About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

మహాభారతకథ-14

 

పరీక్షిత్తుమహారాజుకి శాపము

    కౌరవవంశం నాశనమవుతున్న సమయంలో అర్జునుడి కుమారుడు అభిమన్యుడు, విరాటమహారాజు కూతురు ఉత్తర దంపతులకి ధర్మస్వరూపుడైన పరీక్షిత్తు జన్మించాడు.

    పరీక్షిత్తు మహారాజు కుమారుడు జనమేజయుడు. ఒకరోజు ఉదంకుడు వచ్చి జనమేజయుడితో అతడి తండ్రి పరీక్షిత్తు మహారాజు మరణించాడని చెప్పాడు. జనమేజయ మహారాజు మంత్రుల్ని పిలిచి అది ఎలా జరిగిందో చెప్పమని అడిగాడు. జరిగిన విషయాన్ని మంత్రులు జనమేజయుడికి వివరించారు.

  పరీక్షిత్తు మహారాజు ధర్మం, అర్ధం, కామం అనే పురుషార్ధాల్ని అతిక్రమించకుండా... ప్రజలకి ఏ కష్టమూ కలగకుండా... భూమి మీద ఉన్న ప్రజలందర్నీ కాపాడుతూ అరవై సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. పాండురాజు కొడుకు అర్జునుడు. అర్జునుడి కొడుకు అభిమన్యుడు. అభిమన్యుడి కొడుకు పరీక్షిత్తు. పరీక్షిత్తు కొడుకు జనమేజయుడు. ఆ వంశంలో పాండురాజుకి వేటంటే చాలా ఇష్టం. అలాగే పరీక్షిత్తుకి కూడా వేటంటే చాలా ఇష్టం.

   ఒకరోజు అడవికి వెళ్లి పెద్ద పెద్ద జంతువుల్ని వేటాడుతున్నాడు. తన బాణంతో దెబ్బతిన్న ఒక లేడి పారిపోతుంటే దాన్ని తరుముకుంటూ చాలా దూరం వెళ్లిపోయాడు. ఒక చోట శమీకుడు అనే పేరుగల మహర్షి తపస్సు చేసుకుంటూ కనిపించాడు. పరీక్షుత్తు శమీకుడితో మహర్షీ! నేను బాణంతో కొట్టడం వల్ల లేడికి దెబ్బ తగిలింది. ఆ లేడి ఇటువైపు వచ్చిందా?” అని అడిగాడు. శమీకుడు తపస్సులో ఉండడం వల్ల పరీక్షిత్తు మాటలు వినలేదు. అందుకని అతడి ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. తను అడిగినదానికి బదులు చెప్పలేదని పరీక్షిత్తుకి శమీకుడి మీద కోపం వచ్చి దగ్గర్లో చచ్చి పడి ఉన్న ఒక పాముని తన బాణం కొసతో తీసి శమీకుడి మెడలో వేసి వెళ్లిపోయాడు.

   శమీకుడి కుమారుడు శృంగి. అతడు శివుడి సేవకుడైన భృంగితో సమానమైనవాడు. గొప్ప తపస్సంపన్నుడు. అతడికి కోపం చాలా ఎక్కువ. జరిగినదాన్ని చూసిన కృశుడు అనే ముని బ్రహ్మకోసం తపస్సు చేస్తున్న శృంగి దగ్గరికి వచ్చి పరీక్షిత్తుమహారాజు శమీకుడి మెడలో చచ్చిన పాముని వేసి వెళ్లిపోయాడని చెప్పాడు.

   మౌనంగా తపస్సు చేసుకుంటున్న ముసలివాడైన తన తండ్రి మెడలో చచ్చిన పాముని వేసి వెళ్లినందుకు పరీక్షిత్తు మహారాజు మీద శృంగికి చాలా కోపం వచ్చింది. “నా తండ్రి మెడలో చచ్చిన పాముని వేసిన పరీక్షిత్తు అనే పేరుగల మహారాజు నేటి నుంచి ఏడు రోజుల్లో తక్షకుడు అనే పాము విషం వల్ల మరణించుగాక! అని శాపం ఇచ్చాడు.

   తరువాత తన తండ్రి దగ్గరికి వెళ్లాడు శృంగి. మెడలో చచ్చిన పాము వేలాడుతున్నా తెలియని స్థితిలో ధ్యానంలో మునిగి ఉన్నాడు శమీకుడు. శృంగి తండ్రి మేడలో ఉన్న పాముని తీసి పారేశాడు. కళ్లు తెరిచి చూశాడు శమీకుడు. శృంగి జరిగిన విషయాన్ని తండ్రికి వివరించాడు.  అది విని శమీకుడు చాలా బాధపడి నాయనా! నువ్వు చేసిన పని చాలా తప్పు. కోపమే తపస్సుని, అణిమ, లఘిమ అనబడే అష్టసిద్ధుల్ని పోగొడుతుంది. ధర్మ కార్యాలు చెయ్యవలసిన మునులకి కోపం ఉండచ్చా? ఓర్పు లేని మహర్షి చేసిన తపస్సు; అహంకారి దగ్గరుండే ధనము; ధర్మం తప్పిన రాజుకి చెందిన రాజ్యము పగిలిన కుండలో పోసిన నీళ్లు బయటికి పోయినట్లు ఎందుకూ పనికి రాకుండా పోతాయి.

  మహర్షులకి ఏది ఉండకూడదో అదే కోపంతో నువ్వు ఓర్పు లేకుండా భూమండలం మీద ఉన్న ప్రజలందర్నీ రక్షిస్తున్న ధర్మాత్ముడైన పరీక్షిత్తు మహారాజుని శపించి పొరపాటు చేశావు. రాజులు రక్షిస్తున్నారు కనుకనే మహర్షులు తీవ్రమైన తపస్సు చేస్తూ, వేదాల్లో చెప్పబడిన ధర్మాలు నిర్వర్తిస్తూ గొప్ప శక్తి కలిగి ఉంటున్నారు. అటువంటి రాజులకి కీడు చెయ్యడం కంటే మించిన పాపం ఏదీ ఉండదు. పరీక్షిత్తు మహారాజు అంటే సామాన్యుడు అనుకున్నావా? భూమిని పాలించిన వాళ్లల్లో క్షత్రియ కులానికి చెందిన రాముడు, మాంధాత, రఘుమహారాజు కూడా పరీక్షిత్తు మహారాజు పాలించినట్టు పాలించలేదు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే నాలుగు వర్ణాల ప్రజల్ని తమ ధర్మాలు తప్పకుండా ఉండేలా వాళ్లకంటే ఎక్కువగా కాపాడుకుంటూ వస్తున్నాడు.

   వేటపైన ఆసక్తి వల్ల అలిసిపోయి ఆకలి, దప్పికల వల్ల తెలియని స్థితిలో ఉండి నన్ను అవమాన పరిచాడు. అది కావాలని చేసిన పని కాదు. నేను అతడి ప్రశ్న విని కూడా సమాధానం ఇవ్వలేదని పొరపాటు పడ్డాడు. నువ్వు అతడికి ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకో!” అన్నాడు. తండ్రి మాటలు విని శృంగి  “తండ్రీ! నా శాపం జరిగే తీరుతుంది. వెనక్కి తీసుకోడం నాకు చాతకాదు! అన్నాడు.

   శమీకుడు మనస్సులో బాధపడుతూ గౌరముఖుడు అనే పేరుగల శిష్యుణ్ని పిలిచి పరీక్షిత్తు మహారాజు దగ్గరికి వెళ్లి అతడికి శృంగి ఇచ్చిన శాపం గురించి చెప్పి తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పుని చెప్పి  పంపించాడు.

   గౌరముఖుడు రాజు దగ్గరికి వెళ్లి మహారాజా! మీరు ఏకాగ్రతతో తపస్సు చేసుకుంటున్న మా గురువుగారి మెడలో చచ్చిన పాముని వేసి వచ్చారు. అది చూసిన అయన కుమారుడు శృంగి ఏడు రోజుల్లో మీరు తక్షకుడు అనే పాము విషంతో మరణించాలని శాపమిచ్చాడు. ఆ విషయం తెలిసిన మా గురువుగారు బాధపడి జాగ్రత్తగా ఉండమని మీకు చెప్పి రమ్మని నన్ను పంపించారు” అని చెప్పి వెళ్లిపోయాడు.

   గౌరముఖుడు చెప్పినదాన్ని విని పరీక్షిత్తు తను చేసిన ధర్మ విరుద్ధమైన పనికి బాధపడ్డాడు. శమీకుడి ఓర్పుకి మెచ్చుకున్నాడు. శృంగి ఇచ్చిన శాపానికి భయపడి తనను రక్షించుకోడానికి చెయ్యవలసిన కార్యక్రమాల గురించి మంత్రులతో సంప్రదించాడు. భూమికంతటికీ ప్రభువైన పరీక్షిత్తు నేర్పరులైన వడ్రంగుల్ని పిలిపించాడు. ఒంటిస్తంభంతో మేడ కట్టించమని ఆజ్ఞాపించాడు. రాత్రి పగలు తనను విడవకుండా నమ్మకంగా ఉండే ఆప్తులు, సేవకులు, మంత్రులు మొదలయిన వాళ్లని రక్షణకి ఏర్పాటు చేసుకుని ఒంటిస్తంభం మేడలో నివసించాడు. విషాన్ని పోగొట్టే మంత్రాలు తెలిసినవాళ్లని, విషవైద్యుల్ని రప్పించుకున్నాడు. విధిని ఎవరూ తప్పించలేరు.

