౩౦-4-2017 మహాకవి
శ్రీశ్రీ జయంతి సందర్భంగా విజయవాడలో
జరిగిన శతాధిక కవిసమ్మేళనంలో చదివిన కవిత
విస్తరించిన మహావృక్షం ’శ్రీశ్రీ’
దేనికైనా సరే విత్తు పడాలి! అంకురం మొలకెత్తాలి!
చెట్టుకైనా మనిషికైనా పశుపక్ష్యాదులకైనా...
సృష్టి ఏదైనా విత్తు నాటాలి.. అది అంకురిచాలి..
విస్తరించాలి!
మంచికైన చెడుకైనా సమాలోచనకైనా సమరానికైనా..
సమాజానికి మంచి జరగాలన్నా...సమాజంలో ఉన్న చెడు
సమూలంగా నాశనమవాలన్నా...దేనికైనా అంకురార్పణ జరగాలి!
సమాజ శ్రేయస్సుకి కృషి చేసేవాడు కవి.. శ్రేష్ఠమైన విత్తు
కవి మేథస్సు
అంకురించిన వృక్షాన్ని పెంచి పెద్ద చేస్తాడు
శాఖోపశాఖలుగా విస్తరిస్తాడు... ప్రపంచమంతా మొలకెత్తుతాడు!
తన కలమనే కత్తితో కలుపు మొక్కల్ని నరుకుతాడు
సమాజంలో ఊపిరి పోసుకుంటున్న చెడుని తెలుసుకోమని
తన ఆక్షరావేశంతో ప్రపంచమంతా గొంతెత్తి చాటుతాడు !
స్పందించే మనస్సుతో కలం పట్టి, గళం విప్పి
అక్షరాలతో సమాజ సేద్యం స్వేచ్ఛగా చెయ్యగలడు కవి!
ఆస్వాదించడానికి ప్రకృతి ఇచ్చే పచ్చదనం.. బాటసారులకి
శ్రమ తెలియ నివ్వని నీడ.. పక్షి సంతానం పెరగడానికి..
పెద్ద వృక్షాల అవసరం తెలుసుకున్నారు పూర్వ పాలకులు!
విత్తునాటి అంకురించిన మొలకల్ని పెంచి పెద్దచేసి
అడ్డదిడ్డంగా పెరిగే కొమ్మల్ని కొడవలితో నరికేసి
మొక్కల్ని, వృక్షాలుగా ... వృక్షాల్ని, మహావృక్షాలుగా
మార్చేసి
రహదారులకు ఇరువపులా భావితరాలకు అందించారు!
శాఖోపశాఖలతో విస్తరించి ఒకదానితో ఒకటి పెనవేసుకుని
ఊగిసలాడే ఊడలతో
పలకరిస్తూ.. పాలకుల చరిత్రని తెలుపుతూ
కపి సమూహాల్ని ఆడిస్తూ.. బాటసారులకి గొడుగు పడుతున్నాయి!
కర్కశమైన హృదయాలతో .. మూలాల్ని కొడవళ్లతో నరికేసి
రహదారులు విస్తరిస్తూ.. అటవీ ప్రాంతాలు వెలికి వస్తే ..
మృగాలన్నీ తలదాచుకునే చోటు లేక..అంతరించి పోతున్నాయి!
ఈనాటి పాలకుల గురించి చెప్పేదెలాగని వాపోతుంటే
కవిలోకంలో అంకురించి..తన రచనలతో హుంకరించి.. కవిలోకం,
పాఠకలోకాల్లో విస్తరించి.. కవితలకి ఏదీ కాదు అనర్హమని
చెప్పిన
విస్తరించిన మహా కవివృక్షం.. ’శ్రీశ్రీ’ గుర్తుకొచ్చాడు !!
No comments:
Post a Comment