About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

కవిత

నెలనెలా వెన్నెల ఎక్సరే వారి కవిసమ్మేళనం 05-03-2023

      దేశభవిష్యత్తుకు  విద్యాసంస్థలే వేదికలు

జీవించడానికి  నీరు అవసరం..

కలుషితమైతే శుద్ధిచేసి తాగాలి..

దేశానికి రాజకీయం అవసరం..

కలుషితమైతే శుద్ధి చేసి కాపాడాలి!

యువత ప్రయోజనాలు తీర్చాలి..

యువశక్తి దేశానికి అవసరం!  

ఎన్నికల బాధ్యత, ఆలోచన

యువతకి అవసరం!

ప్రజాస్వామ్యానికి శక్తిని యిచ్చేది వోటరు..

రక్షణ కవచం వోటరు!

ఏమీ చేయలేము, జనాన్ని మార్చలేము,..

అందరినోట ఇదే మాట..
ప్రాణత్యాగం చేసిన మహనీయులు

ఇలాగే అనుకుంటే.. 

తెల్ల దొరల కింద బానిసత్వం

పోయేది కాదు.. విముక్తి దొరికేది కాదు

ఆస్తులే కాదు.. ఉత్తమ పాలనా వ్యవస్థ

కూడా వారసత్వపు సంపదే!

సమాజంలో అవినీతి ఊడలు విస్తరిస్తే..

పోరు జరుగుతూనే ఉండాలి..

జాతి ప్రతిష్ఠ మసక బారుతూ పోతే..

సంస్కరణల పర్వం ముగిసిపోతుంది!

యువత పనిముట్లు కావాలి..

ఉపాధ్యాయులు వాటికి పదునుపెట్టాలి..

వారు చెక్కిన శిల్పాలే

ప్రజాస్వామ్య విజయానికి

కీలకమని తెలియాలి!

సమస్యల్ని పలు కోణాల నుంచి

విద్యార్థి అధ్యయనం చేయాలి..

వీరుడి చేతిలో ఆయుధాల్లా..

ఓటు హక్కు వినియోగించుకోవాలి

విద్యతో పొందిన వినయాన్ని ప్రదర్శించాలి..

 ప్రజలను మెప్పించగలగాలి!

విద్యార్థి దశలోనే నేతల్ని ఎంచుకునే

నేర్పు తెలిసి ఉండాలి!!  

దేశ భవిష్యత్తు నిర్మాణం

జరగవలసింది తరగతి గదుల్లో..

అందుకు విద్యాసంస్థలే వేదికలు.. 

 


కవిత - ప్రాచీన జానపద సాహిత్య ప్రతిబింబమే – ఆధునిక జనపద సాహిత్యం

 


Xray సాహితీ సంస్థ నెలనెలా వెన్నెల కార్యక్రమంలో 05-02-2023 చదివిన కవిత

ప్రాచీన జానపద సాహిత్య ప్రతిబింబమే ఆధునిక  జనపద సాహిత్యం  

 

అక్షరస్పృహ లేకపోయినా...

రంజింప చేయగలది, ఆలోచింపచేయగలదీ

జానపద సాహిత్యం! 

ప్రత్యేక పాట, ఆట, సహజస్పందనలు కలిగి..

సంగీత, సాహిత్యాల్లో నిరక్షరాస్యుల భావగీతమే

ప్రాచీన జానపద సాహిత్యం!

ఒక జాతి జీవన విధానాన్ని, సంస్కృతిని

ప్రతిబింబింప చేస్తుంది..

జీవితానుభవాలను వర్ణిస్తూ..

విలక్షణత, మాటలు, సామెతలు,పొడుపు కథలు,

జాతీయాలు, చమత్కారాలు, మాండలికాలు

జానపదుల భాషలో ప్రత్యేకాలు!

అంత్య ప్రాసలతో శబ్ద ప్రధానంగా ..పనిలో అలసట

తెలియకుండా,ఆసక్తిగా పెరిగేలా..

లయబద్ధ ధ్వనులు జోడించి పాడేదే..

జానపద సంగీతం! 

తరతరాల జానపద సాహిత్యమే..

నేటి ఆధునిక జనపద సాహిత్యానికి ప్రతిబింబం! 

చుట్టూ ఉన్నమూలతత్త్వం పాటల రూపంలో...

ప్రేమ, హాస్యం, వెటకారం, ఆవేశం, బాధ, భక్తి..

ఎన్నో భావోద్వేగాలతో జనపదంలోకి చేరింది!