 

మహాభారతకథ-13

 

జరత్కారుడు వృత్తాంతము

  జరత్కారుడు అనే పేరుగల మహర్షి యాయావరము’ అనే వంశంలో జన్మించాడు. అతడు గొప్ప కఠినమైన నియమనిష్ఠలు కలవాడు, బ్రహ్మచారి. మళ్లీ మళ్లీ జన్మలు పొందడం ఇష్టం లేక సంసార బంధంలో చిక్కుకోకుండా బ్రహ్మచారిగానే ఉండిపోవాలని నిశ్చయించుకున్నాడు.

   తపస్సు చెయ్యడం, వేదాలు చదవడం, బ్రహ్మచర్యం వంటివాటితో ఋషుల ఋణం తీర్చుకుంటున్నాడు. ఒకరోజు నీటి ఒడ్డున తిరుగుతూ ఎలుకలు తినేసి ఒక్కవేరు మాత్రమే మిగిలి ఉన్న చెట్టుని, ఆ చెట్టు కొమ్మకి తలకిందులుగా వ్రేలాడుతూ సూర్యకిరణాల్ని భోజనం చేస్తూ జీవిస్తున్న కొంతమంది ఋషుల్ని చూశాడు. వాళ్లతో  అయ్యా! తలకిందులుగా చెట్టుకొమ్మని పట్టుకుని వేలాడుతూ తపస్సు చేసే విధానం కూడా ఉందా? ఇంత భయంకరమైన తపస్సు గురించి నేను ఎప్పుడూ వినలేదు. దాని గురించి చెప్తే ఆ తపస్సుని కూడా నేను చేస్తాను! అని అడిగాడు.

   తపస్సంపన్నుడా! మా తరువాత సంతానం లేకపోవడం వల్ల; ఎటువంటి ఆధారం లేక; పాపలోకాలకి వెళ్లలేక; గొప్ప తపసంపన్నులమై ఉండి కూడా ఇటువంటి హీన స్థితిలో ఉన్నాము. మా వంశంలో జరత్కారుడు అనే పేరుతో ఒకడు పుట్టాడు. అతడు పెళ్లి చేసుకుని సంతానం పొందుతేనే గాని మాకు విముక్తి కలగదు. అతడు పెళ్లి చేసుకోడానికి అంగీకరించడు. మేము అతడి తాత తండ్రులం. మేము పట్టుకుని వెళ్లాడుతున్న ఔరుగడ్డి దుబ్బువేళ్లన్నీ యముడి వల్ల తెగిపోతున్నాయి. ఇంక ఒక్క వేరు మాత్రం మిగిలి ఉంది. జరత్కారుడు సంతానం పొందకపోతే ఆ వేరు కూడా తెగిపోతే మేము అధోలోకాలకి వెళ్లిపోతాం. అతడు సంతానం పొందితే మేము పైలోకాలకి చేరుకుని మోక్షాన్ని పొందుతాము. నువ్వు ఎవరివో మాకు తెలియదు కాని, ఓర్పుతో మేము చెప్పినదాన్ని విన్నావు. నీకు మా జరత్కారుడు కనిపిస్తే అతడికి మా బాధ గురించి చెప్పు” అన్నారు.

   పితృదేవతల మాటలు విని జరత్కారుడు తను తప్పకుండా పెళ్లి చేసుకోవాలని, తనకు కలిగిన సంతానం వల్ల వాళ్లకి విముక్తి కలిగించాలని నిర్ణయించుకున్నాడు. వాళ్లతో  “పితృదేవతలారా! నేనే జరత్కారుడు అనే పేరుగల మీ కొడుకుని. మీరు నా పితృదేవతలు. మిమ్మల్ని నేను పూజించాలి. అది మీ కొడుకుగా నా ధర్మం. ఇంతవరకు నేను పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. ఇలా వేలాడుతున్న మిమ్మల్ని చూశాక నేను చేస్తున్న బ్రహ్మచర్యం వల్ల మీరు ఎంత బాధ పడుతున్నారో అర్థం చేసుకున్నాను. నేను పెళ్లి చేసుకుని మంచి సంతానాన్ని పొంది మీ బాధని పోగొడతాను అన్నాడు.

   అది విని పితృదేవతలు చాలా సంతోషంతో నాయనా! యోగ్యులైన కొడుకుల్ని పొంది ధర్మమార్గం విడిచి పెట్టకుండ నడుచుకునే ఆ కొడుకుల ద్వారా లోకంలో తమ పేరు నిలబడినప్పుడు పితృదేవతలు మంచి లోకాలు పొందుతారు. అంతేకాని, యజ్ఞాలు చెయ్యడం వల్ల, ఎక్కువగా దక్షిణలు ఇవ్వడం వల్ల పితృదేవతలు మంచి లోకాలకు చేరలేరు. అందుకే నువ్వు పెళ్లి చేసుకుని సంతానాన్ని పొందాలి! అని చెప్పారు.

జరత్కారుడు-జరత్కారువుల పెళ్లి

   పితృదేవతలు చెప్పినది విని జరత్కారుడు పితృదేవతలతో  నా పేరుతో సమానమైన పేరుగల కన్యతో వివాహం జరగాలని ఆశీర్వదించండి! అని వాళ్లకి నమస్కరించాడు.  తరువాత అటువంటి పేరుగల కన్యకోసం భూమండలమంతా తిరిగాడు. కాని తన పేరుతో సమానమైన పేరుగల కన్య అతడికి భూలోకంలో ఎక్కడా దొరకలేదు.

   జరత్కారుడు కన్యకోసం వెతుకుతున్న విషయం వాసుకి తెలుసుకున్నాడు. తన చెల్లెలు జరత్కారువుని తీసుకుని తన సేవకులతో కలిసి జరత్కారుడి దగ్గరకి వెళ్లాడు. ఆయన్ని కలిసి ధర్మాత్ముడా! లోకపూజ్యుడా! బ్రాహ్మణశ్రేష్ఠుడా! జరత్కారు మహర్షీ! మీ వంశం గొప్ప పుణ్యం చేసుకుంది. మీకూ మా చెల్లెలికీ పేర్లు, గుణాలు కలవడం వల్ల మా వంశం కూడా ధన్యమైంది. మా చెల్లెలు జరత్కారువు అనే కన్యని మీకు భిక్షగా ఇస్తున్నాను. మెను ఇష్టంతో స్వీకరించి పెళ్లి చేసుకోండి అన్నాడు.

   వాసుకి చెప్పిన మాటలు విన్న జరత్కారుడు తను కోరుకున్నట్టుగా తన పేరు కలిసిన జరత్కారువుని పెళ్లి చేసుకున్నాడు. మొదటి రోజే అమెతో  నువ్వు  నన్ను అగౌరవంగా చూసిన రోజు నేను నిన్ను విడిచిపెట్టి వెళ్లిపొతాను!” అని చెప్పాడు. ఆ రోజు నుంచి జరత్కారువు భయభక్తులతో భర్తకి సేవ చేస్తోంది. ఆమె జీవితం కత్తి మీద సాములా తయారయింది. భర్తకి భక్తితోను ఇష్టంతోను సేవ చేస్తూ కొంతకాలానికి గర్భవతి అయింది.

   ఒకరోజు జింకచర్మం మీద కూర్చున్న జగత్కారువు తొడ మీద తల పెట్టుకుని నిద్రపోతున్నాడు జగత్కారుడు. సాయంకాలమయింది. ఆశ్రమంలో ఉన్న ఋషులందరూ సాయంకాలం చెయ్యవలసిన సంధ్యావందన కార్యక్రమాలు చెయ్యడం కోసం బయలుదేరారు. తన భర్తని నిద్ర లేపితే నిద్రాభంగమైందని కోపగిస్తాడేమో...లేపకపోతే సంధ్యాకాలంలో చెయ్యవలసిన పనులు చెయ్యకపోతే ధర్మానికి భంగమైందని కోపగిస్తాడేమో... అని భయపడుతూ మనస్సులో కూడా ధర్మానికి భగం కలగకూడదన్న నిశ్చయంతో  జరత్కారుణ్ని నిద్ర లేపింది.

