About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

మహాభారత కథ-9

 

సముద్ర మథనము

    అమృతం తాగడం వల్ల మరణం ఉండదని దేవతలకి తెలిసింది. ఏమయినా సరే అది ఎలా దొరుకుతుందో తెలుసుకుని దాన్ని తాగాలని అనుకున్నారు. పాలసముద్రాన్ని చిలికితే అందులోంచి అమృతం వస్తుంది. కాని, అది అంత తేలికైన పని కాదు. రాక్షసులకి కూడా నచ్చచెప్పి తమతో కలుపుకుంటే సముద్రాన్ని చిలకడం తేలిక అవుతుంది.

   అమృతం దొరికాక దాన్ని రాక్షసులే తాగేస్తేనో? దేవతలకి సందేహం వచ్చింది. అప్పటి సంగతి అప్పుడు చూసుకోవచ్చు. ముందు పాలసముద్రాన్ని చిలకడానికి రాక్షసుల సాయం అడగాలని అనుకున్నారు. దేవతలకీ రాక్షసులకీ ఎప్పుడూ పడదు. ఒకళ్లతో ఒకళ్లు పోట్లాడుకుంటూనే ఉంటారు. అయినా సరే, అమృతం తాగాలన్న కోరిక దేవతల్ని ఒకచోట నిలబడనియ్యడం లేదు.

  ఒకరోజు దేవతలందరూ రాక్షసుల దగ్గరికి వెళ్లారు. అమృతం తాగితే మరణం ఉండదని, ఎప్పుడూ హాయిగా జీవించే ఉండచ్చని నచ్చ చెప్పారు. చివరికి పాలసముద్రాన్ని చిలికి అమృతాన్ని పొందడానికి తాము సహాయం చేస్తామన్నారు రాక్షసులు.

   ఇంద్రుణ్ని తీసుకుని అందరూ కలిసి మేరు పర్వతం మీదకి వెళ్లారు. పాలసముద్రాన్ని చిలకడానికి సన్నాహాలు మొదలుపెట్టారు. అంత పెద్ద సముద్రాన్ని చిలకాలంటే దానికి సరిపడినంత కవ్వం కావాలి. కవ్వం దొరికినా దానికి తిరగడానికి తాడు కావాలి. ఈ రెండూ దొరికినా కవ్వం భూమిలో కూరుకుని పోకుండా దానికి కింద ఆధారం కావాలి. ఏం చెయ్యాలా.. అని అనేక విధాలుగా ఆలోచిస్తున్నారు.

   ఏదయినా సాధించాలి అనుకుంటే ముందు పట్టుదల ఉండాలి, తరువాత దానికి తగిన జ్ఞానం ఉండాలి, అవసరమైన పరికరాలు ఉండాలి. దేవతలు, రాక్షసులు అమృతం తాగాలన్న పట్టుదలతో ఉన్నారు. ఎలా చేస్తే అమృతాన్ని పొందవచ్చో ముందుగా తెలుసుకున్నారు. పరికరాల కోసం ఆలోచిస్తూ బ్రహ్మ,  విష్ణువుల్ని కలిసి సలహా అడిగారు.

   అన్ని పర్వతాల్నీ కలిపితే ఎంత పొడవు ఉంటుందో అంత పొడవుతోను, వంకర లేకుండాను, కదలకుండా స్థిరంగాను, తన మీద పెరిగే మూలికల రసంతో దృఢంగాను, అన్ని పర్వతాల కంటే పెద్దదిగాను ఉన్న  మంథర పర్వతాన్ని పాలసముద్రం చిలకడానికి కవ్వంగా ఉపయోగించమని సలహా ఇచ్చారు.

   భూమి పైకి పదకొండు యోజనాలు, భూమి లోపలికి పదకొండు యోజనాలు ఉన్న మంథర పర్వతాన్ని సర్పరాజు ఆది శేషుడు పెల్లగించాడు. దేవతలు రాక్షసులు కలిసి దాన్ని మోసుకుని వచ్చి సముద్రంలో పడేశారు. వెంటనే అది సముద్రంలో పైకి నిలవకుండా లోపలికి కూరుకుని పోయింది.

   పర్వతం కదలకుండా ఉండడానికి ఏం చెయ్యాలని విష్ణుమూర్తిని సలహా అడిగారు. మంథర పర్వతం సముద్రంలో కూరుకుని పోకుండా దాని అడుగున కూర్మావతారంతో తనే ఆధారంగా ఉంటానన్నాడు.

   మంథర పర్వతాన్ని కవ్వంగాను, కూర్మావతారంలో ఉన్న విష్ణుమూర్తిని దానికి ఆధారంగాను ఏర్పాటు చేసుకున్నారు.  కాని, కవ్వాన్ని తిప్పాలంటే తాడు కావాలిగా? బాగా ఆలోచించి... చాలా పొడవుగా ఉండే వాసుకి అనే పేరుగల పాముని తెచ్చి తాడుగా చేసుకున్నారు. వాసుకి మంథర పర్వతాన్ని చుట్టలుగా చుట్టుకున్నాడు.

   రాక్షసులు సర్పరాజు తలవైపు బలంగా పట్టుకున్నారు. దేవతలు వాసుకి తోక భాగాన్ని పట్టుకున్నారు. దేవతలు, రాక్షసులు కూడా అమృతాన్ని తాగే తీరాలి అనే పట్టుదలతో పాలసముద్రాన్ని చిలకడం మొదలు పెట్టారు.

   వాళ్లు పడుతున్న శ్రమని చూసి వాళ్లకి ఉన్న శక్తి సరిపోదనుకున్నాడు విష్ణుమూర్తి. అందుకని వాళ్లకి ఇంకా కొంత శక్తిని, వేగాన్ని ఇచ్చాడు. ఒకళ్లనొకళ్లు జబ్బలు చరుచుకుంటూ; ఉత్సాహ పరుచుకుంటూ; అంతకు ముందు కంటే ఎక్కువ వేగంతో కవ్వాన్ని తిప్పుతూ; పాలసముద్రాన్ని చిలుకుతున్నారు.  

   వాళ్ల కష్టానికి ఫలితం దక్కలేదు. ముందు విషం పుట్టి లోకాలన్నింటినీ దహించేస్తూ అన్ని వైపులకీ వ్యాపించించడం మొదలుపెట్టింది. భయపడి పరుగులు పెడుతూ అందరూ శివుడి దగ్గరికి వెళ్లారు.

   శివుడు ఆ విషాన్ని తన కఠంలో బంధించి ఉంచాడు. దేవతలు, రాక్షసులు పాలసముద్రం దగ్గరికి వెళ్లి మళ్లీ చిలకడం మొదలు పెట్టారు. వాళ్లల్లో అమృతాన్ని తాగాలన్న పట్టుదల ఇంకా పెరిగిపోయింది.

   ఈసారి జ్యేష్టాదేవి, చంద్రుడు, లక్ష్మీదేవి, ఉచ్ఛైశ్రవము అనే పేరుతో తెల్లని గుర్రము, కౌస్తుభమణి, అమృతంతో నిండిన కమండలంతో దేవ వైద్యుడు, ఐరావతమనే పేరుగల తెల్లని ఏనుగు ఇంకా అనేకమంది వ్యక్తులు, వస్తువులు, జంతువులు మొదలైనవన్నీ పుట్టాయి.

   వాటిలో ముల్లోకాలతో పూజింపబడుతున్న లక్ష్మీదేవి, సూర్యకిరణాల కాంతి కంటే ఎక్కువ కాంతితో ప్రకాశించే కౌస్తుభమణి విష్ణుమూర్తి వక్షస్థలం మీదకీ; ఉచ్ఛైశ్రమనే గుర్రము, ఐరావతమనే ఏనుగు ఇంద్రుడి దగ్గరికీ చేరుకున్నాయి.