ఒకనాడు భిక్షువుల ద్వారా వ్యాపింపబడిన

జానపదానికి ఒక ప్రతిబింబం ఏర్పడింది...

జానపద సమాహార కళగా ప్రసిద్ధి చెందిన..

తోలుబొమ్మలాటల ప్రతిబింబాలే

నేటి సినిమాలు!

పండుగలు, ఉత్సవ సందర్భాల్లో

స్త్రీ పురుషులు ఆడే కోలాటాల ప్రతిబింబాలే

నేటి డీజేలు!

లయ ప్రధానమై, రస భావాన్ని పెంచే

ప్రాచీన జానపద సంగీతానికి ...

చెవులు బద్దలు కొట్టే వికృత పాశ్చాత్య

వెర్రి కూతలే ప్రతిబింబాలు!

సంగీత సాహిత్యం సంస్కృతులు ప్రవహించే జీవనదులు

మూలబింబాలైన జానపద కళారూపాలు

సహజత్వాన్ని కోల్పోతే...

ఆధునిక జనపద ప్రతిబింబానికి అస్తిత్వం ఉండదు!

ప్రతిబింబాలు లేని బింబం కళావిహీనమవుతుంది!

మూలబింబం ప్రకాశిస్తేనే.. ప్రతిబింబాలకి ప్రకాశం!!

 

కవిత ఊరే ఉమ్మడి కుటుంబం

ఊరే ఉమ్మడి కుటుంబం

ప్రపంచమంతా ఒకే కుటుంబం...

ది నేటి మాట!

ఊరంతా ఒకే కుటుంబం...

అది నాటి మాట!

పెళ్ళిళ్ళు, వ్రతాలు, సంతర్పణలూ...

ఊరంతా కలిసే!  

పెళ్ళిళ్లకి సంబంధాలు, చదువులు...

ఉద్యోగాలూ  ఊరిమధ్యే!

కుటుంబాల మధ్య స్నేహంతో...

ఊరే ఉమ్మడి కుటుంబం!

వృద్ధులు, నడివయసువాళ్ళు,

యువకులు, పిల్లలు...

కలిసికట్టుగా  ఒకే కుటుంబంగా!

కష్టం, సుఖం, బాల్యం, వృద్ధాప్యాలు..

అవగాహనే... నేర్పుతుంది సేవాభావం !

మంచి నడవడిక కలిగిన వాళ్లు

ఊరి పిల్లలందరికీ ఉపమానం!

పాఠాలతో జీవిత సత్యాలు, మెళుకువలు,

క్రమశిక్షణ నేర్పించే గురువులు,

ఊరి పెద్దలు...పిల్లలకి అడుగుజాడలు!

ఊరే ఉమ్మడికుటుంబమైతే...

వృద్ధులకి ఊరి పిల్లలే ఆలంబన!

ప్రపంచమే ఒక కుటుంబమైతే...

చదువులు, ఉద్యోగాలు, సంపాదన,

ప్రపంచ ప్రజలతో బాంధవ్యాలు...

దేశ అభివృద్ధికి మంచిదే!

అది పెంచుతోంది...

తల్లితండ్రులకి, పిల్లలకి మధ్య ...

బాంధవ్యాల దూరం!

పెద్దల అవసరానికి వృద్ధాశ్రమాలే  

అవుతున్నాయి ఆశ్రయాలు

ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ ఉండేదిట!...

మిగులుతోంది విషయం!

జ్ఞానాన్నిపంచిన ఊరు...

మిగులుతోంది ఉమ్మడి వృద్ధాశ్రమంగా!!

కవిత“పట్టిసీమ ఎత్తిపోతల పథకం”!

 

2017 హేవళంబి నామ ఉగాదికి పట్టిసీమ ఎత్తిపోతల పథకం మీద మర్చి 29వ తేదీకి రాసిన కవిత

అపురూప శిల్పం పట్టిసీమ ఎత్తిపోతల పథకం!

 పట్టిసీమ పథకం మొత్తం చూడాలని మా కవుల కోరిక...

ఆ కోరిక నేటికి నెరవేరింది...మనస్సుకి ఆనందం కలిగింది!

అందుకు సహకరించారు నేటి మన జలవనరుల శాఖామాత్యులు!

వాహనం ఏర్పాటు చేశారు...మంచి ఆతిథ్యమిచ్చారు..

పట్టిసీమ ఎత్తిపోతల పథకం! అదొక అద్భుతమైన ప్రక్రియ!