   నిద్ర నుంచి లేచిన జరత్కారుడు నాకు నిద్రాభంగం ఎందుకు చేశావు?” అని అడిగాడు కోపంగా. ఆమె చెప్పిన కారణం విని  నేను నిద్ర లేవకుండా సూర్యుడు పడమటి కొండకి వెళ్లడానికి భయపడతాడని నీకు తెలియదా? నన్ను నిద్ర లేపి అవమానం చేశావు కనుక, ఇంతకు ముందు నీకు చెప్పినట్టే నిన్ను విడిచి వెళ్లిపొతున్నాను.  సూర్యుడితోను, అగ్నితోను సమానమైన కాంతి కలిగి, మన రెండు వంశాల్ని ఉద్ధరించ కలిగిన శక్తితో నీకు కుమారుడు జన్మిస్తాడు. నువ్వు నీ అన్న దగ్గరే ఉండు, అక్కడ ఏ భయము ఉండదు అని చెప్పి జరత్కారుడు తపస్సు చేసుకునేందుకు అడవికి వెళ్లిపోయాడు.

   జరత్కారువు జరత్కారుడు చెప్పినట్టే వాసుకి దగ్గరే ఉండి పోయింది. కొంతకాలానికి జరత్కారువుకి గొప్ప తేజస్సుతో ఆస్తీకుడు జన్మించాడు. అతడు పెరిగి పెద్దవాడై చ్యవన మహర్షి కుమారుడు ప్రమతి దగ్గర వేదవేదాంగాలు నేర్చుకున్నాడు. ప్రశాంతమైన మనస్సుతో అన్ని శాస్త్రాలు తెలుసుకుని పెరిగి పెద్దవాడయ్యాడు.

 

మహాభరతకథ-12

                                            తల్లి శాపానికి బాధపడిన శేషుడు - వాసుకి

   పాములకి తెలియకుండా ఇంద్రుడు అమృతాన్ని తీసుకుని వెళ్లిపోయాడు. అమృతం తాగే యోగం పాములకి లేకుండా పోయింది. జరిగినదానికి శేషుడు బాధపడ్డాడు. తన తల్లి, తమ్ముళ్లు ధర్మవిరుద్ధమైన పనులు చెయ్యడం వల్ల ఇంత అవమానాన్ని పొందవలసి వచ్చింది.

   దు:ఖంతో ఇల్లు వదిలి తపస్సు చేసుకోడానికి గంధమాదన పర్వతానికి వెళ్లిపోయాడు.  గోకర్ణక్షేత్రం, పుష్కరారణ్యం, హిమాచలం మొదలైన పుణ్యక్షేత్రాల్లో అనేక వేల సంవత్సరాలు బ్రహ్మ గురించి తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. ఏ వరాలు కావాలో కోరుకోమన్నాడు.

   “బ్రహ్మదేవా! నా తల్లి కద్రువ, తమ్ముళ్లు కలిసి, నా సవతి తల్లి  వినతని, సోదరుడు గరుత్మంతుణ్ని అనేక విధాలుగా అవమానించారు. వాళ్లు ఎప్పటికీ మారరు. ఇవన్నీ చూస్తూ వాళ్లతో కలిసి ఉండడం నాకు ఇష్టం లేదు. తపస్సు చేస్తూ ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తాను!” అన్నాడు.

   అతడి మాటలు విని బ్రహ్మ “నాయనా! నువ్వు ఎప్పుడూ సత్యాన్ని మాట్లాడతావు. ధర్మబద్ధంగా జీవిస్తావు. దేన్నైనా భరించగల శక్తి, ఓర్పు కలవాడివి. ఈ భూమి మొత్తం భారాన్ని నువ్వే పద్ధతిగా మొయ్యాలి. వినత కుమారుడు గరుత్మంతుడు చాలా గొప్ప పరాక్రమవంతుడు. కశ్యపుడు, వాలఖిల్యులు మొదలైన  మునులతో వరాలు పొందిన పక్షిరాజు. ఇంద్రుణ్ని కూడా ఓడించి అందరితో పొగడ్తలు అందుకున్నాడు. నువ్వు తెలివిగా ఉండి అతడితో స్నేహంగా ఉండడం నీ విధిగా అనుకో!” అని నచ్చ చెప్పాడు బ్రహ్మ.

   శేషుడు బ్రహ్మ చెప్పినట్టుగా భూమి యొక్క సమస్త భారాన్ని మోస్తున్నాడు. గరుత్మంతుడితో స్నేహంగా మెలుగుతూ ప్రశాంతంగా జీవిస్తున్నాడు.

   తమ తల్లి కద్రువ ఇచ్చిన శాపం వల్ల జనమేజయుడు సర్పయాగం చెయ్యబోతున్నాడని పాముల్లో ముఖ్యుడైన వాసుకి అనే పేరుగల పాము తెలుసుకున్నాడు. సర్పయాగంలో తమకు కలగబోయే వినాశనాన్ని తలుచుకుని బాధపడుతున్నాడు. చుట్టాలందర్నీ పిలిపించాడు. ఐరావతుడు అనే పేరు గల తన సోదరులందరినీ కూడా పిలిచి తన బాధ చెప్పుకున్నాడు.

   శేషుడు చాలాకాలం తపస్సు చేసి విశాలమైన  భూమిని మొయ్యడం అనే గొప్ప పనిలో ఉండిపోయాడు. మనతో స్నేహాన్ని బంధుత్వాన్ని విడిచి పెట్టి తనంతట తాను ఒంటరిగా ఉండిపోయాడు. మనందరికీ ఆపద రాబోతోందని తెలిసి కూడా మన భయాన్ని పోగొట్టే పని ఏదయినా చెయ్యాలన్న ఆలోచనే అతడి మనసుకి కలగడం లేదు.

   అమృతం కోసం సముద్రాన్ని చిలికినప్పుడు మంథర పర్వతానికి అల్లెత్రాడుగా ఉండి నేను పడిన కష్టానికి అందరూ మెచ్చుకుని నాకు ఏ భయమూ లేకుండా ఉండేట్టు వరం ఇచ్చారు. నా గురించి నాకు భయం లేదు.

    కాని, మన తల్లి కద్రువ ఇచ్చిన శాపం వల్ల మన నాగజాతికే వినాశనం కలుగబోతోంది. అందుకే నేను చాలా దు:ఖపడుతున్నాను. మన జాతికి కలగబోయే ఉపద్రవాన్ని ఆపడానికి ఏదైనా ఉపాయం ఉందా? ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? అని వాసుకి మిగిలిన పాముల్ని సలహా అడిగాడు.

   వాసుకి కంటే చిన్నవైన పాములు కొన్ని “అంత భయమెందుకు? జనమేజయుడు యాగం మొదలుపెట్టినప్పుడు అది జరగకుండా అడ్డు పడదాం. జనమేజయుడు ధర్మపరుడు కనుక మనం బ్రాహ్మణ రూపాల్లో వెళ్లి ఈ యాగాన్ని ఆపమని చెప్తే వింటాడు. ఈ యాగం చెయ్యడం వల్ల ఇహపర సౌఖ్యాలకి అనేక ఆటంకాలు కలుగుతాయని నచ్చచెప్దాం.

   మనమందరం ఒకే మాట మీద ఉండి ఋత్విక్కులు కూడా యాగాన్ని వదిలి పారిపోయేలా చేద్దాం. యాగానికి వచ్చిన వాళ్లందరికీ పెట్టే భక్ష్యాలు, భోజ్యాలు, లేహ్యాలు, పానీయాలు అనబడే నాలుగు రకాలైన ఆహార పదార్థాల మీద విషాన్ని చిమ్ముదాం. సభలో ఉండే బ్రాహ్మణుల మీద పరుగులు పెడదాం. ఋత్విక్కులు యాగం చెయ్యడం మానేసి భయంతో పారిపోయేలా చేద్దాం! అన్నాయి.

   వాళ్ల మాటలు విన్న పెద్ద పాములు అది అంత తేలికైన పని కాదు. బ్రాహ్మణులు మంత్రాలు చదువుతూ అగ్నిలో నెయ్యి వేసేటప్పుడు పైకి లేచే అగ్ని జ్వాలలు ఎంత ఎత్తున లేస్తాయో మనం ఊహించలేం. ఆ సమయంలో మనం అనుకున్నట్టు జరుగుతుందని ఊహించవద్దు! అన్నాయి.

   వాటిలో ఏలాపుత్రుడు అనే నాగ కుమారుడు కద్రువ పాములకి శాపం ఇచ్చే రోజున నేను ఆమె ఒడిలో నిద్ర రాకపోయినా నిద్రపోతున్నట్టు కళ్లు మూసుకుని ఉన్నాను. అప్పుడు గొప్ప గొప్ప దేవతలు, బ్రహ్మ ఒకళ్లతో ఒకళ్లు మాట్లాడుకున్న మాటలు విన్నాను. అవి మీకు వివరంగా చెప్తాను వినండి.

   తల్లి కద్రువ పాములకి శాపం ఇచ్చిన వెంటనే దేవతలందరూ బ్రహ్మతో తండ్రీ! కద్రువ ఎంతో బలపరాక్రమాలు కలిగిన తన కుమారుల్ని భయంకరంగా శపించింది. దాన్ని ఎవరూ అడ్డుకోలేదు. ఈ శాపానికి వేరే మార్గం ఏమైనా ఉందా? అని అడిగారు.

