About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

మహాభారతకథ-6

 

ఉదంకమహర్షి

    ఉదంకుడు బ్రహ్మతో సమానమైనవాడు, భయంలేనివాడు, గొప్ప తపస్సంపన్నుడు, పైలుడికి శిష్యుడు. అతడు గురుకులంలో గురువుకి సేవలు చేసి ఎనిమిది సిద్ధుల్లో (అణిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, మహిమ, ఈశిత్వం, వశిత్వం, కామావసాయిత అనేవి ఎనిమిది సిద్ధులు) ఉన్న జ్ఞానాన్ని పొందాడు.

  ఉదంకమహర్షి గొప్ప తపస్సంపన్నుడు. ఆయన గురించి పూర్తిగా కాకుండా మహాభారతకథలో ఉన్నంత వరకే ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము. ఆయన తెలుసుకోవాలంటే చదువు పూర్తి చేసి గురువుగారికి గురుదక్షిణ ఇస్తానన్నాడు. తీసుకోడానికి గురువుగారు ఒప్పుకోలేదు. గురువుగారి భార్య ఉదంకుడితో తనకి  పౌష్యమహారాజు భార్య దగ్గర ఉన్న కుండలాలు కావాలని చెప్పింది. గురువుగారి అనుమతి తీసుకుని వాటికోసం బయలుదేరాడు ఉదంకుడు.

    అడవిలో ఒంటరిగా వెడుతున్న సమయంలో ఒక దేవతాపురుషుడు ఎద్దునెక్కి ఎదురుగా వచ్చాడు. పౌష్య మహారాజుని కలుసుకోడానికి ఆటంకాలు రావని చెప్పి ఉదంకుడికి ఎద్దు పేడ ఇచ్చి తినమన్నాడు. ఉదంకుడు ఎద్దుపేడ తిని పౌష్య మహారాజుని కలుసుకున్నాడు.

   మహారాజుని ఆశీర్వదించి ఆయనిచ్చిన అర్ఘ్యపాద్యాలు అందుకుని తను గురువుగారి పనిమీద మహారాణి చెవులకి పెట్టుకునే కుండలాల కోసం యాచకుడిగా వచ్చానని చెప్పాడు. ఉదంకుడి మాటలు విని రాజు మహానుభావా! సంతోషంగా ఆమె దగ్గరికి వెళ్లి అడిగి తీసుకో! అన్నాడు.

   ఉదంకుడు అంతఃపురమంతా తిరిగాడు కాని, మహారాణి కనిపించలేదు. రాజుకి విషయం చెప్పాడు.  రాజు ఉదంకుడితో  మహాత్మా! నువ్వు ఏ దోషాలు లేనివాడివి. నిన్ను అపవిత్రుడవని నేను అనలేను. కాని, నా భార్య మహాపతివ్రత. ఆమె అపవిత్రులకి మాత్రం కనిపించదు అని చెప్పాడు.

   అది విని ఉదంకుడు తను ఇక్కడికి వచ్చేటప్పుడు దివ్యపురుషుడు ఇచ్చిన ఎద్దు పేడని తిని నోరు శుద్ధి చేసుకోలేదు. అతడు చెప్పినా తనుపట్టించుకోలేదు. అదే మహాపతివ్రతని చూడలేక పోడానికి కారణమై ఉంటుంది అనుకున్నాడు. వెంటనే తూర్పు దిక్కుకి తిరిగి పరిశుభ్రమైన నీళ్లతో పాదాలు, చేతులు, ముఖం, నోరు కడుక్కుని మళ్లీ మహారాణి దగ్గరికి వెళ్లాడు.

   ఆమె ఉదంకుడికి నమస్కారం చేసి కుండలాలు ఇచ్చి ఉదంకమహర్షీ! ఈ కుండలాల్ని ఎత్తుకు పోవాలని తక్షకుడు అనే సర్పరాజు కాచుకుని ఉంటాడు. జాగ్రత్తగా తీసుకుని వెళ్లు అని చెప్పింది. ఉదంకుడు కుండలాలు తీసుకుని మహారాజు దగ్గరికి వచ్చాడు. మహారాజు “ఉదంకుణ్ని భోజనం చేసి వెళ్ళమన్నాడు.

   ఉదంకుడు రాజు మాటని తీసివెయ్యలేక భోజనం చెయ్యడానికి కూర్చున్నాడు. భోజనం చేస్తుండగా అన్నంలో వెంట్రుక వచ్చింది. దాన్ని చూసి ఉదంకుడు చూడకుండా నాకు అపవిత్రమైన అన్నాన్ని పెట్టావు. నువ్వు గుడ్డివాడివి అయిపోతావు” అని రాజుని శపించాడు. పౌష్యమహారాజు బాధతో  నేను చేసిన చిన్న తప్పుకి పెద్ద శిక్ష వేశావు. నువ్వు సంతానం ఉండకుండా అయిపోతావు అని ఉదంకుణ్ని శపించాడు.

   ఉదంకుడు తన వంశం వృద్ధి కోసం శాపాన్ని ఉపసంహరించమని మహారాజుని అడిగాడు. పౌష్యరాజు ఉదంకమహర్షీ! బ్రాహ్మణుల మనస్సు అప్పుడే తీసిన వెన్నతో సమానంగా మృదువుగా ఉంటుంది. మాట మాత్రం పరుషంగా ఇంద్రుడి వజ్రాయుధంలా ఉంటుంది. రాజుల్లో ఈ రెండూ విరుద్ధంగా ఉంటాయి. అందువల్ల బ్రాహ్మణుడు తను ఇచ్చిన శాపాన్ని ఉపసంహరించుకోగలడు. రాజు మాత్రం తను ఇచ్చిన శాపాన్ని ఉపసంహరించుకోలేడు. కనుక, నేను ఇచ్చిన శాపాన్ని తిరిగి తీసుకోలేను. నువ్వు నాకు ఇచ్చిన శాపాన్ని ఉపసంహరించు అన్నాడు.

