About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

మహాభారతకథ-సంచికలో ధారావాహికంగా నడుస్తున్న ప్రచురణ

 

మహాభారతంలో  వ్యాసమహర్షి

      మన దేశం భారతదేశం. ధర్మాధర్మాల్ని బోధించిన గ్రంథం.. వ్యాసమహర్షి చెప్పగా విఘ్నేశ్వరుడు రాసిన గ్రంథం మహాభారతం. సంస్కృతంలో రచించిన ఈ గ్రంథాన్ని నన్నయ తెలుగులో అనువదించడానికి ఉపక్రమించి వెయ్యి సంవత్సరాలు పూర్తయింది. ఇప్పటికీ అదే ప్రమాణాలతో.. అదే పవిత్రతతో.. అదే గౌరవంతో నిలిచి ఉన్న శ్రీమదాంధ్ర మహాభారతంలో మనం తెలుసుకోవలసిన ఎంతో మంది మహర్షులు, గురువులు, రాజులు, ధర్మాత్ములు, దానపరులు, వీరులు, ధీరులు ఉన్నారు. వాళ్లందరి గురించి తెలుసుకోడం మన ధర్మం. ఆ ధర్మమే మనల్ని మంచి మార్గం వైపు నడిపిస్తుంది.. ధర్మాన్ని రక్షిస్తుంది.

   మొదట మహాభారతాన్ని రచించిన కారణ జన్ముడు, పరమేశ్వర స్వరూపుడు, మహర్షుల్లో గొప్పవాడు అయిన వ్యాస మహర్షి గురించి తెలుసుకుందాం. ఆయన్ని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే పెద్ద గ్రంథమే ఉంది. ప్రస్తుతం మహాభారతంలో వ్యాసమహర్షిని గురించి మాత్రమే తెలుసుకుందాం.

   ఆదికాలంలో విష్ణుమూర్తి ప్రజల్ని సృష్టించడం కోసం నాభి నుంచి బ్రహ్మని సృష్టించాడు. మిగిలిన సృష్టి  మొత్తాన్ని బ్రహ్మకి అప్పగించాడు. విష్ణుమూర్తి ముఖం నుంచి వేదాలు ఆవిర్భవించాయి. తన మనస్సు నుంచి అపాంతరతముణ్ని సృష్టించి వేదాలన్నీ నేర్చుకోమని చెప్పాడు విష్ణుమూర్తి.

   అపాంతరతముడు విష్ణుమూర్తి చెప్పినట్లు చేశాడు. విష్ణుమూర్తి అతణ్ని మన్వంతరాల్లో పుట్టి వేదాలు వ్యాపింపచేస్తాడని, విష్ణుతత్త్వం గ్రహించి ముల్లోకాల ధర్మాల్ని తెలుసుకుని గొప్ప ఋషి అవుతాడని, తరువాత కాలంలో వసిష్ఠుడికి మనుమడయిన పరాశరుడికి పుట్టి వేదాలు వ్యాప్తి చేసి, అందరి ధర్మ సందేహాలు తీర్చి లోకహితం కోసం శ్లోకాలుగా రాస్తాడని చెప్పాడు.

   పూర్వం పరాశర మహర్షి తీర్థయాత్రలు చేస్తూ యమునానదీ తీరంలో దాశరాజు కూతురు సత్యవతి నడుపుతున్న నావ ఎక్కి, ఆమెని చూసి ఇష్టపడ్డాడు. దివ్యదృష్టితో ఆమె జన్మవృత్తాంతాన్ని తెలుసుకుని తన కోరిక ఆమెకి చెప్పాడు. వాళ్లకి వేదమయుడైన వ్యాసుడు కలిగాడు. పరాశరుడు కుమారుణ్ని దీవించి సత్యతికి చెప్పి తీర్థయాత్రలకి వెళ్లిపోయాడు.

   వ్యాసుడు లోక కళ్యాణం కోసం తపస్సు చెయ్యడానికి బయలుదేరి తల్లికి నమస్కరించి అమ్మా! మీకు అవసరమైనప్పుడు నన్ను తల్చుకోగానే నేను వస్తాను అని చెప్పి వెళ్లిపోయాడు.

