About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

మహాభారతకథ-17

 

ఆదిపర్వము-మూడవ ఆశ్వాసము ప్రారంభము

పాండవులు, కౌరవుల మధ్య వైరము

   జనమేజయుడు చేస్తున్న సర్పయాగాన్ని పూర్తిగా చెయ్యనివ్వక మధ్యలోనే ఆపించేశాడు ఆస్తీకమహర్షి. మధ్యలోనే ఆపేసినా జనమేజయ మహారాజు ఎవరికీ ఎటువంటి లోటూ రానివ్వలేదు. యాగం నిర్వహిస్తున్న ఋత్త్విక్కులకి, యాగం సరిగా జరుగుతోందో లేదో పరీక్షించే వ్యాసుడు మొదలైన మహర్షులకి శాస్త్ర ప్రకారం సంభావనలిచ్చి గౌరవించాడు. పేదలందరికీ ధనాన్ని పంచాడు. యజ్ఞవిధులు పూర్తిచేశాక   జనమేజయుడికి ప్రాచీనమైన గొప్పదైన భారత కథ వినాలని అనిపించింది.

   గొప్ప తపస్సంపన్నుడు, పరాశరుడి కుమారుడు, బ్రహ్మర్షుల్లో ముఖ్యుడు; దయామయుడు; కురుకుల పితామహుడు; లోక కళ్యాణకారకుడు; కృష్ణాజినం కట్టుకున్నవాడు; నల్లటి మేఘం వంటి రంగుతో ఉన్న శరీరము, తగినంత ఎత్తు, రాగిరంగుతో ఉన్న జడలతో ఉన్నవాడు; అభిమానము, ద్వేషము రెండూ లేనివాడు;  అసూయ తెలియనివాడు; గొప్ప గొప్ప మహర్షుల్ని శిష్యులుగా కలిగినవాడు; చుట్టూ అనేకమంది మహర్షులతో కూడి ఉండే వ్యాసభగవానుడు బంగారంతోను, మణులతోను చెయ్యబడిన ఎత్తైన సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు.

  మొదట పూజ్యుడైన వ్యాసమహర్షికి నమస్కరించాడు జనమేజయుడు. తరువాత  ఆయనతో పూజ్యులైన మహర్షీ! మీతో పాటు భీష్ముడు మొదలైన కురువంశ పెద్దలందరూ దగ్గర ఉండి పాండవులకి, కౌరవులకి తోడుగా ఉంటూ రాజ్యసంపదని  పంచి ఇచ్చారు. వాళ్లు ఎవరి రాజ్యాన్ని వాళ్లు పాలించుకుంటూ ఉన్నారు. అంతలోనే ప్రజలందరూ నాశనమయ్యేటట్లు భారతయుద్ధాన్ని ఎందుకు మొదలుపెట్టారు? పెద్దల మాట వినాలి కదా? మరి మీరు చెప్పినట్టు వాళ్లు ఎందుకు వినలేదు? యుద్ధం జరుగుతుందని తెలిసి కూడా మీరందరూ వాళ్లని ముందే ఎందుకు ఆపలేకపోయారు? అసలు ఈ కలహం ఎందుకు వచ్చింది? జరిగిన విషయాలన్నీ దయచేసి నాకు వివరంగా చెప్పండి! అని అడిగాడు.   

గొప్ప పరాక్రమవంతులు; ధైర్యము, వివేకము కలిగినవాళ్లు; ఎప్పుడూ నిజాన్నే పలికేవాళ్లు; కీర్తివంతులు; కృతజ్ఞత తెలిసినవాళ్లు; ఉత్తములు, ధర్మప్రవర్తన కలవాళ్లు; శరణు వేడినవాళ్లని రక్షించేవాళ్లతో ప్రసిద్ధమైన భారత వీరుల సద్గుణాలతో కీర్తించబడిన, ప్రాచీనమైన బారతకథని జనమేజయుడికి వినిపించమని వేదవ్యాసుడు వైశంపాయనుడితో చెప్పాడు.

   వైశంపాయనుడు తన గురువు వేదవ్యాసుడికి నమస్కారం చేసి భారత కథని చెప్పడం మొదలుపెట్టాడు. జనమేజయ మహారాజు గొప్ప భక్తి శ్రద్ధలతో వింటున్నాడు. యాగం చూడ్డానికి వచ్చినవాళ్లు అందరూ కూడా వైశంపాయనుడు చెప్తున్న భారత కథని వినడానికి సిద్ధంగా కూర్చున్నారు.

  పాండురాజు మరణించాక ఆయన కుమారులు పాండవులు హస్తినాపురం వచ్చి అక్కడే ఉండిపోయారు. కౌరవులతోపాటు వేదాలు, ధనుర్విద్య నేర్చుకుని జ్ఞానాన్ని సంపాదించారు. వాళ్ల గుణగణాల్ని అందరూ పొగుడుతుంటే కౌరవులు భరించలేక పోయారు. శకుని, కర్ణుడు, దుశ్శాసనుడు మొదలైనవాళ్లు చెప్పిన మాటలు విని ధృతరాష్ట్రుడు పాండవులకి హాని చేస్తుండేవాడు. పాండవుల ధర్మప్రవర్తనే వాళ్లని కాపాడుతూ ఉండేది.

   ఒకరోజు భీముడు నీళ్లల్లో ఆడుకుని అలిసిపోయి ప్రమాణకోటిఅనే ప్రదేశంలో నిద్రపోతున్నాడు. దుర్యోధనుడు భీముణ్ని చెట్ల తీగలతో కట్టేసి గంగానదిలోకి పడేశాడు. అతి బలవంతుడైన భీముడు మెలుకువ రాగానే గట్టిగా ఒళ్లు విరుచుకున్నాడు. చెట్ల తీగలన్నీ ఒక్కసారిగా తెగిపోయాయి. వెంటనే నదిలోంచి బయటకి వచ్చేశాడు. మరొకసారి నిద్రపోతున్న భీముణ్ని నల్ల తాచుతో కరిపించారు. వజ్ర శరీరం ఉన్న భీముడి శరీరంలోకి పాము దంతాలు దిగబడలేదు. ఇంకొకసారి భీముడు తింటున్న అన్నంలో విషం కలిపారు. భీముడు దివ్యపురుషుడు కనుక అతడు తిన్న అన్నంతో పాటే విషం కూడా జీర్ణమై పోయింది.

   చివరికి పాండవులందర్నీ కలిపి చంపాలనుకున్నారు. దుర్యోధనుడు పాండవుల కోసం వారణావతము అనే ఊళ్లో లక్కతో ఒక ఇల్లు కట్టించి ఇచ్చాడు. పాండవులు ఆ ఇంట్లోకి వెళ్లగానే దానికి నిప్పంటించమని చెప్పాడు. కాని, విదురుడి సలహా ప్రకారం పాండవులు ఒక సొరంగ మార్గం నుంచి బయటకు వచ్చి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ధర్మ ప్రవర్తన కలిగినవాళ్లని, మంచి నడవడిక కలిగినవాళ్లని, సత్యాన్నే పలికేవాళ్లని, ఇతరుల మంచిని కోరేవాళ్లని, గుణసంపన్నుల్ని, శత్రుత్వం లేకుండా అందరితో స్నేహంగా మెలిగేవాళ్లని భగవంతుడు ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటాడు.

   లక్క ఇంట్లోంచి క్షేమంగా బయటపడి, పాండవులు తల్లి కుంతితో కలిసి అడవిలోకి వెళ్లారు. అక్కడ హిడింబుడు అనే రాక్షసుడు పాండవుల్ని చంపబోయాడు. భీముడు ఆ రాక్షసుణ్ని చంపి తన సోదరుల్ని తల్లిని కాపాడుకున్నాడు. తరువాత అతడి చెల్లెలు హిడింబని పెళ్లి చేసుకున్నాడు.

   అక్కడినుంచి పాండవులు ఏకచక్రపురం చేరుకున్నారు. పాండవులందరు బ్రాహ్మణ వేషాలు వేసుకుని ద్రుపదుడి పట్టణానికి వెళ్లారు.  అక్కడ జరుగుతున్న ద్రౌపదీ స్వయంవరంలో చేప రూపంలో ఉన్న మత్స్య యంత్రాన్ని అర్జునుడు కొట్టాడు. అక్కడకి వచ్చిన రాజులందర్నీ ఓడించి పాండవులు ద్రౌపదిని తీసుకుని ఇంటికి వచ్చారు. వ్యాసమహర్షి, తల్లి కుంతీదేవి ఇద్దరి ఆజ్ఞ ప్రకారం పాండవులు అయిదుగురు ద్రౌపదిని పెళ్లి చేసుకున్నారు. ఒక సంవత్సరం ద్రుపదుడి పట్టణంలోనే ఉండిపోయారు.

