నాటి సాయిపథం _ నేటి బాబాల పథం
భక్తులకి ధ్యానం సాధనం _ భక్తులకి సాధనమే
ధ్యానం
ఆత్మసాక్షాత్కారం పొందాలంటే భక్తి మార్గాన్ని
ఆశ్రయించాలి. అమావాస్య తరువాత ప్రకాశవంతమైన గీతలా కనిపించే విదియ చంద్రుడు రోజు
రోజుకీ వృద్ధి పొందుతూ పౌర్ణమినాడు పూర్ణ రూపంతో ఏ విధంగా కనిపిస్తాడో...అదే
విధంగా భక్తితో ధ్యానం చెయ్యగా చెయ్యగా...భగవంతుని యొక్క పూర్ణ రూపాన్ని
దర్శించవచ్చు అన్నారు బాబా. తమకు ఎదురుగా ఉన్న భగవంతుని యొక్క పూర్ణ రూపమే బాబాగా
ధ్యానించారు ఆనాటి భక్తులు.
బాబాను దర్శించి పాపాలు పోగుట్టుకుని, కష్టాలు
తీర్చుకుని వెళ్ళే బాబా భక్తులు...ఆయన జ్ఞానాన్ని గుర్తించి, ఆయన ప్రేరణతో
జీవిస్తూ ఆకాశంలో కనిపించే చుక్కల్ని, పైనుంచి పడే వర్షపు చినుకుల్నీ లెక్కపెట్ట
వచ్చు. గాలిని తెచ్చి సంచీలోకి ఎక్కించవచ్చు. కాని, బాబా లీలలు. బాబా చేసిన వైద్య
సేవలు మాత్రం లెక్కించలేము! అన్నారు.
పురాణ కాలంలో మహర్షులు తపస్సు చేసుకునే
ప్రదేశంలో సాధు జంతువులు, క్రూర జంతువులు కలిసి మెలిసి జీవించేవని చెప్తూ... ఎక్కడైనా
అనంతమైన భక్తితో భగవన్నామం జరుగుతున్న సమయంలో కౄర జంతువులు కూడా సాధు జంతువులుగా
మారి ఎవరికీ కీడు తలపెట్టవు. అదే భక్తి యొక్క ప్రభావమన్నారు బాబా.
జంతువుల్ని చూసి మనుషులు భయపడినట్టే,
మనుషుల్ని చూసి జంతువులు కూడా భయపడతాయి. ప్రాణ భయంతో కౄర జంతువుల్ని కూడా
చంపకూడదన్నారు. ఏ ప్రాణినీ చంపే హక్కు మనిషికి లేదు. ప్రాణికోటిని సృష్టించిన
భగవంతుడికి కూడా ప్రాణుల్ని చంపే హక్కు లేదు. అన్ని ప్రాణులూ కూడా భగవంతుని ఆజ్ఞ
ప్రకారమే నడుచుకుంటాయి. జ్ఞానవంతుడైన మనిషికి ఉండాల్సింది కొంచెం ఓర్పు మాత్రమే!
అన్నారు.
భగవంతుణ్ణి నమ్మి, తమ భారాన్ని భగవంతుడి మీద
పెడితే చాలు..ఆయనే మనల్ని రక్షిస్తాడు అన్నారు శ్రీసాయినాధుడు!
********
భగవత్సాక్షాత్కారానికి భక్తి మార్గాన్నే
ప్రధానంగా ఎంచుకుంటున్నారు ఈనాటి భక్తులు కూడా! ఈనాడు బాబాల దర్శనం కలగాలంటే మార్గం
రేఖామాత్రంగానే ఉంటుంది. దర్శించాలన్న తపన ఉండాలేగాని, పూర్ణ రూపం చూపించడానికి
బాబాలు ఎప్పుడూ సంసిద్ధంగానే ఉంటారు. రేఖా మార్గంలో పయనిస్తూ మార్గం సుగమం చేసుకో
గలిగే చాకచక్యం భక్తులకి ఉంటే చాలు!
బాబాల దర్శనం చేసిన భక్తులు భక్తి మైకంలో వెను
తిరగలేక...బాబాల లీలలు మనస్సులో దాచుకోలేక...పైకి చెప్పడానికి తగిన భాష
రాక...ఆత్మాభిమానంతో ఆత్మసాక్షాత్కారాన్ని పొంది మోక్షం కోసం ఎదురు చూస్తూ వారి
చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉంటారు.
పురాణ కాలంలోనే కాదు, ఆధునిక కాలంలో కూడా
యోగిపుంగవులు ధ్యానం చేసుకునే ప్రదేశంలో అన్ని జంతువులూ కలిసి మెలిసే ఉంటున్నాయి.
ధ్యానం మీద ధ్యాస పెరిగిన కొద్దీ జంతువులన్నీ ఒకే మార్గంలోకి పయనిస్తూ .. భక్తి
పారవశ్యంతో మునిగి కళ్ళు మూసుకుని భగవన్నామం జపిస్తున్న సమయంలో కౄర జంతువులు ఏం
చేసినా తెలుసుకోలేని తన్మయత్వంలో మునిగి పోతాయి సాధు జంతువులు. అంతా యోగి పుంగవుల
లీలలే!
ఈనాడు మనుషుల్ని చూసి జంతువులే భయపడుతున్నాయి.
ఆత్మసాక్షాత్కారం పొందలేని ప్రతి భక్తుడూ జంతు స్వభావానికి దగ్గరవుతున్నాడు. స్వయం
శక్తితో మోక్షాన్ని పొందలేని భక్తగణం బాబాల ఆదేశాల్ని అనుసరించి నడుచుకుంటూ
మోక్షాన్ని పొందుతూనే ఉన్నారు.
నమ్మిన భక్తుల్ని ఎలా ఆదుకోవాలో బాబాలకు
ఆరితేరిన విద్య. వారి కోరిక ఒకటే...’సర్వే జనా: సుఖినో భవంతు!!”
No comments:
Post a Comment