నాటి సాయిపథం _ నేటి బాబాల పథం
జన్మ సార్ధకత _ జన్మ సాధికారికత
సృష్టిలో ఎన్నో జీవరాసులున్నాయి. అన్ని
జీవరాసుల్లోకి ఉత్తమమైంది మానవజన్మ. రకరకాల జన్మల్ని అనుభవించి పొందిన పుణ్యం వల్ల
దొరికేది మానవజన్మ.అప్పటికి బోలెడంత జ్ఞానం సంపాదించుకుని మోక్షానికి దగ్గారగా
చేరినట్టన్నమాట!
అలోచించడానికి మనస్సు, ఉపయోగించు కోవడానికి అవయవాలు, భగవన్నామం ఉచ్చరించడానికి నోరు కలిగి, పుణ్యకార్యాలు చేసి మోక్షం పొందడానికి
ఉపయోగపడే ఈ జన్మకి సార్ధకత చేకూర్చుకోమన్నారు శ్రీసాయినాధుడు.
మంచి మనస్సుతో అన్నీ జీవరాసుల యందు ప్రేమ
కలిగి ఉండాలి.మనిషి చేసిన పాప పుణ్య కార్యాల్ని బట్టే తరువాత జన్మ నిర్ణయింప బడుతుంది.
బుద్దిని బట్టే కర్మ నడుస్తుంది.బుధ్ధి సక్రమంగా ఉంటే చేసే కర్మ కూడా మంచిది అవుతుంది.అదే
తిరిగి పొంద బోయే జన్మకు పెట్టుబడి అవుతుంది.కాబట్టి, భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని నినియోగించుకుని
మోక్షాని పొందమన్నారు బాబా.
భగవంతుని
సృష్టిలో అన్ని జీవరాసులకి తినడం,నిద్ర ఫొవడం,భయం,సుఖ దుఖా:లు,కోరికలు
వంటివి సమానంగానే ఉంటాయి. మిగిలిన జీవరాసులకు లేనిది, మనిషికి మాత్రమే ఉన్నది
జ్ఞానం, ఆలోచనాశక్తి. క్రమబద్దమైన జీవితాన్ని జీవిస్తూ ఆరోగ్యకరంగా జీవించడానికి
తగినట్టుగ ఆహారం తీసుకుంటూ శరీరాన్ని మోక్ష సాధనకి ఉపయోగించే సాధనంగా భావించి,
దేహాభిమానం వదులు కోవాలి. మానవ జన్మలో జీవుడికి శరీరం ఒక స్థానం,సాధనం మాత్రమే!
జన్మ సార్ధకతకి కృషి చేసి మోక్షాన్ని సాధించలేక పోయినా కనీసం ఉత్తమ జన్మ కలిగే
విధంగా ప్రతి మనిషీ జీవనం సాగించాలి. గుర్రాన్ని తోలేవాడు గమ్యస్థానం చేరాక
గుర్రాన్ని వదిలేసినట్టు భగవంతుణ్ణే గమ్యస్థానంగా..అక్కడికి చేరేందుకే ఈ శరీరాన్ని
ఉపయోగించుకుని తరువాత దాన్ని వదిలెయ్యాలి. పుట్టిన వాళ్ళు గిట్టక మానరు. రాకవంటిదే
పోక!! అన్నారు బాబా.
********
సృష్టిలో ఎన్ని జీవరాసులు ఉన్నా మనిషిగా
పుట్టడం గొప్పే కదా! మరి గొప్ప మనిషిగా నిరూపించు కోవాలి అంటే బోలెడంత జ్ఞానాన్ని
సంపాదించుకోవాలి. దానికి తగినంత అనుభవం కావాలి. పుణ్య కార్యాలు మాత్రమే చేస్తూ ఒకే
విధంగా జీవిస్తే అనుభవం సంపాదించేది ఎలా? మోక్షం మాట పక్కన పెడితే అన్ని
జంతుజన్మలు దాటి వచ్చాక ముందు మనిషిగా జీవించడం తెలుసుకోవాలి!
ఎలాగూ ప్రయాణం చేసింది అ జీవరాసుల్లోంచే కనుక,
వాటి మీద ప్రేమ సహజమే! అదే ప్రేమతో పండుగలు కాని, ఉత్సవాలు గాని, వచ్చినప్పుడు
వాటికి మోక్షాన్ని ప్రసాదిస్తున్నారు. బుద్ధి మంచిదా...కర్మ మంచిదా? అనే విషయం
పక్కన పెడితే మంచి కర్మ చెయ్యడానికి మంచి బుద్ధి ఉండాలిగా. అదే లేనప్పుడు చేస్తున్న
కర్మ మంచిదా..చెడ్డదా అనే ఆలోచన ఎలా కలుగుతుంది? రాబోయే జన్మకి పెట్టుబడి
పెట్టాలంటే..వచ్చిన జన్మకి పెట్టిన పెట్టుబడి వసూలవ్వాలి కదా! భగవంతుడు ఇచ్చిన
అవకాశం వడ్డీతో సహా వసూళ్ళకే సరిపోతుంటే .. మళ్ళీ పెట్టుబడి గురించే అలోచిస్తే
సమయం మించిపోతుంది. వసూళ్ళు వేగంగా జరగాలంటే ఎంత మందికి మోక్షప్రాప్తి కలిగించాలో!
కోరికలు, తినడం,నిద్రపోవడం,సుఖ దు:ఖాలూ మనిషికీ
ఇతర జీవరాసులకి ఒకే విధంగ ఉన్నా _ ఆలోచించగల బుద్ధి, జ్ఞానం ఉన్న మనిషి వాటిని
అనుభవించే విధానంలో తేడా ఉంటుందిగా? దేహాభిమానం లేకపోతే కోరికల్ని, సుఖాల్ని ఎలా
అనుభవించ గలడు? ఇతరులతో ఎలా అనుభవింప చేయగలడు? కావాలనుకున్నదాన్ని సాధించాలి
అనుకున్న దేవుడికి సాధనము,స్థానము ఏదయినా ఫర్వాలేదు. బుద్ధే మనిషిది కానప్పుడు
దేహం మత్రం మనిషిది అవాలని ఏముంది? కోరింది దొరకాలే గాని, గమ్య స్థానం చేరి, కోరిక
తీరాక వదిలెయ్యడం కష్టమా? ఈనాటి రాక..అదే పోక! తరువాత వేసినా ఉపయోగం లేదు
పొలికేక!!
No comments:
Post a Comment