నాడు సాయి పథం-నేడు బాబాల పథం
సాయి ప్రాణం భక్తుల ప్రాణాలకి అడ్డం - భక్తుల
ప్రాణాలు బాబాల ప్రాణాలకి అడ్డం
ఒక వ్యక్తి మరొక వ్యక్తితో “నువ్వు చేస్తున్నది తప్పు
అలా చెయ్యకూడదు, ఇలా చెయ్యాలి!” అని చెప్పాడనుకోండి “పోవయ్యా! నీకు మహా తెలుసునని
చెప్తున్నావు!” అంటాడు.
ఇదీ విషయం అని
చెప్తే ఎవరూ వినరు. అదే విషయాన్ని గురువు చెప్తే వినడమే కాదు ఆచరిస్తారుకూడా. అందుకే
జ్ఞానోపదేశం గురువుద్వారానే జరగాలి అన్నారు శ్రీసాయినాథుడు.
మనసు, శరీరం,
సంపద అన్నీ నీవే...నావి కావు! అనుకుని ఆత్మతో సహా భగవంతుడికి భక్తితో అర్పించాలి.
శిష్యుడు
గురువులో భగవంతుణ్ణి చూస్తాడు. గురువు శిష్యుడిలో భగవంతుణ్ణి చూస్తాడు.
భగవంతుడు గురు శిష్యుల్ని
ప్రాణము ఆత్మలుగా చూస్తాడు. వివరంగా, మృదువుగా, నెమ్మదిగా అర్ధం అయ్యేలా చెప్ప
గలిగిన సద్గురువు ఉండడం ఆనాటి భక్తుల అదృష్టమే అదృష్టం!
సాయి చేసిన
ఉపదేశం వల్ల ఆనాటి సాయి భక్తులు కష్టాల్ని కూడా సుఖాలుగా స్వీకరించగల
మనోనిబ్బరాన్ని పొందారు.
ప్రపంచంలో జరిగే ఏ
విషయాలకీ భయపడకుండా “శివుని ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు” అని నమ్మారు.
ఏ కష్టం వచ్చినా ఇది భగవంతుడు
నిర్దేశించిందే..అన్నీ పూర్వ జన్మ కర్మ ఫలమే! కష్టాల్ని అనుభవించ గలిగిన
మనోధైర్యాన్ని సద్గురువే ఇస్తారు! అనుకుని సద్గురువునే భగవంతుడిగా భావించి, ఆయనని
పూజించి ప్రశాంతంగా జీవించారు.
నమ్మిన భక్తుల్ని
భగవంతుడే రక్షిస్తాడు అనడానికి నిదర్శనంగా... శ్రీసాయినాథుడు మనసా, వాచా, కర్మణా
తననే నమ్మిన భక్తుడికి తన ప్రాణాన్ని అడ్డు పెట్టి రక్షించాడు.
అయన దేహంతో లేకపోయినా
ఆయన భక్తులు శిరిడీలోనే కాదు, తమ ఇళ్ళల్లో కూడా, భజనలు, హరికథలు, కీర్తనలు,
సప్తాహాలు, భగవన్నామ స్మరణ చేస్తూనే ఉన్నారు.
ఎల్లప్పుడూ
వెలుగుతూనే ఉండే ధునిని అరాధిస్తున్నారు. రకరకాల పువ్వులు తెచ్చి అందంగా మాలలు కట్టి
శ్రీసాయినాధుణ్ణి అలంకరించి ఆయన చెప్పినట్టు అన్నదానం చేస్తూనే ఉన్నారు.
మంచి మార్గాన్ని
నిర్దేశించి, ప్రశాంత జీవితాన్ని గడిపేందుకు జ్ఞానోపదేశం చేసి, ఆత్మసాక్షత్కారం
పొందే విధానం తెలియ చెప్పారు.
“ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉన్నాడని, ప్రతి జీవికి
ఆకలి ఉంటుందని గుర్తుచేసారు. ప్రతి జీవిని ప్రేమించగల శక్తినిచ్చి, మనస్సులో చెడు
ఆలోచనలు కలగకుండా ఎల ఉండాలో భక్తులకి తెలియ చెప్పారు.
అన్నీ మిథ్య!
భగవంతుడు ఒక్కడే సత్యం! అని తెలియ చేసిన సద్గురువు శ్రీసాయినాథుడికి కృతజ్ఞులం!”
అన్నారు ఆనాటి సాయి భక్తులు.
