ఉరుము కథ
మీకు తెలుసా ఉరుము ఎటువంటి శబ్దాన్ని మనకి
వినిపిస్తుందో...? అలాగే అది ఎటువంటి సందేశాన్ని మనకి పంపిస్తోందో కూడ తెలియదు
కదూ? ఇప్పుడు తెలుసుకుందాం!
యుగాలకి ముందు మన భారతదేశంలో నివసించిన
మహర్షులు గొప్ప తపస్సు చేసి ఆకాశంలో మెరుపులతో కలిసి ఉరిమే ఉరుము అసలు మనకి దేని
గురించి చెప్తోందో తెలుసుకోడానికి ప్రయత్నించి చివరికి ఫలితాన్ని సాధించారు. ఉరుము
ద్వార సృష్టికర్త మనకి ఒక సందేశాన్ని ఇస్తున్నాడని తెలుసుకున్నారు. అదే ఈ ఉరుము
కథ.
సృష్టి మొదలైన కాలంలో సృష్టి చెయ్యడానికి
సృష్టి కర్త ఒక్కడే ఉండేవాడు. ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి. కాని, ఇప్పుడు మనం ప్రజాపతి అనే పేరుతో పిలుచుకుందాం.
ప్రజాపతి మొదట మూడు రకాల జాతుల్ని సృష్టించాడు. వాళ్ళు దేవతలు, మనుషులు,
రాక్షసులు. వాళ్ళు తమ తండ్రి ప్రజాపతి చెప్పినట్టు క్రమశిక్షణతో నడుచుకునేవాళ్ళు.
ప్రజాపతి
మూడు జాతులవాళ్ళకి మూడు లోకాల్ని ఇచ్చేశాడు. దేవతల్ని, మానవుల్ని, రాక్షసుల్ని
ఎవరి లోకానికి వాళ్ళని వెళ్ళి జీవించమన్నాడు. తండ్రి చెప్పినట్టు దేవతలు స్వర్గలోకానికి,
మనుషులు భూలోకానికి, రాక్షసులు నరకలోకానికి బయలుదేరారు.
వాళ్ళు వాళ్ళ లోకాలకి వెళ్ళే ముందు తమ
తండ్రిని కలవాలనుకున్నారు. ఎప్పుడూ మౌనంగా కూర్చుని ఉండే తమ తండ్రి ప్రజాపతిని మొదట
దేవతలు కలుసుకున్నారు. “తండ్రీ! మేము మా లోకానికి వెళ్ళబోయే ముందు మీరు మాకు ఏదేనా ఒక మంచి సందేశం
ఇవ్వండి!” అని అడిగారు.
వాళ్ళ మాటలు విన్న ప్రజాపతి మొదట వాళ్ళకి ఎంత
జ్ఞానం ఉందో తెలుసుకోవాలని అనుకున్నాడు. వాళ్లకి పదాని కంటే చిన్నదైన ఒక అక్షరాన్ని
చెప్పి “మీకు నేను చెప్పింది అర్ధమయిందా?” అన్నాడు. ఆ అక్షరం ’ద’.
దేవతలు తండ్రితో “అర్ధమయిందండి! మీరు పదంలో మొదటి అక్షరం మాత్రమే చెప్పారు. ఆ పదం ’ధన్యత’. అంటే ఎవరిని వాళ్ళు స్వయంగా నియంత్రించుకోవాలి.
అప్పుడే ధన్యులమవుతాం” అని చెప్పారు మీరు. మేము అలాగే నడుచుకుంటాము” అని చెప్పారు.
దేవతలు చెప్పింది విని ప్రజాపతి “మీరు సరిగ్గానే చెప్పారు వెళ్ళిరండి’” అని వాళ్ళ లోకానికి వాళ్ళని పంపించేశాడు.
దేవతలు వెళ్ళిపోయాక మనుషులు వచ్చి “తండ్రీ! మేము వెళ్ళేముందు మాకు కూడా ఏదేనా
మంచిమాట చెప్పండి” అని అడిగారు.
ప్రజాపతి వీళ్ళకి ఉన్న జ్ఞానం కూడా ఎంత ఉందో తెలుసుకుంటాను
అనుకుని వాళ్లకి కూడా ’ద’ అనే అక్షరం చెప్పాడు. తరువాత “మీకు నేను చెప్పింది అర్ధమయిందా?” అని అడిగాడు.
మనుషులు “అర్ధమయిందండి! మీరు పదానికి మొదటి అక్షరం మాత్రం చెప్పారు. ఆ
పదం దానం. అంటే ఎప్పుడూ దానం చేస్తూ ఉండమని కదండీ! మీరు చెప్పినట్టే నడుచుకుంటాము!” అని చెప్పారు.