  ఆ విషయం తెలుసుకున్న కౌరవుల తండ్రి ధృతరాష్ట్రుడు పాండవుల్ని రప్పించి సగం రాజ్యం ఇచ్చాడు. వాళ్లని ఇంద్రప్రస్థ పురంలో ఉండమన్నాడు. పెదతండ్రి మాట ప్రకారం పాండవులు ఇంద్రప్రస్థ పురంలో ఉండి రాజ్యం చేస్తున్నారు.

   అర్జునుడు ద్వారకా నగరానికి వెళ్లి శ్రీకృష్ణుడి చెల్లెలు సుభద్రని పెళ్లి చేసుకున్నాడు. ఆ దంపతులకి అభిమన్యుడు అనే పేరుగల కొడుకు కలిగాడు. తరువాత అర్జునుడు అగ్నిదేవుడినుంచి రథాన్ని, గుర్రాల్ని, గాండీవమనే ధనుస్సుని, దేవదత్తమనే శంఖాన్ని, ఎన్ని బాణాలు తీసి ఉపయోగించినా అవన్నీ మళ్లీ వచ్చి చేరే అమ్ముల పొదిని పొందాడు. ఇంద్రుణ్ని ఓడించి ఖాండవనాన్ని దహిస్తున్న అగ్నికి సహాయపడ్డాడు.

   ధర్మరాజు మయుడు అనే పేరుగల రాక్షస శిల్పిని పిలిపించి సభా భవనాన్ని కట్టించుకున్నాడు. భీముడు, అర్జునుడు శ్రీకృష్ణుడి సహాయంతో దిగ్విజయ యాత్రకు వెళ్లి జరాసంధుణ్ని చంపేశారు. ధర్మరాజు గొప్ప రాజసూయ యాగం చేసి చక్రవర్తిగా ప్రకాశించాడు.

   సుఖంగా జీవిస్తున్న పాండవుల్ని చూసి ఓర్వలేక దుర్యోధనుడు అతడి తమ్ముళ్లు, మేనమామ శకునితో కలిసి ధర్మరాజుని జూదం ఆడడానికి పిలిచారు. ముందుగా ఓడిపోయినవాళ్లు పన్నెండు సంవత్సరాలు అడవిలోను, ఒక సంవత్సరం ఎవరూ తమని గుర్తుపట్టకుండా ప్రజల మధ్యే పట్టణంలోను జీవిస్తూ ఉండాలని నియమం పెట్టుకున్నారు. కౌరవులు జూదంలో ధర్మరాజుని ఓడించి పాండవుల్ని రాజ్యం నుంచి వెళ్లగొట్టారు.

   అర్జునుడు అరణ్యవాసం చేస్తూనే ఒక ఉత్తముడైన గురువు ద్వారా అడవిలో ఉపదేశం పొందాడు. తరువాత గొప్ప తపస్సు  చేసి శివుణ్ని, బాహుపరాక్రమంతో ఇంద్రుణ్ని ప్రసన్నం చేసుకున్నాడు. పాశుపతంతో పాటు అనేకమైన దివ్య బాణాలు కూడా పొందాడు. పన్నెండేళ్లు అరణ్యంలోను, అజ్ఞాతంగా ఒక సంవత్సరం ప్రజల మధ్య జీవించి అతి కష్టంతో పాండవులు పదమూడేళ్లు గడిపారు. మంచి ప్రవర్తన కలిగిన పుణ్యాత్ములైన పాండవులు తిరిగి వచ్చిన తరువాత తమ రాజ్యాన్ని తమకి ఇమ్మని అడిగారు.

  కౌరవులు పాండవులకి రాజ్యం ఇవ్వలేదు. పాండవులు కనీసం అయిదు ఊళ్లయినా ఇమ్మని అడిగారు. అందుకు కూడా కౌరవులు అంగీకరించలేదు. ఇదే కౌరవ పాండవుల మధ్య వైరానికి కారణమైంది, భారత యుద్ధానికి దారితీసింది.

 ఉపరిచర వసుమహారాజు చరిత్ర

   వైశంపాయనుడు జనమేజయ మహారాజుకి వేదవ్యాసుడి జన్మవృత్తాంతం చెప్తున్నాడు.

   చేది దేశానికి రాజు వసువు. అతడు దేవేంద్రుడితో సమానమైన పరాక్రమము, సంపదలు కలిగినవాడు. ప్రజలకి ఏ కష్టమూ రాకుండా ఆదుకునేవాడు.  అతడు ఒకరోజు వేటకోసం అడవికి వెళ్లాడు. అక్కడ ఒక మహర్షి ఆశ్రమాన్ని చూసి తను కూడా వైరాగ్యభావాన్ని పెంచుకున్నాడు. అప్పటికప్పుడే అతడిలో తపస్సు చేసుకోవాలన్న కోరిక పెరిగింది. ధనుస్సు బాణాలు వదిలిపెట్టి అక్కడే ఉండి తపస్సు చేసుకోడం ప్రారంభించాడు.

   ఒకరోజు ఇంద్రుడు అతడి దగ్గరికి వచ్చాడు. రాజా! నువ్వు వర్ణాశ్రమ ధర్మాల్ని అనుసరించి రాజ్యాన్ని పాలిస్తున్నావు. ప్రజల్ని, రాజ్యాన్ని వదిలేసి ఇలా తపస్సులో ఉండిపోతే నీ ప్రజల్ని ఎవరు ఆదుకుంటారు?   నువ్వు చేస్తున్న తపస్సుకి నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు రాజ్యపాలన మానేస్తే ప్రజలు ఇబ్బందులు పడతారు. రాజ్యపాలన చేస్తూనే నాతో స్నేహంగా ఉంటూ నా దగ్గరికి వస్తూ పోతూ ఉండు! అని చెప్పాడు.

  తరువాత అతడికి దివ్యత్వాన్ని; బంగారంతోను మణులతోను తయారైన విమానాన్ని; ఇతర ఆయుధాల వల్ల హాని కలగకుండా ఉండడం కోసం ఎప్పుడూ వాడిపోకుండా ఉండే పద్మాలతో ఉన్న ఇంద్రమాలని; చెడ్డవాళ్లని శిక్షించడానికి, మంచి వాళ్లని రక్షించడానికి ఉపయోగించే వేణుయష్టినీ ఇచ్చాడు. వసురాజు ఇంద్రుడు ఇచ్చిన విమానాన్ని ఎక్కి  పై లోకాల్లో కూడా తిరుగుతూ ఉండేవాడు. అందువల్ల అతడు ఉపరిచరుడు అని పిలవబడ్డాడు.

  ప్రతిసంవత్సరం ఇంద్రమాలకి, వేణుయష్టికి ఉత్సవాన్ని జరిపిస్తూ ఈశ్వరుడికీ, ఇంద్రుడికీ సంతోషం కలిగించేవాడు. అప్పటి నుంచి రాజులందరు ప్రతి సంవత్సరం ఇంద్రోత్సవం జరిపించడం మొదలుపెట్టారు. ఇంద్రోత్సవం జరిపించడం వల్ల రాజులకి ఆయువు, వంశవృద్ధి కలుగుతుంది, రాజ్యంలో జీవించే ప్రజలకి సుఖసంతోషాలు కలుగుతాయి.

   ఉపరిచరుడు జరిపించిన ఇంద్రోత్సవాలకి దేవేంద్రుడు ఎంతో సంతోషించాడు. ఇంద్రుడి వరం వల్ల ఉపరిచరుడికి బృహద్రథుడు, మణివాహనుడు, సౌబలుడు, యదువు, రాజన్యుడు అనే అయిదుగురు కుమారులు కలిగారు. వాళ్లు అయిదుగురు అనేక దేశాలకి అధిపతులై వంశాన్ని వృద్ధిచేశారు. ఉపరిచరుడు రాజర్షిగా రాజ్యపాలన చేస్తున్నాడు.

   అతడి నగరానికి దగ్గరలో ఉన్న శుక్తిమతీ నది కోలహలం అనే పర్వతం మీద ఇష్టాన్ని పెంచుకుంది. అందువల్ల ఆ పర్వతం నదిని ప్రవహించకుండా అడ్డుకుంది. ఉపరిచరుడు ఆ పర్వతాన్ని తన కాలితో తన్నాడు. పర్వతుడి వల్ల శుక్తిమతీ నదికి వసుపదుడు అనే కుమారుడు,  గిరిక అనే కుమార్తె కలిగారు. శుక్తిమతీనది ఉపరిచరుడికి తన కుమారుణ్ని, కుమార్తెని కానుకగా ఇచ్చింది. ఉపరిచరుడు వసుపదుణ్ని తన సేనాపతిగాను, గిరికని ధర్మపత్నిగాను స్వీకరించాడు.