   వ్యాసుడు యమునానదీ తీరంలో పుట్టాడు కనుక కృష్ణద్వైపాయనుడనీ, వేదాలు విభజించాడు కనుక వేదవ్యాసుడనీ, పరాశరుడి కుమారుడు కనుక పారాశర్యుడనీ, సత్యవతి కుమారుడు కనుక సాత్యవతేయుడని పిలవబడ్డాడు. వ్యాసుడు ఒక ఆశ్రమం నిర్మించుకుని శిష్యులకి వేదం నేర్పిస్తున్నాడు.

   కొంతకాలం తర్వాత కురువంశానికి రాజయిన శంతన మహారాజు సత్యవతిని పెళ్లిచేసుకోవాలని అనుకున్నాడు. అతడి మొదటి కొడుకు భీష్ముడు సత్యవతీ శంతనులకి వివాహం జరిపించాడు. శంతనమహారాజుకి చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అని ఇద్దరు కొడుకులు కలిగారు. వాళ్లు పెరిగి పెద్దవాళ్లయ్యాక శంతనుడు మరణించాడు. వాళ్లల్లో చిత్రాంగదుడు గంధర్వులతో యుద్ధం చేసి మరణించాడు. భీష్ముడు విచిత్రవీర్యుడికి పట్టాభిషేకం చేసి పెళ్లి కూడా జరిపించాడు. కొంతకాలానికి విచిత్ర వీర్యుడు కూడా మరణించాడు. ఇద్దరికీ సంతానం లేదు.

      సత్యతి తన కుమారుడు వ్యాసమహర్షిని పిలిచి తన కోడళ్లకి సంతానం కలిగేలా చూడమని లేకపోతే వంశం నాశనం అయిపోతుందని చెప్పి బాధపడింది. వ్యాసమహర్షి అందుకు అంగీకరించి ఒక సంవత్సరం సత్యవతి కోడళ్లు అంబిక అంబాలికల్నిపవిత్రులుగా చెయ్యడానికి వ్రతం చేయించమన్నాడు. తరువాత సత్యవతి కోడళ్లని వ్యాసమహర్షి దగ్గరికి పంపించింది. వ్యాసుడి రూపం చూసి భయపడి కళ్లు మూసుకున్న అంబాలికకి పుట్టుకతో గ్రుడ్డివాడయిన ధృతరాష్ట్రుడు పుట్టాడు. వ్యాసమహర్షి రూపాన్ని చూసి కదలిక లేకుండా నిలబడి పోయిన అంబాలికకి పాండురోగంతో పాండురాజు పుట్టాడు.

   సత్యవతి అంబికకి భయపడవద్దని నచ్చచెప్పి వ్యాసమహర్షి దగ్గరికి మళ్లీ పంపించింది. కాని అంబిక వ్యాసమహర్షి రూపానికి భయపడి తన దాసిని పంపించింది. దాసి వ్యాసమహర్షిని భక్తి శ్రద్ధలతో పూజించింది. ఆమెకి విదురుడు అనే పేరుతో యమధర్మరాజు మహాజ్ఞానిగా పుట్టాడు.

    తరువాత కౌరవులు పాండవులు పుట్టడం పాండురాజు మరణించడం జరిగింది. వ్యాసమహర్షి వచ్చి తల్లితో రాబోయే రోజుల్లో అన్నీ కష్టాలే ఉంటాయి. సంసారం మీద ప్రేమ వదిలి పెట్టి కోడళ్లతో కలిసి తపస్సు చేసుకుని పుణ్యలోకాలకి చేరుకో అన్నాడు. సత్యవతి వ్యాసమహర్షి చెప్పినట్లు తపస్సు చేసుకుని శరీరాన్ని విడిచి పెట్టింది.

   శాలిహోత్రుడి ఆశ్రమంలో ఉన్న కొలనులో స్నానం చేస్తే ఆకలి దాహం ఉండవని, అలా చెయ్యమని లక్క ఇంట్లోంచి బయటపడిన పాండవులతో చెప్పాడు. మత్స్య యంత్రం పడగొట్టిన తరువాత ద్రౌపదిని పాండవులు అయిదుగురికి ఇచ్చి పెళ్లి చెయ్యడానికి ఆలోచిస్తున్న ద్రుపదుడికి ద్రౌపది జన్మ వృత్తాంతం చెప్పి పాండవులతో ద్రౌపది పెళ్లి జరిపించాడు వ్యాసమహర్షి.