   వాళ్లు అడిగినదానికి బ్రహ్మ లోకానికి హాని కలిగించే క్రూరమైన పాములు భూమాతకి బరువుగా అనిపిస్తున్నాయి. అందుకే భూమికి భారం తగ్గించడం కోసం సర్పయాగం చెయ్యడం వల్ల పాములకు కలిగే నాశనానికి అంగీకరించ వలసి వచ్చింది.

   వాసుకి చెల్లెలైన జరత్కారువుకీ, జరత్కారుడు అనే గొప్ప మహర్షికీ వివాహం జరగాలి. వాళ్లిద్దరికీ గొప్ప తేజస్సుతో పుట్టే ఆస్తీకుడు అనే మహర్షి జనమేజయుడి యాగాన్ని ఆపగలడు. అలా జరిగినప్పుడు లోకానికి మంచిని చేసే ప్రముఖులైన నాగులు రక్షింపబడతారు అని దేవతలకి చెప్పిన విషయాన్ని చెప్పాడు.

   నాగులందరు అది విని సంతోషంతో ఏలాపుత్రుణ్ని ఎత్తుకుని పొగిడారు. ఎప్పుడు జరత్కారుడు వస్తాడో ఎప్పుడు తన చెల్లెలు జరత్కారువుని భార్యగా స్వీకరిస్తాడో అని వాసుకి ఎదురు చూస్తున్నాడు.

 

మహాభారతకథ-12


మహాభారతకథ-11

 

                                                         గరుత్మంతుడు-దేవతలు యుద్ధము

    మనస్సుకంటే మించిన వేగంతో గరుత్మంతుడు అమృతం దగ్గర కాపలాగా ఉన్న దేవ ప్రముఖుల దగ్గరకు వచ్చాడు. విశాలమైన రెక్కలు గలవాడు, పక్షిజాతికి రాజు, గొప్ప బలవంతుడు అయిన గరుత్మంతుణ్ని చూసి అమృతం దగ్గర కాపలాగా ఉన్న దేవతలు  భయపడి బాణాలతోను, రకరకాలైన శస్త్రాస్త్రాలతోను యుద్ధం మొదలుపెట్టారు.

   గరుడుడు తన రెక్కల్ని విదిలించి వర్షం కురిపించినట్టు దుమ్ము వర్షం కురిపించాడు. స్వర్గలోకం మొత్తం ధూళితో కప్పబడి దేవతలకి ఎదీ కనిపించకుండా చీకటిగా అయిపోయింది.అమృతానికి కావలిగా ఉన్న దేవతలు ఇంద్రుడికి మొర పెట్టుకున్నారు. ధూళి మొత్తం పోయేలా చెయ్యమని ఇంద్రుడు వాయుదేవుణ్ని పంపించాడు. వాయుదేవుడు గాలి గట్టిగా వీచేలా చేసి దుమ్మంతా పోగొట్టాడు.

   అక్కడ కావలిగా ఉన్న భౌమనుడు గొడ్డలి, వజ్రం, ఈటె, విల్లు, బాణం, కంపం, చక్రం అనే అయుధాలు ధరించిన తన సైన్యాన్ని తీసుకుని గరుత్మంతుణ్ని ఎదుర్కున్నాడు. కాని, అగ్నిలా మండిపోతున్న గరుత్మంతుడి కోపాగ్నిలో పడి మాడిన మిడతలా కాలి బూడిదయ్యాడు. అతడి సైన్యాన్ని కూడా రెక్కలతోను, ముక్కు కొనతోను, కాళ్ల గోళ్లతోను రక్తం ధారలు కట్టేట్టు చేస్తున్నాడు గరుత్మంతుడు.  దేవతలందరూ పరుగులు పెడుతూ ఇంద్రుడి దగ్గరికి వెళ్లారు.

   సాధ్యులు అనే దేవతాగణం తూర్పు దిక్కుకి పారిపోయారు. వసువులు, రుద్రులు దక్షిణ దిక్కుని ఆశ్రయించారు. పన్నెండు మంది సూర్యులు దిగులుతో పడమటి దిక్కుకి జారిపోయారు. అగ్ని, వరుణుడు, వాయువు, కుబేరుడు, యముడు రాక్షసుడైన  నైర్రుతి అనే దిక్పాలకుడు దిక్కు తెలియకుండా పారిపోయారు.

   రేణువు,  క్రథనుడు, ప్రలిహుడు, ప్రరుజుడు, అశ్వకృంతుడు, పదనఖుడు, అనే కావలివాళ్లని తన వజ్రం వంటి గోళ్లతో గరుత్మంతుడు చీల్చి ముక్కలుగా చేసాడు. చివరికి యుద్ధం ముగిసింది. దేవతా ప్రముఖులందర్నీ ఓడించాడు గరుత్మంతుడు. అమృతం ఎక్కడ ఉందో తెలుసుకుని అక్కడికి వెళ్లాడు.

  ఆకాశాన్నే మింగ కలిగినంత  పెద్ద పెద్ద మంటలతో తన నాలుకలు చాపి అగ్ని అమృతాన్ని కాపలా కాస్తున్నాడు. అగ్నిని చూసిన గరుత్మంతుడు వేగంగా వెళ్లి అన్ని నదుల్లో ఉన్న నీటిని తన నోటిలో ఉంచుకుని తీసుకుని వచ్చి అగ్ని మీద పోసి చల్లార్చాడు.

   పదునైన అంచులతో వేగంగా తిరుగుతున్న యంత్రానికి అడుగున అమృతం చాలా జాగ్రత్తగా ఉంచబడింది. గరుడుడు తన పెద్ద ఆకారాన్ని తగ్గించుకుని చిన్నగా మారి యంత్రం అంచుల కిందకి దూరి వెళ్లాడు. అతి ఎవరేనా అమృతం దగ్గరికి వస్తే విషాన్ని చిమ్ముతూ అమితమైన కోపంతో నిప్పుకణాల్లా ఎర్రగా ఉన్న కళ్లతో కాపలా కాస్తున్న రెండు భయంకరమైన పాములు కనిపించాయి.

   గరుత్మంతుడు తన రెండు రెక్కల్ని వేగంగా విదిలించాడు. వాటి నుంచి వచ్చిన దుమ్ముకి పాములకి కళ్లు కనిపించలేదు. అదే సమయంలో వాటి తలల మీద కొట్టి అతి బలవంతుడైన గరుత్మంతుడు అమృతాన్ని తీసుకుని ఆకాశంలోకి ఎగిరిపోయాడు.

గరుత్మంతుడు-విష్ణుమూర్తి- ఇంద్రుడు

   ఇంతమంది దేవప్రముఖుల్ని, అతి వీరుల్ని ఓడించి అమృతాన్ని తీసుకుని వెడుతున్న గరుత్మంతుడికి దాన్ని తాగాలని కొంచెం కూడా అనిపించలేదు. దాని వైపు కూడా చూడకుండా దాన్ని ఎవరి కోసం సంపాదించాడో వాళ్లకి ఇవ్వడానికి ఆకాశంలో ఎగురుతూ వెళ్లిపోతున్న గరుత్మంతుణ్ని చూశాడు విష్ణుమూర్తి.

   అతడి అంకితభావానికి, శౌర్యానికి , వేగానికి, అనాసక్తికి, మంచితనానికి ఆనందించిన విష్ణుమూర్తి  గరుత్మంతుణ్ని  కావలసిన వరాలు కోరుకోమన్నాడు. గరుత్మంతుడు శ్రీమహావిష్ణువుకి నమస్కరించి “దేవా! అమృతం తాగకుండానే ముసలితనం, మరణం రాకుండా ఉండేట్లు, అన్ని లోకాల్లోను పూజింపబడే నీయందు భక్తి కలిగి ఉండేటట్టు అనుగ్రహించు!” అని వేడుకున్నాడు.

   విష్ణుమూర్తి అతడు అడిగిన వరాలు ఇచ్చి తనకు వాహనంగాను, జండాగాను ఉండేటట్లు కూడా అనుగ్రహించాడు. తరువాత విష్ణుమూర్తికి నమస్కరించి గరుత్మంతుడు ఆకాశంలోకి ఎగిరిపోయాడు.

   ఇంద్రుడు అతడి మీదకి తన వజ్రాయుధాన్ని విసిరాడు. గరుత్మంతుడి రెక్కలు నరికెయ్యడానికి ఆకాశంలో నిప్పుకణాలు ఎగురుతున్నాయేమో అనిపించేంత వేగంగా వెళ్లింది వజ్రాయుధం. దాన్ని చూసి గరుత్మంతుడు నవ్వి “నువ్వు నన్ను కనీసం తాకలేవు కూడా! గొప్ప తపస్సంపన్నుడైన దధీచి మహర్షి వెన్నెముకతో చెయ్యబడిన నీ మీద గౌరవంతో, నీకు అవమానం జరగకూడదని ఒక్క ఈక మాత్రం తీసుకుని వెళ్లిపోడానికి అవకాశమిస్తున్నాను. ఇంతకంటే నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు” అన్నాడు.