“చావు పుట్టుకలు
లేని శ్రీసాయి ఇప్పటికీ తమ మధ్యనే ఉన్నారు” అన్నది సాయి భక్తుల నమ్మకం!
********
ఒక
వ్యక్తి మరొక వ్యక్తిని “నువ్వు
చేస్తున్నది తప్పు...అలా చేయకూడదు!” అని చెప్పాలంటే కొంత అర్హత ఉండాలి.
అదే విషయాన్ని
గురువు చెప్తేనే విని ఆచరిస్తారు. కనుక, జ్ఞానోపదేశం చేసే గురువు జ్ఞానవంతుడై
ఉండాలి. లేకపోతే శిష్యులు కూడా అజ్ఞానులుగానే ఊండిపోతారు.
ఈనాడు ఎవరికి
వారే జ్ఞానవంతులమని అనుకుంటూ ఉండడంవల్ల జ్ఞానమంటే ఏమిటి? అనేది ప్రశ్నగానే
మిగిలిపోతోంది.
మనస్సు, సంపద
అన్నీ నీవే! ఇవన్నీ నాకు సంబంధించినవి కావు! అంటున్నారు ఈనాటి భక్తులు. ఈనాటి బాబాలకి
ఈనాటి భక్తులు ఆత్మతో సహా దేహాన్ని కూడా అర్పించుకుంటున్నారు.
శిష్య బాబాలు,
బాబా గురువుల్లో తాము కోరుకుంటున్న కోరికల్ని
చూస్తున్నారు. భక్తులు శిష్య బాబాల్లో బాబా గురువుల్ని చూస్తున్నారు.
బాబా గురువులు,
భక్తుల్ని, శిష్య బాబాల్ని ఏమరుపాటు లేకుండ చూస్తూ...భక్తి తగ్గిన భక్తులకు
నెమ్మదిగా, మృదువుగా, అర్ధమయ్యేలా జ్ఞానోపదేశం చేస్తున్నారు.
కష్టాల్ని కూడా
సుఖాలుగా భావించగల మనో నిబ్బరాన్ని కలిగిస్తున్నారు. బాబా గురువుల ఆజ్ఞ లేకుండా ఏ
పనీ జరగదు.
శిష్యబాబాల అండ, బాబాగురువుల ఉపదేశం ఉండగా
పూర్వకర్మ ఫలాన్ని అనుభవించ వలసిన అవసరం ఎవరికి ఉంటుంది?
కష్టాలు కూడ
కష్టాలుగా అనిపించ లేనంత ప్రశాంతతని పొందుతూ తమని తాము తెలుసుకోలేనంతగా మైమరిచి
జీవించ గలిగే ఏర్పాట్లు తమ భక్తులకి చేయిస్తున్నారు నేటి బాబా గురువులు.
నమ్మిన భక్తుల్ని
భగవంతుడే రక్షిస్తాడు అనే దానికి నిదర్శనంగా మనసా వాచా కర్మణా తమనే నమ్మిన భక్తుల్ని
తమ ప్రాణాలకి అడ్డుపెట్టుకుని మరీ రక్షిస్తున్నారు.
జీవుడు
జీవచ్ఛవంలా మారినా భజనలు, కీర్తనలు, హరికథలు,సప్తాహాలు, భగవన్నామ స్మరణ భక్తుల
ఇళ్ళల్లో కూడా జరుగుతూనే ఉన్నాయి. ధుని కూడా ఏదో ఒక రూపంలో వెలుగుతూనే ఉంటోంది.
జీవన మార్గాన్ని
నిర్దేశించి ప్రశాంతమైన జీవితాన్ని గడిపేందుకు మార్గాన్ని సుగమం చేస్తున్నారు.
ఆత్మల సాక్షాత్కారాన్ని పొందగలిగే విధంగా ఉపదేశించి ప్రతి జీవిలోను ఆకలి ఉంటుందని దేహల
అవసరాన్ని గురించి తెలియచేస్తున్నారు.
ఆకలి గురించి తెలుసుకునే అవకాశం దాన్ని తీర్చుకునే
అవకాశం కల్పించి మనస్సులో ఆలోచనలని ప్రేరేపించి అందర్నీ ప్రేమించగల శక్తి నిస్తున్నారు.
ఇంతకంటే దేనికోసం కష్టపడక్కర్లేదని, నిత్యం
జరుగుతున్నదే నిజమని జ్ఞానోపదేశం చేస్తున్న బాబా గురువులకి నేటి భక్తులు కృతజ్ఞతలు
తెలియచేస్తున్నారు.
No comments:
Post a Comment