   ద్వైతవనంలో ఉన్న పాండవులు భీష్మ, ద్రోణ, కృపాచార్యుల్ని ఓడించడం కష్టమని సందేహిస్తున్న సమయంలో ధర్మరాజుకి ప్రతిస్మృతిఅనే విద్య ఉపదేశం చేశాడు. అదే విద్యని ధర్మరాజు అర్జునుడికి ఉపదేశించాడు. అర్జునుడు తపస్సు చేసి దేవతల నుంచి అస్త్రాల్ని పొందాడు.

   కురుక్షేత్రంలో మహాభారతయుద్ధం జరుగుతున్నప్పుడు కౌరవ పాండవుల్లో జయం ఎవరికి కలుగుతుంది అని ధృతరాష్ట్రుడు అడిగినప్పుడు పాండవులే జయిస్తారని చెప్పాడు. శ్రీకృష్ణుడు చెప్పినట్లు సంధి చేసుకోమని లేకపోతే యుద్ధం తప్పదని చెప్పాడు. యుద్ధ సమయంలో ఎప్పటికప్పుడు యుద్ధ విశేషాలు తెలియచేసే శక్తి సంజయుడికి ఇచ్చి అతడి ద్వారా విషయాలు తెలుసుకోమని కూడా చెప్పాడు.

   యుద్ధంలో అభిమన్యుడి మరణానికి బాధపడుతున్న పాండవుల్ని ఓదార్చాడు వ్యాసమహర్షి. అశ్వత్థామ నారాయణాస్త్రం వ్యర్థమయిందని బాధపడుతున్నప్పుడు నారాయణుడే శ్రీకృష్ణుడని అతడి అంశ అయిన అర్జునుడి మీద పనిచెయ్యదని అతడి అజ్ఞానాన్ని పోగొట్టాడు. అర్జునుడు యుద్ధం చేస్తుంటే తనకంటే ముందు ఒక మహాపురుషుడు శూలంతో రాజుని చంపుతున్నట్లు తను ఊరకే బాణాలు వేస్తున్నట్లు కనిపించింది దానికి అర్థం చెప్పమని అడిగాడు. వ్యాసమహర్షి శంకరుడే కరుణించి అర్జునుడికి సహాయపడ్డడని చెప్పి అర్జునుడిలో శివభక్తి పెంచి శివుణ్ని మనస్సులో తల్చుకుంటూ యుద్ధం చెయ్యమని చెప్పాడు.

   కౌరవులు యుద్ధంలో మరణించినప్పుడు పుత్రుల మీద ప్రేమతో ధృతరాష్ట్రుడు, గాంధారి పాండవుల్నిశపించకుండా కాపాడాడు.  యుద్ధం తరువాత బంధుమిత్రులు, రాజులు పోయినందుకు బాధపడుతున్న ధర్మరాజుకి రాజ్యాన్ని అనాధగా వదిలి బాధపడ్డం ధర్మం కాదని సుద్యుమ్నుడి చరిత్ర, సేనజిత్తుడి మాటలు, ధర్మాధర్మాలు, ప్రాయిశ్చిత్త విశేషాలు, మరుత్తుడి కథ చెప్పి అశ్వమేథయాగం కూడా చేయించాడు వేదవ్యాసుడు.

   వ్యాసుడి ఉపదేశం ప్రకారం ధృతరాష్ట్రుడు ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకుని గాంధారితో కలిసి ఉన్నాడు. పాండవులతో కలిసి ఉన్న ధృతరాష్ట్రుడికి దివ్యదృష్టితో చనిపోయిన వాళ్ళందర్నీ చూడగలిగేలా చేసి ఎవరెవరు ఎక్కడెక్కడికి చేరారో చూపించాడు.

   యాదవస్త్రీలని రక్షించడానికి అస్త్రం తీసిన అర్జునుడికి అస్త్రాలు పనిచెయ్యలేదు. అర్జునుడు వేదవ్యాసుడి పాదాల మీద పడి తన అవమానం గురించి చెప్పి దుఃఖించాడు.