   అతడి రెక్కల బలానికి అబ్బురపడి వజ్రాయుధం అతణ్ని సువర్ణుడు’ అని స్తుతించింది. ఇంద్రుడు  పక్షిరాజు గొప్పతనానికి ఆశ్చర్యపడి “సాటిలేని పరాక్రమం కలిగిన గరుత్మంతుడా! ఇంత బలపరాక్రమాలు కలిగిన వాడిని ఇంతవరకు నేను చూడలేదు. నాకు నీతో స్నేహం చెయ్యాలని ఉంది. నువ్వు ముసలితనం, మరణము లేనివాడివని; ఇంతటివాడివి, అంతటివాడివి అని పొగడడానికి కూడా అందనివాడివి. నీకు అమృతం ఎందుకు?

   అమృతాన్ని తీసుకుని వెళ్లి నువ్వు ఎవరికి ఇస్తావో వాళ్లని దేవతలు కూడా జయించలేరు. నువ్వు ఈ అమృతాన్ని ఇతరులెవ్వరికీ ఇవ్వకూడదు. దాన్ని నాకు ఇచ్చేస్తే నీకు కావలసింది నేనే చేసి పెడతాను” అన్నాడు.

   దేవేంద్రుడి మాటలు విని “దేవేంద్రా! అమృతం తీసుకుని వస్తానని కద్రువ పిల్లలు పాములకి మాట ఇచ్చాను. దీన్ని పాములకి ఇస్తే నా తల్లి  వినతకి దాస్యం తొలగి పోతుంది. నేను ఈ అమృతం తీసుకుని వెళ్లి నా తల్లిని దాస్యం నుంచి విడిపించాలి. నేను దీన్ని తీసుకుని వెళ్లి పాములకి ఇస్తాను. అవి తాగక ముందే నువ్వు వచ్చి అమృతాన్ని తీసుకుని వెళ్లిపో!” అని ఇంద్రుడికి ఉపాయం చెప్పాడు గరుత్మంతుడు.

   అతడు చెప్పిన ఉపాయానికి ఇంద్రుడు మెచ్చుకుని “నీ బలపరాక్రమాలు చెప్తావా? వింటాను” అని అడిగాడు. అది విని గరుడుడు “ఇంద్రా! ఇతరుల్ని నిందించడం, తనను తాను మెచ్చుకోవడం సజ్జనులు చేసే పని కాదు కదా! అయినా నువ్వు అడిగావు కనుక చెప్తాను. అవి విన్నాక నువ్వు ఆశ్చర్యపోతావు. నాకు నిజంగా ఉన్న లక్షణాల్నే నీకు చెప్తాను.

    కదలగలిగిన, కదలలేని పదార్థాలతో నిండి ఉన్న ఈ భూమండలాన్ని నాకున్న బలంతో మొయ్యగలను. నా బలమైన రెక్కల నుంచి వచ్చే గాలితో అన్ని సముద్రాల్లో ఉన్న నీళ్లని, అందులో ఉన్న రత్నాలతో సహా బయటికి వెదజల్లగలను. ముల్లోకాల్ని ఒక్క క్షణంలో చుట్టి రాగలను!” అని చెప్పాడు.

  ఇంద్రుడు అతడు చెప్పినది విని అతడి వేగానికి, బలానికి, శక్తికి మెచ్చుకుని “నువ్వు నాతో స్నేహంగా ఉంటావా? నువ్వు నాకు ఇష్టమైన పని చేశావు. నేను కూడా నీకు ఇష్టమైన పని చేస్తాను. నీకు ఏం కావాలో అడుగు” అన్నాడు.

   ఇంద్రుడి మాటలు విని గరుత్మంతుడు “అమితమైన గర్వంతో నా తల్లికి అపకారం చేసిన కద్రువ కుమారులు పాముల్ని నాకు ఆహారంగా చెయ్యి!  నేను తినలేక నిన్ను అడగట్లేదు. నువ్వు రక్షిస్తున్న లోకాల్లోనే పాములు  తిరుగుతున్నాయి. నీ ఆజ్ఞ తీసుకోవడం ధర్మం కనుక అడుగుతున్నాను” అని చెప్పాడు. పాములు తనకు ఆహారంగా ఉండేలా  ఇంద్రుడి దగ్గర అనుజ్ఞ తీసుకుని ఇంద్రుడితో సహా పాముల దగ్గరికి వచ్చాడు. తను తెచ్చిన అమృతాన్ని మరకతమణుల్లా పచ్చగా మెరిసిపోతున్న దర్భల మీద పెట్టాడు.

   పాముల్ని పిలిచి “దేవేంద్రుడి దగ్గరికి వెళ్లి అమృతాన్ని తెచ్చాను. కనుక సూర్యుడు, అగ్ని, గాలి, చంద్రుడు మొదలైన వాళ్లందరి సాక్షిగా నా తల్లి వినత దాసితనం పోయింది. మీరందరు పవిత్రంగా స్నానం చేసి వచ్చి ఈ అమృతాన్ని తాగండి” అని చెప్పాడు. తరువాత  పక్షిరాజు గరుత్మంతుడు తల్లి వినతని తన వీపు మీద కూర్చోబెట్టుకుని, ఎవరికీ కనిపించకుండా దాక్కుని ఉన్న దేవేంద్రుడి వైపు చూసి వెళ్లిపోయాడు.

    పాములన్నీ అమృతం తాగాలని ఉత్సహంతో స్నానం చెయ్యడానికి వెళ్లాయి. అవి అటు వెళ్లగానే ఇంద్రుడు అమృతాన్ని తీసుకుని స్వర్గలోకం వెళ్లిపోయి దాన్ని ఒక సురక్షిత ప్రాంతంలో పెట్టాడు.

   దర్భల మీద ఉన్న అమృతం తాగాలని స్నానం చేసి వచ్చిన పాములు తమ నాలుకలతో దర్భల మీద నాకాయి. అందువల్ల పాముల నాలుకలు రెండుగా చీలిపోయాయి. అమృతాన్ని త మీద ఉంచడం వల్ల దర్భలు మాత్రం పవిత్రమయ్యాయి.

   పాముల నాలుకలు చీలి ఉండడానికి కారణం, దర్భలు పవిత్రత పొందడానికి కారణం తెలిసిందిగా!

 

మహాభారత కథ-10-

 

గరుత్మంతుడు కథలు

గరుత్మంతుడు-అమృతము

   గరుత్మంతుడు తన తల్లిని దాసీతనం నుంచి విముక్తురాల్ని చెయ్యాలని అనుకున్నాడు. పాములతో సంప్రదించాడు. విముక్తుల్ని చెయ్యాలంటే తమకి అమృతం తెచ్చి ఇవ్వాలని చెప్పాయి. గరుత్మంతుడు అందుకు అంగీకరించాడు.     పాములకి ఇవ్వడానికి అమృతం తీసుకుని వస్తానని చెప్పి తల్లికి నమస్కరించి ఆమె ఆశీర్వాదం తీసుకున్నాడు. నాయనా! నీ పెద్ద శరీరరాన్ని సూర్యుడు రక్షిస్తాడు. పెద్ద పెద్ద రెక్కల్ని వాయువు, వీపుని చంద్రుడు, తలని అగ్ని రక్షిస్తారు. విజయాన్ని కీర్తిని పొందుతావు! అని దీవించింది తల్లి వినత.

   తల్లి దగ్గర ఆశీర్వాదం తీసుకుని వెడుతున్న గరుడుడు తల్లితో అమ్మా! నేను చెయ్యబోతున్న పని చాలా కష్టమైంది. నాకు చాలా బలం కావాలి కనుక, తినడానికి ఏదేనా చూపించు! అని అడిగాడు. వినత నాయనా! సముద్రగర్భంలో ఉన్న బోయల సమూహం వల్ల ప్రజలకి హాని కలుగుతోంది. వాళ్లని నువ్వు ఆహారంగా తీసుకో! దాని వల్ల నీకు ఆకలి తీరుతుంది. ప్రజలకి మేలు కలుగుతుంది. వాళ్లని తినేప్పుడు నువ్వు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్లల్లో ఎవరికీ హాని తలపెట్టని బ్రాహ్మణులు ఉంటారు. వాళ్లని మాత్రం తినకుండా విడిచిపెట్టు!” అని చెప్పింది.

   అది విని గరుత్మంతుడు అమ్మా! వాళ్లల్లో బ్రాహ్మణుడు ఎవరో తెలుసుకోవడం ఎలా?” అని అడిగాడు.  నాయనా! గాలం అనే సాధనం మింగేటప్పుడు కంఠం దగ్గర గుచ్చుకుని బాధ పెడుతుంది కదా! అలాగే బ్రాహ్మణుడు కంఠం దగ్గర గుచ్చుకుంటూ నిప్పులా వేడిగా కాలుస్తుంటాడు.  కోపం వచ్చినప్పుడు బ్రాహ్మణుడు పదునైన ఆయుధంగాను, విషంగాను, నిప్పుగాను మారిపోతాడు.  బ్రాహ్మణుణ్ని గౌరవంగా చూస్తే ప్రజలకు మంచి కలిగేలా చేస్తాడు, గురువుగా ఉంటాడు, ఇష్టాన్ని నెరవేరుస్తాడు! అని బ్రాహ్మణుడి లక్షణాల్ని అతడికి అర్థమయ్యేలా చెప్పింది వినత. తల్లి చెప్పినట్టు గరుత్మంతుడు సముద్రం మధ్యలో ఉన్న బోయల్ని అందర్నీ తినేసి మళ్లీ అమృతం కోసం బయలుదేరాడు. అతడికి ఆకలి మాత్రం తీరలేదు.