 

మహాభారతకథ-16

 

జనమేజయుడు చేసిన సర్పయాగము

   మంత్రులు జనమేజయుడితో ఇంకా ఇలా చెప్పారు ”బలపరాక్రమాలు, సంపదలు కలిగిన జనమేజయా! నీకు చిన్నతనంలోనే పట్టాభిషేకం జరిగి రాజ్యభారం అప్పగించబడింది. ప్రజలందర్నీ ధర్మ మార్గంలో నడిచేలా చేశావు. యాగాలు చేసి ఎంతో ఎక్కువగా దక్షిణలు ఇచ్చి బ్రాహ్మణుల్ని పోషించావు. గుణసంపదల్లో నీకు ఎవరూ సాటి రారు. ఈ విషయంలో నీ కీర్తి భూమండలమంతా వ్యాపించింది. శృంగి అనే బ్రాహ్మణుడి ప్రేరణవల్ల నీ తండ్రికి హాని జరిగింది. నువ్వు కూడా సర్పయాగం చేసి పాముల సంతతి మొత్తం అందులో పడి కాలి బూడిద అయ్యేలా చెయ్యి! అని మంత్రులు సలహా ఇచ్చారు.

   వాళ్ల మాటలు విన్న జనమేజయుడు కోపంతో తక్షకుడు విషాగ్నితో నా తండ్రిని ఎలా అయితే చంపాడో అదే విధంగా తక్షకుణ్ని, అతడి బంధుజనాన్ని కూడా అగ్ని జ్వాలల్లో పడి కాలిపోయేలా చేస్తాను. స్వర్గస్థుడైన నా తండ్రికీ, ఉదంకుడు అనే బ్రాహ్మణుడికీ, మంచివాళ్లందరికీ మంచి జరిగేలా  చేస్తాను! అన్నాడు. సర్పయాగం ఎలా చెయ్యాలో శాస్త్రాల్లో చెప్పిన విధానం గురించి తనకు వివరంగా చెప్పమని ఋత్విక్కుల్ని అడిగాడు.

   “రాజా! జనమేజయా! ఈ సర్పయాగం నీ కోసమే దేవతలతో కల్పించబడింది. ఇతరులు ఎవరూ ఈ యాగాన్ని చెయ్యరు. ఇది అతి ప్రాచీనమైంది, ప్రసిద్ధమైందని పురాణాల్లో చెప్పబడినట్టుగా మేము విన్నాము” అని చెప్పారు ఋత్విక్కులు.

   జనమేజయుడు సర్పయాగం చెయ్యాలన్న నిర్ణయానికి వచ్చాడు. జనమేజయ మహారాజు ధర్మపత్ని కాశీరాజు కుమార్తె  వపుష్టమతో కలిసి సర్పయాగం చెయ్యడానికి దీక్ష తీసుకున్నాడు. శాస్త్రంలో చెప్పబడిన కొలతలు, లక్షణాలతో నేర్పరులతో నిర్మించబడిన యజ్ఞకుండము; యజ్ఞానికి కావలసిన అనేక సాధనాలు; అవసరమైన వస్తువులు; కావలసినంత ధనం, ధాన్యం; విధులు నిర్వర్తించడానికి వచ్చిన బ్రాహ్మణులు; యజ్ఞాన్ని చేయించగల గొప్ప ఋత్విక్కులతో యజ్ఞశాల కళకళలాడుతోంది.

   గృహనిర్మాణశాస్త్రంలో అనుభవం, పురాణజ్ఞానం కలిగిన ఒక బ్రాహ్మణుడు జనమేజయా! నువ్వు చేస్తున్న ఈ యజ్ఞం ఋత్విక్కులు శాస్త్రోక్తంగా చేయించినా కూడా ఒక బ్రాహ్మణుడి కారణంగా మధ్యలోనే ఆగిపోతుంది! అని చెప్పాడు.

  అతడి మాటలు  ఎవరూ పట్టించుకోలేదు. మహారాజు నియోగించిన చ్యవనమహర్షి వంశంలో ప్రసిద్ధుడైన చండభార్గవుడు హోతగాను; పింగళుడు అధ్వర్యుడుగాను; శార్జ్ఞరవుడు ఋత్విజుడుగాను; కౌత్సుడు ఉద్గాతగాను; వైశంపాయనుడు మొదలైన మహర్షులు యజ్ఞవిధికి పరీక్షకులుగాను ఉండి యజ్ఞం చేయించడం ప్రారంభించారు.

   నల్లటి రంగుగల వస్త్రాలు ధరించి, పొగవల్ల ఎర్రబడ్డ కళ్ళతో యజ్ఞతంత్రాన్ని నడిపించే ఋత్విజులు నెయ్యి మొదలైన పదార్థాలు అగ్నిలో హోమం చెయ్యడం మొదలుపెట్టారు. మంత్ర ప్రభావం వల్ల, హోమంలో వేస్తున్న పదార్థాల ప్రభావం వల్ల  పాముల జాతికి రాజులైన పాములు మిగిలిన వాళ్లని కూడా తమతో తీసుకుని వచ్చి హోమకుండంలో పడుతున్నారు.

   హోమంలో పడిన పాముల పేర్లు అన్నీ చెప్పుకోలేము కనుక, కొన్ని పేర్లు చెప్పుకుందాం. వాసుకి వంశంలో పుట్టిన కోటీశుడు, మానసుడు, పూర్ణుడు, శలుడు, పాలుడు, హలీమకుడు, పిచ్ఛిలుడు, గౌణపుడు, చక్రుడు, కాలవేగుడు, ప్రకాలనుడు, హిరణ్యబాడు, శరణుడు, కక్షకుడు, కాలదంతుడు మొదలైనవాళ్లు.

    తక్షక వంశంలో పుట్టిన పుచ్ఛాండకుడు, మండలకుడు, పిండసేక్త, రణేభకుడు, ఉచ్ఛికుడు, శరభుడు, భంగుడు, బిల్వతేజుడు, విరోహణుడు, శిలశలకరుడు, మూకుడు, సుకుమారుడు, ప్రవేపనుడు, ముద్గరుడు, శిశురోముడు, సురోముడు, మహాహనువు మొదలైనవాళ్లు. ఐరావతుడి వంశంలో పుట్టిన పారావతుడు, పారిజాతయాత్రుడు (పారియత్రుడు), పాడరుడు, హరిణుడు, కృశుడు, విహంగుడు, శరభుడు, మోదుడు, ప్రమోదుడు, సంహతాపనుడు (సంహతాశనుడు), మొదలైన వాళ్లు. సర్పరాజ కులంలో పుట్టిన నేరకుడు, కుండలుడు, వేణి, వేణీస్కంధుడు, కుమారకుడు, బాహుకుడు, శృంగబేరకుడు, ధూర్తకుడు, ప్రాతరాతకుడు, కొరవ్యుడు మొదలైనవాళ్లు.

   ధృతరాష్ట్రసర్పరాజ వంశలో పుట్టిన శంకుకర్ణుడు, పిఠరకుడు, కుఠారుడు, సుఖసేచకుడు, పూర్ణాంగదుడు, పూర్ణముఖుడు, ప్రహాసుడు, శకుని, దర్యుడు, మాహఠుడు, కామఠకుడు, సుషేణుడు, మానుడు, సావ్యయుడు, భైరవుడు, ముండుడు, వేదాంగుడు, పిశంగుడు, చోద్రపారకుడు, వృషభుడు, వేగవంతుడు, పిండరకుడు, మహాహనుడు, రక్తాంగుడు, సర్వసారంగుడు, సమృద్ధుడు, పఠవాసకుడు, వరాహకుడు, వీరణకుడు, సుచిత్రుడు, చిత్రవేగికుడు, పరాశరుడు, తరుణకుడు, మణిస్కంధుడు, ఆరుణ్యుడు మొదలైన వాళ్లు ఉన్నారు.

     అన్ని వంశాలవాళ్లు ఒక్కొక్కళ్లుగా హోమకుండంలో వచ్చి పడుతున్నారు. కోరల్లో అగ్నిలాంటి విషం ఉన్న వాళ్లూ, తెల్లని, నల్లని, పసుపు పచ్చని, ఎర్రని రంగులూ; బాగా ఎత్తుగా ఉన్న దేహాలూ; ఒకటి కంటే ఎక్కువ తలలు ఉన్నవాళ్లూ  అందరూ మంత్ర  ప్రభావం వల్ల దీనంగా అరుస్తూ వేగంగా వచ్చి హోమకుండంలో పడి కాలి బూడిదవుతున్నారు. పాముల దేహాలనుంచి అగ్నిలో పడేటప్పుడు, కాలేటప్పుడు, కాలిన తరువాత ముక్కలుగా బ్రద్దలయ్యేటప్పుడు కలుగుతున్న ధ్వని అన్ని దిక్కుల్లోను ప్రతిధ్వనించింది.