   నాయనా! కృష్ణావతారం అయిపోయాక ఆయన ప్రభావం నీ మీద లేదు. కాలం మనది కానప్పుడు మనం ఏం చేసినా అది కలిసిరాదు. జ్ఞానమున్నవాడివి కనుక విషయాలు తెలుకుని నువ్వు కూడా సర్వసంగ పరిత్యాగం చేసి నీ వాళ్లతో కలిసి ఉత్తమ గతులు పొందుని చెప్పాడు.

   పాండవులు  అందరు శరీరాలు విడిచిపెట్టాక పాండవుల కీర్తి విస్తరింప చెయ్యడానికి రాజుల చరిత్రలు ప్రజలకు తెలియ చెయ్యడానికి, దేవదేవుడి లీలలు, సర్వదేవతల జన్మలు వంటివి ఎన్నో తెలియపరుస్తూ సర్వజ్ఞుడు, సత్యదర్శి సర్వవిజ్ఞానభవుడు అయిన వేదవ్యాసుడు మహాభారతాన్ని పంచమ వేదంగా రచించి మనకి అందించాడు.

   వేదవ్యాసుడు నడిచి వెడుతున్నప్పుడు ఒక పురుగు భయంతో పరుగెడుతూ కనిపించింది. వ్యాసుడు ఆ పురుగుని నీ బతుకే నికృష్టం కదా!  బతికి ప్రయోజనం ఏముంది? చచ్చిపోవడమే సుఖం కదా! భయపడతావెందుకు? అని అడిగాడు.

   పురుగు మహాత్మా! నేను పురుగుని కదా! నాకు అంత విషయ పరిజ్ఞానం ఎక్కడ ఉంటుంది? బతకడమంటే సుఖం, చావడమంటే భయం తప్ప ఇంకేమీ తెలియవు. అన్ని జీవులకి తెలిసేది ఇదే కదా? అంది.  ఆ పురుగు మీద దయ చూపించి  శూద్ర, వైశ్య, క్షత్రియ జన్మలు వరుసగా వచ్చేలా వరమిచ్చాడు.

   విష్ణుప్రభావం వల్ల పుట్టిన వ్యాసమహర్షి బ్రహ్మ చెప్పగా వేదాల్ని నాలుగు భాగాలుగా చేసి ఋగ్వేదం పైలుడికి, యజుర్వేదం వైశంపాయనుడికి, సామవేదం జైమినికి, అధర్వణవేదం సుమంతుడికి చెప్పి, వాళ్ల వాళ్ల శిష్యులతో వ్యాప్తి పొందేలా చేశాడు.

   చతుర్వేదాలు, అష్టాదశ పురాణాలు, చతుర్దశ విద్యలు అన్నీ నేర్చుకుని, బ్రహ్మర్షులు, దేవర్షులు, రాజర్షులు చదివి అందరికీ చెప్పగలిగేలా చేశాడు వేదవ్యాసమహర్షి. పరమేశ్వరుణ్ణి ఆరాధించి పక్షి రూపంలో ఉన్న ఘృతాచి అనే అప్సరసయందు ఒక కొడుకుని పొందాడు. అతడి పేరు శుకుడు. పుడుతూనే అన్ని వేదాలు నేర్చుకున్న శుకుడు తండ్రి దగ్గర సమస్త విషయాలు తెలుసుకుని చివరికి యోగమార్గంలో అంతర్థానమయ్యాడు. ఇంత వరకు మహాభారంలో వ్యాసమహర్షి గురించి తెలుసుకున్నాం. వ్యాసమహర్షి చరిత్ర తెలుసుకోవాలంటే ఒక పెద్ద గ్రంథమే చదవాలి. వ్యాస రచనలు వ్యాససంహిత, వ్యాసస్మృతి. వీటిలో నిత్యకర్మల గురించి అనేక విషయాల చెప్పబడ్డాయి!!        