   ఇంకా పట్టుదలతో పాలసముద్రాన్ని చిలుకుతూనే ఉన్నారు. చివరికి అమృతాన్ని సాధించారు. వాళ్ల ఆనందానికి అవధులు లేవు. సంతోషంతో ఉప్పొంగిపోయారు.

   అమృతం సాధించిన తరువాత దేవదానవుల మధ్య యుద్ధం జరిగింది. దాన్ని గురించి తెలుసుకుందాం...

   పాలసముద్రాన్ని చిలికినప్పుడు వచ్చిన అమృతాన్ని రాక్షసులు తీసేసుకున్నారు. దేవతలు ఊరుకుంటారా? ఆ విషయం విష్ణుమూర్తికి చెప్పారు. విష్ణుమూర్తి తక్కువవాడా? వెంటనే అందమైన మోహిని రూపంలో రాక్షసుల దగ్గరికి వచ్చాడు. రాక్షసులు అందంగా ఉన్న మోహినిని చూసి అమృతం గురించి మర్చిపోయి మోహిని వెంట పడ్డారు. అమృతం విష్ణుమూర్తి చేతికి వచ్చింది.

   మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి దేవతల్ని ఒకవైపు, రాక్షసుల్ని ఒకవైపు కూర్చోమన్నాడు. తనే స్వయంగా అందరికీ అమృతం పంచుతానని చెప్పాడు. దేవతలు, రాక్షసులు మోహిని చెప్పినట్టే కూర్చున్నారు. 

   మోహిని దేవతల వైపు అమృతం పంచుతుంటే వాళ్లు తాగుతున్నారు. రాక్షసుడు రాహువు కూడా దేవతల వరుసలో కూర్చున్నాడు. చంద్రుడు, సూర్యుడు అతణ్ని చూసి విషయం మోహినికి చెప్పారు. అప్పటికే మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి రాహువుకి అమృతం పోసేశాడు.

   సూర్య చంద్రులు చెప్పింది విని విష్ణుమూర్తి వెంటనే తన చక్రంతో రాహువు తల నరికేశాడు. అతడు తాగుతూ ఉన్న అమృతం అతడి కంఠం దగ్గరే ఉండిపోయింది. అప్పటికి ఇంకా రాహువు అమృతాన్ని మింగలేదు.

   రాహువు శరీరం భూమి మీద పడిపోయింది. తల భాగం మాత్రం అమృతం తాకడం వల్ల నాశనం లేకుండా ఉండిపోయింది. అప్పటినుంచే రాహువుకి సూర్య చంద్రులతో విరోధం ఏర్పడింది. అది ఇప్పటికీ నడుస్తూనే ఉంది.

   అమృతం తమకి పొయ్యలేదని రాక్షసులకి కోపం వచ్చింది. అందరూ కలిసి తమకు రాజైన బలిచక్రవర్తిని కలుసుకుని జరిగిన విషయం మొత్తం చెప్పుకున్నారు. బలిచక్రవర్తితో సంప్రదించి చివరికి ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ దేవతలతో మనకి స్నేహం వద్దు, యుద్ధం చేసి అమృతాన్ని తెచ్చుకుందామని అనుకున్నారు.

  యుద్ధమంటే రాక్షస జాతికి చాలా ఇష్టం. వెంటనే రథాలు, గుర్రాలు, ఏనుగులు, కాలిబలం సిద్ధం చేసుకున్నారు. భయంకరమైన ఆకారాలతో పెద్ద పెద్ద కేకలు వేస్తూ దేవతల మీదకి యుద్ధానికి వెళ్లారు.

   దేవతల మీద ఆపకుండా బాణాలు వేశారు. ఆ బాణాలు దేవతల్ని భయంకరంగా చుట్టుముట్టాయి. అది చూసిన దేవతలు విష్ణుమూర్తితో సహా యుద్ధానికి దిగారు.  పెద్ద పెద్ద పర్వత శిఖరాల మీద ఎక్కి రాక్షసుల మీద బాణవర్షం కురిపించారు.

   పై నుంచి ఆగకుండా మీద పడుతున్న బాణాలకి రాక్షసులు పెద్ద పెద్ద కేకలు వేస్తూ కూలబడి పోతున్నారు. విష్ణుమూర్తి ప్రయోగించిన చక్రానికి రాక్షసుల తలలు తెగి పడుతున్నాయి. యుద్ధరంగం మొత్తం రాక్షసుల రక్తంతో నిండి పోయింది.

   సముద్రపు ఒడ్డు దగ్గర జరుగుతున్న యుద్ధంలో రాక్షసులు ఓడిపోయారు. మరణించగా మిగిలిన రాక్షసులు సముద్రం అడుగుకి వెళ్లిపోయారు. అమృతాన్ని జాగ్రత్తగా కాపాడమని ఇంద్రుడికి అప్పగించి దేవతలందరూ తమ ప్రదేశాలకి వెళ్లిపోయారు.

 

మహాభారతకథ-8

 

ఆదిపర్వము రెండవ ఆశ్వాసము నుండి

నాగజాతి అనూరుడు గరుత్మంతుల జననం

   అప్పటి వరకు సూతమహర్షి చెప్పినదాన్ని విని శౌనకుడు మొదలైన మహర్షులు మహర్షీ! పాములకి కద్రువ తల్లి కదా! ఆమె తన పిల్లలకి నాశనం జరగాలని ఎందుకు శపించింది? అని అడిగి, సూతమహర్షి తరువాత చెప్పబోయే కథల్ని వినడానికి సిద్ధంగా ఉన్నారు.

నాగజాతి జననం

   కశ్యపబ్రహ్మకి ఇద్దరు భార్యలు. వాళ్ల పేర్లు కద్రువ, వినత. సంతానం కోసం కొన్నివేల సంవత్సరాలు ఆయనకి సేవ చేశారు.   ఒకరోజు కశ్యపుడు వాళ్లిద్దర్నీ పిలిచి  మీకు ఏ వరం కావాలో కోరుకోండి ఇస్తాను! అన్నాడు. తమ కోరిక తీరుతున్నందుకు వాళ్లిద్దరు చాలా సంతోష పడ్డారు.

   కద్రువ  “నాథా! నాకు అగ్నిలా గొప్ప కాంతి, చాలా పొడవైన శరీరము, అమితమైన పరాక్రమము కలిగిన వెయ్యి మంది కొడుకుల్ని ప్రసాదించండి! అని అడిగింది.

    అమె అడిగిన తరువాత వినత స్వామీ! నాకు కద్రువకు కలిగే కొడుకులకంటె ఎక్కువ పరాక్రమము, ముఖ్యంగా బాహుబలం ఎక్కువగా కలిగిన ఇద్దరు కొడుకుల్ని ప్రసాదించండి! అని కోరుకుంది.

   తపస్సంపన్నుడైన కశ్యప మహర్షి మంచి సంతానం కోసం పుత్రకామేష్టి అనే యాగం చేశాడు. కద్రువకి వెయ్యిమంది కొడుకుల్ని, వినతకి ఇద్దరు కొడుకుల్ని వాళ్లు కోరుకున్నట్టుగా అనుగ్రహించాడు. గర్భాల్ని జాగ్రత్తగా కాపాడుకోమని చెప్పాడు.

   కొంతకాలం గడిచాక వాళ్ల గర్భాలు అండాలుగా మారాయి. వాటిని నెయ్యితో నిండిన కుండల్లో ఉంచి కాపాడుకుంటున్నారు. అయిదు వందల సంవత్సరాలు అలాగే గడిచిపోయాయి.

