About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

తెలుగు ప్రజల మొదటి పండుగ ఉగాది


                                      తెలుగు ప్రజల మొదటి పండుగ ఉగాది       
                                    మార్చి 2017 మన ఆరోగ్యం మాసపత్రిక
   గడిచి పోతున్న జీవితంలో ఉత్సహన్ని ఉల్లాసాన్ని నింపుకుంటూ కుటుంబ సంబంధాలు, స్నేహం, మానవత్వం వంటివాటిని నిలుపుకుంటూ అనందంగా జరుపుకునేవి పండుగలు.
   ప్రాంతాన్ని, భాషని బట్టే అచార వ్యవహారాలు, సంస్కృతి నడుస్తూ ఉంటాయి. ప్రాంతము, భాష, సంస్కృతి ఒకదానితో ఒకటి ముడిపడే ఉంటాయి.
   ఏ పండుగ జరుపుకున్నా ఆ యా ఋతువుల్ని అనుసరించి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేసుకునే పిండివంటలు కూడా నిర్ణయింప బడ్డాయి.
    ఏ పండుగకి ఏ పిండివంటలు చెయ్యాలో,  ఏ పదార్ధం ఏ దేవుడికి నైవేద్యంగా పెట్టాలో కూడా పూర్వ కాలం నుంచి వస్తున్నసంస్కృతిలో భాగమే.
   ప్రతి పండుగరోజు ఆ పండుగ జరుపుకోడానికి కారణం, అందువల్ల ప్రయోజనము తెలియ చేసే విధంగా పాటలు, ఆటలు హరికథలు, బుర్ర కథలు వంటివి తెలుగుజాతి సంస్కృతిని నిలబెట్టడంలో ముఖ్య పాత్రని పోషిస్తున్నాయి.
   ప్రాచీన సంస్కృతిని గొప్ప సంపదగా భద్రపరిచి ఎక్కడా ఆగిపోకుండా తరతరాలకి అందిస్తున్నది మనము జరుపుకుంటున్న పండుగలే!
   కొత్త తెలుగు సంవవత్సరం మొదటి నెల మొదటి రోజు జరుపుకునే పండుగ యుగాది లేక ఉగాది. ఇది పూర్తిగా తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే పండుగ.
   రాబోతున్న కొత్త తెలుగు సంవత్సరం పేరు ’హేవళంబి’. మొదటి మాసం చైత్రంలో శుద్ధ పాడ్యమి రోజు ఉగాది పండుగని జరుపుకోబోతున్నాం.
   దీన్ని మొదటి తెలుగు పండుగ అంటారు. మామిడి ఆకులతో ఇంటికి తోరణాలు కట్టుకుని ఉదయాన్నే ఉగాది పచ్చడిని తిని, కొత్త పంచాగానికి పూజ చేస్తారు. సాయంత్రం పంచాంగ శ్రవణం చెయ్యడం ఆచారంగా వస్తోంది.
నూతన సంవత్సర కీర్తనాత్ ప్రారంభ: ప్రతిగృహ ధ్వజారోహణం|
నింబపుష్పాశనం సంవత్సర పంచాంగం శ్రవణం నవరాత్రారంభ: ||
   అన్ని రుచులు కలిగిన ఉగాది పచ్చడి తినడమంటే జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాల్ని ఒకేలా స్వీకరించడం అని అర్ధం. ఈ పచ్చడికి వాడే ప్రతి వస్తువు వెనుక ఆరోగ్య రహస్యం దాగి ఉంది. అన్ని రుచులూ కలిగిన ఆహారం తీసుకుంటే... ”శతాయర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయచ”. నిండు నూరేళ్ళు  వజ్రంతో సమానమైన దేహం కలిగి జీవిస్తారు అని అర్ధం.
