నేనెవరో…! అసలు తెలుసా మీకు? (ప్రపంచ కవి సమ్మేళనం అంతర్వేది 2015)
ఉదయించే సూర్యుడి నుంచి దూసుకొచ్చిన కిరణాలు
గలగలా పారే గోదావరి అలలమీద ఉయ్యాలలూగుతూ...
అటుఇటు కదులుతూ... వెండితీగల్లా మెరుస్తూ సంభ్రమం
కలిగిస్తుంటే...
వాటివైపే చూస్తున్న కవి కళ్ళల్లో మెరిసే కాంతుల్లో ఉంటాను
నేను!
జంట ఎద్దులు,
కొమ్ములకి కట్టిన గంటల మోతతో లయబద్ధంగా నడిచి
నాగలితో దున్నిన పంటపొలం మొదట నల్లగా నిగనిగలాడుతూ
ఆనక విత్తనాలు మొలకెత్తి తివాచీ పరిచినట్టు పచ్చదనం
పరుచుకున్న
పైరుమీద నుంచి వచ్చే గాలికి శరీరం పులకరించి,
మనస్సు పరవశిస్తుంటే...
అరమోడ్పు కళ్ళతో చూస్తున్న కవి మనస్సులో ఉంటాను
నేను!
తెల్లవారిందని కోడి లేచి చెప్పగానే...మగువలంతా
నిద్ర లేచి ముంగిట ముగ్గులు దిద్ది
దైవసేవకి సమయమని గుడిగంటలు చెప్పగానే...
రంగు రంగుల దుస్తులతో...తడి ఆరని కురులతో..నుదిటికి
అద్దిన సిందూరం..
ఎర్రటి కాంతులు చిందించి ..అప్పుడే ఉదయించిన సూర్యకాంతిని
మరిపిస్తూ,
గుడి చుట్టూ తిరుగుతూ..కోరికల చిట్టా
చదువుతూ..భక్తి పారవశ్యంలో మునిగుంటే..
అయోమయంగా చూస్తున్న కవి భావావేశంలోఉంటాను నేను!
చాకిరేవు బండ దగ్గర... బట్టల గుట్టలు పెట్టి ..చీర
మడిచి పైకి కట్టి,
నడుము చుట్టూ కొంగు తిప్పి ..వంగీ లేచీ
ఉతుకుతుంటే..లయబద్ధంగా వినిపించే
చప్పుళ్ళకి.. గుండె చప్పుడు లయతప్పి.. కళ్ళతో
చూస్తున్నఆ చిత్రం
మనస్సు లోతుల్లోకి చొచ్చుకుని..దృశ్య రూపంగా మారి
గిలిగింతలు పెడుతుంటే...
ఆసక్తిగా చూస్తున్న కవి హృదయ పీఠం మీద చిత్రమై ఉంటాను
నేను!
బడిగంట వినగానే ఉరకలేస్తూ పరుగుతీస్తూ...చదువు భారం
వీపు మీద..
మనసంతా ఆట్లమీద...రాబోయే కాలాన్ని ఊహించలేని పసి
మనసులు
గేటు తీసి వెళ్ళగానే..గేటు మూసి బంధించి...అన్ని
భాషల్లో చదివించి..అనందాన్ని హరించి
శక్తి మొత్తం క్షీణించి ..వాడిపోయిన ముఖాలతో గేటు
తోసి వస్తుంటే..
కరుణతో చుస్తున్న కవి మనస్సులో విద్యార్థినై ఉంటాను
నేను!
బడి పక్కన కల్లుపాక..గుడి పక్కన కల్లుపాక..చెప్పి
చెప్పి పొల్లుపోక..
కూలినాలి చేసుకొచ్చి సందెవేళ ఊరి చివరి కల్లుపాకకు
చేరుతుంటే...
ఎవరికి మొర పెట్టుకోవాలో.. ముడుపు ఎవరికి
కట్టుకోవాలో..
తెలియని వనితలు వెతలెన్నో అనుభవిస్తూ... సంసారం
నడపలేక..
అమ్మ మనస్సు పగిలిపోయి...కన్నీళ్ళూ
ఇంకిపోయి...దీనంగా గడుపుతుంటే...
అర్ధం చేసుకున్న కవి కన్నీళ్ళ పొరల్లో ఉంటాను నేను!
ఆనందంలోనూ నేనే..బాధలోనూ నేనే.. కథలో- కావ్యంలో, పద్యంలో-గద్యంలో,
మనుషుల్లో-మృగాల్లో, పక్షుల్లో-ప్రకృతిలో,ఆకాశంలో,
నీటిలో భూమి మీద ఎక్కడైనా
అక్కడ ఇక్కడ అని లేక ..స్పందించే హృదయానికి
విశ్వమంతా కనిపిస్తాను నేను
నేనున్న చోట కవి ఉంటాడు...కవి ఉన్నంతకాలం నేనుంటాను
తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న పుణ్యప్రదేశం
అంతర్వేదికి
నృసింహస్వామి పాదాలమీద పరిమళ భరిత పుష్పాన్నై...
ప్రపంచ కవి సమ్మేళనానికి అనేక రూపాలతో వచ్చాను నేను...
స్వామి ఆశీస్సులతో ...ఇప్పుడు ప్రపంచామంతా నేనే
ఉంటాను!!
“నేనెవరో... ! అసలు తెలుసా మీకు...?“
కవి హృదయంలో ఉండే కవితా కన్యను నేనే!
No comments:
Post a Comment