  కద్రువ కుండల్లో పెట్టిన అండాలు పగిలి:-  శేషుడు, వాసుకి, ఐరావతుడు, తక్షకుడు, కర్కోటకుడు, ధనంజయుడు, కాళీయుడు, మణినాగుడు, ఆపూరణుడు, పింజరకుడు, ఏలాపుత్రుడు, వామనుడు, నీలుడు, అనీలుడు, కల్మాషుడు, శబలుడు, ఆర్యకుడు, ఉగ్రకుడు, కలశపోతకుడు, సురాముఖుడు, దధిముఖుడు, విమలపిండకుడు, ఆప్తుడు, కర్కోటకుడు, శంఖుడు, వాలిశిఖుడు, నిష్ఠానకుడు, హేమగుహుడు, నహుషుడు, పింగళుడు, బాహ్యకర్ణుడు, హస్తిపదుడు, ముద్గరుడు, పిండకుడు, కంబలుడు, అశ్వతరుడు, కాళీయకుడు, వృత్తుడు, సంవర్తకుడు, పద్ముడు, శంఖముఖుడు, కూష్మాండకుడు, క్షేమకుడు, పిండారకుడు, కరవీరుడు, పుష్పదంష్ట్రుడు, బిల్వకుడు, బిల్వపాండరుడు, మూషకాదుడు, శంఖశిరుడు, పూర్ణభద్రుడు, హరిద్రకుడు, అపరాజితుడు, జ్యోతికుడు, శ్రీవహుడు, కౌరవ్యుడు, ధృతరాష్ట్రుడు, శంఖపిండుడు, వీర్యవంతుడు, విరజుడు, సుబాహువు, శాలిపిండుడు, హస్తిపిండుడు, పిఠరకుడు, సుముఖుడు, కౌణపాశనుడు, కుఠరుడు, కుంజరుడు, ప్రభాకరుడు, కుముదుడు, కుముదాక్షుడు, తిత్తిరి, హలికుడు, కర్దముడు, బహుమూలకుడు, కర్కరుడు, అకర్కరుడు, కుండోదరుడు, మహోదరుడు  మొదలైన పేర్లతో వెయ్యిమంది గొప్ప బలవంతులైన, పొడవైన సర్ప రాజులు జన్మించారు. కద్రువకి కలిగిన సంతానం పాములన్నమాట!

అనూరుడు జననం

   తన గర్భం నుంచి వచ్చిన అండాలు ఇంకా పగలలేదని, తను కోరుకున్నట్టుగా తనకి సంతానం కలగలేదని వినత బాధ పడింది. తన సవతి కద్రువ తనకంటే ముందు తల్లయింది. తనని అందరూ ఏమనుకుంటారో అని సిగ్గుపడింది. తన అండాలు వాటంతట అవి పగలక ముందే కంగారుగా ఒక అండాన్ని పగుల కొట్టింది.  ఆ అండం నుంచి శరీరంలో కింద భాగం లేకుండా, పై శరీరం మాత్రమే ఉన్న గొప్ప నీతివంతుడైన కుమారుడు జన్మించాడు.

  అతడి పేరు అనూరుడు. శరీరం పూర్తిగా ఏర్పడకుండా జన్మించిన అనూరుడు (తొడలు లేనివాడు) తల్లి మీద కోపగించాడు. తల్లీ! నాకు పూర్తిగా శరీరం ఏర్పడకుండానే అండాన్ని పగలకొట్టి పొరపాటు చేశావు. నన్ను వికలాంగుడిగా పుట్టించావు. కనుక, నువ్వు అయిదు వందల సంవత్సరాలు నీ సవతి కద్రువకి దాసిగా జీవించు!” అని తల్లిని శపించాడు.

   అనూరుడు కోపంతో శపించినా అంతలోనే దయ కలిగి  అమ్మా!  రెండవ అండం నుంచి గొప్ప బలము, పరాక్రమము కలిగినవాడు పుడతాడు. నీ దాసీత్వాన్ని అతడే పోగొడతాడు. తొందరపడి ఆ గుడ్డుని మాత్రం పగలకొట్టద్దు!” అని చెప్పాడు.

    వినత మళ్లీ పొరపాటు  చెయ్యకుండా తన రెండవ అండాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటోంది. ఆమె పెద్ద కుమారుడు అనూరుడు సూర్యుడికి సారథిగా వెళ్లిపోయాడు.

కద్రువ వినతల పందెము

   కద్రువ వినతలు పాలసముద్రం ఒడ్డు దగ్గర కూర్చుని ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తున్నారు. మొసళ్లు, నీటి ఏనుగులు బలంగా నీళ్లమీద పడి ఎగురుతున్నప్పుడు నీటి బిందువులు పైకి లేచి సముద్రపు అలల మీద వర్షం కురుస్తున్నట్టు, పైకి లేచిన అలలు ఆకాశాన్ని కప్పేస్తున్నట్టు కనిపిస్తోంది.

   పాములు, చేపలు, మొసళ్లతో నిండిన సముద్రం ఎగిసిపడే అలలతో అందంగా కనిపిస్తుంటే చూస్తూ కూర్చున్నారు. మధ్య మధ్య ఒడ్డు మీద ఉన్న వనాల్లో నడుస్తూ... ఏలకిలతలు, లవలీలతలు, మాదీలతలు, లవంగలతల్ని; తెల్లటి పద్మాలు, సముద్రపు అంచుకి చేరిన నురుగుతో అందంగా ఉన్న ప్రదేశాల్ని అసక్తిగా చూస్తున్నారు.

      పాలసముద్రాన్ని చిలికినప్పుడు అమృతంతో పాటు పుట్టిన ఉచ్ఛైశ్రవము అనే అందంగా బలంగా ఉన్న ఇంద్రుడి తెల్లటి గుర్రం పాలసముద్ర తీరంలో హాయిగా తిరుగుతూ కనిపించింది.  దాన్ని చూసి కద్రువ శరీరమంతా నిండు చంద్రుడిలా తెల్లగా ఉన్నా కూడా ఆ గుర్రానికి తోక మాత్రం నల్లగా ఉంది చూడు!” అంది.

   అది విని వినత నవ్వి “కద్రువా! నీకు నలుపు ఎలా కనిపించిందో గానీ, గొప్పవాళ్ల కీర్తి ప్రపంచమంతా వ్యాపించినట్టు దాని శరీరమంతా తెలుపు రంగు కాంతితో ప్రకాశిస్తోంది. దాని శరీరంలో అసలు నలుపు మచ్చ ఎక్కడ ఉంది?” అంది.

   అది విని కద్రువ “అయితే, ఆ తెల్లని గుర్రానికి నల్లటి మచ్చ ఉంటే నువ్వు వెంటనే నాకు దాసిగా ఉండాలి. ఒకవేళ దాని శరీరం మీద నల్ల మచ్చ లేదనుకో నేనే నీకు దాసిగా ఉంటాను! అంది.

   ఇద్దరూ ఒకళ్లకి ఒకళ్లు దాసిగా ఉండేట్టు పందెం వేసుకున్నారు. “అయితే దగ్గరగా వెళ్లి ఆ గుర్రాన్ని చూసి వద్దాం రా!” అంది వినత.

   కద్రువ “ఇప్పుడు సమయం చాలదు. రేపు ఉదయాన్నే వచ్చి చూద్దాం!” అంది. ఆ రోజు ఇద్దరూ ఇంటికి వెళ్లిపోయారు.

   ఇంటికి వెళ్లిన తర్వాత కద్రువ తన పాము పిల్లల్ని పిలిచి జరిగిన విషయం చెప్పి నేను, వినత పందెం వేసుకున్నాం. కనుక, మీరు ఆ గుర్రం తోకని నలుపు చెయ్యండి. లేకపోతే నేను వినత దగ్గర దాసిగా పడి ఉండాలి! అని చెప్పింది.

   అది ధర్మం కాదని వాళ్లు ఎవరూ అందుకు అంగీకరించలేదు. కద్రువకి తన కుమారుల మీద కోపం వచ్చింది. “నా మాట మీద మీకు గౌరవం లేదు. నేను చెప్పిన పని చెయ్యడం మీకు ఇష్టం లేదు. కనుక, పరీక్షిత్తు కుమారుడైన జనమేజయ మహారాజు చేసే సర్పయాగంలో మీరందరు మరణిస్తారు! అని శపించింది.