సర్పయాగాన్ని ఆపించిన ఆస్తీకమహర్షి

  ఆ సమయంలో తక్షకుడు తనను రక్షించమని ఇంద్రుణ్ని వేడుకున్నాడు. ఇంద్రుడు తక్షకుడికి భయపడవద్దని ధైర్యం చెప్పాడు. తన తల్లి కద్రువ ఇచ్చిన శాపం వల్ల ఈ మారణ హోమం జరుగుతోందని నాగజాతి మొత్తం నాశనమవుతోందని బాధపడిన వాసుకి తన చెల్లెలు జరత్కారువు దగ్గరికి వెళ్లాడు. సోదరీ! జనమేజయుడు తలపెట్టిన సర్పయాగం వల్ల నాగజాతి మొత్తం నాశనమవుతోంది. దాన్ని ఆపించగల శక్తి నిర్మలమైన మనస్సు కలిగినవాడు, గొప్ప తపస్సంపన్నుడు, పాపాలులేనివాడు బ్రహ్మతో సమానుడు అయిన నీ కుమారుడు ఆస్తీకమహర్షికి మాత్రమే ఉంది.

   ఈ విషయాన్ని బ్రహ్మ చెప్తుండగా ఏలాపుత్రుడు అనే నాగకుమారుడు విన్నాడు. అందువల్లనే నీ వివాహం జరత్కారుడుతో జరిపించాము. ఇంక అలస్యమయితే సర్పజాతే లేకుండా పోతుంది. జనమేజయ మహారాజు దగ్గరికి వెళ్లి సర్పయాగం ఆపించి పాముల్ని రక్షించాలి! అన్నాడు వాసుకి.

   వాసుకి చెప్పిన మాటలు విని జరత్కారువు ఆస్తీకుడివైపు చూసి నీ మేనమామ చెప్పింది విన్నావా? అతడు చెప్పినట్టు చెయ్యి!” అని చెప్పింది. తల్లి మాటలు విని ఆస్తీకుడు తల్లీ! ఇంతకు ముందు అగ్నిలో పడి దగ్ధమైన వాటిని ఏమీ చెయ్యను. ఇకముందు పడకుండా ఉండేటట్టు మిగిలిన వాటిని రక్షిస్తాను! అని చెప్పాడు.

   ఆస్తీకుడు వాసుకి మొదలైన సర్పరాజుల్ని ఓదార్చి జనమేజయుడు సర్పయాగం చేస్తున్న శాలలో ప్రవేశించాడు. అతడు ప్రవేశించగానే ఆ ప్రదేశమంతా గొప్ప కాంతితో ప్రకాశించింది. ఓ జనమేజయ మహారాజా! నువ్వు చంద్రవంశానికే అలంకారానివి. గొప్ప ధర్మాత్ముడివి. భూ ప్రజలు కోరుకున్నట్టుగాను పాండవ వంశం కీర్తితో ప్రకాశించేట్టుగాను రాజ్యాన్ని పాలిస్తున్నావు.

   నలమహారాజు చేసిన యాగం; ధర్మరాజు చేసిన రాజసూయ యాగం; బ్రహ్మదేవుడు ప్రయాగ క్షేత్రంలో చేసిన యాగం; వరుణదేవుడు, కృష్ణుడు, చంద్రుడు చేసిన యాగాల కంటే కూడా నువ్వు చేస్తున్న యాగం చాలా గొప్పది. ఇక్కడ ఉన్న ఋత్విక్కులు కూడా యజ్ఞం చేయించడం బాగా తెలిసినవాళ్లు, గొప్ప జ్ఞానం కలవాళ్లు, గొప్ప తపస్సంపన్నులు, అనేక శక్తులు కలవాళ్లు, బ్రహ్మతో సమానమైనవాళ్లు. ఇంద్రుడి యజ్ఞంలో ఉన్న ఋత్విక్కులకంటే గొప్ప కీర్తి కలిగినవాళ్లు.

   మహారాజా! విద్వాంసులకే విద్వాంసుడు, ధర్మదేవత మూడులోకాల్లోను గొప్ప తేజస్సు కలవాడు, మంచివాళ్లతో కీర్తింపబడేవాడు అయిన వ్యాస మహర్షి తన కుమారుడితోను, శిష్యులతోను, ఋత్విక్కుల సమూహంతోను వచ్చి నువ్వు చేస్తున్న యాగంలో సదస్యుడుగా ఉన్నాడంటే నీ యాగం గురించి,  నిన్ను గురించి వర్ణించడం ఎవరితరం? అని మహారాజుని కీర్తించాడు. 

   జనమేజయ మహారాజుని, అతడి యజ్ఞాన్ని, యజ్ఞం చేయిస్తున్న ఋత్విక్కుల్ని, యజ్ఞ విధిని పరీక్షిస్తున్న సదస్యుల్ని, పూజ్యుడైన అగ్నిని, అక్కడున్న ప్రతి ఒక్కళ్లని కూడా ఎవరికి తగినట్టు వాళ్లని పొగిడి అందర్నీ సంతోషపెట్టాడు ఆస్తీకమహర్షి.

   జనమేజయ మహారాజు అనందంతో ఆస్తీక మహర్షికి ఏం కావాలో అడగమన్నాడు. జనమేజయా! కోపాన్ని వదిలి పెట్టి, పాముల వంశానికి భయం తగ్గేట్టు, నాకు సంతోషం కలిగేట్టు ఈ సర్పయాగాన్ని ఆపి నాగజాతిని కాపాడు! అని అడిగాడు ఆస్తీకమహర్షి.  అతడు అడిగినదాన్ని విని అక్కడ ఉన్నవాళ్లందరు “అర్హుడు, తగినవాడు, గొప్పతపస్సే ధనంగా కలవాడు అయిన ఈ బ్రాహ్మణుడి కోరిక తీర్చడం మంచిది. గౌరవంతోను, ప్రేమతోను అతడి కోరిక తీర్చండి!” అన్నారు.

   సదస్యులందరూ కలిసి చెప్పడం వల్ల జనమేజయుడు ఆస్తీకుడు అడిగినట్టు సర్పయాగాన్ని ఆపించాడు. అప్పటికే మంత్ర ప్రభావంతో వేగంతో సుడిగాలిలా హోమకుండం వైపు వస్తున్న తక్షకుణ్ని మధ్యలోనే ఆపి హోమకుండంలో పడకుండా వెనక్కి పంపించేశాడు ఆస్తీకుడు. తల్లి అయిన కద్రువ ఇచ్చిన శాపం వల్ల జనమేజయుడు చేస్తున్న సర్పయాగంలో కద్రువ సంతానమైన పాములు మరణిస్తున్నాయి. సర్పయాగాన్ని ఆపించి పాముల్ని మరణం నుంచి తప్పించిన ఆస్తీకుణ్ని యాగశాలలో ఉన్నవాళ్లందరూ భక్తితో స్తోత్రం చేశారు.

   జరత్కారుడు అనే గొప్ప మహర్షికీ, వాసుకి చెల్లెలు జగత్కారువుకీ కుమారుడైన ఆస్తీక మహర్షిని స్మరిస్తే పాముల వల్ల భయం ఉండదు. ఆస్తీకమహర్షి కథ విన్నవాళ్ల పాపాలన్నీ నశిస్తాయి.

ఇంతటితో ఆదిపర్వం రెండవఆశ్వాసం పూర్తిచేసుకున్నాము.

 

మహాభారతకథ-15

 

పరీక్షిత్తుమహారాజుని చంపిన తక్షకుడు

   శృంగి శాపం వల్ల ప్రేరేపించబడ్డ తక్షకుడు పరీక్షిత్తు మహారాజు దగ్గరికి వెళ్లడానికి మార్గం కోసం అన్వేషిస్తున్నాడు. పాములు బూమ్మీద ఉన్న ప్రజల్ని కాటేసి తమ విషంతో చంపేస్తున్నాయని బాధపడ్డాడు బ్రహ్మదేవుడు. పాము కరిచిన వాళ్లని ఆ విష ప్రభావం నుంచి తప్పించి తిరిగి బ్రతికేలా చెయ్యాలనుకున్నాడు. కశ్యపమహర్షిని పిలిచి మంత్రోపదేశం చేశాడు.

   తక్షకుడి విషం వల్ల పరీక్షిత్తు మహారాజు మరణిస్తాడని విన్నాడు కశ్యపమహర్షి. మహారాజుని తను బ్రతికిస్తే తన కీర్తి అన్ని వైపుల ప్రసరిస్తుంది. పరీక్షిత్తుని బ్రతికించి తన విద్యలో ఉన్న శక్తిని అందరికీ తెలియ చెయ్యాలని అనుకున్నాడు. భూమండలం మొత్తాన్ని రక్షించే ప్రభువుని కాపాడితే ఎక్కువ ధనాన్ని కూడా పొందవచ్చు. అందువల్ల తనకు కీర్తి, ధనము, పుణ్యము కూడా దక్కుతాయి అనుకున్నాడు. వెంటనే పరీక్షిత్తు మహారాజు ఉండే హస్తినాపురానికి బయలుదేరాడు. ముసలి బ్రాహ్మణ రూపంతో వెడుతున్న తక్షకుడికి అడవిలో కశ్యపమహర్షి కలిశాడు.

    తక్షకుడు మహర్షీ! ఏ పని మీద వెడుతున్నావు? ఎక్కడికి వెడుతున్నావు? అని అడిగాడు.

