నాడు సాయి పథం - నేడు బాబాల పథం
నాటి బిక్షాటన ధర్మాలు-నేటి బిక్షాటన
ధర్మాలు
సాయి గొప్పతనాన్ని తెలుసుకుని తల్లిలా
ఆదరించింది బాయజాబాయి. మధ్యాహ్నం పన్నెండు గంటలకి తల మీద గంప పెట్టుకుని అడవిలోకి
వెళ్ళి అడవంతా తిరిగి సాయిని వెతికి పట్టుకుని భోజనం పెట్టేది. ఇతరుల ఆకలిని
తెలుసుకోగలిగేది తల్లి మాత్రమే ! స్త్రీలందరూ సేవా భావంతోనే భగవంతుడికి దగ్గరవాలి
అన్నారు శ్రీసాయినాథుడు.
అసలు బిక్షాటన చేసే హక్కు అందరికీ ఉండదు...బిక్షాటన
చేసేవారికి కొన్ని అర్హతలు ఉండాలి...ప్రతి వ్యక్తి బిక్షకు అర్హుడు కాదు ! అన్నారు
సాయి. అర్హతలేమిటో వివరించారు. “ బాల్యం నుండి సన్యాసి అయి ఉండాలి.
సన్యాసే ఎందుకు అర్హుడు ? వంశవృద్ధి కోరిక
ఉండదు.
భార్య పిల్లలు ఉండరు కనుక – ఇల్లు ఉండదు. ఎవరి పోషణ భారాన్ని తాను వహించడు
కనుక – ధనాపేక్ష ఉండదు. ధనము ఉండదు కనుక – కీర్తి కాంక్ష ఉండదు. ఉదర పోషణకి మాత్రమే బిక్ష
అడుగుతాడు కనుక – ఉదయం నుండి రాత్రి వరకు బిక్షకి తిరగడు. ఎక్కే
గడప, దిగే గడప కాకుండా నిర్దుష్టంగా లెక్కకు ఇళ్ళు ఎంచుకుని బిక్ష ఆడుగుతాడు కనుక – బిక్ష దొరికినా దొరక్క పోయినా వెను తిరుగుతాడు.
బిక్షాటన చేసే వారికి ఇల్లు, పిల్లలు, ధనాపేక్ష,
కీర్తి కాంక్ష, రుచులు వంటివి ఉండకూడదు కనుక – సన్యాసి మాత్రమే బిక్షాటనకి అర్హుడు. అలాగే ఏ దిక్కూ లేని
అర్భకుడు కూడా !” అన్నారు సాయి.
అదే విధంగా బిక్ష వెయ్యడానికి అర్హులు ఎవ్వరు
? దానికి సాయి చెప్పిన సమాధానం ’గృహస్థు’!’ పాప విముక్తుడయ్యి మోక్షాన్ని పొందడానికి గల మార్గాల్లో
అతిథి యజ్ఞం ఒకటి. అది గృహస్థు ధర్మం.
గృహస్థుకు పాపాలు చేసేందుకు అవకాశాలు ఎక్కువ
కనుక – బిక్ష వెయ్యడం వలన కొన్ని పాపాల నుండి విముక్తుడవుతాడు.
ఇంటింటికి వెళ్ళి బిక్షాటన చేసి, వారి ధర్మాల్ని వారికి గుర్తు చేసి, ఆ గృహస్థు
యొక్క పాపాలను ప్రక్షాళన చేసి, వారిని మోక్షానికి దగ్గర చెయ్యడం కోసమే బిక్షాటన
చేస్తున్నాను! అన్నారు శ్రీసాయినాధుడు.
********
బిక్షాటన చెయ్యడానికి ఈనాడు అందరికీ హక్కే !
అడుక్కోడానికి అరవై విధాలు! అన్నట్టు...పిల్లల పోషణ బాధ్యత స్వీకరించాల్సిన తల్లి
కూడా పిల్లల్ని బిక్షాటనకి పంపి పోషిస్తోంది.
పిల్లల ఆకలి తెలుసుకుని అన్నం పెట్టాల్సిన
కన్న తల్లే తన భోజనానికి కూడా పిల్లలు తెచ్చిన బిక్షనే ఉపయోగించుకుంటోంది. తల్లిగా
పిల్లల ఆకలి గ్రహించలేని తల్లులకి సేవా భావం ఎక్కడిది ?
బిక్షాటనకి ఏనాటి అర్హతలు ఆనాటివే ! ఈనాడు
బిక్షాటన చెయ్యడం ఒక హాబీ ! కష్టపడకుండా వస్తున్న ఆదాయాన్ని ఎవరు వదులు కుంటారు ? ’ సన్యాసి ’ సంగతి అటుంచి అసలు
ఆదాయం కోసం అడుక్కునేవాడే గృహస్థు.
ఉదర పోషణార్ధమే కాదు, విలాసవంతమైన జీవితం కోసం
కూడా! అడుక్కునే పద్ధతుల్లో అనేక రకాలు. వీటిని ఒక్క మాటలో చెప్పాలంటే ’వీరముష్టి’.
బిక్ష అడిగినట్టు వినిపించదు... బిక్ష వేసినట్టు కనిపించదు.
మామూలు ముష్టికి మామూళ్ళు ఉంటాయి. ఏ సమయానికి ఏది అవసరమో దాన్ని బిక్షలోంచి బిక్ష తీసుకుని
అందించేస్తారు. ఇదే బిక్ష సేవ !
వివిధ
రకాలయిన ఈ బిక్ష సేవలోంచి కీర్తి, కనకం, కాంత అన్నీ లభిస్తూనే ఉంటాయి. పలకడంలో తేడా
తప్పించి ఈనాడు బిక్షాటనకి అందరూ అర్హులే...అందరూ సుముఖులే !
ఇంటింటికీ వెళ్ళే బిక్షాటన చెయ్యక్కర్లేదు.
రోడ్డు ప్రధాన కూడళ్ళలోనో...గుడి మెట్ల దగ్గరో...ఏ సీ గదుల్లోనో ఎక్కడయినా సరే
బిక్షాటన బిక్షాటనే ! బిక్ష వేసే వాళ్ళళ్ళోనే ఉంటాయి తేడాలు.
వారి వారి హోదాను బట్టే...అడిగేవారూ వేసేవారూ
కూడా ! అడిగేవాడు ఉన్నప్పుడు ఇచ్చేవాడికి...ఇచ్చే వాడు ఉన్నప్పుడు పుచ్చుకునే
వాడికి కూడా ఉండదు మొహమాటం.
భక్తుడు కోరుకున్నది అందించడానికే అడుగు తున్నప్పుడు
ఇవ్వడానికి ఎందుకు మొహమాటం ? కాకపోతే శృతి మించి మొహం మొత్తితేనే ప్రమాదం !!v
No comments:
Post a Comment