   అందరికంటే చిన్నవాడైన కర్కోటకుడు మాత్రం తల్లి ఇచ్చిన శాపానికి భయపడ్డాడు. మర్నాడు ఉదయాన్నే వెళ్లి గుర్రం తోకకి నల్లని మచ్చలా కనిపించేట్లు దాని తోకని పట్టుకుని వ్రేలాడుతూ ఉండిపోయాడు.

    కద్రువ, వినత గుర్రాన్ని చూడ్డానికి వెళ్లారు. కర్కోటకుడు గుర్రం తోకని చుట్టుకుని ఉండడం వల్ల గుర్రం తోక నల్లగా కనిపించింది. పందెంలో ఓడిపోయిన వినత కద్రువకి దాసిగా వచ్చింది.

గరుత్మంతుడు జననం

   అనూరుడు తల్లి వినతకి శాపం ఇచ్చి అయిదు వందల సంవత్సరాలు గడిచింది. శాప ఫలాన్ని అనుభవిస్తున్న వినత తన సవతి కద్రువ దగ్గర దాసిగానే జీవిస్తోంది.

    ఒకరోజు వినత పెట్టిన రెండవ గుడ్డు పగిలింది. సూర్యుడి కాంతే తక్కువగా ఉందేమో అనిపించేంత గొప్ప కాంతి; పర్వతాల్ని కూడా కదిలించ కలిగినంత వేగము, బలము ఉన్న రెండు రెక్కలతో అతిపెద్ద శరీరం కలిగిన  గరుత్మంతుడు జన్మించాడు.  గొప్ప బలశాలి, పెద్ద శరీరం ఉన్న కుమారుణ్ని చూసుకుని ఆనందపడింది వినత. అతడు వెంటనే ఆకాశంలోకి ఎగిరిపోయాడు. ఇంద్రుడు వజ్రాయుధానికి కూడా తెగనంత పెద్దపెద్ద రెక్కలతో ఉన్నాడు. పర్వతంలా ఆకాశ మార్గంలో ఎగురుతూ వెళ్లి, వెంటనే కిందకి దిగి వచ్చి తల్లి వినతకి నమస్కరించాడు.

   పుడుతూనే తన పెద్ద శరీరంతో ఆకాశంలోకి ఎగిరి, తిరిగి వచ్చి తల్లికి నమస్కరిస్తున్న గరుడుణ్ని చూసిన కద్రువకి అసూయ కలిగింది. వెంటనే “నీ తల్లి వినత నాకు దాసి. నువ్వు కూడా నేను చెప్పినట్టే వినాలి. నా పిల్లల్ని అందర్నీ ఎత్తుకుని తీసుకుని వెళ్లి ప్రదేశాలన్నీ చూపించు!” అని ఆజ్ఞాపించింది.

   సవతి తల్లి కద్రువ చెప్పిన పనులన్నీ గరుత్మంతుడు వినయంగా చేస్తున్నాడు. ఒకరోజు గరుత్మంతుడు పాముల్ని వీపు మీద ఎక్కించుకుని, అతి వేగంతో ఎగురుతూ సూర్యమండలం వరకు వెళ్లాడు.  సూర్యుడి తీక్ష్ణమైన కిరణాల వేడిని భరించలేక పాములు జారి నేలమీద పడి మూర్ఛపోయాయి.

    అది చూసిన కద్రువ కోపంతో గరుత్మంతుణ్ని నిందించింది. తన పిల్లల్ని బ్రతికించమని ఇంద్రుణ్ని ప్రార్థించింది. ఇంద్రుడు ఆ పాముల మీద పెద్ద వాన కురిపించి వాటికి వేడి తగ్గేట్టు చేశాడు. కద్రువ ఇంతకు ముందు కంటే ఎక్కువగా వినతకి, గరుత్మంతుడికి పనులు చెప్పి చేయించుకుంటోంది.

   ఒకరోజు గరుత్మంతుడు తల్లి దగ్గరికి వెళ్లి “మనం కద్రువకి దాసులుగా ఎందుకు ఉంటున్నాము? అని అడిగాడు.

   తను కద్రువ పందెం వేసుకున్నామనీ; అందులో తను ఓడిపోడం వల్ల అమెకి దాసీగా ఉండవలసి వచ్చిందనీ; తన పెద్దకుమారుడు అనూరుడు కూడా తనను శపించాడనీ వివరంగా చెప్పింది వినత. గరుత్మంతుడు చాలా బాధ పడ్డాడు.

     “నాయనా! తల్లితండ్రులయందు భక్తి, శక్తి, మంచి బుద్ధి కలిగిన కుమారులు ఉంటే ఏ తల్లితండ్రులకీ కష్టాలు ఉండవు. నీ వంటి యోగ్యుడైన కుమారుణ్ని పొందిన నాకు ఈ దాస్యం ఎంతకాలమో ఉండదు. తప్పకుండా విముక్తి కలుగుతుంది బాధపడకు అని ఆత్మ విశ్వాసంతో చెప్పింది.

 

 

మహాభారతకథ-7

 

భృగువంశము యొక్క గొప్పతనము

    మహాభారత కథ వింటున్న మహర్షులకి ఒక సందేహం కలిగింది. సూతమహర్షిని అడిగారు మహర్షీ! పాములకి లోకాలన్నింటినీ భయపెట్ట కలిగినంత పరాక్రమము, అగ్నితో సమానమైన భయంకరమైన విషము ఉంది. సర్పయాగంలో భయంకరమైన అగ్ని జ్వాలల్లో పడి నశించ వలసిన అవసరం ఎందుకు వచ్చింది? అని అడిగారు.

   శౌనకుడు మొదలైన మహర్షుల సందేహాన్ని తీర్చడం కోసం సూతమహర్షి చెప్తున్నాడు..  పాముల తల్లి కద్రువ ఇచ్చిన శాపం వల్లే జనమేజయుడు సర్పయాగం చేసినప్పుడు పాములన్నీ అగ్నిలో పడి  మరణించాయి.  భృగువంశంలో పుట్టిన రురుడు చేసిన సర్ప నాశనాన్ని సహస్రపాదుడు అనే మహర్షి   ఆపించాడు. అదే విధంగా జరత్కారు దంపతుల కుమారుడు ఆస్తీకుడు అనే మహర్షి జనమేజయుడు చేసిన సర్పయాగాన్ని మాన్పించాడు. ఆ వృత్తాంతాన్ని మీకు చెప్తాను అని ఆస్తీకుడు కథ చెప్తున్నాడు.

    భృగు మహర్షి భార్య  పులోమ గర్భవతి. ఆమెకి హోమానికి అగ్నిని సిద్ధం చెయ్యమని చెప్పి మహర్షి స్నానానికి వెళ్లాడు. అదే సమయంలో పులోముడు అనే భయంకరమైన రాక్షసుడు వచ్చాడు. అతడు అగ్నికి పులోమని చూపించి ఈమె ఎవరు? అని అడిగాడు.

   అబద్ధం చెప్పకూడదు కనుక అబద్ధం చెప్పలేక, నిజం చెప్తే భృగుమహర్షి శాపం ఇస్తాడు కనుక నిజం చెప్పలేక అగ్ని భయపడ్డాడు. శాపం వల్ల కలిగిన అపద నుంచి తప్పించుకోవచ్చు. అసత్యం చెప్పడం వల్ల కలిగే పాపం నుంచి తప్పించుకోడం కుదరదు. తనలో తను ఆలోచించుకున్న అగ్ని చివరికి ఆమె మహాపతివ్రత భృగుమహర్షి భార్య అని రాక్షసుడికి నిజం చెప్పేశాడు.  పులోముడు పంది రూపంలో వచ్చి పులోమని ఎత్తుకుని పోయాడు. అతడు పరుగెత్తుకుంటూ వెళ్లేటప్పుడు ఆమె కడుపులో ఉన్న బిడ్డ జారి కింద పడ్డాడు. అతడి పేరు చ్యవనుడు.