   కశ్యపుడు “తక్షకుడు అనే పాము ఈ రోజు పరీక్షిత్తు మహారాజుని కరుస్తుందని విన్నాను. శత్రువుల్ని తరిమేవాడు, శుభప్రదుడు, సమర్థుడు, మంచి మనస్సు కలవాడు అయిన మహారాజు విషాన్ని పోగొట్టడానికి వెడుతున్నాను” అన్నాడు.

   “నేనే ఆ తక్షకుణ్ని. నువ్వు అనుకుంటున్న పని మీదే వెడుతున్నాను. నువ్వు వేసే మందులు, మంత్రాలు నా మీద పని చెయ్యవు. కావాలంటే నేను ఈ చెట్టుని కరిచి ఆ విషంతో దాన్ని కాల్చి బూడిద చేస్తాను చూడు అని తక్షకుడు మర్రిచెట్టుని కరిచాడు. తక్షకుడి నుంచి వచ్చిన విషం వల్ల పుట్టిన అగ్నితో ఆ చెట్టు కాలిపోయింది. దాని విశాలమైన ఆకులు పొడవైన కొమ్మలు కూడా పూర్తిగా కాలి బూడిదయ్యాయి.

   “ఇప్పుడు నీ మంత్రం పనిచేస్తుందో లేదో చూసుకో! అన్నాడు తక్షకుడు. కశ్యపుడు కాలిన చెట్టు బూడిదని పోగుచేసి తన మంత్రబలంతో దాన్ని మళ్లీ ఇంతకు ముందు ఉన్నచెట్టులా చేశాడు.

   అది చూసిన తక్షకుడు మహర్షీ! నీ మంత్ర ప్రభావం వల్ల ఈ చెట్టు బ్రతికి ఉండచ్చు. కాని, బ్రాహ్మణుడు, తపస్వి అయిన శృంగి శాపం వల్ల మరణించిన పరీక్షిత్తు మాత్రం తిరిగి బ్రతకలేడు. అక్కడికి వెడితే నీకు ఎంత సొమ్ము వస్తుందో అంతకంటే ఎక్కువ సొమ్ముని నేను ఇస్తాను. ఇక్కడి నుంచి నువ్వు తిరిగి వెనక్కి వెళ్ళిపో!” అన్నాడు. కశ్యపమహర్షి తక్షకుడు చెప్పింది విని తన దివ్యదృష్టితో చూసి జరిగేదేమిటో తెలుసుకున్నాడు. పరీక్షిత్తుకి మరణం తప్పదని అర్థమయింది. తక్షకుడి దగ్గర ధనం తీసుకుని తిరిగి వెళ్లిపోయాడు. కశ్యపమహర్షిని పరీక్షిత్తు మహారాజు దగ్గరికి వెళ్లకుండా ఆపాడు తక్షకుడు.

   అసలు అడవిలో కశ్యపుడు తక్షకుడు మాట్లాడుకున్నారన్న విషయం మన వరకు ఎలా తెలిసిందీ? అని మనకి కలుగుతున్న సందేహం. అది అడవి కదా...వాళ్లు మాట్లాడుకునేప్పుడు అక్కడ ఎవరూ లేరు కదా? అని అనుకోకండి. ఎలా తెలిసిందంటే...హస్తినాపురం నుంచి ఒక బ్రాహ్మణుడు కట్టెలకోసం అడవికి వెళ్లి అదే చెట్టు మీద కట్టెలు కొట్టుకుంటున్నాడు. అతణ్ని కశ్యపమహర్షిగాని, తక్షకుడుగాని ఇద్దరూ చూడలేదు.

   తక్షకుడు ఆ చెట్టుని కరిచి తన విషంతో కాల్చి బూడిద చేసినప్పుడు చెట్టుతోపాటు ఆ బ్రాహ్మణుడు కూడా కాలి బూడిదైపోయాడు. కశ్యపమహర్షి చెట్టుని మళ్లీ బతికించినప్పుడు చెట్టుతో పాటు ఆ బ్రాహ్మణుడు కూడా మళ్లీ బతికాడు. అతడు హస్తినాపురం వెళ్లి జరిగిన విషయాన్ని నగర ప్రజలకి మొత్తం చెప్పేశాడు.

   పరీక్షిత్తు మహారాజుని కాపాడాలని వెడుతున్న కశ్యప మహర్షిని అడవి నుంచే వెనక్కి పంపించేశాడు తక్షకుడు. మిగిలిన సర్పాల్ని పిలిచి వాళ్లని బ్రాహ్మణ రూపాల్లోకి మారమన్నాడు. తరువాత మంచి సువాసనలు వెదజల్లే తాజా పువ్వుల్ని, రుచిగా తియ్యగా ఉండే పండ్లని మోదుగ ఆకులతో చేసిన బుట్టలో పెట్టుకుని రమ్మన్నాడు. వాళ్లందర్నీ పరీక్షిత్తు మహారాజు ఉంటున్న ఒంటి స్తంభం మేడలోకి వెళ్లమని చెప్పాడు. తనుకూడా అదృశ్య రూపంలో వాళ్లని అనుసరించాడు.

   అందమైన రూపం కలిగిన పరీక్షిత్తు మహారాజు వేదాలు చదువుతూ లోపలికి వచ్చిన బ్రాహ్మణ యువకుల్ని చూశాడు. వాళ్లని దగ్గరకు రమ్మని పిలిచాడు. వాళ్లు తెచ్చిన పండ్లు, పూలు తీసుకున్నాడు. వాళ్లని తగిన విధంగా సత్కరించి పంపించాడు. మనం ఎంత చేసినా.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కాలం మాత్రం దాని పని అదే చేసుకుని పోతుంది.

   అప్పటికి సాయంకాలం అవుతోంది. గొప్ప బలపరాక్రమాలు కలిగిన పరీక్షిత్తు మహారాజు తనకు ఇరువైపులా కూర్చున్న మంత్రుల్ని స్నేహితుల్ని, ఆప్తుల్ని అందర్నీ చూస్తూ “ శమీక మహర్షి కుమారుడు శృంగిమహర్షి శాపం ఇచ్చి ఏడు రోజులు గడిచిపోతున్నాయి. సూర్యుడు అస్తమిస్తున్నాడు” అని చెప్తూ తన దగ్గర ఉన్న పండ్ల బుట్టల్ని చూపించి వీటిని అందరికీ పంచండి అని చెప్పాడు.

   అందరికీ పంచడం అయిపోయాక ఇంకొక బుట్ట మిగిలి పోయింది. దాంట్లోంచి ఒక పండుని చీల్చాడు. అందులో ముందు నల్లగా కనబడి, అంతలోనే ఎర్రని రంగుతో పాముగా మారి, అగ్ని జ్వాలల్లా విషాన్ని చిమ్ముతూ తక్షకుడు బయటికి వచ్చి పరీక్షిత్తు మహారాజుని కరిచి వెళ్లిపోయాడు. చుట్టూ ఉన్న పరివారం మొత్తం భయంతో అటు ఇటు పరుగులు పెడుతూ చెల్లాచెదరుగా పారిపోయారు. తక్షకుడి విషం వల్ల ఒంటిస్తంభం మేడ కూడా కాలి బూడిదయింది. ఆ విధంగా నీ తండ్రి మరణించాడు.

   వేదవిదులైన బ్రాహ్మణులు, పురోహితులు శాస్త్రప్రకారం పరలోకంలో ఉత్తమ గతి కలగడానికి అవసరమైన కర్మలు చేశారు.

 

మహాభారతకథ-14

 

పరీక్షిత్తుమహారాజుకి శాపము

    కౌరవవంశం నాశనమవుతున్న సమయంలో అర్జునుడి కుమారుడు అభిమన్యుడు, విరాటమహారాజు కూతురు ఉత్తర దంపతులకి ధర్మస్వరూపుడైన పరీక్షిత్తు జన్మించాడు.

    పరీక్షిత్తు మహారాజు కుమారుడు జనమేజయుడు. ఒకరోజు ఉదంకుడు వచ్చి జనమేజయుడితో అతడి తండ్రి పరీక్షిత్తు మహారాజు మరణించాడని చెప్పాడు. జనమేజయ మహారాజు మంత్రుల్ని పిలిచి అది ఎలా జరిగిందో చెప్పమని అడిగాడు. జరిగిన విషయాన్ని మంత్రులు జనమేజయుడికి వివరించారు.

  పరీక్షిత్తు మహారాజు ధర్మం, అర్ధం, కామం అనే పురుషార్ధాల్ని అతిక్రమించకుండా... ప్రజలకి ఏ కష్టమూ కలగకుండా... భూమి మీద ఉన్న ప్రజలందర్నీ కాపాడుతూ అరవై సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. పాండురాజు కొడుకు అర్జునుడు. అర్జునుడి కొడుకు అభిమన్యుడు. అభిమన్యుడి కొడుకు పరీక్షిత్తు. పరీక్షిత్తు కొడుకు జనమేజయుడు. ఆ వంశంలో పాండురాజుకి వేటంటే చాలా ఇష్టం. అలాగే పరీక్షిత్తుకి కూడా వేటంటే చాలా ఇష్టం.