గరుత్మంతుడు-ఏనుగు-తాబేలు

     అమృతం కోసం వెడుతున్న గరుత్మంతుడు మధ్యలో తపస్సు చేసుకుంటున్న తండ్రి దగ్గరికి వెళ్లి  తండ్రీ! నాకు చాలా ఆకలిగా ఉంది. తినడానికి ఏదయినా కావాలి! అని అడిగాడు.  అతడి తండ్రి కశ్యపబ్రహ్మ నాయనా! అగ్నితో సమానమైనవాడు, నియమనిష్ఠలు కలిగినవాడు విభావసుడు అనే పేరుగల బ్రాహ్మణుడు ఉన్నాడు. అతడు తన పెద్దలు సంపాదించి పెట్టిన ధనంతో సుఖంగా జీవిస్తున్నాడు.   అతడి తమ్ముడు సుప్రతీకుడు. ఒకరోజు అతడు తన అన్న విభావసుడి దగ్గరికి వెళ్లి తాత తండ్రులు సంపాదించి ఇచ్చిన ధనంలో తనకు కూడా భాగం పంచి ఇమ్మని అడిగాడు.

   ధనం మొత్తం తనకే కావాలని తమ్ముడికి ఇవ్వకూడదని అనుకున్న విభావసుడు తమ్ముణ్ని  ఏనుగుగా మారమని శపించాడు. తమ్ముడు సుప్రతీకుడు అన్నని తాబేలుగా మారిపొమ్మని శపించాడు.  ఇద్దరూ ఒకళ్లని ఒకళ్లు శపించుకోవడంవల్ల సుప్రతీకుడు మూడు ఆమడల పొడవు, పది ఆమడల పరిధితో తాబేలుగాను, విభావసుడు ఆరు ఆమడల పొడవు, పన్నెండు ఆమడల వెడల్పుతో ఏనుగుగాను మారిపోయారు. మారినవెంటనే ఏనుగు అడవిలోకి, తాబేలు చెరువులోకి వెళ్లిపోయాయి.

   పూర్వజన్మలో ఇద్దరి మధ్య ఉన్న విరోధం వల్ల వాళ్లిద్దరూ ఇప్పటికీ పోట్లాడుకుంటూనే ఉన్నారు. వాళ్లిద్దరి వల్ల వాళ్లకే కాదు ఎవరికీ ఉపయోగంలేదు. వాళ్లని తినేసి నీ ఆకలి తీర్చుకో!” అని చెప్పాడు.  వెంటనే గరుత్మంతుడు తన బలమైన రెక్కలతో ఏనుగుని, తాబేల్ని వెతికి పట్టుకుని రెండింటినీ ఒకేసారి పైకి ఎత్తి పాదాలతో బంధించి ఆకాశంలోకి ఎగిరిపోయాడు.   ఆకాశ మార్గంలో వెడుతున్న అతడికి సంపంగి పూల తీగలు చుట్టుకుని, దేవతా వృక్షాలతో ఎంతో మనోహరంగా ఉన్న ’అలంబ’ అనే పర్వతం కనిపించింది. ఆ పర్వతం మీద రోహిణము అనే పెద్ద దేవతా వృక్షం ఉంది. ఆ దేవతా వృక్షం గరుత్మంతుణ్ని గౌరవంగా పిలిచి వినతకుమారా! వంద ఆమడల పొడవుతో ఉన్న నా చెట్టు కొమ్మ మీద ఆగి ఏనుగుని, తాబేలుని తిని నీ ఆకలిని తీర్చుకుని వెళ్లు!” అని చెప్పింది.

   గరుత్మంతుడు అది చెప్పినట్టు ముందు కొమ్మ మీద కూర్చుని ఆకలి బాధ తీర్చుకుని వెడదామనుకుని కొమ్మ మీద కాలు మోపాడు. అతడి బరువుకి  ఫెళ్లుమని పెద్ద శబ్దం చేస్తూ కొమ్మ విరిగిపోయింది. ఆ ధ్వనికి దిక్కులు కంపించి పోయాయి.  చెట్టు మీద నివసిస్తున్న పక్షుల గుంపులు భయంతో పారిపోయాయి. సూర్యకిరణాలని ఆహారంగా తీసుకుంటూ వాలఖిల్యులు అనే మహర్షులు అదే కొమ్మని ఆధారంగా చేసుకుని తలకిందులుగా ఉండి తపస్సు చేసుకుంటున్నారు. ఆ కొమ్మ భూమి మీద పడితే మహర్షులకి బాధ కలుగుతుంది. అందువల్ల గరుత్మంతుడు ఆ కొమ్మని నోటికి కరుచుకుని, ఏనుగుని తాబేలుని పాదాలతో పట్టుకుని ఆకాశంలోకి ఎగిరాడు.

   తను నిలబడడానికి ఎక్కడేనా చోటు దొరుకుతుందేమోనని ఎంత వెతికినా ఎక్కడా కనిపించ లేదు.  గంధ మాదన పర్వతం మీద తపస్సు చేసుకుంటున్న తన తండ్రి దగ్గరికి వెళ్లి నమస్కరించాడు.  మేరుపర్వతంతో సమానమైన శరీరము, వాయువునే జయించ కలిగినంత గొప్ప వేగము, ఊహించలేనంత శక్తి, వెలుగుతున్న అగ్నికి ఉండేంత తేజస్సు కలిగిన వినత కుమారుడు గరుత్మంతుణ్ని, అతడి నోటిలో ఉన్న చెట్టు కొమ్మని, దానికి అతుక్కుని తలకిందులుగా వేలాడుతున్న పవిత్రులైన వాలఖిల్యులు అనే మహర్షుల్ని చూశాడు కశ్యపబ్రహ్మ.

   వాలఖిల్య మహర్షుల్ని చూసి “మహానుభావులారా! ఈ గరుత్మంతుడు లోక రక్షకుడు, గొప్ప బలవంతుడు. మీకు బాధ కలగకూడదని ఈ చెట్టుకొమ్మని వదలి పెట్టకుండా నోటికి కరుచుకుని తిరుగుతున్నాడు. దయతలచి మీరే ఈ కొమ్మని వదిలి వేరొక చోటికి వెళ్లి అతణ్ని అనుగ్రహించండి!” అని వేడుకున్నాడు. వాలఖిల్యమునులు కశ్యపుడి ప్రార్థన విని ఆ చెట్టు కొమ్మని వదిలి పెట్టి హిమాలయ పర్వతానికి వెళ్లిపోయారు.

    గరుత్మంతుడు చెట్టు కొమ్మ నోటిలో ఉండడం వల్ల మాటలు సరిగా పలక లేక పలుకుతూ తండ్రీ! ఈ చెట్టుకొమ్మ నా నోటికి అడ్డుగా ఉంది. బ్రాహ్మణులు లేని అడవి ప్రాంతం ఎక్కడ ఉందో చెప్పండి. అక్కడకి వెళ్లి దీన్ని వదిలి పెట్టాలి! అని అడిగాడు.  అతడి మాటలు విన్న కశ్యపబ్రహ్మ “నాయనా! హిమాలయాల్లో నిష్పురుష అనే కొండ ఉంది. అక్కడికి వెళ్లడం ఈశ్వరుడికి కూడా కష్టమే. ఆ కొండ గంధమాదన పర్వతానికి లక్ష ఆమడల దూరంలో ఉంది. ఈ చెట్టు కొమ్మని అక్కడ విడిచిపెట్టు! అని చెప్పాడు. తండ్రి మాటలు విని గరుత్మంతుడు మనో వేగం కంటే మించిన వేగంతో ఎగురుతూ వెళ్లి ఆ చెట్టు కొమ్మని  నిష్పురుషం అనే పర్వతం మీద విడిచి పెట్టాడు. తరువాత హిమాచల పర్వతం మీదకి వెళ్లి ఏనుగుని, తాబేలుని తిని  బలాన్ని పెంచుకుని తన పని మీద స్వర్గలోకానికి బయలుదేరాడు.  అతడు రెక్కలు విదిలించగానే  రెక్కల వేగం నుంచి వచ్చిన గాలికి ఆ పర్వతం మీద ఉన్న వృక్షాలకు పూసిన పువ్వులన్నీ జయం కలగాలని ఆశీర్వదిస్తూ జలజలా గరుత్మంతుడి మీద వర్షంలా పడ్డాయి.