    వెయ్యి మంది సూర్యుల తేజస్సుతో సమానమైన తేజస్సు, ప్రళయ సమయంలో అగ్నికి ఉండేంత వెలుగు కలవాడు చ్యవనుడు. భృగుమహర్షి కుమారుడు చ్యవనుడి తేజస్సు చూడగానే రాక్షసుడు పులోముడు కాలి బూడిదయ్యాడు. భృగువంశ కీర్తిని ఇనుమడింప చేసే ఆ బిడ్డని ఎత్తుకుని పులోమ తన ఆశ్రమానికి వచ్చింది.

   రాక్షసుడు ఎత్తుకుని పోతున్నప్పుడు మె ఏడ్చింది.  ఆ సమయంలో ఆమె కళ్లనుంచి కారిన కన్నీళ్లు ఆశ్రమం దగ్గర పెద్ద నదిగా ప్రవహించాయి. ఆ నదికి బ్రహ్మదేవుడు వధూసర అని పేరు పెట్టాడు. భృగుమహర్షి కొడుకుని ఎత్తుకుని వచ్చిన భార్యని ఆ రాక్షసుడు నిన్ను ఎలా తెలుసుకున్నాడు?” అని అడిగాడు.

   పులోమ అగ్నిని చూపించి  ఇతడే నా గురించి చెప్పాడు. నేను పరుగెడుతున్నప్పుడు నా గర్భంలో ఉన్న ఈ కుమారుడు గర్భంలోంచి జారి కింద పడ్డాడు.  ఇతడి తేజస్సుని చూసి తట్టుకోలేక రాక్షసుడు చచ్చిపోయాడు. తన తేజస్సుతో రాక్షసుణ్ని చంపి ఈ బిడ్డే నన్ను కాపాడాడు అని చెప్పింది.

   భృగు మహర్షి అగ్నిని చూసి నువ్వు చాలా తప్పు చేసావు. అన్ని వస్తువుల్నీ తినేసే స్వభావాన్ని పొందు” అని శపించాడు.  అగ్ని మహర్షీ! తనకు తెలిసిన విషయాన్ని తెలియదు అని అబద్ధం చెప్పినవాడు నరకానికి వెడతాడు. అందుకే నేను అబద్ధం చెప్పకుండా నిజమే చెప్పాను.  నేను కూడా నీకు శాపం ఇవ్వగలను. కాని, బ్రాహ్మణుల్ని అందరూ గౌరవించాలి. వాళ్లకి హాని చెయ్య కూడదు. నేను బ్రాహ్మణుల్ని భక్తితో పూజిస్తాను కనుక, నేను నిన్ను శపించను.

   నాకు శాపమిచ్చి నువ్వు లోకాలకే హాని కలిగించావు. వేదాల్లో చెప్పబడిన వస్తువులతో బ్రాహ్మణులు నా యందు హోమం చేస్తారు. అన్నము మొదలైన వస్తువులు దేవతలకీ, పితృదేవతలకీ నా ద్వారానే అందుతాయి. అటువంటి నేను అన్నీ తింటూ అపవిత్రుణ్ని అయితే కర్మలు సరిగా జరగవు. దానివల్ల లోక గమనం ఆగిపోతుంది అని చెప్పి అగ్ని దేవుడు అన్ని లోకాల్లోను వ్యాపించిన తన కాంతిమయమైన రూపానికి కాంతి లేకుండా చేశాడు.

   ఆహవనీయం, దక్షిణాగ్ని, గార్హపత్యం అనే మూడు అగ్నులు ప్రకాశించక పోవడం వల్ల యాగాలు ఆగిపోయాయి. అగ్నుల్లో ఉదయం సాయంకాలం జరిగే ఉపాసం మొదలైన హోమాలు జరగడం లేదు. భూమి మీద పితృదేవతలకి ఇచ్చే పిండాలు, యజ్ఞకార్యాలు ఆగిపోయాయి.

   ప్రజలందరు భయంతో మహర్షుల దగ్గరికి వెళ్లారు. మహర్షులందరూ దేవతల దగ్గరికి వెళ్లారు. దేవతలు, మునులూ కలిసి బ్రహ్మ దగ్గరికి వెళ్లారు. భృగుమహర్షి ఇచ్చిన శాపం వల్ల అగ్నికి తేజస్సు లేకుండా పోయిందని, దాని వల్ల అన్ని లోకాల్లోను కర్మలు లేకుండా పోయాయని బ్రహ్మదేవుడికి చెప్పారు.

   ఆయన అగ్నిని పిలిపించి కనిపించే భూతాలన్నింటికీ నువ్వే అధిపతివి. కదలడం, కదలక పోవడం, లోకాల్ని పవిత్రం చెయ్యడం నీ వల్లే జరుగుతోంది. ఇన్ని మంచి గుణాలు కలిగి ప్రపంచాన్ని రక్షించవలసిన నువ్వు ఆ పనిని లక్ష్య పెట్టకుండా ఉండడం మంచిది కాదు. భృగుమహర్షి శాపం జరగక మానదు. నువ్వు అన్నీ తినేవాడివే అయినా పవిత్రులందరికంటే పవిత్రుడివి; అర్హత కలవాళ్లందరి కంటే అర్హత కలిగినవాడివి; పూజింప తగ్గ వాళ్లందరిలో మొదట పూజింపతగ్గ వాడివి.  వేదాల్లో చెప్పినట్లు బ్రాహ్మణులకి కర్మలు చెయ్యడంలో సహాయపడి లోకాలు నడిచేలా చెయ్యి. నీ పవిత్రత ఎప్పటిలాగే ఉంటుంది అని అగ్నికి చెప్పి మహర్షి శాపాన్ని వ్యర్థం కాకుండా చేశాడు.

   తపస్సంపన్నుడైన భృగుమహర్షి తన కుమారుడు చ్యవనుడికి శర్యాతిమహారాజు కుమార్తె  సుకన్యని ఇచ్చి వివాహం చేశాడు. ఆ దంపతులకి  గొప్పవాడైన  ప్రమతి పుట్టాడు.  ప్రమతికీ అమృతంతో పాటు పుట్టిన ఘృతాచి అనే అప్సరసకి వివాహం జరిపించాడు. భృగువంశంలో గొప్పడుగా గొప్ప కాంతి కలిగిన రురుడు పుట్టాడు. అతడు గొప్ప మహర్షి.

   విశ్వావసుడు అనే పేరు గల గంధర్వరాజుకి మేనక అనే అప్సరసకీ పుట్టినవాడు  స్థూలకేశుడు.  రూపము, గుణము, సౌందర్యము కలిగిన ప్రమద్వర స్థూలకేశమహర్షి  ఆశ్రమంలో పెరుగుతోంది.  ప్రమద్వరని చూసిన రురుడు ఆమెని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు.

    ఒకరోజు ప్రమద్వర తన తోటివాళ్లతో ఆడుకుంటూ చూసుకోకుండా పాముని తొక్కింది. వెంటనే ఆ పాము ప్రమద్వరని కరిచింది. మిగిలినవాళ్లు భయంతో కేకలు పెట్టారు. విషయం తెలుసుకున్న గౌతముడు, కణ్వుడు, కుత్సుడు, విశ్వామిత్రుడు, శంఖుడు, మేఖలుడు, భరద్వాజుడు, వాలఖిల్యులు, ఉద్దాలకుడు, శ్వేతకేతుడు, మైత్రేయుడు, ప్రమతి, రురుడు అనే మహర్షులందరూ స్థూలకేశుడి ఆశ్రమానికి వచ్చి చచ్చిపోయిన ప్రమద్వరని చూసి బాధ పడ్డారు.