   ఒకరోజు అడవికి వెళ్లి పెద్ద పెద్ద జంతువుల్ని వేటాడుతున్నాడు. తన బాణంతో దెబ్బతిన్న ఒక లేడి పారిపోతుంటే దాన్ని తరుముకుంటూ చాలా దూరం వెళ్లిపోయాడు. ఒక చోట శమీకుడు అనే పేరుగల మహర్షి తపస్సు చేసుకుంటూ కనిపించాడు. పరీక్షుత్తు శమీకుడితో మహర్షీ! నేను బాణంతో కొట్టడం వల్ల లేడికి దెబ్బ తగిలింది. ఆ లేడి ఇటువైపు వచ్చిందా?” అని అడిగాడు. శమీకుడు తపస్సులో ఉండడం వల్ల పరీక్షిత్తు మాటలు వినలేదు. అందుకని అతడి ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. తను అడిగినదానికి బదులు చెప్పలేదని పరీక్షిత్తుకి శమీకుడి మీద కోపం వచ్చి దగ్గర్లో చచ్చి పడి ఉన్న ఒక పాముని తన బాణం కొసతో తీసి శమీకుడి మెడలో వేసి వెళ్లిపోయాడు.

   శమీకుడి కుమారుడు శృంగి. అతడు శివుడి సేవకుడైన భృంగితో సమానమైనవాడు. గొప్ప తపస్సంపన్నుడు. అతడికి కోపం చాలా ఎక్కువ. జరిగినదాన్ని చూసిన కృశుడు అనే ముని బ్రహ్మకోసం తపస్సు చేస్తున్న శృంగి దగ్గరికి వచ్చి పరీక్షిత్తుమహారాజు శమీకుడి మెడలో చచ్చిన పాముని వేసి వెళ్లిపోయాడని చెప్పాడు.

   మౌనంగా తపస్సు చేసుకుంటున్న ముసలివాడైన తన తండ్రి మెడలో చచ్చిన పాముని వేసి వెళ్లినందుకు పరీక్షిత్తు మహారాజు మీద శృంగికి చాలా కోపం వచ్చింది. “నా తండ్రి మెడలో చచ్చిన పాముని వేసిన పరీక్షిత్తు అనే పేరుగల మహారాజు నేటి నుంచి ఏడు రోజుల్లో తక్షకుడు అనే పాము విషం వల్ల మరణించుగాక! అని శాపం ఇచ్చాడు.

   తరువాత తన తండ్రి దగ్గరికి వెళ్లాడు శృంగి. మెడలో చచ్చిన పాము వేలాడుతున్నా తెలియని స్థితిలో ధ్యానంలో మునిగి ఉన్నాడు శమీకుడు. శృంగి తండ్రి మేడలో ఉన్న పాముని తీసి పారేశాడు. కళ్లు తెరిచి చూశాడు శమీకుడు. శృంగి జరిగిన విషయాన్ని తండ్రికి వివరించాడు.  అది విని శమీకుడు చాలా బాధపడి నాయనా! నువ్వు చేసిన పని చాలా తప్పు. కోపమే తపస్సుని, అణిమ, లఘిమ అనబడే అష్టసిద్ధుల్ని పోగొడుతుంది. ధర్మ కార్యాలు చెయ్యవలసిన మునులకి కోపం ఉండచ్చా? ఓర్పు లేని మహర్షి చేసిన తపస్సు; అహంకారి దగ్గరుండే ధనము; ధర్మం తప్పిన రాజుకి చెందిన రాజ్యము పగిలిన కుండలో పోసిన నీళ్లు బయటికి పోయినట్లు ఎందుకూ పనికి రాకుండా పోతాయి.

  మహర్షులకి ఏది ఉండకూడదో అదే కోపంతో నువ్వు ఓర్పు లేకుండా భూమండలం మీద ఉన్న ప్రజలందర్నీ రక్షిస్తున్న ధర్మాత్ముడైన పరీక్షిత్తు మహారాజుని శపించి పొరపాటు చేశావు. రాజులు రక్షిస్తున్నారు కనుకనే మహర్షులు తీవ్రమైన తపస్సు చేస్తూ, వేదాల్లో చెప్పబడిన ధర్మాలు నిర్వర్తిస్తూ గొప్ప శక్తి కలిగి ఉంటున్నారు. అటువంటి రాజులకి కీడు చెయ్యడం కంటే మించిన పాపం ఏదీ ఉండదు. పరీక్షిత్తు మహారాజు అంటే సామాన్యుడు అనుకున్నావా? భూమిని పాలించిన వాళ్లల్లో క్షత్రియ కులానికి చెందిన రాముడు, మాంధాత, రఘుమహారాజు కూడా పరీక్షిత్తు మహారాజు పాలించినట్టు పాలించలేదు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే నాలుగు వర్ణాల ప్రజల్ని తమ ధర్మాలు తప్పకుండా ఉండేలా వాళ్లకంటే ఎక్కువగా కాపాడుకుంటూ వస్తున్నాడు.

   వేటపైన ఆసక్తి వల్ల అలిసిపోయి ఆకలి, దప్పికల వల్ల తెలియని స్థితిలో ఉండి నన్ను అవమాన పరిచాడు. అది కావాలని చేసిన పని కాదు. నేను అతడి ప్రశ్న విని కూడా సమాధానం ఇవ్వలేదని పొరపాటు పడ్డాడు. నువ్వు అతడికి ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకో!” అన్నాడు. తండ్రి మాటలు విని శృంగి  “తండ్రీ! నా శాపం జరిగే తీరుతుంది. వెనక్కి తీసుకోడం నాకు చాతకాదు! అన్నాడు.

   శమీకుడు మనస్సులో బాధపడుతూ గౌరముఖుడు అనే పేరుగల శిష్యుణ్ని పిలిచి పరీక్షిత్తు మహారాజు దగ్గరికి వెళ్లి అతడికి శృంగి ఇచ్చిన శాపం గురించి చెప్పి తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పుని చెప్పి  పంపించాడు.

   గౌరముఖుడు రాజు దగ్గరికి వెళ్లి మహారాజా! మీరు ఏకాగ్రతతో తపస్సు చేసుకుంటున్న మా గురువుగారి మెడలో చచ్చిన పాముని వేసి వచ్చారు. అది చూసిన అయన కుమారుడు శృంగి ఏడు రోజుల్లో మీరు తక్షకుడు అనే పాము విషంతో మరణించాలని శాపమిచ్చాడు. ఆ విషయం తెలిసిన మా గురువుగారు బాధపడి జాగ్రత్తగా ఉండమని మీకు చెప్పి రమ్మని నన్ను పంపించారు” అని చెప్పి వెళ్లిపోయాడు.

   గౌరముఖుడు చెప్పినదాన్ని విని పరీక్షిత్తు తను చేసిన ధర్మ విరుద్ధమైన పనికి బాధపడ్డాడు. శమీకుడి ఓర్పుకి మెచ్చుకున్నాడు. శృంగి ఇచ్చిన శాపానికి భయపడి తనను రక్షించుకోడానికి చెయ్యవలసిన కార్యక్రమాల గురించి మంత్రులతో సంప్రదించాడు. భూమికంతటికీ ప్రభువైన పరీక్షిత్తు నేర్పరులైన వడ్రంగుల్ని పిలిపించాడు. ఒంటిస్తంభంతో మేడ కట్టించమని ఆజ్ఞాపించాడు. రాత్రి పగలు తనను విడవకుండా నమ్మకంగా ఉండే ఆప్తులు, సేవకులు, మంత్రులు మొదలయిన వాళ్లని రక్షణకి ఏర్పాటు చేసుకుని ఒంటిస్తంభం మేడలో నివసించాడు. విషాన్ని పోగొట్టే మంత్రాలు తెలిసినవాళ్లని, విషవైద్యుల్ని రప్పించుకున్నాడు. విధిని ఎవరూ తప్పించలేరు.

 

మహాభారతకథ-13

 

జరత్కారుడు వృత్తాంతము

  జరత్కారుడు అనే పేరుగల మహర్షి యాయావరము’ అనే వంశంలో జన్మించాడు. అతడు గొప్ప కఠినమైన నియమనిష్ఠలు కలవాడు, బ్రహ్మచారి. మళ్లీ మళ్లీ జన్మలు పొందడం ఇష్టం లేక సంసార బంధంలో చిక్కుకోకుండా బ్రహ్మచారిగానే ఉండిపోవాలని నిశ్చయించుకున్నాడు.

