ఆశ్రమాల్లోను తపస్సు చేసుకుంటూ ఉండే మహర్షులకి సేవ
చేస్తూ ఎక్కువ కాలం గడిపేసింది. వాళ్ళకి అవసరమయిన అగ్నిహోత్రం, పూలు, పండ్లు,
నీళ్ళు అన్నీ అమర్చి పెట్టేది.
కొంచెం
పెరిగి పెద్దదయ్యాక అటు వైపు వచ్చే సాధువులకి సేవ చేసేది. ఆమెకి కోరికలు, ఆశలు, ఇష్టాలు
ఏవీ ఉండేవి కావు. ఆమె అడవిలో స్వేచ్ఛగా ఒక పక్షిలా సంతృప్తిగా తన జీవితాన్ని
గడిపేసింది.
మునులు
కూడా శబరి అంకితభావంతో చేసే సేవకి సంతోషించేవారు. ఒక మహర్షి శబరిని “”అమ్మా! శబరీ! నీది చాలా మంచి
మనస్సు. నీలో ఉన్న అంకితభావం చాలా గొప్పది. ఏదో ఒక రోజు శ్రీరామచంద్రుడు వచ్చి
నిన్ను అశీర్వదిస్తాడు!”” అన్నాడు. మహర్షి చెప్పిన ఆ మాటల్ని విని ఆయన చెప్పినట్టు
జరుగుతుందని నమ్మింది.
శబరి
మనస్సు చిన్నపిల్లల మనస్సులా కల్మషం లేనిది. ఆమె మనస్సులో ప్రశ్నలు కాని, సందేహాలు
కాని ఏవీ ఉండేవి కావు. చిన్న పిల్లల మనస్సులో ఉన్నట్టు నమ్మకం మాత్రమే ఉండేది.
రాముడు వస్తాడని మహర్షి చెప్పాడు కనుక
రాముడు తప్పకుండా వస్తాడు. ఎప్పుడు వస్తాడో ఆమెకి తెలియక పోయినా మహర్షి చెప్పిన
విషయం తప్పకుండ జరుగుతుంది అనే నమ్మకం ఆమెకి బలంగా ఉంది.
రాముడి
ఆశీస్సులు తీసుకునే రోజు, ఆయన్ని సేవించుకునే రోజు ఎప్పుడు వస్తుందో తెలియదు.
అకస్మాత్తుగా రాముడు వస్తే అతడికి ఇవ్వడానికి ఏమీ లేవు కదా... అనుకుని అప్పటి
నుంచే ఏర్పాట్లు మొదలు పేట్టేసింది.
తన
ఆశ్రమాన్ని శుభ్రం చేసుకుంది. ఏ రోజుకారోజు చల్లటి మంచి నీళ్ళు తెచ్చి
పెట్టుకునేది. తన దగ్గర ఉన్న మొత్తం సామాను తను ఉపయోగించినా ఉపయోగించక పోయినా
ప్రతి రోజు తోముకుని పెట్టుకునేది. రాముడు వస్తే ఆయన్ని ఎక్కడ కూర్చోబెట్టాలి? బండ
రాయి మీద, నేలమీద రాముడు కూర్చోలేడు. మెత్తగా ఉండేలా ఆసనం ఏదయినా అమర్చాలి అనుకుని
లేత పచ్చగడ్డిని కోసుకుని వచ్చి కూర్చునేందుకు వీలుగా కుట్టి ఉంచేది.
రాముడు
ఏం తింటాడో? అనుకుని అడవిలో ఏ కాలంలో ఏ పండ్లు దొరుకుతాయో వాటిలో తాజాగాను,
రుచిగాను ఉన్న వాటిని సేకరించి ఆశ్రమానికి తీసుకుని వచ్చేది. శబరి తపస్వినిగా,
భగవంతుని యందు అంకితభావం ఉండేటట్టుగా తనకి తానుగానే మలుచుకుంది.