   రురుడు బాధపడుతూ ఒంటరిగా అడవికి వెళ్లి దేవతలారా! బ్రాహ్మణులారా! నేను దేవతల్ని పూజించడం, యజ్ఞాలు చెయ్యడం, వేదాలు పఠించడం, వ్రతాలు ఆచరించడం, పుణ్యకార్యాలు చెయ్యడం, గురువుల్ని బ్రాహ్మణుల్ని గౌరవించడం, తపస్సు చెయ్యడం వంటివి ఆచరిస్తున్నవాడినైతే నా ప్రాణంగా అనుకుంటున్న ప్రమద్వరని బ్రతికించండి. మీ దయ వల్ల ఆమె విష ప్రభావం నుంచి బయట పడాలి!  మహాత్ములు తమ తపో ప్రభావంతోను, విషతత్త్వాన్ని తెలిసినవాళ్లు మంత్ర తంత్రాలతోను విష ప్రభావం వల్ల  ప్రాణాలు పోగొట్టుకున్న నా ప్రమద్వరని తిరిగి బ్రతికించండి. అమెని బతికించిన వాళ్లకి నాకు తపస్సు వల్ల కలిగిన ఫలితాన్ని, వేదాధ్యయనం చెయ్యడం వల్ల కలిగిన ఫలితాన్ని, దానంగా ఇస్తాను అని చెప్తూ గట్టిగా ఏడుస్తున్నాడు.

   అకాశం నుంచి ఒక దేవదూత మహర్షీ! మరణం కలిగితే దాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదు. అయినా ఒక ఉపాయం చెప్తాను. నీ ఆయుర్దాయంలో సగం భాగాన్ని నువ్వు ఆమెకి ఇయ్యగలిగితే ఆమె బ్రతుకుతుంది అని చెప్పాడు. ఆ మాటలు విని రురుడు తన ఆయుర్దాయంలో సగ భాగం ప్రమద్వరకి ఇవ్వడానికి సంతోషంగా అంగీకరించాడు. దేవదూత యముడి అనుమతి తీసుకుని ప్రమద్వరని బ్రతికించాడు. రురుడు ప్రమద్వరని పెళ్లి చేసుకుని అనేక భోగాలు అనుభవించాడు.

   రురుడు తన భార్యకి హాని చేసిన పాముల మీద కక్ష పెట్టుకున్నాడు. పెద్ద కర్ర పట్టుకుని అడవిలో తిరుగుతూ చెట్లల్లోను, పుట్లల్లోను, పొదల్లోను వెతికి వెతికి కనిపించిన ప్రతి పాముని చంపేస్తున్నాడు.   ఒకచోట విషం లేని డుండుబము అనే పెద్ద పాము కనిపించింది. దాన్ని కొట్టడానికి కర్రని పైకి ఎత్తాడు.

   అది హరినామాన్ని స్మరిస్తూ మనుష్య భాషలో మాట్లాడుతూ  గొప్ప తేజస్సు కలవాడివి, బ్రాహ్మణుడివి. నువ్వు పాముల మీద ఇంత కోపాన్ని ఎందుకు పెంచుకున్నావు? అని అడిగింది. రురుడు నేను భార్గవ వంశంలో పుట్టిన రురుడు అనే పేరు కలవాణ్ని. నా భార్యకి పాము హాని చేసింది కనుక చంపుతున్నాను. ఇప్పుడు నిన్ను కూడ వదిలిపెట్టను” అంటూనే కర్రని పైకి ఎత్తాడు.  వెంటనే మహర్షి రూపంలో కనిపించిన డుండుబాన్ని చూసి రురుడు ఇప్పటి వరకు సర్పరూపంలో  ఇప్పుడు మహర్షి రూపంలో ఉన్నావు... ఏమిటిదంతా?” అని అడిగాడు.

    డుండుబము మహర్షి రురుడితో నేను సహస్రపాదుడు అనే మహర్షిని. ఖగముడు నాతో కలిసి చదువుకున్నాడు. అతడు హోమశాలలో ఉన్నప్పుడు ఒక గడ్డి పాముని చేసి సరదాగా అతడి మీదకి వేశాను. అతడు భయపడి నా మీద కోపగించి నువ్వు శక్తిలేని పాముగా మారు! అని శపించాడు.  నేను క్షమించమని అడిగాను.

    ఖగముడు శాంతించి నా శాపం నువ్వు అనుభవించక తప్పదు. కొంతకాలం విషం లేని పాముగా ఉంటావు. తరువాత భృగువంశంలో భార్గవవంశాన్ని వృద్ధి చేసే రురుడు నీకు కనిపిస్తాడు. అతడు కనిపించగానే నీకు శాప విమోచనం జరుగుతుంది అని చెప్పాడు. ఇప్పుడు నువ్వు కనిపించగానే నాకు శాపవిమోచనం జరిగింది.

   ప్రజలతో కీర్తింపబడే బ్రాహ్మణుడివి, గొప్ప జ్ఞానం కలవాడివి, అందరికీ మంచి జరగాలని కోరుకునే మనస్సు కలవాడివి, శాంతస్వభావుడివి, వేదాల్లో చెప్పబడిన కర్మల్ని  క్రమం తప్పకుండా ఆచరించేవాడివి, దయ కలవాడివి, సత్యాన్నే పలికేవాడివి, గొప్పదైన భృగు వంశంలో పుట్టినవాడివి, అన్ని మంచి గుణాలు కలిగిన నువ్వు ఇటువంటి పని ఎందుకు చేస్తున్నావు? ఇటువంటి హింసా స్వభావం క్షత్రియులకి ఉంటుంది.  బ్రాహ్మణులకి హింస పనికిరాదు. పూర్వం పాములకి తల్లి అయిన కద్రువ పాములకి శాపం ఇచ్చింది. అందువల్ల జనమేజయుడు చేసిన సర్పయాగంలో పాములకి హాని జరిగింది. ఆ సమయంలో నీ తండ్రికి శిష్యుడైన ఆస్తీకుడు అనే బ్రాహ్మణుడే ఆ యాగాన్ని ఆపించి పాముల్ని రక్షించాడు” అని చెప్పాడు.  సహస్రపాదుడు చెప్పిన మాటలు విని రురుడు తను పాములకి చేస్తున్న హింసని ఆపేశాడు అని చెప్పి సూతమహర్షి అక్కడ ఉన్న మహర్షులకి మహాభారత కథని వినిపిస్తున్నాడు.

ఇక్కడివరకు మహాభారతకథ ఆదిపర్వం మొదటి ఆశ్వాసం పూర్తయింది

 

 

మహాభారతకథ-6

 

ఉదంకమహర్షి

    ఉదంకుడు బ్రహ్మతో సమానమైనవాడు, భయంలేనివాడు, గొప్ప తపస్సంపన్నుడు, పైలుడికి శిష్యుడు. అతడు గురుకులంలో గురువుకి సేవలు చేసి ఎనిమిది సిద్ధుల్లో (అణిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, మహిమ, ఈశిత్వం, వశిత్వం, కామావసాయిత అనేవి ఎనిమిది సిద్ధులు) ఉన్న జ్ఞానాన్ని పొందాడు.

  ఉదంకమహర్షి గొప్ప తపస్సంపన్నుడు. ఆయన గురించి పూర్తిగా కాకుండా మహాభారతకథలో ఉన్నంత వరకే ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము. ఆయన తెలుసుకోవాలంటే చదువు పూర్తి చేసి గురువుగారికి గురుదక్షిణ ఇస్తానన్నాడు. తీసుకోడానికి గురువుగారు ఒప్పుకోలేదు. గురువుగారి భార్య ఉదంకుడితో తనకి  పౌష్యమహారాజు భార్య దగ్గర ఉన్న కుండలాలు కావాలని చెప్పింది. గురువుగారి అనుమతి తీసుకుని వాటికోసం బయలుదేరాడు ఉదంకుడు.

    అడవిలో ఒంటరిగా వెడుతున్న సమయంలో ఒక దేవతాపురుషుడు ఎద్దునెక్కి ఎదురుగా వచ్చాడు. పౌష్య మహారాజుని కలుసుకోడానికి ఆటంకాలు రావని చెప్పి ఉదంకుడికి ఎద్దు పేడ ఇచ్చి తినమన్నాడు. ఉదంకుడు ఎద్దుపేడ తిని పౌష్య మహారాజుని కలుసుకున్నాడు.