రాజు తల్చుకుంటే దెబ్బలకి కొదవేముందని నాటి సామెత..

పాలకులు తలుచుకుంటే సాధించలేనిది ఏముందని నేటి సామెత!

పోలవరం మండలంలో ఉంది ' పట్టిసీమ’ !

దక్షయజ్ఞ సమయంలో వీరభద్రుడి ఆయుధం పడిన ప్రదేశం..

ఆయుధం పేరు పట్టిస! ఊరి పేరు ' పట్టిసం’! పిలవబడుతోంది ' పట్టిసీమ’గా!

ఇది ఆనాటి చరిత్రలో ఒక ఆధ్యాత్మిక దేవాలయం..

ఈనాటి చరిత్రలో.. ఇదొక లక్ష్య సాధనతో సిరుల పంటల కోసం

నిర్మితమైన ఆధునిక సాంకేతిక నిర్మాణం! 

అన్నమో చంద్రన్నా! అని అడగక ముందే.. పరిస్థితిని గ్రహించి

తన మేథాశక్తిని ఉపయోగించాడు చంద్రబాబు..

తన శ్రమశక్తిని అందించాడు ఉమామహేశ్వరుడు!

నీటిని భూమికి తీసుకుని వచ్చాడు.. ఆనాటి భగీరథుడు..

నీటిని ఒడిసిపట్టి రైతన్నల కష్టాన్ని తీర్చాడు.. ఈనాటి భగీరథుడు!

కాలువల్లో ఇంకిన నీరు... నింపుతోంది రైతుల కంటిలో నీరు..

వర్షమే ఆధారం... అది కురవక పోతే ఉండదు జీవనాధారం!

వరద గోదావరి ఉరకలు పెడుతూ పరుగెడుతోంది సముద్రంవైపు..

ఆ నీటిని ఒడిసి పట్టి పరుగులు పెట్టించారు పొలాలవైపు!

ఆనాడు భగీరథుడు నీటిని ఎలా తెచ్చాడో..  చూడలేదు కళ్లతో..

ఈనాటి భగీరథుడు చేసిన కష్టం చూశాము... కన్నుల పండువుగా!

పట్టిసమంతా తిరిగాము...ప్రతి అంగుళము పట్టి పట్టి చూశాము..

కలిగాయి మాకెన్నో సందేహాలు...తీర్చారు పనిచేస్తున్న శ్రామికులు!

పట్టిసంలో ఎత్తిపోతల పథకం ప్రయోజనం...నీటి ఎద్దడిని తగ్గించడం..

 వరద సమయంలో సముద్రంలో కలుస్తున్న నీటిని ఒడిసిపట్టడం!

పంపులద్వారా తోడి పోలవరం కుడి ప్రధాన కాలువకి పంపడం..

ఆ కాలువ ద్వారా నీటిని కృష్ణా నదిలోకి వదలడం...!

నీరు అందక అలమటించే రైతన్నల పొలాల్లో పచ్చదనం నింపడం!

పోలవరం పథకం ఉండగా ఈ పట్టిసీమ ఎందుకు?

దీనికోసం పెట్టిన  ఖర్చు నిరుపయోగమని సందేహం..

పట్టిసీమ చూశాక తీరింది మా సందేహం!

అక్కడ పెట్టిన ప్రతి కాసుకి కలుగుతుంది వందరెట్ల ప్రయోజనం..

పోలవరం వైపు చూస్తూ... ఇంకెప్పుడా అని వేచి చూడద్దన్నాడు..

పట్టిసీమ అనే పోలవరాన్ని రైతన్నలకి ఇచ్చాడు చంద్రన్న వరంగా!

చంద్రన్న సంకల్పం...ఉమామహేశ్వరుడి చాకచక్యం...

అతి తక్కువ సమయంలో...అధునాతన యంత్రాలతో...

ఇంజనీర్లే యంత్రాలై ...శ్రామికులందరు ఒక్కటై...

పగలు రాత్రి సమమై ... అందరూ దేవ శిల్పులై..

రూపుదిద్దుకున్న అపురూప శిల్పం “పట్టిసీమ ఎత్తిపోతల పథకం”!

మనస్సులో ముద్రితమైన ఆ దృశ్యం ఎప్పటికీ కాదుఅదృశ్యం’!

పనిని, పనిచేస్తున్నవాళ్ళని, చేయిస్తున్న వాళ్లని...ఒక్కచోట చూశాము

చూడగలిగిన మా అదృష్టాన్ని .. అనందాన్ని అందరితో పంచుకుంటున్నాము!

