రాతిగా మారిన నాతి
చాలాకాలం క్రితమే
అమెని సామన్య స్త్రీగా కూడా మర్చిపోయాం. కాని అమెని పవిత్రమైన స్త్రీగా చరిత్ర మర్చిపోకుండా
గుర్తుపెట్టుకుంది.
అమె గౌతమ మహర్షి
భార్య అహల్య. సన్యాసికి మహర్షికి మధ్య తేడా ఉంది. సన్యాసి అంటే గృహసంబంధమైన
సంబంధాలు ఉండవు. అన్నీత్యాగం చేసి వచ్చేస్తారు.
ఋషికి
కుటుంబం ఉంటుంది కాని, నగరంలో జీవించరు. సమాజానికి దూరంగా వచ్చి జీవిస్తూ
ఆధ్యాత్మిక చింతనతో పరమాత్మను గురించి తెలుసుకోడంలో మునిగి ఉంటారు.
శిష్యులకి
విద్య బోధిస్తూ ఆ సంపాదనతో జీవిస్తారు. పూర్వం విద్యార్థులే గురువు దగ్గర ఉండి
వాళ్లతో కలిసి జీవించేవాళ్ళు. క్రమశిక్షణతో విద్య నేర్చుకుని విద్యాభ్యాసం
పూర్తయ్యాక తిరిగి సమాజంలోకి అడుగు పెట్టేవాళ్ళు.
గౌతమ మహర్షి తన
భార్యతో కలిసి అడవిలో జీవించేవాడు. అహల్య కూడా అంకిత భావంతో భర్తకి సేవ చేసేది.
తెలియకుండానే ఆమె జీవితంలో ఒక తప్పు జరిగి పోయింది. తప్పులు అందరూ చేస్తూనే ఉంటారు.
కాని, ఆ రోజుల్లో చిన్న తప్పుకి కూడా పెద్ద శిక్షలు ఉండేవి.
తప్పు అహల్య
చెయ్యక పోయినా జరిగిన తప్పుకి ఆమె బాధ్యురాలయింది. నీతికి ప్రాధాన్యత ఇచ్చే
గౌతముడు అహల్య తనని మోసం చేసిందనుకుని కోపంతో మండిపడ్డాడు.
ఒక్క
క్షణమయినా ఓర్పు వహించి ఉంటే తన భార్య పరిస్థితి ఏమిటో ఆయనకి అర్థమై ఉండేది. కాని
అంతవరకు ఆగకుండా వెంటనే శపించాడు.
మహర్షి అహల్యని
పాషాణంగా మారమని శపించాడు. అహల్య తన దురదృష్టాన్నే అదృష్టంగా భావించింది.
చిన్నప్పుడు ఓర్పుకి మొదటి ఉదాహరణ భూదేవే అని తెలుసుకుంది. అదే ఇప్పుడు ఆమెకి
ఉపయోగపడింది. తనకి పెద్ద శిక్ష పడుతోందని తెలిసినా ఓర్పుతో సహించింది.
తెలియక జరిగినా
తనవల్ల తప్పు జరిగింది. అందుకు శిక్ష అనుభవించడానికి ఆమె సిద్ధంగా ఉంది. కొంత సమయం గడిచాక గౌతముడికి కోపం తగ్గింది.
తన భార్య వల్ల
జరిగిన తప్పు పెద్దదేమీ కాదు. అయినా తను కొంత సమయం ఓర్పుతో ఆలోచించకుండా ఆమెని
శిక్షించాడు. తను అనలోచితంగా ఆమెకి వేసిన శిక్ష చాలా పెద్దది అనుకుని పశ్చాత్తాప
పడ్డాడు. ఇచ్చిన శాపాన్ని ఆమె అనుభవించక తప్పదు కదా!
గౌతముడు భార్యతో ““ఒక్కొక్కసారి ఒకళ్ళు చేసిన తప్పుకి మరొకళ్ళు
బాధ పడవలసి వస్తుంది. ఏది జరిగినా మన
పూర్వజన్మ కర్మ వల్ల జరుగుతుంది.
నువ్వు ఎల్లకాలమూ
ఇదే విధంగా ఉండకుండ శాప విమోచనం జరిగే మార్గం కూడా నేనే చెప్తాను. కొంతకాలం గడిచాక
శ్రీరామచంద్రుడు గురువుగారితో కలిసి ఇటు వస్తాడు.
ఆ సమయంలో అతడి పాదస్పర్శకి నీకు శాపవిమోచనం కలుగుతుంది. అది అతి త్వరలో
జరుగుతుంది.
ఇతరులకి ఆదర్శ
వనితగా నువ్వు చరిత్రలో గొప్ప ఉదాహరణగా నిలిచిపోతావు. ఆపదలో భగవంతుడిని తలుస్తే
దాని నుండి బయట పడే అవకాశం దానంతట అదే వస్తుంది.”” అన్నాడు.
అంతా విన్న అహల్య
అనుకుంది కష్టపడకుండా దేన్నీ సాధించలేం!” అని.