   ఉగాది రోజు పశువుల్ని పూజించడం ఆచారంగా వస్తోంది. గ్రామీణులకి పాడిపంటలే సిరిసంపదలు. అవి అందుకోడానికి సహయపడుతున్నవి పశువులు. అందుకే పశువుల్ని పూజించడం సంస్కృతిలో ఒక భాగంగా మారింది.
   కొత్త పంటలు చేతికి రాగానే ముందుగా నైవేద్యం పెడతారు. తరువాత తిరగలికి, రోలుకి, చల్లగుంజకి, కూరాడుకి కూడా పెట్టి ఆ నైవేద్యాన్ని ఆడపడుచులు, కోడళ్ళు కలిసి తింటారు.
   వసంతఋతువు ప్రవేశిస్తుంది కనుక వసంతనవరాత్రులు, వసంత మాధవ పూజలు, వసంతోత్సవాలు జరుపుకుంటారు. చలివేంద్రాలు ఏర్పాటు చేస్తారు.
   చెప్పులు, గొడుగులు దానంగా ఇస్తారు. ఇది మన పెద్దల నుంచి వస్తున్న ఆచారం.
    సాయంకాల సమయంలో కొత్త సంవత్సరంలో జరగబోయే మంచి చెడ్డల్ని; ఆదాయ-వ్యయాలు; వానా-వరదలు; ధరలు, లాభ నష్టాలు; మొదలైన సంవత్సరంలో కలిగే  ఫలితాల్ని పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకుంటారు. దీన్ని ఒక పుణ్య కార్యంగా భావిస్తారు.
   ఇంక పండుగ వస్తే యాచకుల సందడి మామూలే!  పెట్టిన వాళ్ళని పొగడడం, పెట్టని వాళ్ళని తిట్టడం. “పెడితే పెళ్ళి- పెట్టకపోటే శ్రాద్ధం” అనే సామెత దీన్నుంచే వచ్చిందేమో!
   ఉగాది మొదలు పెట్టి పది రోజులు బంధువులు, స్నేహితులు కలిసి ఊరి బయట ఉన్న ప్రదేశానికి వెడతారు. వెళ్ళేటప్పుడు తమతో కొన్ని పిండివంటలు కూడా తీసుకుని వెడతారు. వాటిని తిని రోజంతా సంతోషంగా అక్కడే గడుపుతారు.
   దీన్ని ఉగాది జాతర అంటారు. రైతుల దగ్గర పనిచేసే జీతగాళ్ళు మళ్ళీ అక్కడే పని చెయ్యడమో...వేరే యజమాని దగ్గర పనికి చేరడమో ఉగాది రోజే నిర్ణయించుకుంటారు.
   ఉగాది సంబరం కొత్త బట్టలు, పిండివంటలు, పంచాంగ శ్రవణంతోనే పూర్తవదు. అసలు ఉత్సాహం వసంత మాసంలో ప్రకృతి పచ్చదనానికి పులకరించే కోయిలల కుహూ! కుహూ! రావాలతో నిండి ఉంటుంది.
వసంత ఋతువు అందాల్ని ఎర్రన గారు అరణ్య పర్వంలో ఇలా వర్ణించారు.
త్రేనులు గ్రోలి క్రోలి కడుతియ్యని కమ్మని పండులింపు సొం
పానగ నానియాని పరపందిన నీడలు సొచ్చి సొచ్చి మం
దానిల శైత్య సౌరభ సమగ్రతకుం గడు జొక్కి చొక్కియు
ద్యానమునందు మారుతసుత ప్రముఖుల్ విహరించి తృప్తులై.  
    కవుల కవితా గానాలు, పద్య పఠనాలు, అవధానాలతో చైత్ర మాసం మొత్తం ఉత్సాహంగాను, ఉల్లాసంగాను గడిచి పోతుంది.
   తెలుగు భాషని మాట్లాడే ప్రజల సంస్కృతి సంప్రదయాల ప్రాచీనతని తెలియ చేసే ఉగాది పండుగ తెలుగు ప్రజలకు మొదటి పండుగ!!

   కొత్త సంవత్సరంలో పాఠకులందరూ ఏ కష్టమూ లేకుండ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ప్రశాంత జీవనాన్ని గడపాలని మనసారా కోరుకుంటూ.. 

No comments:

Post a Comment