ఇది అన్నదాతలకి చంద్రన్న సేన అందించిన కానుకగా...

రాష్ట్ర గౌరవానికి ప్రతీకగా...భావి తరాలకి చాటుదాం!

మన రాష్ట్ర  చరిత్రలో దీన్ని పదిల పరిచి ఉంచుదాం!!

 

 

 

 

 

నాన్నమ్మ చెప్పిన కథలు

దాగి ఉన్న నిథి  కథ

      నాన్నమ్మ పిల్లల కోసం ఎదురు చూస్తోంది. మాయదారి కరోనా వచ్చి పిల్లల్ని జైలుపాలు చేసింది. కోతికొమ్మచ్చులూ లేవు, దాగుడు మూతలూ లేవు. తలుపులు మూతేసి నాలుగు గోడల మధ్య బంధించేస్తున్నారు.

   ఫోనులోనో, బుల్లి పెట్టెలోనో పాఠాలు చెప్పేస్తున్నారు. వీళ్ల మొహం వాళ్లకి కనిపించదు, వాళ్ల మొహం వీళ్లకి కనిపించదు. చెప్పిన పాఠాలు బుర్రకెక్కించుకుంటున్నారో లేదో తెలియదు కాని, తలనెప్పులూ, మెడనొప్పులూ మాత్రం వచ్చేస్తున్నాయి అంటూ తనలో తనే మాట్లాడుకుంటోంది.

   ఇంతలో నందూ పరుగెత్తుకుంటూ వచ్చేశాడు. నాన్నమ్మా! నీ కథ కోసం అందరం ఎదురుచూస్తున్నాం అన్నాడు.

   వాడి మాటలు విని నాన్నమ్మ ఒరేయ్! ఎన్ని మాటలు నేర్చావురా? ఇందాకట్నుంచీ నేను మీ కోసం పడగాపుళ్లు పడి కూర్చున్నాను. మీరు రాకుండా నన్ను అంటావురా? ఉండు నీ పని చెప్తా. అసలు కథే చెప్పను పొండి! అంది నాన్నమ్మ.

   నందూ భయపడిపోయాడు. అయ్యో నాన్నమ్మా! అంత పని చెయ్యకు. ఇప్పుడే అందర్నీ లాక్కొస్తాను. నువ్విక్కడే కూర్చో! అంటూ తుర్రుమన్నాడు.

   వాణ్ని చూసి నాన్నమ్మ పిచ్చి సన్నాసికి కథ వినకపోతే నిద్రపట్టదు అనుకుంటూ పిల్లల కోసం ఎదురు చూస్తూ కూర్చుంది.

   అంతలోనే బిలబిల్లాడుతూ వచ్చేశారు. చాపలు వేసుకుని పడకలు సిద్ధం చేసుకుని నాన్నమ్మ ఎదురుగా కూర్చున్నారు.

   వాళ్లని చూస్తే నాన్నమ్మకి ముచ్చటేసింది. ఎమర్రా! అందరూ వచ్చేశారా? ఈ రోజు మీకు  దాగి ఉన్న నిథి  కథ చెప్తాను వినండి అంది.

   పిల్లలందరూ ఒకేసారి ... అని అరిచారు. నాన్నమ్మ కథ మొదలు పెట్టింది.

   మార్జలపురంలో సోములు అనే రైతు ఉండేవాడు. అతడికి ఇద్దరు కొడుకులు.. వాళ్లిద్దరు పరమ బద్ధకస్తులు. ఏ పనీ చేసేవాళ్లు కాదు. తినడం తిరగడమే వాళ్ల పని.

   సోములుకి చాలా విచారంగా ఉండేది. వీళ్లు ఏ పని చెయ్యకుండా తిరిగి తిరిగి భోజనానికి మాత్రం ఇంటికి వస్తారు. తనకి కూడా పనిలో సాయం చెయ్యరు.

   ఇలా అయితే నేను వెళ్లిపోతే ఎలా బతుకీడుస్తారు? ఎప్పటికైనా బాగుపడతారా? అది నేను చూస్తానా? అని బాధపడేవాడు. అతడికి ఎప్పుడూ అదే ఆలోచన అయిపోయింది.

   హఠాత్తుగా సోములుకి ఒక మంచి ఆలోచన తట్టింది. వెంటనే ఆలస్యం చెయ్యకుండా తన కొడుకులిద్దరినీ పిలిచాడు. నాయనలారా! మన పొలంలో  నిథి దాగి ఉంది అని చెప్పాడు.