వాలఖిల్య మహర్షుల వృత్తాంతము

   గరుత్మంతుడు ఆకాశమార్గంలో ఇంద్రుడి రక్షణలో ఉన్న అమృతం తీసుకుని రావడం కోసం  బయలుదేరాడు. ఆ సమయంలో స్వర్గలోకంలో అనేక దుశ్శకునాలు కనిపించాయి.  వాటిని చూసి ఇంద్రుడు దేవతల గురువైన బృహస్పతిని కలుసుకుని మహర్షీ! ఇటువంటి దుశ్శకునాలు కలగడానికి కారణం ఏమిటి? అని అడిగాడు.   బృహస్పతి ఇంద్రుడితో “గరుత్మంతుడు బ్రహ్మజ్ఞానం కలిగిన కశ్యప ప్రజాపతి ఇచ్చిన వరం వల్ల వినతకి పుట్టిన కొడుకు. ఇతడు వాలఖిల్యులు అనే మహర్షుల దయతో పక్షి జాతికి రాజుగా ప్రసిద్ధి పొందాడు.  సముద్రం లోపల నివసించే అతి భయంకరులైన బోయల్ని పూర్తిగా తినేసిన వీరుడు. ఏనుగుని, తాబేలుని, రోహిణమనే వృక్షం యొక్క కొమ్మని ఒకేసారి పట్టుకుని ఆకాశంలో ఎగరకలిగిన బలము, వాయువేగము కలవాడు.

   తన తల్లి యొక్క దాసితనాన్ని పోగొట్టడం కోసం అమృతాన్ని తీసుకుని వెళ్లడానికి సాహసంతో వస్తున్నాడు. తనకిష్టమైన రూపాన్ని ధరించ గలడు, ఇష్టమైన ప్రదేశానికి  వెళ్లగలడు. అతణ్ని నువ్వు జయించలేవు. గరుత్మంతుడి గొప్పతనం నీకు కూడా తెలుసు.  పూర్వం కశ్యప ప్రజాపతి సంతానం పొందడం కోసం పుత్రకామేష్టి చేశాడు. అప్పుడు నీతో సహా అందరు దేవతలు, వాలఖిల్యులు అనే మహర్షులు ఆయనకి సహాయపడ్డారు. ఆ యజ్ఞం జరుగుతున్న సమయంలో నువ్వు నీ బలానికి తగినట్టు సమిధల్ని వీపుమీద మోసుకుని వచ్చావు. అదే సమయంలో బొటనవేలంత ఆకారంలో బలహీనులుగా ఉన్న వాలఖిల్యులు అనే మహర్షులు మోదుగ కట్టెల మోపుల్ని, దర్భల మోపుల్ని మొయ్యలేక, శ్రమతో వణుకుతూ తీసుకుని రావడం చూసి నువ్వు నవ్వావు.

   ఆ మహర్షులు కోపంతో  “ఎప్పుడూ యుద్ధంలో విజయాన్నే పొందేవాడు, అగ్నికి ఉన్నంత తేజస్సు కలవాడు, అణిమాది గుణాలు కలిగినవాడు, వీరులకే వీరుడైనవాడు, ఇంద్రుడికంటే వంద రెట్లు ఎక్కువ బలం కలవాడు, ఎవరితోను జయింపబడనివాడు అయిన బలవంతుడు జన్మిస్తాడు. అతడు రెండవ ఇంద్రుడుగా ప్రకాశిస్తాడు” అని అగ్నిహోత్రంలో హోమం చేశారు.  అది తెలుసుకున్న నువ్వు అలా జరగకుండ ఉండేలా చూడమని కశ్యప ప్రజాపతిని ప్రార్థించావు. వాలఖిల్య మహర్షులతో కశ్యపుడు మహర్షులారా! తన బాహుబలంతో అన్ని జీవరాసుల్నీ కాపాడడం కోసం బ్రహ్మ ఇంద్రుణ్ని నియమించాడు. రెండవ ఇంద్రుడు ఏర్పడితే అన్నీ తారుమారవుతాయి. ఇలా చెయ్యడం తగిన పని కాదు.

   మీరు అన్న మాటలు జరిగే తీరతాయి. కనుక, నాకు పుట్టబోయే కుమారుడు పక్షి జాతికే ఇంద్రుడు(రాజు) అవుతాడు!” అని చెప్పి వాలఖిల్య మహర్షుల్ని అంగీకరించేలా చేశాడు. ఇంద్రుడు ఒక్కడే ఉండేట్లు చేశాడు.

    కశ్యప ప్రజాపతి చేసిన పుత్రకామేష్టి యాగ ఫలితంవల్ల, వాలఖిల్యుల చేసిన తపస్సు యొక్క ఫలితం వల్ల జన్మించినవాడు గరుత్మంతుడు. పక్షులకు రాజైన ఆ గరుత్మంతుడే ఇప్పుడు అమృతాన్ని తీసుకుని వెళ్లడానికి వస్తున్నాడు. అందువల్లనే స్వర్గలోకంలో ఇన్ని దుశ్శకునాలు కనిపిస్తున్నాయి” అని చెప్పాడు.   బృహస్పతి చెప్పింది విని ఇంద్రుడు అమృతాన్ని రక్షిస్తున్న వాళ్లని అందర్నీ రప్పించి అమృతాన్ని జాగ్రత్తగా కాపాడమని ఆజ్ఞాపించి పంపించాడు. అనేక రకాల రూపాలు కలిగిన వీరులు, పదునైన కత్తులు మొదలైన ఆయుధాలు, నలుపు, ఎరుపు, తెలుపు, పసుపు మొదలైన రంగుల్లో ఉన్న కవచాలు ధరించి అమృతానికి కాపలాగా ఉన్నారు.  వాళ్లందరూ రాత్రి, పగలు కంటిమీద కునుకు లేకుండా అమృతం చుట్టూ ఉండి కాపలా కాస్తున్నారు.

 

మహాభారత కథ-9

 

సముద్ర మథనము

    అమృతం తాగడం వల్ల మరణం ఉండదని దేవతలకి తెలిసింది. ఏమయినా సరే అది ఎలా దొరుకుతుందో తెలుసుకుని దాన్ని తాగాలని అనుకున్నారు. పాలసముద్రాన్ని చిలికితే అందులోంచి అమృతం వస్తుంది. కాని, అది అంత తేలికైన పని కాదు. రాక్షసులకి కూడా నచ్చచెప్పి తమతో కలుపుకుంటే సముద్రాన్ని చిలకడం తేలిక అవుతుంది.

   అమృతం దొరికాక దాన్ని రాక్షసులే తాగేస్తేనో? దేవతలకి సందేహం వచ్చింది. అప్పటి సంగతి అప్పుడు చూసుకోవచ్చు. ముందు పాలసముద్రాన్ని చిలకడానికి రాక్షసుల సాయం అడగాలని అనుకున్నారు. దేవతలకీ రాక్షసులకీ ఎప్పుడూ పడదు. ఒకళ్లతో ఒకళ్లు పోట్లాడుకుంటూనే ఉంటారు. అయినా సరే, అమృతం తాగాలన్న కోరిక దేవతల్ని ఒకచోట నిలబడనియ్యడం లేదు.

  ఒకరోజు దేవతలందరూ రాక్షసుల దగ్గరికి వెళ్లారు. అమృతం తాగితే మరణం ఉండదని, ఎప్పుడూ హాయిగా జీవించే ఉండచ్చని నచ్చ చెప్పారు. చివరికి పాలసముద్రాన్ని చిలికి అమృతాన్ని పొందడానికి తాము సహాయం చేస్తామన్నారు రాక్షసులు.

   ఇంద్రుణ్ని తీసుకుని అందరూ కలిసి మేరు పర్వతం మీదకి వెళ్లారు. పాలసముద్రాన్ని చిలకడానికి సన్నాహాలు మొదలుపెట్టారు. అంత పెద్ద సముద్రాన్ని చిలకాలంటే దానికి సరిపడినంత కవ్వం కావాలి. కవ్వం దొరికినా దానికి తిరగడానికి తాడు కావాలి. ఈ రెండూ దొరికినా కవ్వం భూమిలో కూరుకుని పోకుండా దానికి కింద ఆధారం కావాలి. ఏం చెయ్యాలా.. అని అనేక విధాలుగా ఆలోచిస్తున్నారు.

   ఏదయినా సాధించాలి అనుకుంటే ముందు పట్టుదల ఉండాలి, తరువాత దానికి తగిన జ్ఞానం ఉండాలి, అవసరమైన పరికరాలు ఉండాలి. దేవతలు, రాక్షసులు అమృతం తాగాలన్న పట్టుదలతో ఉన్నారు. ఎలా చేస్తే అమృతాన్ని పొందవచ్చో ముందుగా తెలుసుకున్నారు. పరికరాల కోసం ఆలోచిస్తూ బ్రహ్మ,  విష్ణువుల్ని కలిసి సలహా అడిగారు.

   అన్ని పర్వతాల్నీ కలిపితే ఎంత పొడవు ఉంటుందో అంత పొడవుతోను, వంకర లేకుండాను, కదలకుండా స్థిరంగాను, తన మీద పెరిగే మూలికల రసంతో దృఢంగాను, అన్ని పర్వతాల కంటే పెద్దదిగాను ఉన్న  మంథర పర్వతాన్ని పాలసముద్రం చిలకడానికి కవ్వంగా ఉపయోగించమని సలహా ఇచ్చారు.

