నాటి సాయిపథం _ నేటి బాబాలపథం!
“సాయి సత్సంగం _ బాబాల
సత్సంగం!”
గురువుగారి మాటలు మనస్సు మీద బాగా
పని చెయ్యాలంటే కాస్తో కూస్తో భక్తి, మంచితనం కలిగి ఉండాలి.అటువంటి వాళ్ళు ఒకచోట
చేరి మరికొంత మందికి జ్ఞానోపదేశం చేసి మంచి మార్గం వైపు నడిపించాలి.దాన్నే సత్సంగం
అంటారు.ఆనాటి సత్సంగాన్ని వివరించారు బాబా.
మనం కలుస్తున్న వాళ్ళల్లో
గురువయినా,యోగయినా,సన్యాసి అయినా,మన చుట్టూ ఉండే మనుషులయినా ఎటువంటివారో
తెలుసుకోవాలంటే వారు చేస్తున్న పనులు,ఇతరులతో వారి ప్రవర్తన,ఆహారపు అలవాట్లు
వంటివి ముందుగా తెలుసు కోవాలి.వాళ్ళతో కలిసి కొంత కాలం గడిపితేనే అది సాధ్య
పడుతుంది. ఆత్మశుద్ధి,వాక్సుద్ధి కలిగిన యోగులు,గురువులు,సన్యాసులు పైకి ఒక
విధంగానూ మనస్సులో మరో విధంగానూ కాకుండా మంచితనం కలిగి,భగవద్బక్తితో ఆత్మనందాన్ని
పొందుతూ ప్రశాంతంగానూ గొప్ప తేజస్సుతోనూ వెలుగుతుంటారు.
ఎల్లప్పుడూ కళ్ళు మూసుకుని
భగవంతుణ్నే తల్చుకుంటూ కూర్చుంటే రోజు గడవదు కదా...అందుకే సత్సంగం!సద్గురువు దగ్గర
అందరూ చేరి భగవంతుని గురించిన కథలు, పాటలు, భజనలు, మాటలతో పాటు అందరి మధ్య స్నేహం
ఏర్పడుతుంది. స్నేహితుల మధ్య కష్ట సుఖాలు,సలహాలు, సంప్రదింపులు,సమస్యలకు పరిష్కారాలు
దొరికి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మనస్సులో అలజడి లేనప్పుడు భగవంతుని మీద ఏకాగ్రత
కూడా కుదురుతుంది.ప్రతి రోజూ మనం మానకుండా చేసే పనులు అనేకం ఉంటాయి. వాటిలో
సత్సంగం కూడా చేరిస్తే మంచిది.
జన్మ రాహిత్యం వరకు వెళ్ళలేక పోయినా
జన్మ నిచ్చిన వారితో జన్మసాన్నిహిత్యాన్నయినా పొందచ్చు అన్నారు శ్రీసాయినాథుడు.
*********
సత్సంగం ఆనాడే కాదు...ఈనాడూ ఉంది.
ఆనాటి సత్సంగమే పేరు రూపాంతరం చెంది మీటింగు పేరుతో పిలవబడుతోంది. మీటింగు ఏర్పాటు
చేసిన వ్యక్తి చెప్పిన విషయాలు మనస్సుకి నచ్చినప్పుడు ఇంకో పది మందిని
కూడగట్టుకుని వెళ్ళడం సహజమే!
అప్పుడయినా ఇప్పుడయినా వాక్సుద్ధి,
భక్తి, మంచితనం కలిగినవాళ్ళు ప్రత్యేకమయిన తేజస్సుతో కనిపిస్తారు. ఊసరవెల్లిలా
ఎప్పటి కప్పుడు రంగులు మారిపోతున్న ఈనాటి సమాజంలో ఎంత కాలం కలిసి గడిపినా వారి
వారి స్వభావాలు తెలుసుకోవడం కష్టమే! చేస్తున్న పనుల్లోనూ, ప్రవర్తనలోను పారదర్శకత
లేనప్పుడు పరిస్థితుల్ని బట్టి మార్పులు తప్పవుగా మరి! శరవేగంతో పుట్టగొడుగుల్లా
పుట్టుకొస్తున్న బాబాలు వారి జ్ఞానంతో ఏ పనిలో ఎంత ఆనందం ఉందో స్వానుభవంతో
చెప్తున్నారు.వారికి పెద్దలు దాసోహం అంటూ ఉన్నారు. సామాన్యులు వాటిని ఆదరించడానికి
శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఇదీ ఈనాటి సత్సంగం.
ఈనాటి సత్సంగాల్లో కూడా భజనలు,నాటికలు,పాటలు,సన్మానాలు
వంటివి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. వివిధ అంశాలలో పోటీలు పడుతూ...పోటీలు
పెడుతున్నారు. అవసరాలు తీరడానికి ఇది కూడా ఒక మార్గమే! ఈనాటి బాబాలు ఆశించినట్టు
సత్సంగాల వల్ల కుల,మత,రాజకీయ స్నేహాలు అభిమానాలు పెరిగి ఎవరి సమస్యలు వారు పరిష్కరించుకుంటూనే
ఉన్నారు.అది అందరికీ సాధ్య పడకపోయినా దానికి తగిన విశ్వాసం,వాక్పటిమ,దూరదృష్టి
ఉన్నవారు రాణిస్తూనే ఉన్నారు.
సన్మనాలు స్వయంగా చేయించుకునేవారు
ఉన్నంత వరకు సత్సంగాలకు కొదువ లేదు!!
No comments:
Post a Comment