   మర్నాడు ఏదో పని ఉందని చెప్పి పొరుగూరు వెళ్లాడు. సోములు ఊరు వెళ్లగానే అన్నదమ్ములిద్దరూ తండ్రి లేని సమయంలో ఆ నిథి ఎక్కడుందో కనిపెట్టడానికి ఏదో ఒకటి చెయ్యాలనుకున్నారు.

  వాళ్లకి తండ్రి చెప్పిన విషయం గుర్తుకి తెచ్చుకున్నారు.  నిథి పొలంలో ఉందని చెప్పాడు కదా...దాగి ఉన్న నిథిని గురించి తెలుసుకోవాలనుకున్నారు.

   అది దక్కించుకుంటే దాన్ని తీసుకుని ఎక్కడికైనా వెళ్లి స్వతంత్రంగా బతకచ్చు అనుకున్నారు.

    అనుకున్నారో లేదో వెంటనే పొలానికి బయలుదేరారు. చాలా రోజులు కష్టపడి పొలమంతా తవ్వేశారు. వాళ్లకి నిథి ఎక్కడ ఉందో కనిపించలేదు. నిరాశతో ఇంటికి వచ్చేశారు.

   ఒకరోజు బాగా వర్షం పడింది. పొరుగూరు వెళ్లిన సోములు తిరిగి వచ్చేశాడు. కొడుకులిద్దరూ వచ్చి పొలంలో నిథి ఉందని చెప్పావని పొలమంతా తవ్వేశాము. కాని, ఎంత తవ్వినా మాకు నిథి కనిపించలేదు” అని చెప్పారు.

   సోములు పొలం చూడ్డానికి వెళ్లాడు. వర్షం బాగా పడడం వల్ల పొలమంతా మొక్కలు బాగా లేచాయి. సోములు ఊరు వెళ్లేటప్పుడు పొలమంతా విత్తనాలు చల్లి వెళ్లాడు.

  వర్షం తోడయ్యేసరికి చక్కగా పైరు బయలుదేరింది.

   కొడుకులిద్దర్నీ పిలిచాడు. చూశారా! మీరు పడిన కష్టానికి ఫలితం లేదని అనుకున్నారు. కాని, మన పొలం ఎంత చక్కగా పండిందో చూడండి” అని పొలాన్ని చూపించాడు.

   మీరు కష్టపడి పొలాన్ని తవ్వారు. కాబట్టే పొలంలో ఇంత పంట పండుతోంది. కష్టానికి ఫలితం ఎప్పుడూ ఉంటుంది. మీరే స్వయంగా చూస్తున్నారు కదా!” అన్నాడు సంతోషంగా.

   అన్నదమ్ములిద్దరూ పొలం వైపు చూసి ఆశ్చర్యపోయారు. మనమిద్దరం కలిసి తవ్వడం, వెంటనే వర్షం రావడం వల్ల నాన్న వేసిన విత్తనాలకి పైరు పెరిగి ఇంత పంట చేతికొస్తోంది.

   ఇంతకంటే గొప్ప నిథి ఏముంటుంది? అంటే, మన పొలంలో పంట రూపంలో నిథి దాగి ఉంది. అది మనం తెలుసుకోలేకపోయాం అని ఆనందపడ్డారు.

   బాగా కష్టపడితే బాగా సంపాదించవచ్చు, తిని కూర్చుంటే ఏదీ తమ దగ్గరికి రాదుఅని వాళ్లు అర్థం చేసుకున్నారు.

   అప్పటినుంచి బద్ధకం వదిలించుకుని పని చెయ్యడం మొదలుపెట్టి బాగా ధనవంతులయ్యారు. బద్ధకం వదిలి కష్టపడి పనిచెయ్యడం నేర్చుకున్న కొడుకుల్ని చూసుకుని సోములు ఆనందానికి అవధులు లేవు.

   ఇదర్రా ఆ అన్నదమ్ముల కథ. మీకు అర్థమైందా? మీరు కూడా బద్ధకాన్ని పెంచుకోకుండా బాగా చదువుకుని పెద్ద ఉద్యోగాలు తెచ్చుకోండి అంటూ నాన్నమ్మ నందూ వైపు చూసింది.

   వెంటనే నందూ  కథ కంచికి, మనం నిద్రలోకి అని చెప్పేశాడు. అందర్నీ పడుకోమని చెప్పి నాన్నమ్మ కూడా నిద్రపోయింది.

                                                              ‘ఫలితం కావాలంటే కష్టపడాలి!