రాయిగా బ్రతకడం
వల్ల ఇంతకంటే ఏ అపకారమూ జరగదు. ఇలా జరగడం తన పూర్వజన్మ సుకృతం అనుకుంది. అహల్యకి పెద్ద
ఆపదే కలిగినా అదే ఆమెకి అవకాశంగా మారింది.
రాయిగా మారినా
ఆమెకు జ్ఞానం ఉంది. అందుకే జరిగినదానికి కోపంగాని, బాధగాని ఆమెకి లేవు. తనకి
కలిగిన పరిస్థితికి లోబడి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ గడిపేస్తోంది.
కర్మఫలాన్నిఅనుభవించేప్పుడు
భగవంతుడిని ప్రార్థిస్తూ మంచి పనులు చేసుకుంటూ పోతే కష్టాలు అనుభవిస్తున్నామనే
ఆలోచన కలగదు. విధిని ఎవరూ ఎదిరించలేరు.
“ఎప్పుడు రాముడి
పవిత్ర పాదస్పర్శ తగులుతుందో అప్పుడు శాపవిముక్తి జరుగుతుంది” అని మహర్షి చెప్పాడు.
ఇది అసాధ్యమే అయినా జరిగి తీరాలి. మహర్షుల మాటలు ఎప్పుడూ తప్పవు.
భగదవతారమైన శీరాముడు
అడవిలోకి రావాలి, అహల్య ఉన్న వైపు నడవాలి, రాయిగా మారిన అహల్యకి అతడి పాదం తగలాలి.
అప్పుడు అహల్యకి శాపవిముక్తి కలగాలి.
మహర్షి శాపం
ఇచ్చాడు, శాపవిమోచనం జరుగుతుందని కూడా చెప్పాడు. అది ఎప్పుడు జరుగుందో తెలియదు,
దాని విధానంలో అది జరుగుతుంది అన్నాడు.
అహల్య ఓర్పుతో
రాముడి రాక కోసం ఎదురు చూస్తోంది. ఎండలో ఎండుతూ, వానలో తడుస్తూ, రాముడిని
తల్చుకుంటూ, అతడి రాకకోసం ప్రార్థిస్తూ తమ ఆశ్రమం దగ్గరే రాయిలా పడి ఉంది.
ఆమె ప్రార్ధన
ఫలించింది. రాముడు వచ్చాడు. ఆడవిలో ఆమె ఎక్కడయితే రాయిగా మారి పడి ఉందో సరిగ్గా అదే
ఆశ్రమం వైపు వచ్చాడు.
అతడి పవిత్రమైన
పాదాలు ఆ రాయికి తగిలాయి. వెంటనే రాయి గొప్పతేజస్సు కలిగిన స్త్రీమూర్తిగా మారి
లేచి నిలబడింది. ఆమెని చూసి రాముడు చాలా ఆశ్చర్యపోయాడు.
అమె అతడి పాదాలకి
నమస్కరించింది. అంకిత భావంతోను, భక్తి శ్రద్ధలతోను ప్రార్థిస్తూ, శాపాన్ని
అనుభవిస్తూ ఎండలోను, వానలోను, చలిలోను, వేడిలోను తను వచ్చి రక్షిస్తాడని ఎదురు చూస్తూ
ఉన్న ఆమెని చూసి రాముడు మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు.
అదే సమయంలో
గౌతమమహర్షి కూడా అక్కడికి వచ్చాడు.
ఒక సామాన్య
స్త్రీ అయిన అహల్య తనకు కలిగిన ఆపదనే అవకాశంగా మార్చుకుని భగవంతుడిని ప్రార్ధించి ఉన్నతమైన
స్థితికి చేరింది. ఆదర్శవంతమైన అయిదుగురు మహిళల్లో ఒక మహిళగా నిలిచింది.
మిగిలిన నలుగురు
మండోదరి, తార, సీత, సావిత్రి. ప్రపంచంలో ఉన్న స్త్రీలందరు అనుసరించ తగిన ఆదర్శవంతమైన
చరిత్ర ఉన్నవాళ్ళు ఈ అయిదుగురే.
మనం అందరం
తప్పులు చేస్తాం కాని వాటిని అధిగమించడానికి ప్రయత్నించం. “ఎప్పుడూ ఆనందాన్ని ఆనందంగా
అనుభవించడం కాదు...బాధల్ని కూడా ఆనందంగానే అనుభవించాలి. ప్రార్ధనలతోగాని,
నిస్వార్ధ సేవతోగాని వాటిని అధిగమించడానికి ప్రయత్నించాలి.
ఎవరయితే
కష్టపడతారో వాళ్లకి భగవంతుడి సహాయం తప్పకుండ అందుతుంది”అన్నారు స్వామి
వివేకానందుడు.
అహల్య పాషాణంగా మారి ఆపదలో పడినా... ఆ ఆపదే తనకి
కలిగిన అవకాశంగా భావించి దానికి అనుగుణంగా
నడుచుకుని భగవంతుడిని తన దగ్గరికే రప్పించుకుంది. జనన మరణాలు లేని మోక్షాన్ని కూడా
పొందింది.
No comments:
Post a Comment