వాళ్ళు చెప్పింది విని ప్రజాపతి “అవును. మీరు బాగా అర్ధం చేసుకున్నారు వెళ్ళిరండి!” అని వాళ్ళ లోకానికి వాళ్ళని పంపించేశాడు.
మనుషులు
వెళ్ళిపోయాక రాక్షసులు వచ్చారు. “తండ్రీ మేము మా లోకానికి వెళ్ళబోయే ముందు మాకు కూడా ఏదేనా ఒక మంచి మాట
చెప్పండి” అన్నారు.
వాళ్ళ మాటలు విని ప్రజాపతి వీళ్ళు కూడా ఎంత జ్ఞానవంతులో
తెలుసుకుంటాను అనుకుని వాళ్ళకి కూడా ’ద’ అనే అక్షరం చెప్పాడు. తరువాత వాళ్ళకి ఏమర్ధమయిందో చెప్పమన్నాడు
రాక్షసులు ప్రజపతితో “తండ్రీ! మీరు ఒక్క పదం కూడా చెప్పకుండా ఒక్క
అక్షరమే చెప్పారు. అయినా కూడా మాకు మీరు ఏం చెప్పారో చాలా బాగా అర్ధమయింది. ఆ పదం ’దయ’. అంటే ఎప్పుడూ దయ కలిగి ఉండమని చెప్పారు కదండీ!” అన్నారు.
ప్రజపతి వాళ్ళు చెప్పింది విని “అవును. మీకు చాలా బాగా అర్ధమయింది వెళ్ళిరండి!” అన్నాడు
దేవతలు, మనుషులు, రాక్షసులు ప్రజాపతికి
వినయంగా నమస్కారం చేసి ఎవరి లోకాలకి వాళ్ళు వెళ్ళిపోయారు.
ఈ కథ వల్ల ఏం తెలిసింది? రాక్షసులు స్వతహాగా
కౄరస్వభావం కలిగినవాళ్ళు. అయినా కూడా అప్పుడప్పుడు దయదాక్షిణ్యాలు చూపిస్తారు. ఎందుకంటే,
వాళ్లకి ఎప్పటికేనా ఇంక కొంచెం పై స్థాయికి ఎదుగుతాము అనే నమ్మకం ఉంది.
మనుషులు బాగా స్వార్ధపరులు. భూమి మీద వాళ్ళకి
ఒకళ్ళకొకళ్ళు తప్పకుండా సహాయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం దానధర్మాలు
చెయ్యాలి. ఎందుకంటే, దాని వల్ల వాళ్ళు పైకి
ఎదగడానికి అవకాశం ఉంది.
దేవతలు స్వర్గంలో ఉండి ఎప్పుడూ విందులు వినోదాలతో
కాలక్షేపం చేస్తుంటారు. ఆ పరిస్థితిలో వాళ్ళు దేనికీ సమయాన్ని కేటాయించరు. కనుక,
వాళ్ళు అసలు విషయాన్ని మర్చిపోతారు. వాళ్ళని వాళ్ళు నియంత్రించుకోకుండా ఎప్పుడూ
వినోద కాలక్షేపాలతోనే గడిపేస్తే తాము చేసుకున్న పుణ్యం ఖర్చయిపోతుందని, తరువాత
మళ్ళీ జన్మ ఎత్తాల్సి వస్తుందన్న నిజాన్ని గ్రహించలేరు.
ప్రజాపతి
అందరికీ ఒకే అక్షరాన్ని చెప్పాడు. కాని, దేవతలు, మనుషులు, రాక్షసులు వాళ్ళు వాళ్ళ
జాతిని బట్టి, వాళ్లకి ఉన్న జ్ఞానాన్ని బట్టి అర్ధం చేసుకున్నారు.
పూర్వం
ప్రజాపతి చెప్పిన మాటలే ఇప్పటికీ ’ద, ద, ద’ అనే అక్షరాలతో
వినిపిస్తోంది ఉరుముల శబ్దం. అన్నిరకాల జీవరాసులకి మళ్ళీ మళ్ళీ
చెప్పడం కోసం సృష్టికర్త అయిన ప్రజాపతి
ఇప్పటికీ ’ద, ద, ద’ అనే పెద్ద శబ్దం చేస్తూ మంచి నడవడికతో బాగా పైకి ఎదగడానికి ప్రయత్నించమని
ఉరుముతూ చెప్తూనే ఉన్నాడు.
No comments:
Post a Comment