రాను
రాను ఆమె అడవంతా తిరుగుతూ పండ్లు, పూలు, గడ్డి, ఆకులు సేకరిస్తూ పాడే పాటలు అడవంతా
వినిపిస్తూ ఉండేవి. అక్కడ ప్రవహించే పంపా నది ఆమె పాటల్ని నలువైపులా
ప్రతిధ్వనించేలా చేసేది. పండ్లు ఏరుకొస్తూ శబరి “ఒకవేళ నేను పెట్టిన పండ్లు
పుల్లగా ఉంటే? అమ్మో! నా ఆశ్రమంలో అటువంటి పండ్లు తిని రాముడు బాధపడ కూడదు” అనుకునేది. అందుకని ప్రతి
పండు రుచి చూసి తియ్యగా ఉన్న పండ్లని ఉంచి, బాగుండని వాటిని అక్కడే పారేసి
వచ్చేది.
అలా ఏ
రోజుకి ఆ రోజు శబరి తాజాగా ఉండే పండ్లని ఏరుకొచ్చి ఉంచేది. అమె నిర్మలమైన మనస్సులో
రాముడు రాడేమో అనే సందేహం ఎపుడూ కలిగేది కాదు. ఆమెకి ఎప్పుడూ ఒకటే ఆలోచన...రాముడు
అకస్మాత్తుగా వస్తే అతణ్ణి ఎలా సంతోష పెట్టాలి! అని.
రాముడు
వస్తే ఎలా సేవించాలి అనుకుంటూ ఏర్పాట్లు చేసుకోవడంతోనే ఆమెకి రోజు మొదలయ్యేది. ఏ
నిముషంలో రాముడు వచ్చినా ఆతిథ్యం ఇవ్వడానికి ఆమె సిద్ధంగా ఉండేది. తలుపు దగ్గరే
ఎదురుచూస్తూ ఉండేది. ఎవరేనా అటువైపు నడుస్తూ వెడుతున్నప్పుడు వినబడిన ఎండు అకుల
శబ్దానికి ఉలిక్కిపడి రాముడు వస్తున్నాడనుకుని పరుగున వెళ్ళి చూసేది. రాముడు కాదని
తెలిసి నిరుత్సాహ పడేది. శబరి జీవితమంతా రాముడి ఆలోచనలతోనే గడిపింది. ఆమె జీవితం
రాముడే, అమె ధ్యానం రాముడే, ఆమె ఊపిరి రాముడే!
రోజులు
గడిచిపోయాయి. ఇప్పుడు శబరి చిన్నపిల్ల కాదు. పండుటాకులా పండిపోయిన ముదుసలి. అయినా
ఒక్క రోజు కూడా రాముణ్ణి సేవించడం కోసం ఏర్పాట్లు చెయ్యడం మానలేదు. తనకు మహర్షి
చెప్పిన మాటలు నిజం కావని ఒక్కసారి కూడా శబరి అనుకోలేదు. విశ్వాసం కొండల్ని కూడా
కదిలించ కలదు. శబరి
రాముడి రాక కోసం ఏళ్ళతరబడి ఎదురు చూస్తూనే
ఉంది. చివరికి అమె నమ్మకం గెలిచింది. తను ఏ రోజు కోసం సంవత్సరాలుగా ఎదురు
చూస్తోందో ఆ రోజు రానే వచ్చింది.
రాముడు
తన ఆశ్రమం వైపు నడిచి వస్తున్నాడు. శబరి తన ఆశ్రమం గుమ్మం దగ్గర నిలబడి చూస్తోంది.
