నాటి సాయి పథం _ నేటి బాబాల పథం
గ్రంథ పఠన జ్ఞానం _ దూరదర్శన జ్ఞానం
ఉపనిషత్తులు పురాణాలు వంటి ఉద్గ్రంధాలు చదవలేక
పోయినా భగవంతుని గురించి తెలియ చేసేదిగాని, మంచి విషయాలు వివరించేది గాని ఏదైనా
గ్రంథం లభించినప్పుడు తప్పనిసరిగా చదవాలన్నారు బాబా.
పారాయణ అంటే ఆచరించడం కనుక ఒకసారి అర్ధం
కాకపోయినా నెమ్మది నెమ్మదిగా మళ్ళీ మళ్ళీ చదవాలి. తెలియని విషయాలు అడిగి
తెలుసుకోవడం చిన్నతనంగా భావించ కూడదు. ఆచరణ యోగ్యమైన విషయాలు పది మందికి తెలియ
చెప్పడం వలన జ్ఞానం పెరుగుతుంది కాని, తరగదు. అవసరమైన గ్రంథం లేనప్పుడు అది ఎవరి
దగ్గరుందో తెలుసుకుని అడిగి తెచ్చుకుని...తన దగ్గరున్న మరో గ్రంథాన్ని వారికి
ఇవ్వాలి. విషయాలు చర్చించుకోడం ద్వారా కూడా జ్ఞానాన్ని పెంచుకోవచ్చు. తెచ్చుకున్న
గ్రంథం తిరిగి ఇవ్వకపోవడం దొంగతనమే అవుతుంది అన్నారు బాబా.
గ్రంథ పారాయణకు నియమాలు, ఆచారాలు లేవు.
భగవన్నామ పారాయణ గ్రంథం చదవగా చదవగా అలవాటుగా మారుతుంది. పారాయణ చెయ్యడమంటే ఆ
చివరి నుంచి ఈ చివరి వరకు చదవడం కాదు. ఆచరించి జ్ఞానం పెంచుకోవాలి. గ్రంథాన్ని
చెత్తోపట్టుకోవడం లోనూ, చదవడంలోనూ కూడా భక్తి శ్రద్ధలు ఉండాలి. అప్పుడే దానిలో
ఉండే విషయాలు ఆచరించడంలో కూడా శ్రద్ధ కలుగుతుంది.
తల్లితండులు జన్మనిస్తే గురువులు
విద్యాబుద్ధులు నేర్పిస్తారు. గ్రంథ పఠనం జ్ఞానాన్ని ఇస్తుంది. గురుశిష్యుల మధ్య
భేదభావం ఉండ కూడదు. శిష్యుడు కూడా కాబోయే గురువే కదా..! తనకు తెలిసిన విషయాలన్నీ
బోధించి శిష్యుణ్ణి గురువుని మించిన శిష్యుడిగా మలచడం గురువు బాధ్యత. గురువు
చెప్పిన విధంగా నడుచుకుని గురువుగా ఎదగడం శిష్యుడి కర్తవ్యం! అన్నారు
శ్రీసాయినాథుడు.
********
గ్రంథ పఠనమే లేనప్పుడు అవి
ఉపనిషత్తులా..పురాణాలా అన్న ప్రశ్నే లేదు. దూరదర్శనంలో జగత్తే కనిపిస్తున్నప్పుడు
ఈ పఠనాలు ఎందుకు? ఏది చూడాలో తెలియక మార్చి మార్చి చూస్తూ...ఏది మంచో ఏది చెడో అనే
విషయం పక్కన పెడితే...ఏది ఆకర్షిస్తోందో దాన్నే చూడగలిగిన అవకాశం ఉన్నప్పుడు
భగవంతుడికి సంబంధించినవి మాత్రమే చూడ్డం ఎవరికి సాధ్యం? దేనికైనా పూర్వజన్మ సుకృతం
ఉండాలి.
బ్రేకుల తర్వాత బ్రేకులతో ముందు
జరిగిందేమిటో...తరువాత జరిగేదేమిటో చూపిస్తూ... చూసే కార్యక్రమాలు ఆచరణ యోగ్యమా కాదా అని
ఆలోచించుకునే అవకాశమే ఉండదు. ఎన్ని సంవత్సరాలు గడిచినా ముగింపే లేనప్పుడు
ఆలోచించేది, ఆచరించేది ఎప్పుడు? వింటున్నవీ, కంటున్నవీ ఆచరణ యోగ్యమైనవే అయితే పది మందికీ
చెప్పచ్చు. అవునో కాదో నిర్ణయించుకోలేనప్పుడు ఇతరులకు చెప్పక పోవడమే మంచిది.
పొరపాటున గ్రంథ పఠనం చెయ్యలనుకున్నా సొంత
గ్రంథాలు ఎక్కడివి? దిన పత్రికే కొని చదివే అలవాటు లేని ఈ రోజుల్లో అడిగి
తెచ్చుకున్న గ్రంథాలని చదివినా చదవక పోయినా వాటిని తిరిగి ఇస్తే చాలు. భగన్నామ
పారాయణ గ్రంథాలు చదవగా చదవగా నోటికి అలవాటుగా మారుతాయి అన్నది నిజమే అయినా పారాయణ
చేద్దామన్న ఆలోచన మనస్సుకి ఆలోచనగా మారాలిగా! ఈనాడు అంత తీరికా, అంత కోరికా రెండూ
లేవు. ఏదయినా చెయ్యాలన్న కోరిక, శ్రద్ధ బలీయంగా ఉంటే సాధించే తీరతారు.
తల్లితండ్రులు, గురువులు, గ్రంథాలు ఎన్ని
చెప్పినా, ఏవి నేర్చినా...దూరదర్శనంలో కనువిందు చేస్తూ కనిపిస్తున్నవే జ్ఞానాన్ని
ఇస్తాయి గాని,చదివి అర్ధం చేసుకుని జ్ఞానం పొందే ఓర్పు ఎవరికి ఉంది? గురువు
శిష్యుడికి చెప్పి, శిష్యుడు వాటిని ఆచరించి గురువుగా ఎదగడం కంటే సరాసరి, గురువుగా
ఎదగడమే తేలికనుకుంటున్నారు ఈనాటి శిష్యులు. ఎవరికి ఏది ఇష్టమో దాన్ని మాత్రమే చెప్ప
గలిగే జ్ఞానం చాలు ఈనాటి గురువుకి!!
No comments:
Post a Comment