   మహారాజుని ఆశీర్వదించి ఆయనిచ్చిన అర్ఘ్యపాద్యాలు అందుకుని తను గురువుగారి పనిమీద మహారాణి చెవులకి పెట్టుకునే కుండలాల కోసం యాచకుడిగా వచ్చానని చెప్పాడు. ఉదంకుడి మాటలు విని రాజు మహానుభావా! సంతోషంగా ఆమె దగ్గరికి వెళ్లి అడిగి తీసుకో! అన్నాడు.

   ఉదంకుడు అంతఃపురమంతా తిరిగాడు కాని, మహారాణి కనిపించలేదు. రాజుకి విషయం చెప్పాడు.  రాజు ఉదంకుడితో  మహాత్మా! నువ్వు ఏ దోషాలు లేనివాడివి. నిన్ను అపవిత్రుడవని నేను అనలేను. కాని, నా భార్య మహాపతివ్రత. ఆమె అపవిత్రులకి మాత్రం కనిపించదు అని చెప్పాడు.

   అది విని ఉదంకుడు తను ఇక్కడికి వచ్చేటప్పుడు దివ్యపురుషుడు ఇచ్చిన ఎద్దు పేడని తిని నోరు శుద్ధి చేసుకోలేదు. అతడు చెప్పినా తనుపట్టించుకోలేదు. అదే మహాపతివ్రతని చూడలేక పోడానికి కారణమై ఉంటుంది అనుకున్నాడు. వెంటనే తూర్పు దిక్కుకి తిరిగి పరిశుభ్రమైన నీళ్లతో పాదాలు, చేతులు, ముఖం, నోరు కడుక్కుని మళ్లీ మహారాణి దగ్గరికి వెళ్లాడు.

   ఆమె ఉదంకుడికి నమస్కారం చేసి కుండలాలు ఇచ్చి ఉదంకమహర్షీ! ఈ కుండలాల్ని ఎత్తుకు పోవాలని తక్షకుడు అనే సర్పరాజు కాచుకుని ఉంటాడు. జాగ్రత్తగా తీసుకుని వెళ్లు అని చెప్పింది. ఉదంకుడు కుండలాలు తీసుకుని మహారాజు దగ్గరికి వచ్చాడు. మహారాజు “ఉదంకుణ్ని భోజనం చేసి వెళ్ళమన్నాడు.

   ఉదంకుడు రాజు మాటని తీసివెయ్యలేక భోజనం చెయ్యడానికి కూర్చున్నాడు. భోజనం చేస్తుండగా అన్నంలో వెంట్రుక వచ్చింది. దాన్ని చూసి ఉదంకుడు చూడకుండా నాకు అపవిత్రమైన అన్నాన్ని పెట్టావు. నువ్వు గుడ్డివాడివి అయిపోతావు” అని రాజుని శపించాడు. పౌష్యమహారాజు బాధతో  నేను చేసిన చిన్న తప్పుకి పెద్ద శిక్ష వేశావు. నువ్వు సంతానం ఉండకుండా అయిపోతావు అని ఉదంకుణ్ని శపించాడు.

   ఉదంకుడు తన వంశం వృద్ధి కోసం శాపాన్ని ఉపసంహరించమని మహారాజుని అడిగాడు. పౌష్యరాజు ఉదంకమహర్షీ! బ్రాహ్మణుల మనస్సు అప్పుడే తీసిన వెన్నతో సమానంగా మృదువుగా ఉంటుంది. మాట మాత్రం పరుషంగా ఇంద్రుడి వజ్రాయుధంలా ఉంటుంది. రాజుల్లో ఈ రెండూ విరుద్ధంగా ఉంటాయి. అందువల్ల బ్రాహ్మణుడు తను ఇచ్చిన శాపాన్ని ఉపసంహరించుకోగలడు. రాజు మాత్రం తను ఇచ్చిన శాపాన్ని ఉపసంహరించుకోలేడు. కనుక, నేను ఇచ్చిన శాపాన్ని తిరిగి తీసుకోలేను. నువ్వు నాకు ఇచ్చిన శాపాన్ని ఉపసంహరించు అన్నాడు.

   ఉదంకుడు రాజా! నీకు త్వరలోనే శాప విముక్తి కలుగుతుంది. నేను గురుపత్నికోసం కుండలాలు తీసుకుని వెడుతున్నాను అని చెప్పి సంతోషంగా అక్కడి నుంచి బయలుదేరాడు. దారిలో అతడికి ఒక సరస్సు కనిపించింది.  తన చేతిలో ఉన్న కుండలాల్ని ఒక శుభ్రమైన ప్రదేశంలో పెట్టి, సరస్సులోకి దిగి ఆచమనం చేస్తుండగా తక్షకుడు వచ్చి కుండలాలు తీసుకుని పరుగెత్తాడు.

  ఉదంకుడు కూడ తక్షకుడి వెంట పరుగెత్తాడు. సర్పరూపంలో వచ్చిన తక్షకుడు కుండలాలతో సహా భూమికి ఉన్న రంధ్రం నుంచి తన నాగలోకానికి వెళ్లిపోయాడు. ఉదంకుడు కూడా తక్షకుడి వెనుక నాగలోకానికి వెళ్లి అనేక అడవులు, చెట్లు, సముద్రాలు, కులపర్వతాలు, నిండుగా ప్రవహిస్తున్న సరస్సులు, నదులు కలిగిన బరువైన భూమిని తన వెయ్యి పడగలతో మోస్తూ; నారాయణుడికి శయ్యగా ఉంటూ అన్ని పాపాల్నీ నాశనం చెయ్యగల శక్తి కలిగిన అనంతుడు అనే నాగరాజు మా యందు దయ కలిగి ఉండుగాక!   గొప్ప తపశ్శక్తితో రాక్షసులు పెట్టే బాధల నుంచి నాగులందర్నీ రక్షించినవాడు; వినయంగా నమస్కరించే రాక్షసుల, దేవతల కిరీటాల మీద మణుల కాంతితో ప్రకాశించే పడగలతో, పార్వతీ పతి శివుడికి అలంకారమైన సర్పరాజు వాసుకికి మా యందు దయ కలుగుగాక! 

   దేవ, మనుష్య లోకాల్లో తిరుగుతూ గొప్ప తేజస్సుతో అందరితో పూజలూ అందుకుంటూ గొప్ప పరాక్రమము, విషము, కోపము కలిగి మహాత్ములైన ఐరావత నాగవంశంలో ఉన్న సర్పరాజులందరూ మా యందు దయ కలిగి ఉందురుగాక! పెద్ద పెద్ద కులపర్వతాల పొదరిళ్లలోను, అడవుల్లోను, కురుక్షేత్రంలోను స్వేచ్ఛగా తిరిగేవాడు; తన కుమారుడైన అశ్వసేనుడితో కలిసి భూమి మీద తిరిగేవాడు; బలంలోను, గర్వంలోను, శౌర్యంలోను సమర్థుడైనవాడు, పరాక్రమవంతుడు పాములకి రాజు అయిన తక్షకుడు మా యందు దయ కలిగి ఉండు గాక!” అని నాగరాజులందర్నీ స్తుతించాడు.

   పాతాళ లోకంలో తెల్లని నల్లని దారాలతో కలిసిన వస్త్రాన్ని నేస్తున్న ఇద్దరు స్త్రీలని, పన్నెండు ఆకులతో ఉన్న చక్రాన్ని తిప్పుతున్న ఆరుగురు యువకుల్ని, ఎత్తైన గుర్రాన్ని ఎక్కి తేజస్సుతో ఉన్న ఒక దివ్య పురుషుణ్ని చూశాడు. వాళ్లని కూడా భక్తితో మంత్రాలతో స్తుతించాడు.