 

మహాభారతకథ

                                                 మహాభారతం - మహోన్నత భారతం

1. మహాభారతకథ

    మన దేశాన్ని మహోన్నత భారతం' అని చెప్పుకుంటున్నాం కనుక దాని గురించి మనం తెలుసుకోవాలి. భారతజాతి గొప్పతనం తెలుసుకోవడం, తరతరాలకి అందించడం ప్రతి భారత పౌరుడి బాధ్యత. ఎంతోమంది తపస్సంపన్నులు, జ్ఞానవంతులు, త్యాగధనులు, పరాక్రమవంతులు తమకోసం కాకుండా ప్రజల కోసమే జీవించినవాళ్ల గొప్పతనాన్నీ, సంస్కృతీ సంప్రదాయాల్నీ తెలుసుకోకపోతే బారతీయుడు అని ఎలా అనిపించుకుంటాడు?

   కుటుంబంలో ఉండే ప్రతి సభ్యుడు తన తాతముత్తాల గురించి తన వంశ చరిత్ర గురించి తెలుసుకుని ఆ వంశ గౌరవం నిలబెట్టాలి కాబట్టి, మన భారతదేశం మొత్తం ఒక కుటుంబం అని చెప్పుకుంటున్నాం కాబట్టి, మనదేశానికి ఆ పేరు ఎలా వచ్చింది? మనదేశ సంస్కృతి సంప్రదాయాలు ఏమిటి? మనదేశ  ప్రముఖులు ఎవరు? అనే విషయాలు మొత్తం తెలుసుకుని తీరాలి!

   ఇంత మంచి పేరు , పవిత్రత, ఆధ్యాత్మికత, దయాగుణం, పరాక్రమం, పెద్దలయందు పూజ్యభావం, ప్రకృతి ఆరాధన, క్రమశిక్షణ ఇలా ఎన్నో విషయాలతో కలగలిసిన మన సంస్కృతీ సంప్రదాయాల్ని గురించి మనం అన్ని తరాలకి అందించగలగాలి. అప్పుడే మనదేశ ఔన్నత్యం భవిష్యత్తులో కూడా ఈ విశాల విశ్వంలో మహోన్నతంగా నిలుస్తుంది. ఇప్పుడు ఈ మహాభారతకథలు చదవడం వల్ల అనేకమంది పెద్దలు రాసిన ఎన్నో గ్రంథాలు చదవాలన్న ఆసక్తి కూడా పెరుగుతుంది.

    మహాభారతాన్ని సంస్కృత భాషలో వేదవ్యాసుడు వేగంగా అవలీలగా చెప్తుంటే.. అప్పటికప్పుడే అర్థం చేసుకుంటూ, తెలియనివి అడిగి తెలుసుకుంటూ శివశక్తుల కుమారుడు విఘ్నేశ్వరుడు అంతే వేగంగా రాశాడు.

   పూర్వం వేదం మొత్తం ఒక్కటిగా ఉండేది. అలా ఉన్న వేదాన్ని వ్యాసమహర్షి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము అని నాలుగు భాగాలుగా విభజించాడు. అలా చెయ్యమని వ్యాసుడికి బ్రహ్మ చెప్పాడు. వేదాలు విభజించాడు కనుక వ్యాసుణ్ని వేదవ్యాసుడుఅని పిలిచారు.

   తరువాత దాన్ని తన శిష్యులు పైలుడు, వైశంపాయనుడు, సుమంతుడు, జైమిని అనే మహర్షులకి బోధించాడు.  వరుసగా ఒక్కొక్క వేదాన్ని ఒక్కొక్కళ్లకి చెప్పి నాలుగు వేదాల్ని నలుగురితో అధ్యయనం చేయించాడు. నలుగురు శిష్యులూ ఎవరికి బోధించిన వేదాన్ని వాళ్లు సంపూర్ణంగా నేర్చుకున్నారు.

   తపస్సంపన్నుడైన వేదవ్యాసుడు పద్ధెనిమిది పురాణాలు;  నీతిశాస్త్రము; అర్ధశాస్త్రాల అర్థాలు, స్వభావాలు;  నాలుగు వేదాలు, వాటి ఉపనిషత్తుల భావాలు; దర్మార్థకామ మోక్షాలతో అరిషడ్వర్గాలకు సంబంధించిన చక్కటి కథలు;  ఇతిహాసాలు; కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగాల్లో ఉన్న గొప్ప మహర్షుల, రాజుల వంశ చరిత్రలు; బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అని పిలవబడే నాలుగు వర్ణాలు; బ్రహ్మచర్యం, గృహస్థం వానప్రస్థం, సన్యాసం అనే ఆశ్రమాల్లో ఉండే ధర్మాలు వాటి విధానాలు; నాలుగు ముఖాలున్న బ్రహ్మ మొదలైన దేవతలు; మహర్షులతో పూజించబడే శ్రీకృష్ణుడి మహత్యం; పాండవులు మొదలైన భారత శూరుల గుణగణాలు పరిపూర్ణమైన జ్ఞానంతో అందరికీ అర్థమయ్యేలా రచించాడు.