ఇద్దరు సూర్యులు దారి వెంట నడుస్తూ తన ఆశ్రమం వైపు వస్తున్నట్టు శబరికి
అనిపించింది. ఆ ప్రదేశమంతా రామలక్ష్మణుల కీర్తి ప్రకాశంతో వెలిగి పోతోంది. ఆమె
ఆశ్చర్యపోయింది. అంత వరకు అమెకి ముసలితనం వల్ల కనిపించని వస్తువులన్నీ ఇప్పుడు
స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొంచెం సేపు అంతా తికమకగా అనిపించింది. తరువాత తన
ఎదురు చూపులు ఫలించాయి అనుకుంది. తన మనస్సు చెప్తోంది... వస్తున్నది నిజంగా
రాముడే! తన రాముడే! అని. లక్ష్మణుడితో కలిసి తన ఆశ్రమం వైపే వస్తున్నాడు. శబరి
పొందిన ఆనందాన్ని చెప్పడానికి భాషలో ఉన్న అక్షరాలు చాలవు.
గొప్ప
ప్రకాశంతో వెలిగిపోతూ తన ఆశ్రమంలోకూర్చున్న రామలక్ష్మణుల తేజస్సు ఆడవంతా
వ్యాపించింది. వాళ్ళిద్దరి రాకతో అడవి ధన్యత పొందింది. అందుకు కారణమైన శబరిని ఆడవి
మొత్తం కృతజ్ఞతతో చూస్తోంది. రాముడు తన భక్తురాలిమీద ఆత్మీయతని కురిపిస్తున్నాడు.
ఆమె ఇచ్చిన ఆతిథ్యంతో రాముడూ తృప్తి పడట్లేదు...తను సేకరించి తీసుకు వచ్చిన పండ్లు
పెట్టిన శబరి కూడా తృప్తిపడట్లేదు. శబరి తినిపిస్తూనే ఉంది. రామలక్ష్మణులు తింటూనే
ఉన్నారు.
తెచ్చిన
పండ్లని మొదట తను కొరికి రుచి చూసి రుచిగా ఉన్నాయి అనుకున్నవాటినే రామలక్ష్మణులకి
తినడానికి ఇస్తోంది. అమె పెట్టిన వాటిని రామలక్ష్మణులు ఇద్దరూ సంతోషంగా తిన్నారు.
సువాసనలు వెదజల్లే పువ్వులతో రాముడి పాదలు పూజించింది. తను స్వయంగా కట్టిన
పూలమాలల్ని రాముడి మెడలో అలంకరించింది.
ఎన్ని విధాలుగా రాముణ్ణి సేవించికున్నా శబరికి ఇంకా తృప్తి కలగలేదు.
శబరి భక్తికి, అంకిత భావంతో చేసిన సేవకి మెచ్చిన రాముడు ఆమెకి మోక్షాన్ని
ప్రసాదించాడు. “ అందరూ మెచ్చే విధంగా స్వచ్ఛమైన మనస్సు, బలమైన నమ్మకం, భగవంతుడి యందు భక్తి కలవాళ్ళ కోరికల్ని భగవంతుడు అడగకుండానే తీరుస్తాడు” అన్నారు
స్వామి వివేకానందుడు.
శబరి
తనకు మహర్షి చెప్పిన మాట మీద ఉన్న నమ్మకం ఉంచింది. తనకు తానుగా అంకితభావాన్ని,
నమ్మకాన్ని, సేవాభావాన్ని పెంచుకుని భగవంతుడైన రాముడి ఆశీస్సుల్ని పొందింది.
శబరి తన
ఒంటరి జీవితంలో ఎన్ని
ఆపదలు కలిగినా రాముడు వస్తాడని నమ్మడం
వల్ల ఆపదల్నితనకు అవసరమైన అవకాశాలుగా మలుచుకుని భగవంతుని అవతారమైన రాముణ్ణి
సేవించి తరించింది. రాముడి పేరు వినిపించినంత కాలం శబరి పేరు కూడా ఈ భూమి మీద
వినబడుతూనే ఉంటుంది. నమ్మకానికి మరో పేరు శబరి.
No comments:
Post a Comment