   భూమి పైకి పదకొండు యోజనాలు, భూమి లోపలికి పదకొండు యోజనాలు ఉన్న మంథర పర్వతాన్ని సర్పరాజు ఆది శేషుడు పెల్లగించాడు. దేవతలు రాక్షసులు కలిసి దాన్ని మోసుకుని వచ్చి సముద్రంలో పడేశారు. వెంటనే అది సముద్రంలో పైకి నిలవకుండా లోపలికి కూరుకుని పోయింది.

   పర్వతం కదలకుండా ఉండడానికి ఏం చెయ్యాలని విష్ణుమూర్తిని సలహా అడిగారు. మంథర పర్వతం సముద్రంలో కూరుకుని పోకుండా దాని అడుగున కూర్మావతారంతో తనే ఆధారంగా ఉంటానన్నాడు.

   మంథర పర్వతాన్ని కవ్వంగాను, కూర్మావతారంలో ఉన్న విష్ణుమూర్తిని దానికి ఆధారంగాను ఏర్పాటు చేసుకున్నారు.  కాని, కవ్వాన్ని తిప్పాలంటే తాడు కావాలిగా? బాగా ఆలోచించి... చాలా పొడవుగా ఉండే వాసుకి అనే పేరుగల పాముని తెచ్చి తాడుగా చేసుకున్నారు. వాసుకి మంథర పర్వతాన్ని చుట్టలుగా చుట్టుకున్నాడు.

   రాక్షసులు సర్పరాజు తలవైపు బలంగా పట్టుకున్నారు. దేవతలు వాసుకి తోక భాగాన్ని పట్టుకున్నారు. దేవతలు, రాక్షసులు కూడా అమృతాన్ని తాగే తీరాలి అనే పట్టుదలతో పాలసముద్రాన్ని చిలకడం మొదలు పెట్టారు.

   వాళ్లు పడుతున్న శ్రమని చూసి వాళ్లకి ఉన్న శక్తి సరిపోదనుకున్నాడు విష్ణుమూర్తి. అందుకని వాళ్లకి ఇంకా కొంత శక్తిని, వేగాన్ని ఇచ్చాడు. ఒకళ్లనొకళ్లు జబ్బలు చరుచుకుంటూ; ఉత్సాహ పరుచుకుంటూ; అంతకు ముందు కంటే ఎక్కువ వేగంతో కవ్వాన్ని తిప్పుతూ; పాలసముద్రాన్ని చిలుకుతున్నారు.  

   వాళ్ల కష్టానికి ఫలితం దక్కలేదు. ముందు విషం పుట్టి లోకాలన్నింటినీ దహించేస్తూ అన్ని వైపులకీ వ్యాపించించడం మొదలుపెట్టింది. భయపడి పరుగులు పెడుతూ అందరూ శివుడి దగ్గరికి వెళ్లారు.

   శివుడు ఆ విషాన్ని తన కఠంలో బంధించి ఉంచాడు. దేవతలు, రాక్షసులు పాలసముద్రం దగ్గరికి వెళ్లి మళ్లీ చిలకడం మొదలు పెట్టారు. వాళ్లల్లో అమృతాన్ని తాగాలన్న పట్టుదల ఇంకా పెరిగిపోయింది.

   ఈసారి జ్యేష్టాదేవి, చంద్రుడు, లక్ష్మీదేవి, ఉచ్ఛైశ్రవము అనే పేరుతో తెల్లని గుర్రము, కౌస్తుభమణి, అమృతంతో నిండిన కమండలంతో దేవ వైద్యుడు, ఐరావతమనే పేరుగల తెల్లని ఏనుగు ఇంకా అనేకమంది వ్యక్తులు, వస్తువులు, జంతువులు మొదలైనవన్నీ పుట్టాయి.

   వాటిలో ముల్లోకాలతో పూజింపబడుతున్న లక్ష్మీదేవి, సూర్యకిరణాల కాంతి కంటే ఎక్కువ కాంతితో ప్రకాశించే కౌస్తుభమణి విష్ణుమూర్తి వక్షస్థలం మీదకీ; ఉచ్ఛైశ్రమనే గుర్రము, ఐరావతమనే ఏనుగు ఇంద్రుడి దగ్గరికీ చేరుకున్నాయి.

   ఇంకా పట్టుదలతో పాలసముద్రాన్ని చిలుకుతూనే ఉన్నారు. చివరికి అమృతాన్ని సాధించారు. వాళ్ల ఆనందానికి అవధులు లేవు. సంతోషంతో ఉప్పొంగిపోయారు.

   అమృతం సాధించిన తరువాత దేవదానవుల మధ్య యుద్ధం జరిగింది. దాన్ని గురించి తెలుసుకుందాం...

   పాలసముద్రాన్ని చిలికినప్పుడు వచ్చిన అమృతాన్ని రాక్షసులు తీసేసుకున్నారు. దేవతలు ఊరుకుంటారా? ఆ విషయం విష్ణుమూర్తికి చెప్పారు. విష్ణుమూర్తి తక్కువవాడా? వెంటనే అందమైన మోహిని రూపంలో రాక్షసుల దగ్గరికి వచ్చాడు. రాక్షసులు అందంగా ఉన్న మోహినిని చూసి అమృతం గురించి మర్చిపోయి మోహిని వెంట పడ్డారు. అమృతం విష్ణుమూర్తి చేతికి వచ్చింది.

   మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి దేవతల్ని ఒకవైపు, రాక్షసుల్ని ఒకవైపు కూర్చోమన్నాడు. తనే స్వయంగా అందరికీ అమృతం పంచుతానని చెప్పాడు. దేవతలు, రాక్షసులు మోహిని చెప్పినట్టే కూర్చున్నారు. 

   మోహిని దేవతల వైపు అమృతం పంచుతుంటే వాళ్లు తాగుతున్నారు. రాక్షసుడు రాహువు కూడా దేవతల వరుసలో కూర్చున్నాడు. చంద్రుడు, సూర్యుడు అతణ్ని చూసి విషయం మోహినికి చెప్పారు. అప్పటికే మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి రాహువుకి అమృతం పోసేశాడు.

   సూర్య చంద్రులు చెప్పింది విని విష్ణుమూర్తి వెంటనే తన చక్రంతో రాహువు తల నరికేశాడు. అతడు తాగుతూ ఉన్న అమృతం అతడి కంఠం దగ్గరే ఉండిపోయింది. అప్పటికి ఇంకా రాహువు అమృతాన్ని మింగలేదు.

   రాహువు శరీరం భూమి మీద పడిపోయింది. తల భాగం మాత్రం అమృతం తాకడం వల్ల నాశనం లేకుండా ఉండిపోయింది. అప్పటినుంచే రాహువుకి సూర్య చంద్రులతో విరోధం ఏర్పడింది. అది ఇప్పటికీ నడుస్తూనే ఉంది.

   అమృతం తమకి పొయ్యలేదని రాక్షసులకి కోపం వచ్చింది. అందరూ కలిసి తమకు రాజైన బలిచక్రవర్తిని కలుసుకుని జరిగిన విషయం మొత్తం చెప్పుకున్నారు. బలిచక్రవర్తితో సంప్రదించి చివరికి ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ దేవతలతో మనకి స్నేహం వద్దు, యుద్ధం చేసి అమృతాన్ని తెచ్చుకుందామని అనుకున్నారు.

  యుద్ధమంటే రాక్షస జాతికి చాలా ఇష్టం. వెంటనే రథాలు, గుర్రాలు, ఏనుగులు, కాలిబలం సిద్ధం చేసుకున్నారు. భయంకరమైన ఆకారాలతో పెద్ద పెద్ద కేకలు వేస్తూ దేవతల మీదకి యుద్ధానికి వెళ్లారు.

   దేవతల మీద ఆపకుండా బాణాలు వేశారు. ఆ బాణాలు దేవతల్ని భయంకరంగా చుట్టుముట్టాయి. అది చూసిన దేవతలు విష్ణుమూర్తితో సహా యుద్ధానికి దిగారు.  పెద్ద పెద్ద పర్వత శిఖరాల మీద ఎక్కి రాక్షసుల మీద బాణవర్షం కురిపించారు.

   పై నుంచి ఆగకుండా మీద పడుతున్న బాణాలకి రాక్షసులు పెద్ద పెద్ద కేకలు వేస్తూ కూలబడి పోతున్నారు. విష్ణుమూర్తి ప్రయోగించిన చక్రానికి రాక్షసుల తలలు తెగి పడుతున్నాయి. యుద్ధరంగం మొత్తం రాక్షసుల రక్తంతో నిండి పోయింది.

   సముద్రపు ఒడ్డు దగ్గర జరుగుతున్న యుద్ధంలో రాక్షసులు ఓడిపోయారు. మరణించగా మిగిలిన రాక్షసులు సముద్రం అడుగుకి వెళ్లిపోయారు. అమృతాన్ని జాగ్రత్తగా కాపాడమని ఇంద్రుడికి అప్పగించి దేవతలందరూ తమ ప్రదేశాలకి వెళ్లిపోయారు.