 ఆ మహాభారత కథల్ని ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం!

   అంత మంచి పని చెయ్యమని ఎవరు సలహా ఇచ్చారు అని కదా మీ సందేహం? విమలాదిత్యుడు, రాజరాజచోళుడి కుమార్తె కుందవాంబ దంపతులకి కుమారుడు, పవిత్రమైన మనస్సు, అస్త్రవిద్యలో గొప్ప నేర్పరితనము కలిగి చాళుక్య వంశానికి దీపంలా ప్రకాశించిన మహారాజు రాజరాజనరేంద్రుడు.

    ఒకరోజు నన్నయని పిలిచి నాకు ఎప్పుడూ భారత కథలు వినాలనే ఉంటుంది. గొప్ప పండితుడవైన నన్నయకవీ! వ్యాసమహర్షి  మహాభారతంలో చెప్పిన విషయాల్ని అందరికీ అర్థమయ్యేలా మీకు గల పాండిత్యంతో తెలుగులో వ్రాయండి అని చెప్పాడు.  

   మహాభారత కథలు ఎలా మొదలయ్యాయో తెలుసా... పూర్వం లోకాలకి మంచి జరగాలని బ్రహ్మర్షులందరు సేవిస్తుండగా మహాముని శౌనకుడు పన్నెండు సంవత్సరాలు జరిగే  సత్రము’ అనే యాగాన్ని చెయ్యడం మొదలుపెట్టాడు. అక్కడికి రోమహర్షుడు అనే మహర్షి కుమారుడు  ఉగ్రశ్రవసుడు వచ్చాడు. ఉగ్రశ్రవసుణ్ని సూతమహర్షి అని కూడా అంటారు. ఆయన పురాణ కథలు బాగా చెప్పగలడు.

   ఉగ్రశ్రవసుడు వచ్చి అక్కడ ఉన్న మహర్షులకి నమస్కారం చేశాడు.నేను వ్యాసమహర్షి శిష్యుడైన రోమహర్షణుడు అనే గొప్ప పురాణికుడికి కుమారుణ్ని. పురాణాల్లో ఉన్న పుణ్య కథల్ని అన్నింటినీ చెప్పగలను. మీరు ఏ కథ వినాలని అనుకుంటున్నారో ఆ కథని నేను చెప్తాను అని తనని తను పరిచయం చేసుకున్నాడు.

   మహర్షులందరికీ ఆయన చెప్పే కథలు వినాలని కోరిక కలిగింది. ఆయన్ని శ్రద్ధగా పూజించి ఏ కథ బాగుంటుందో; ఏ కథ కొత్తగా, వింతగా ఉంటుందో; ఏ కథ వింటే సంపూర్ణమైన జ్ఞానం కలుగుతుందో; ఏ కథ పాపాలన్నింటినీ పోగొడుతుందో అటువంటి కథని వినాలని ఉంది చెప్పమని అడిగారు.

    కథలు చెప్తుంటే వినాలని పెద్దవాళ్లకి కూడా ఉంటుందన్నమాట. మహర్షులతో మీకు ఇష్టమైన, పవిత్రమైన ఒక కథ చెప్తాను శ్రద్ధగా వినండి” అన్నాడు సూతమహర్షి. శౌనకుడు మొదలైన మహర్షులందరు సూతమహర్షి చెప్పే కథ వినడానికి సిద్ధంగా కూర్చున్నారు.