    ఆ దివ్య పురుషుడు ఉదంకుణ్ని చూసి నిర్మలమైన నడవడిక కలిగిన ఉదంకమహర్షీ! నీకు ఏం కావాలో చెప్పు, నేను తీరుస్తాను!” అన్నాడు.  ఉదంకుడు  ఈ పాముల వంశం అంతా నాకు అధీనమై ఉండేట్టు అనుగ్రహించు” అని అడిగాడు. దివ్యపురుషుడు గుర్రం చూపిస్తూ గుర్రం చెవికి ఉన్న రంధ్రంలో ఊదమన్నాడు.  ఉదంకుడు దివ్య పురుషుడు చెప్పినట్టే చేశాడు. దాని ఇంద్రియాల నుంచి భయంకరమైన అగ్ని జ్వాలలు పాతాళలోకంలో వ్యాపించాయి. అది చూసి పాములన్నీ భయపడ్డాయి.

  అగ్ని జ్వాలలు చూసి అవి ఆ బ్రాహ్మణుడి కోపం అనుకుని తక్షకుడు  భయపడుతూ కుండలాల్ని తీసుకొచ్చి ఇచ్చేశాడు. ముందు ఈ నాగలోకం నుంచి ఎలాగయినా బయట పడి సాయంత్రానికి  తను గురుపత్ని దగ్గరికి చేరుకోవాలి. ఈ రోజు తను అక్కడికి చేరలేకపోతే ఇప్పటి వరకు పడ్డ శ్రమంతా వ్యర్థమవుతుందని బాధ పడుతున్నాడు.

   దివ్యపురుషుడు ఉదంకుడికి తన గుర్రాన్ని ఇచ్చి దీని మీద వెడితే నువ్వు గాలి కంటే, మనస్సు కంటే కూడా వేగంగా వెళ్లగలవు అని చెప్పాడు.  దివ్యపురుషుడు ఇచ్చిన గుర్రాన్ని ఎక్కి ఉదంకుడు అదే రోజు గురువుగారి ఇంటికి చేరుకున్నాడు. అక్కడ గురువుగారి భార్య పవిత్ర స్నానం చేసి, కొత్త బట్టలు కట్టుకుని కర్ణాభరణాలు ధరించాలని ఉదంకుడి కోసం ఎదురు చూస్తోంది. కుండలాల్ని ధరించి, బ్రాహ్మణుల్ని పూజించి తను తలపెట్టిన వ్రతాన్ని పూర్తి చేసుకుంది.

   వచ్చిన ఉదంకుణ్ని చూసి గురువు పైలుడు నాయనా!  పౌష్య మహారాజు పట్టణం ఇక్కడికి దగ్గరగానే ఉంది కదా? అక్కడికి వెళ్లి రావడానికి నీకు నాలుగు రోజులు ఎందుకు పట్టింది? అని ఆడిగాడు. ఉదంకుడు గురువర్యా! కాని, దుష్టుడైన నాగరాజు తక్షకుడు అడ్డుపడ్డం వల్ల ఆలస్యమైంది. మీ దగ్గర్నుంచి వెడుతున్నప్పుడు ఒక దివ్య పురుషుడు ఎదురయ్యాడు. అతడిచ్చిన ఎద్దు పేడ తిని వెళ్లి పౌష్య మహారాజుని అడిగి కుండలాలు తీసుకుని వస్తున్నాను. మధ్యలో తక్షకుడు నా దగ్గరున్న కుండలాల్ని ఎత్తుకుని పోయాడు. నేను తక్షకుడి వెనకాలే నాగలోకానికి వెళ్లి సర్పరాజుల్ని పొగిడాను.

   పాతాళ లోకంలో తెలుపు, నలుపు రంగుల దారాలతో వస్త్రాలు నేస్తున్న ఇద్దరు స్త్రీలని, పన్నెండు అకులు గల చక్రాన్ని తిప్పుతున్న ఆరుగురు యువకుల్ని, ఎత్తైన గుర్రాన్నిఎక్కిన ఒక దివ్యపురుషుణ్ని చూశాను. అతడు అనుగ్రహించి ఇచ్చిన గుర్రాన్ని ఎక్కి కుండలాలు తీసుకుని సమయానికి రాగలిగాను. అసలు ఇంతవరకూ జరిగినదేమిటో నాకు అర్థం కాలేదు అని చెప్పాడు.

   పైలుడు ఉదంకా! ఎద్దుని ఎక్కి వచ్చిన దివ్య పురుషుడు ఇంద్రుడు. అతడు ఎక్కిన ఎద్దు దేవతల ఏనుగు ఐరావతం. పేడ అమృతం. ఇద్దరు స్త్రీలు ధాత, విధాత. వాళ్లు నేస్తున్న తెలుపు, నలుపు దారాల మగ్గం దినరాత్రులకి రూపం. పన్నెండు కులు గల చక్రం నెలల రూపమైన సంవత్సరం. దాన్ని తిప్పుతున్న ఆరుగురు యువకులు ఆరు ఋతువులు (వసంతం, గ్రీష్మం, వర్షం, శరత్తు, హేమంతం, శిశిరం).    గుర్రం అగ్ని; దాన్ని ఎక్కిన దివ్య పురుషుడు ఇంద్రుడి స్నేహితుడు పర్జన్యుడు. మొదట ఇంద్రుణ్ని చూసి అమృతం తిన్నావు కనుక, నువ్వు కోరుకున్నది దొరికింది. నువ్వు చెయ్యాలనుకున్న పని నెరవేరింది. నీకు కుండలాలు దొరికాయి.

   గురువుగారి పని నెరవేర్చి గురువు ఋణం తీర్చుకున్నావు. ఇంక నువ్వు నీ ఇష్టం ప్రకారం జీవించు!” అని దీవించి పంపించాడు. ఉదంకుడు గురువుగారి అనుమతి తీసుకుని అక్కడ నుంచి వెళ్లి చాలాకాలం తపస్సు చేశాడు. తక్షకుడు తనకి చేసిన అపకారానికి బదులు తీర్చుకోవాలని ఉదంకుడు జనమేజయమహారాజు దగ్గరికి వెళ్లాడు.

  జనమేజయ మహారాజుని కలిసిన ఉదంకుడు భూమి మీద ఉన్న ప్రజలందరితో కీర్తింపబడేవాడా! జనమేజయుడా! నేను నా గురువుగారి పని మీద వెడుతుంటే సర్పరాజు తక్షకుడు అజ్ఞానంతో నాకు హాని చేశాడు. దానాలు, యజ్ఞాలు చేస్తూ, భరత వంశాన్ని వృద్ధిపరుస్తూ, ప్రజలందరికీ మేలు చేస్తూ అర్జునుడితో సమానమైన, ఇంద్రియ నిగ్రహం కలిగిన నీ తండ్రి పరీక్షిత్తు మహారాజుని క్రూరుడైన తక్షకుడు తన భయంకరమైన విషంతో చంపేశాడు.

   తక్షకుడు నీకు ఇంత కీడు చెయ్యడానికి కారణం శమీకుడి కుమారుడు శృంగి అనే ఒక బ్రాహ్మణుడు. అందుకు ప్రతీకారంగా నువ్వు కూడా  బ్రాహ్మణులతో సర్పయాగాన్ని నిర్వహించి, భయంకరమైన అగ్నిజ్వాలల్లో తక్షకుడు మొదలైన పాములన్నింటినీ నాశనం చెయ్యి. బ్రాహ్మణుల అనుమతి తీసుకుని సర్పయాగం చెయ్యి”  అని చెప్పి జనమేజయుడికి సర్పయాగం చెయ్యాలనే బుద్ధి కలిగేలా మాట్లాడాడు. పరీషిత్తుమహారాజు కొడుకు జనమేజయమహారాజు సర్పయాగం చెయ్యడానికి ఉదంకుడు కారకుడయ్యాడు.