   తపస్సు చెయ్యడం, వేదాలు చదవడం, బ్రహ్మచర్యం వంటివాటితో ఋషుల ఋణం తీర్చుకుంటున్నాడు. ఒకరోజు నీటి ఒడ్డున తిరుగుతూ ఎలుకలు తినేసి ఒక్కవేరు మాత్రమే మిగిలి ఉన్న చెట్టుని, ఆ చెట్టు కొమ్మకి తలకిందులుగా వ్రేలాడుతూ సూర్యకిరణాల్ని భోజనం చేస్తూ జీవిస్తున్న కొంతమంది ఋషుల్ని చూశాడు. వాళ్లతో  అయ్యా! తలకిందులుగా చెట్టుకొమ్మని పట్టుకుని వేలాడుతూ తపస్సు చేసే విధానం కూడా ఉందా? ఇంత భయంకరమైన తపస్సు గురించి నేను ఎప్పుడూ వినలేదు. దాని గురించి చెప్తే ఆ తపస్సుని కూడా నేను చేస్తాను! అని అడిగాడు.

   తపస్సంపన్నుడా! మా తరువాత సంతానం లేకపోవడం వల్ల; ఎటువంటి ఆధారం లేక; పాపలోకాలకి వెళ్లలేక; గొప్ప తపసంపన్నులమై ఉండి కూడా ఇటువంటి హీన స్థితిలో ఉన్నాము. మా వంశంలో జరత్కారుడు అనే పేరుతో ఒకడు పుట్టాడు. అతడు పెళ్లి చేసుకుని సంతానం పొందుతేనే గాని మాకు విముక్తి కలగదు. అతడు పెళ్లి చేసుకోడానికి అంగీకరించడు. మేము అతడి తాత తండ్రులం. మేము పట్టుకుని వెళ్లాడుతున్న ఔరుగడ్డి దుబ్బువేళ్లన్నీ యముడి వల్ల తెగిపోతున్నాయి. ఇంక ఒక్క వేరు మాత్రం మిగిలి ఉంది. జరత్కారుడు సంతానం పొందకపోతే ఆ వేరు కూడా తెగిపోతే మేము అధోలోకాలకి వెళ్లిపోతాం. అతడు సంతానం పొందితే మేము పైలోకాలకి చేరుకుని మోక్షాన్ని పొందుతాము. నువ్వు ఎవరివో మాకు తెలియదు కాని, ఓర్పుతో మేము చెప్పినదాన్ని విన్నావు. నీకు మా జరత్కారుడు కనిపిస్తే అతడికి మా బాధ గురించి చెప్పు” అన్నారు.

   పితృదేవతల మాటలు విని జరత్కారుడు తను తప్పకుండా పెళ్లి చేసుకోవాలని, తనకు కలిగిన సంతానం వల్ల వాళ్లకి విముక్తి కలిగించాలని నిర్ణయించుకున్నాడు. వాళ్లతో  “పితృదేవతలారా! నేనే జరత్కారుడు అనే పేరుగల మీ కొడుకుని. మీరు నా పితృదేవతలు. మిమ్మల్ని నేను పూజించాలి. అది మీ కొడుకుగా నా ధర్మం. ఇంతవరకు నేను పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. ఇలా వేలాడుతున్న మిమ్మల్ని చూశాక నేను చేస్తున్న బ్రహ్మచర్యం వల్ల మీరు ఎంత బాధ పడుతున్నారో అర్థం చేసుకున్నాను. నేను పెళ్లి చేసుకుని మంచి సంతానాన్ని పొంది మీ బాధని పోగొడతాను అన్నాడు.

   అది విని పితృదేవతలు చాలా సంతోషంతో నాయనా! యోగ్యులైన కొడుకుల్ని పొంది ధర్మమార్గం విడిచి పెట్టకుండ నడుచుకునే ఆ కొడుకుల ద్వారా లోకంలో తమ పేరు నిలబడినప్పుడు పితృదేవతలు మంచి లోకాలు పొందుతారు. అంతేకాని, యజ్ఞాలు చెయ్యడం వల్ల, ఎక్కువగా దక్షిణలు ఇవ్వడం వల్ల పితృదేవతలు మంచి లోకాలకు చేరలేరు. అందుకే నువ్వు పెళ్లి చేసుకుని సంతానాన్ని పొందాలి! అని చెప్పారు.

జరత్కారుడు-జరత్కారువుల పెళ్లి

   పితృదేవతలు చెప్పినది విని జరత్కారుడు పితృదేవతలతో  నా పేరుతో సమానమైన పేరుగల కన్యతో వివాహం జరగాలని ఆశీర్వదించండి! అని వాళ్లకి నమస్కరించాడు.  తరువాత అటువంటి పేరుగల కన్యకోసం భూమండలమంతా తిరిగాడు. కాని తన పేరుతో సమానమైన పేరుగల కన్య అతడికి భూలోకంలో ఎక్కడా దొరకలేదు.

   జరత్కారుడు కన్యకోసం వెతుకుతున్న విషయం వాసుకి తెలుసుకున్నాడు. తన చెల్లెలు జరత్కారువుని తీసుకుని తన సేవకులతో కలిసి జరత్కారుడి దగ్గరకి వెళ్లాడు. ఆయన్ని కలిసి ధర్మాత్ముడా! లోకపూజ్యుడా! బ్రాహ్మణశ్రేష్ఠుడా! జరత్కారు మహర్షీ! మీ వంశం గొప్ప పుణ్యం చేసుకుంది. మీకూ మా చెల్లెలికీ పేర్లు, గుణాలు కలవడం వల్ల మా వంశం కూడా ధన్యమైంది. మా చెల్లెలు జరత్కారువు అనే కన్యని మీకు భిక్షగా ఇస్తున్నాను. మెను ఇష్టంతో స్వీకరించి పెళ్లి చేసుకోండి అన్నాడు.

   వాసుకి చెప్పిన మాటలు విన్న జరత్కారుడు తను కోరుకున్నట్టుగా తన పేరు కలిసిన జరత్కారువుని పెళ్లి చేసుకున్నాడు. మొదటి రోజే అమెతో  నువ్వు  నన్ను అగౌరవంగా చూసిన రోజు నేను నిన్ను విడిచిపెట్టి వెళ్లిపొతాను!” అని చెప్పాడు. ఆ రోజు నుంచి జరత్కారువు భయభక్తులతో భర్తకి సేవ చేస్తోంది. ఆమె జీవితం కత్తి మీద సాములా తయారయింది. భర్తకి భక్తితోను ఇష్టంతోను సేవ చేస్తూ కొంతకాలానికి గర్భవతి అయింది.

   ఒకరోజు జింకచర్మం మీద కూర్చున్న జగత్కారువు తొడ మీద తల పెట్టుకుని నిద్రపోతున్నాడు జగత్కారుడు. సాయంకాలమయింది. ఆశ్రమంలో ఉన్న ఋషులందరూ సాయంకాలం చెయ్యవలసిన సంధ్యావందన కార్యక్రమాలు చెయ్యడం కోసం బయలుదేరారు. తన భర్తని నిద్ర లేపితే నిద్రాభంగమైందని కోపగిస్తాడేమో...లేపకపోతే సంధ్యాకాలంలో చెయ్యవలసిన పనులు చెయ్యకపోతే ధర్మానికి భంగమైందని కోపగిస్తాడేమో... అని భయపడుతూ మనస్సులో కూడా ధర్మానికి భగం కలగకూడదన్న నిశ్చయంతో  జరత్కారుణ్ని నిద్ర లేపింది.

   నిద్ర నుంచి లేచిన జరత్కారుడు నాకు నిద్రాభంగం ఎందుకు చేశావు?” అని అడిగాడు కోపంగా. ఆమె చెప్పిన కారణం విని  నేను నిద్ర లేవకుండా సూర్యుడు పడమటి కొండకి వెళ్లడానికి భయపడతాడని నీకు తెలియదా? నన్ను నిద్ర లేపి అవమానం చేశావు కనుక, ఇంతకు ముందు నీకు చెప్పినట్టే నిన్ను విడిచి వెళ్లిపొతున్నాను.  సూర్యుడితోను, అగ్నితోను సమానమైన కాంతి కలిగి, మన రెండు వంశాల్ని ఉద్ధరించ కలిగిన శక్తితో నీకు కుమారుడు జన్మిస్తాడు. నువ్వు నీ అన్న దగ్గరే ఉండు, అక్కడ ఏ భయము ఉండదు అని చెప్పి జరత్కారుడు తపస్సు చేసుకునేందుకు అడవికి వెళ్లిపోయాడు.

   జరత్కారువు జరత్కారుడు చెప్పినట్టే వాసుకి దగ్గరే ఉండి పోయింది. కొంతకాలానికి జరత్కారువుకి గొప్ప తేజస్సుతో ఆస్తీకుడు జన్మించాడు. అతడు పెరిగి పెద్దవాడై చ్యవన మహర్షి కుమారుడు ప్రమతి దగ్గర వేదవేదాంగాలు నేర్చుకున్నాడు. ప్రశాంతమైన మనస్సుతో అన్ని శాస్త్రాలు తెలుసుకుని పెరిగి పెద్దవాడయ్యాడు.