    మహాభారతకథ చెప్పుకుంటూ మొదట సంస్కృతంలో మహాభారతాన్ని రచించిన శ్రీవేదవ్యాసమహర్షులవారిని గురించి, మహాభారతకథ వినిపించడానికి మూలకారకుడైన పరీక్షిత్తుమహారాజు గురించి, సంస్కృతంలో రచింపబడిన మహాభారతాన్ని తెలుగులోకి అనువదించాలని సంకల్పించిన శ్రీరాజరాజనరేంద్రుడి గురించి తెలుసుకుందాం. తరువాత వరుసగా పర్వాల అనుక్రమణికని అనుసరించి మహాభారతాన్ని తెలుసుకుందాం.

 

 

 


కవిత:పలకరించిన మానసవీణ – పులకరించిన మామిడిపండు

  

అంశం: మానసవీణ 

పలకరించిన మానసవీణ పులకరించిన మామిడిపండు

దేవర్షి నారదుడు బహుధన్యుడు.

చేస్తుందతడి మానసవీణ..

 సదా హరిగుణ గానం!

మానసం వీణారాగం..

చేతి వీణ మ్రోగిస్తుంది రాగం  

మానసవీణ కలిగిస్తుంది

నారదుడికి.. భక్తిపారవశ్యం

చేతివీణతో జగత్తుకి అందిస్తున్నాడు

 ఆనంద పారవశ్యం!

సంకల్ప బలం

భగవన్నామ స్మరణలోనే..

లోకాల్ని సందేశంతో నింపుతోంది

 నారదుడి మహతివీణ!

నారాయణ స్మరణతో మానసవీణ

శ్రుతి చేసుకుంటాడు..

ముకుంద గీతాలతో..

జగత్తుకి వీనులవిందు చేస్తాడు

మనస్సులో పరవశిస్తాడు..

జగత్తుని పరవశింపచేస్తాడు!

సుఖదుఃఖాలు రమ్మంటే రావు.

వద్దంటే పోవు..

నిరూపణ చెయ్యాలనుకున్నాడు

 శ్రీకృష్ణుడు !

నారదుడితో బయలుదేరాడు

విహారయాత్రకు...

ఆపాడు అందమైన వనంలో

 అందమైన సరస్సు వద్ద రథం...!

దాహంతో నీటిని దోసిలితో

తీసుకున్నాడు నారదుడు..

స్నానం చేయకుండా నీటిని త్రాగకు..

ప్రమాదమన్నాడు కృష్ణుడు!

వారిస్తున్నా వినలేదు.. దాహార్తి తీర్చుకున్నాడు...

తనను తాను మరిచాడు..

స్త్రీ రూపం పొందాడు నారదుడు!

శ్రీకృష్ణమాయా ప్రభావంతో

 ఋషిపత్నిగా జీవించాడు

కలిగిన అరవైమంది సంతానం...

కళ్ళముందే విగతజీవులయ్యారు

స్ర్తి నారదుడు ఖిన్నుడయ్యాడు..

దుఃఖ భారంతో!

ఆకలి బాగా పెరిగింది..

మామిడి చెట్టుకి కనిపించిందొక పండు 

భర్త ఋషి, అరవైమంది పిల్లల

 శవాల్ని గుట్టగా పేర్చాడు.

శవాల గుట్టనెక్కి

పండును అందుకున్నాడు..!

తినబోతున్న స్త్రీ రూప నారదుణ్ని

బ్రాహ్మణుడు అడ్డగించాడు

స్నానం చేసి పండు తిను..

మృతులకు మంచిదన్నాడు!

మామిడి పండు ఉన్న చేతిని

పైకెత్తి పట్టుకుని

నారదుడు కొలనులో దిగాడు ..

పురుషుడిగా మారాడు ..

మారని మామిడిపండు హస్తం..

నారదుణ్ని వెక్కిరించింది!

కృష్ణుడు నవ్వాడు.. నారదుడు

పండుతో సహా నీటిలో మునిగాడు..

పైకి వచ్చిన నారదుడి చేతిలో

 మామిడిపండు  వీణగా మారింది..

నారదుడి వీణ పేరు మహతి!

చెప్పాడు శ్రీకృష్ణుడు!

మహతిని చేతితో మీటాడు..

నారదుడి మానసవీణ పులకరించింది

నారాయణ! నారాయణ! స్మరణ గానంతో..

జగత్తు పరవశించింది!