సాయి ధుని జ్వాల –
భక్తుని హృదయ జ్వాల
దక్షిణ దిక్కుగా తిరిగి ధునికి ఎదురుగా
కూర్చుని ఎడమ చెయ్యి ఒక కొయ్య మీద పెట్టి భగవన్నామం జపిస్తూ దర్శనమిచ్చేవారు సాయి.
ధుని అనేది చలిమంట కాదు.
అది ఒక ఆరని అగ్నిహోత్రం. ప్రతి వ్యక్తి జ్ఞానవంతుడై అగ్నిలా ప్రకాశించాలన్నదే
సాయి కోరిక.
తమలో ఉన్న క్రోధం, ఈర్ష్య, అహంకారం, కోరికలు,
చెడు ఆలోచనలు వంటి చెడు గుణాల్ని అగ్నిహోత్రంలో వదిలెయ్యాలి. అలా చేసిన వ్యక్తే
నిర్మలమైన మనస్సుతో ప్రకాశిస్తాడు అని చెప్పేవారు.
ఆ విషయం భక్తులకి తెలియ చెయ్యడానికే ధునిని
ఎల్లప్పుడూ జ్వలింపచేస్తూ ఉండేవారు సాయి. దర్శనానికి వచ్చిన ప్రతి భక్తుడు ధునిలో
వెయ్యడానికి తమతో ఒక వస్తువుని తెచ్చేవాళ్ళు. దాన్ని ధునిలో వేసి దని చుట్టూ ప్రదక్షిణ చేసి నమస్కరించేవారు.
ఆ విధంగా భక్తులు కూడా సాయి ఆదేశాన్ని ఆచరించేవారు.
తనతో తీసుకువచ్చిన వస్తువుని తనలో ఉన్న చెడ్డ
గుణంగా భావించి “నాలో ఉన్న చెడు గుణాల్ని అగ్నికి ఆహుతి చేస్తున్నాను.
పవిత్రమైన నా మనస్సుని పువ్వుగా చేసి భగవంతుడికి
అర్పిస్తున్నాను! అనుకుని నిర్మలమైన
మనస్సుతో భగవంతుణ్ణి ధ్యానించడమే ఇందులో ఉన్న పరమార్ధం !
చెడు ఆలోచనలు, కోర్కెలు లేని హృదయమే
నిష్కల్మషమైన హృదయం ! అటువంటి హృదయం కలిగిన ప్రతి వ్యక్తి అగ్నిహోత్రంలా పవిత్రుడే
! అన్నారు శ్రీసాయినథుడు.
********
ఈనాడు బాబాకోసం దేవాలయాలు వీధి వీధికీ
వెలిశాయి. కొలిచే భక్తులూ పెరిగారు. పెరిగిన భక్తులకు సరిపడినంత స్థలం అవసరం కనుక,
ఇప్పుడు బాబా విగ్రహానికి కొంచెం దూరంలోనే
ధుని ఉంటోంది.
బాబా దర్శనానికి వచ్చిన భక్తులు ధునిని,
బాబాని ఒకేసారి చూడలేకపోయినా విడివిడిగా అయినా దర్శనం చేసుకునే వెడుతున్నారు.
ధునిని అగ్నిహోత్రంగా
భావిస్తున్నారో...చలిమంటగా భావిస్తున్నారో... తెలియదు కాని, ఒకళ్ళని చూసి ఒకళ్ళు
నమస్కరిస్తూనే ఉన్నారు.
కొంత మంది ధుని చుట్టూ తిరిగి ప్రదక్షిణ
చేస్తారు. కొంత మంది నమస్కారం చేస్తారు కాని, ప్రదక్షిణ చెయ్యరు. అది వారి భక్తిని
ప్రదర్శించే విధానం కావచ్చు.
ఒకవైపు జ్వలిస్తున్న నిత్యావసర వస్తువుల ధరలు,
రాజకీయ వైషమ్యాలు, అన్నదమ్ముల పోరు, విషజ్వరాలకు బలవుతున్న చిన్న ప్రాణాలు,
హత్యలు, ఆత్మహత్యలు, సీట్ల అయోమయంలో విద్యార్ధుల ఆవేశాలు, వృద్ధాశ్రమలకు తరలిపోతున్న
తల్లితండ్రుల ఆక్రోశాలు, నిరుద్యోగుల నిట్టూర్పులు, ధన దాహం తీరని హైటెక్కులు వంటి
అనేక అర్తనాదాలతో ఈనాటి ధుని వేడి పెరుగుతూనే ఉంటుంది, అది ఎప్పటికీ ఆరదు.
రగిలింప చేసే భక్తులకు లోటూ లేదు.
సహకరించేందుకు ఎంతోమంది స్వామీజీలు కూడా యోగా పరికరాలతో ముందుకొస్తున్నారు.
తమలో చెడు గుణాలే ఉన్నాయో, మంచి గుణాలే
ఉన్నాయో తెలుసుకోలేని భక్తులు తమ కోర్కెలు తీర్చమని కోరుతూ బాబా చుట్టూ, ధుని
చుట్టూ గిరగిరా తిరుగుతూనే ఉన్నారు. మొక్కులు మొక్కుతూనే ఉన్నారు.
ఈనాటి భక్తుల కోరికలు ఆపుకోలేని కోరికలు.
అందుకే అలుపెరుగని ఆగని ప్రదక్షిణలు. తిరిగే వేగంలో అనుకున్న ప్రదక్షిణల లెక్క
పూర్తయిందో లేదో అని లెక్క కోసం చేతిలో ఆధునిక పరికరం.
దృష్టి ప్రదక్షిణల లెక్క మీదే గాని, బాబా నామం
మీద నిలబడదు కదా! ఏది ఏమయినా తమ పవిత్రమైన కోర్కెలతో మనస్సుని బాబాకి అర్పిస్తూనే
ఉన్నారు.
బబల కనుసన్నలలో జీవించే ఈనాటి భక్తుని హృదయం
ఆరని అగ్నిహోత్రమే !
రగులుతున్న ధునిని ఆర్పాలో...ఇంకా రగిలించాలో ఈనాటి
బాబాలకే బాగా తెలుసు!!
No comments:
Post a Comment