About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

నాటి సాయిపథం – నేటి బాబాల పథం



భక్తులది భక్తి బరువు _ భక్తికి నైవేద్యమే బరువు
   
   బాబా సలహా కోసం వచ్చిన భక్తులు తిరిగి వెళ్ళేప్పుడు బాబా ఆశీర్వాదం ,అనుమతి తీసుకుని వెళ్ళేవారు. అలా వెడితేనే ప్రయాణం సుఖంగా జరుగుతుందని, అనుకున్న పనులు జరుగుతాయని ఆనాటి భక్తుల నమ్మకం.
   బాబా మాటని గౌరవించకుండ వెళ్ళిన వాళ్ళు ప్రమాదాల్లో ఇరుక్కునేవాళ్ళు. ప్రయాణం చేస్తున్న సమయం మంచిది కానప్పుడు పెద్దలు హెచ్చరించే తీరాలి! అనుకునేవారు బాబా.
    భక్తులు తమకు బాధ కలిగినప్పుడు మొక్కుకుని , బాధలనుండి బయట పడ్డాక మర్చిపోయినప్పుడు ఏదో ఒక విధంగా భగవంతుడే ఆ మొక్కుల్ని వసూలు చేసుకుంటాడు అని చెప్పేవారు బాబా.
   ఏ వస్తువైనా భగవంతుడు ఇస్తేనే మనకు లభిస్తుంది. అందుకే భగవంతుడు మనకు ఇచ్చిన దానిని కొందరికైనా పంచాలి. భగవంతుడే భక్తుడి రూపంలో వచ్చి ఆ ప్రసాదాన్నితింటాడు. తనొక్కడే తినేస్తే అది తనకు చెందదని... ఇతరులకు పెట్టిందే తనకు చెందుతుంది కనుక, ఇతరులకి పెట్టి తినాలి! అన్నారు.
   భగవంతుడు భక్తుడు పెట్టిన నైవేద్యాని కంటే, అతడికి తనపై ఉన్న భక్తికే లొంగుతాడు. ఫలము, పత్రము,పుష్పము లేదా ఒక ఉద్ధరిణి నీళ్ళయినా చాలు భక్తితో సమర్పిస్తే !
   భక్తి భావం లేకుండా టన్నులకొద్దీ బరువుతో అందర్నీ ఆకర్షించడమే ధ్యేయంగా నైవేద్యాలు పెట్టినా భగవంతుడు గ్రహించడు. భక్తుని మనస్సులో ఉన్న భక్తి భావం యొక్క బరువుని మాత్రమే కొలుస్తాడు. భక్తియొక్క బరువుని, ఏకాగ్రతని పెంచుకుని మోక్షానికి దారి వెతుక్కోవాలి అన్నారు  శ్రీ సాయినాథుడు.
                                                  
                                                              ********
      ఊరినుండి వచ్చి తిరిగి వెళ్ళేఫ్పుడో, ముఖ్యమయిన పని మీద వెళ్ళేఫ్పుడో దేవుడికి, అమ్మనాన్నలకు దండం పెట్టడం ఆచారంగా వస్తోంది. ఆ అలవాటు కొంత తప్పి పోతున్న మాట నిజమే కాని, ఆచరిస్తున్నవాళ్ళు లేకపోలేదు.
    మంచి సమయం చూసుకుని పెద్దల అనుమతి తీసుకుని  ప్రయాణం చెస్తే కష్టపడకుండా గమ్యస్థానం చేరి, అనుకున్న పనులు నెరవేరుతాయన్న నమ్మకం ఈనాడు కూడా ఉంది. కాని, నమ్మకం మాట పక్కన పెడితే ఈనాటి యువతకి పెద్దలు చెప్పింది చాదస్తంగా అనిపిస్తోంది. అయినా పెద్దలు తమ ధర్మాన్ని వదలకూడదు!
   బాధల్లో ఉన్నప్పుడు భగవంతుడికి కాక మరెవరికి మొక్కుతారు? ఎదురుగా కనిపించకపోయినా బాధలు తీర్చేది ఆయనేగా! ఈనాడు భక్తులకి ఎవరి భగవంతుడు వారికున్నాడు.
   పెట్టిన నైవేద్యంలో కొంత భాగం ఎవరికి పంచాలో వారికే పంచుతాడు. తనొక్కడే భోంచేస్తే భక్తుల భక్తి తగ్గి పోవచ్చు కదా? అయినా ఆ జీవాత్ముడికి తెలియంది ఏముంది కనుక!
   ఈనాడు భగవంతుడు పండో, పువ్వో, ఆకో, కాయో ఇస్తే తృప్తి పొందడు...కలియుగ దేవుడు కదా! భక్తి బరువు కంటే  నైవేద్యం బరువుకే ఎక్కువ ప్రాధాన్యత. టన్నుల బరువుతో నైవేద్యం పెట్టి, దాన్ని టిన్నుల్లో పెట్టి వేలం వేస్తే  వచ్చిన కాసుల బరువే ఈనాటి భక్తుల భక్తి బరువు.
   ఆ విధమైన భక్తి బరువు మీద ఏకాగ్రత పెట్టి, లక్ష్య సాధనకు కృషి చేసి, తమ భగవంతుని ఆశీస్సులు పొందితే ఈ లోకంలో, ఈ సమయంలో భక్తుడు పొందలేనిదీ, భవంతుడు ఇవ్వలేనిదీ ఏదీ లేదు.


No comments:

Post a Comment