 

మహాభరతకథ-12

                                            తల్లి శాపానికి బాధపడిన శేషుడు - వాసుకి

   పాములకి తెలియకుండా ఇంద్రుడు అమృతాన్ని తీసుకుని వెళ్లిపోయాడు. అమృతం తాగే యోగం పాములకి లేకుండా పోయింది. జరిగినదానికి శేషుడు బాధపడ్డాడు. తన తల్లి, తమ్ముళ్లు ధర్మవిరుద్ధమైన పనులు చెయ్యడం వల్ల ఇంత అవమానాన్ని పొందవలసి వచ్చింది.

   దు:ఖంతో ఇల్లు వదిలి తపస్సు చేసుకోడానికి గంధమాదన పర్వతానికి వెళ్లిపోయాడు.  గోకర్ణక్షేత్రం, పుష్కరారణ్యం, హిమాచలం మొదలైన పుణ్యక్షేత్రాల్లో అనేక వేల సంవత్సరాలు బ్రహ్మ గురించి తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. ఏ వరాలు కావాలో కోరుకోమన్నాడు.

   “బ్రహ్మదేవా! నా తల్లి కద్రువ, తమ్ముళ్లు కలిసి, నా సవతి తల్లి  వినతని, సోదరుడు గరుత్మంతుణ్ని అనేక విధాలుగా అవమానించారు. వాళ్లు ఎప్పటికీ మారరు. ఇవన్నీ చూస్తూ వాళ్లతో కలిసి ఉండడం నాకు ఇష్టం లేదు. తపస్సు చేస్తూ ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తాను!” అన్నాడు.

   అతడి మాటలు విని బ్రహ్మ “నాయనా! నువ్వు ఎప్పుడూ సత్యాన్ని మాట్లాడతావు. ధర్మబద్ధంగా జీవిస్తావు. దేన్నైనా భరించగల శక్తి, ఓర్పు కలవాడివి. ఈ భూమి మొత్తం భారాన్ని నువ్వే పద్ధతిగా మొయ్యాలి. వినత కుమారుడు గరుత్మంతుడు చాలా గొప్ప పరాక్రమవంతుడు. కశ్యపుడు, వాలఖిల్యులు మొదలైన  మునులతో వరాలు పొందిన పక్షిరాజు. ఇంద్రుణ్ని కూడా ఓడించి అందరితో పొగడ్తలు అందుకున్నాడు. నువ్వు తెలివిగా ఉండి అతడితో స్నేహంగా ఉండడం నీ విధిగా అనుకో!” అని నచ్చ చెప్పాడు బ్రహ్మ.

   శేషుడు బ్రహ్మ చెప్పినట్టుగా భూమి యొక్క సమస్త భారాన్ని మోస్తున్నాడు. గరుత్మంతుడితో స్నేహంగా మెలుగుతూ ప్రశాంతంగా జీవిస్తున్నాడు.

   తమ తల్లి కద్రువ ఇచ్చిన శాపం వల్ల జనమేజయుడు సర్పయాగం చెయ్యబోతున్నాడని పాముల్లో ముఖ్యుడైన వాసుకి అనే పేరుగల పాము తెలుసుకున్నాడు. సర్పయాగంలో తమకు కలగబోయే వినాశనాన్ని తలుచుకుని బాధపడుతున్నాడు. చుట్టాలందర్నీ పిలిపించాడు. ఐరావతుడు అనే పేరు గల తన సోదరులందరినీ కూడా పిలిచి తన బాధ చెప్పుకున్నాడు.

   శేషుడు చాలాకాలం తపస్సు చేసి విశాలమైన  భూమిని మొయ్యడం అనే గొప్ప పనిలో ఉండిపోయాడు. మనతో స్నేహాన్ని బంధుత్వాన్ని విడిచి పెట్టి తనంతట తాను ఒంటరిగా ఉండిపోయాడు. మనందరికీ ఆపద రాబోతోందని తెలిసి కూడా మన భయాన్ని పోగొట్టే పని ఏదయినా చెయ్యాలన్న ఆలోచనే అతడి మనసుకి కలగడం లేదు.

   అమృతం కోసం సముద్రాన్ని చిలికినప్పుడు మంథర పర్వతానికి అల్లెత్రాడుగా ఉండి నేను పడిన కష్టానికి అందరూ మెచ్చుకుని నాకు ఏ భయమూ లేకుండా ఉండేట్టు వరం ఇచ్చారు. నా గురించి నాకు భయం లేదు.

    కాని, మన తల్లి కద్రువ ఇచ్చిన శాపం వల్ల మన నాగజాతికే వినాశనం కలుగబోతోంది. అందుకే నేను చాలా దు:ఖపడుతున్నాను. మన జాతికి కలగబోయే ఉపద్రవాన్ని ఆపడానికి ఏదైనా ఉపాయం ఉందా? ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? అని వాసుకి మిగిలిన పాముల్ని సలహా అడిగాడు.

   వాసుకి కంటే చిన్నవైన పాములు కొన్ని “అంత భయమెందుకు? జనమేజయుడు యాగం మొదలుపెట్టినప్పుడు అది జరగకుండా అడ్డు పడదాం. జనమేజయుడు ధర్మపరుడు కనుక మనం బ్రాహ్మణ రూపాల్లో వెళ్లి ఈ యాగాన్ని ఆపమని చెప్తే వింటాడు. ఈ యాగం చెయ్యడం వల్ల ఇహపర సౌఖ్యాలకి అనేక ఆటంకాలు కలుగుతాయని నచ్చచెప్దాం.

   మనమందరం ఒకే మాట మీద ఉండి ఋత్విక్కులు కూడా యాగాన్ని వదిలి పారిపోయేలా చేద్దాం. యాగానికి వచ్చిన వాళ్లందరికీ పెట్టే భక్ష్యాలు, భోజ్యాలు, లేహ్యాలు, పానీయాలు అనబడే నాలుగు రకాలైన ఆహార పదార్థాల మీద విషాన్ని చిమ్ముదాం. సభలో ఉండే బ్రాహ్మణుల మీద పరుగులు పెడదాం. ఋత్విక్కులు యాగం చెయ్యడం మానేసి భయంతో పారిపోయేలా చేద్దాం! అన్నాయి.

   వాళ్ల మాటలు విన్న పెద్ద పాములు అది అంత తేలికైన పని కాదు. బ్రాహ్మణులు మంత్రాలు చదువుతూ అగ్నిలో నెయ్యి వేసేటప్పుడు పైకి లేచే అగ్ని జ్వాలలు ఎంత ఎత్తున లేస్తాయో మనం ఊహించలేం. ఆ సమయంలో మనం అనుకున్నట్టు జరుగుతుందని ఊహించవద్దు! అన్నాయి.

   వాటిలో ఏలాపుత్రుడు అనే నాగ కుమారుడు కద్రువ పాములకి శాపం ఇచ్చే రోజున నేను ఆమె ఒడిలో నిద్ర రాకపోయినా నిద్రపోతున్నట్టు కళ్లు మూసుకుని ఉన్నాను. అప్పుడు గొప్ప గొప్ప దేవతలు, బ్రహ్మ ఒకళ్లతో ఒకళ్లు మాట్లాడుకున్న మాటలు విన్నాను. అవి మీకు వివరంగా చెప్తాను వినండి.

   తల్లి కద్రువ పాములకి శాపం ఇచ్చిన వెంటనే దేవతలందరూ బ్రహ్మతో తండ్రీ! కద్రువ ఎంతో బలపరాక్రమాలు కలిగిన తన కుమారుల్ని భయంకరంగా శపించింది. దాన్ని ఎవరూ అడ్డుకోలేదు. ఈ శాపానికి వేరే మార్గం ఏమైనా ఉందా? అని అడిగారు.

   వాళ్లు అడిగినదానికి బ్రహ్మ లోకానికి హాని కలిగించే క్రూరమైన పాములు భూమాతకి బరువుగా అనిపిస్తున్నాయి. అందుకే భూమికి భారం తగ్గించడం కోసం సర్పయాగం చెయ్యడం వల్ల పాములకు కలిగే నాశనానికి అంగీకరించ వలసి వచ్చింది.

   వాసుకి చెల్లెలైన జరత్కారువుకీ, జరత్కారుడు అనే గొప్ప మహర్షికీ వివాహం జరగాలి. వాళ్లిద్దరికీ గొప్ప తేజస్సుతో పుట్టే ఆస్తీకుడు అనే మహర్షి జనమేజయుడి యాగాన్ని ఆపగలడు. అలా జరిగినప్పుడు లోకానికి మంచిని చేసే ప్రముఖులైన నాగులు రక్షింపబడతారు అని దేవతలకి చెప్పిన విషయాన్ని చెప్పాడు.

   నాగులందరు అది విని సంతోషంతో ఏలాపుత్రుణ్ని ఎత్తుకుని పొగిడారు. ఎప్పుడు జరత్కారుడు వస్తాడో ఎప్పుడు తన చెల్లెలు జరత్కారువుని భార్యగా స్వీకరిస్తాడో అని వాసుకి ఎదురు చూస్తున్నాడు.