నాడు సాయి పథం- నేడు బాబాల పథం
బిక్ష మోక్ష సాధనం -బిక్ష జీవిత సాధనం
బిక్షాటన చెయ్యవలసిన అవసరం సాయికి లేదు.
ఎవర్నీ ఏదీ యాచించకుండా కూర్చున్న చోటుకే అన్నీ తెప్పించుకో గలిగిన శక్తి సాయికి
ఉంది.
ఒక చేతిలో డబ్బా రెండవ చేతిలో జోలె పట్టుకుని, ఘన
పదార్ధాల్ని జోలెలోను, ద్రవ పదార్ధాల్ని రేకు డబ్బాలోను వేసుకునేవారు. ప్రతి రోజూ
పన్నెండు గంటలకి సాయి బిక్షాటన పూర్తయ్యేది. అన్ని దానాల్లోకి అన్న దానం గొప్పది
అనేవారు శ్రీసాయినాథుడు.
తను ఉన్న చోటుకే అన్నీ తెప్పించుకో గలిగిన
సాయి బిక్షాటనకి ఎందుకు వెడుతున్నారు? అనేది భక్తుల సందేహం.
ఆకలితో ఉన్న వారికి
అన్నం పెడితే జన్మ జన్మలకు ఆహారానికి లోటు ఉండదు. మనం వేసే బిక్ష ద్వారా ఇతరుల
ఆకలి తీర్చడమే కాదు...పాపాలు నశించి మోక్షాన్ని పొందవచ్చు. అటువంటి మోక్ష
మార్గాన్ని భక్తులకు చూపించడం కోసమే సాయి బిక్షాటన !
బిక్షకి ఏ ఇంటికి వెళ్ళాలో ముందుగానే
నిర్ణయించుకుని ఆ ఇళ్ళ వరకే వెళ్ళేవారు. బిక్ష దొరికినా...దొరక్కపోయినా వేరే
ఇళ్ళకు వెళ్ళేవారు కాదు.
దొరికిన బిక్షలో కొంతభాగం మట్టి పాత్రలో వేసి బయట
పెట్టేవారు. నోరులేని పక్షులకు జంతువులకు అది ఆహారంగా ఉపయోగించేది. దాని ద్వారా
భూత దయ ఉండాలని తెలియ చెప్పడమే సాయి ఉద్దేశ్యం.
మిగిలిన దాన్ని తనతో కలిసి జీవిస్తున్న భక్తులతో కలిసి
పంచుకుని తినేవారు. సాయికి రుచులు, కోరికలు లేవు. బిక్ష రూపంలో దొరికిన వాటిని అన్నిటినీ కలిపేసి
తినేవారు.
అకలి తీరడమే ముఖ్యం కాని, రుచిగా తినడం కాదు. మంచి కార్యాలు
చేస్తూ మోక్ష మార్గం వైపు పయనించడానికి ఉపయోగించే శరీరమనే సాధనాన్ని పని
చేయించడానికే ఆహారం అనేవారు.
ఉన్నదంతా ఒక్కళ్ళే తినెయ్యకుండా ఆకలి అన్ని
ప్రాణులకీ ఉంటుంది కనుక అందరితో కలిసి పంచుకోమనీ...సహ జీవనం మంచిదనీ చెప్పారు
శ్రీసాయినాథుడు !
********
బిక్షాటన చెయ్యవలసిన అవసరం ఉందా...లేదా అనే
విషయం పక్కన పెడితే అనుకున్నది మాత్రం బిక్షాటన చేసి తీరాలనే ! ద్రవ పదార్ధాల
బదులు ద్రవ్యము, ఘన పదార్దాల బదులు బియ్యము.
అన్ని దానాలకంటే అన్నదానమే గొప్పది కదా !
అన్నమయితే నేమిరా...మరి బియ్యమయితే నేమిరా ? కాలాన్ని బట్టే కొంచెం మార్పు
అంటున్నారు ఈనాటి భక్తులు. ఆకలి ఉన్న వాళ్ళకి అన్నం, ఆకలి లేని వాళ్ళకి బియ్యం !
నెత్తి మీద పెట్టుకుని అమ్మోర్ని
తెచ్చినా...పళ్ళెంలో చెంబు పెట్టుకుని వచ్చినా...గంగిరెద్దుని తోలుకొచ్చినా...
బండి చుట్టూ కాషాయ గుడ్డలు కట్టి, మైకులు పెట్టి పాటలతో హోరెత్తించినా...గుడి
కట్టించాలని చెప్పినా...అన్న దానమని పలికినా...బిక్షాటన మోక్షమని చాటినా... మొత్తానికి
తనదైనా ఇతరులదైనా పొట్ట నింపుకోవడానికేగా. వేసిన వారికి వేసినంత మహదేవా...తిన్న
వారికి తిన్నంత మహదేవా !
తెల్లవారితే ఏ ఏ వీధులు తిరగాలో ముందుగానే
నిర్ణయించుకుంటారు. ఏ దేవుణ్ణి తలిస్తే బాగా బిక్ష దొరుకుతుందో ఆ దేవుడికి తగిన
విధంగా నలుపు, తెలుపు, పసుపు, కాషాయాలు ధరించి చూసే వాళ్ళకి భక్తి కలిగేలా
చేస్తారు.
ఉదయాన్నే బయలుదేరి తీసుకెళ్ళిన జోలె నింపుకునే
వరకు ఇంటింటికీ, వీధి వీధికీ తిరిగి తిరిగి వచ్చినంత వరకు సేకరించి మొయ్యలేనంత
బరువుతో ఇంటికి చేరతారు.
ఏ రోజు బరువు ఆ రోజుకే ! బరువు పెంచుకోవడమే
గాని, వెను తిరగ కూడదు అన్నదే మొక్కు !
తెచ్చుకున్న దాన్ని
దాచుకోవడమే గాని పంచుకోవడం ఉండదు. పుచ్చుకోవడమేగాని, ఇచ్చుకోవడం రానప్పుడు భూత
దయకు దారేది ? జోలె బరువు పెరిగిందంటే భక్తుల భక్తి పెరిగినట్టే ! భక్తులు
పెరిగారంటే పాపభీతి పెరిగినట్టే! బిక్ష అడుక్కున్న వాడికి అడుక్కున్నంత !!
No comments:
Post a Comment