   ఉదంకుడు రాజా! నీకు త్వరలోనే శాప విముక్తి కలుగుతుంది. నేను గురుపత్నికోసం కుండలాలు తీసుకుని వెడుతున్నాను అని చెప్పి సంతోషంగా అక్కడి నుంచి బయలుదేరాడు. దారిలో అతడికి ఒక సరస్సు కనిపించింది.  తన చేతిలో ఉన్న కుండలాల్ని ఒక శుభ్రమైన ప్రదేశంలో పెట్టి, సరస్సులోకి దిగి ఆచమనం చేస్తుండగా తక్షకుడు వచ్చి కుండలాలు తీసుకుని పరుగెత్తాడు.

  ఉదంకుడు కూడ తక్షకుడి వెంట పరుగెత్తాడు. సర్పరూపంలో వచ్చిన తక్షకుడు కుండలాలతో సహా భూమికి ఉన్న రంధ్రం నుంచి తన నాగలోకానికి వెళ్లిపోయాడు. ఉదంకుడు కూడా తక్షకుడి వెనుక నాగలోకానికి వెళ్లి అనేక అడవులు, చెట్లు, సముద్రాలు, కులపర్వతాలు, నిండుగా ప్రవహిస్తున్న సరస్సులు, నదులు కలిగిన బరువైన భూమిని తన వెయ్యి పడగలతో మోస్తూ; నారాయణుడికి శయ్యగా ఉంటూ అన్ని పాపాల్నీ నాశనం చెయ్యగల శక్తి కలిగిన అనంతుడు అనే నాగరాజు మా యందు దయ కలిగి ఉండుగాక!   గొప్ప తపశ్శక్తితో రాక్షసులు పెట్టే బాధల నుంచి నాగులందర్నీ రక్షించినవాడు; వినయంగా నమస్కరించే రాక్షసుల, దేవతల కిరీటాల మీద మణుల కాంతితో ప్రకాశించే పడగలతో, పార్వతీ పతి శివుడికి అలంకారమైన సర్పరాజు వాసుకికి మా యందు దయ కలుగుగాక! 

   దేవ, మనుష్య లోకాల్లో తిరుగుతూ గొప్ప తేజస్సుతో అందరితో పూజలూ అందుకుంటూ గొప్ప పరాక్రమము, విషము, కోపము కలిగి మహాత్ములైన ఐరావత నాగవంశంలో ఉన్న సర్పరాజులందరూ మా యందు దయ కలిగి ఉందురుగాక! పెద్ద పెద్ద కులపర్వతాల పొదరిళ్లలోను, అడవుల్లోను, కురుక్షేత్రంలోను స్వేచ్ఛగా తిరిగేవాడు; తన కుమారుడైన అశ్వసేనుడితో కలిసి భూమి మీద తిరిగేవాడు; బలంలోను, గర్వంలోను, శౌర్యంలోను సమర్థుడైనవాడు, పరాక్రమవంతుడు పాములకి రాజు అయిన తక్షకుడు మా యందు దయ కలిగి ఉండు గాక!” అని నాగరాజులందర్నీ స్తుతించాడు.

   పాతాళ లోకంలో తెల్లని నల్లని దారాలతో కలిసిన వస్త్రాన్ని నేస్తున్న ఇద్దరు స్త్రీలని, పన్నెండు ఆకులతో ఉన్న చక్రాన్ని తిప్పుతున్న ఆరుగురు యువకుల్ని, ఎత్తైన గుర్రాన్ని ఎక్కి తేజస్సుతో ఉన్న ఒక దివ్య పురుషుణ్ని చూశాడు. వాళ్లని కూడా భక్తితో మంత్రాలతో స్తుతించాడు.

    ఆ దివ్య పురుషుడు ఉదంకుణ్ని చూసి నిర్మలమైన నడవడిక కలిగిన ఉదంకమహర్షీ! నీకు ఏం కావాలో చెప్పు, నేను తీరుస్తాను!” అన్నాడు.  ఉదంకుడు  ఈ పాముల వంశం అంతా నాకు అధీనమై ఉండేట్టు అనుగ్రహించు” అని అడిగాడు. దివ్యపురుషుడు గుర్రం చూపిస్తూ గుర్రం చెవికి ఉన్న రంధ్రంలో ఊదమన్నాడు.  ఉదంకుడు దివ్య పురుషుడు చెప్పినట్టే చేశాడు. దాని ఇంద్రియాల నుంచి భయంకరమైన అగ్ని జ్వాలలు పాతాళలోకంలో వ్యాపించాయి. అది చూసి పాములన్నీ భయపడ్డాయి.

  అగ్ని జ్వాలలు చూసి అవి ఆ బ్రాహ్మణుడి కోపం అనుకుని తక్షకుడు  భయపడుతూ కుండలాల్ని తీసుకొచ్చి ఇచ్చేశాడు. ముందు ఈ నాగలోకం నుంచి ఎలాగయినా బయట పడి సాయంత్రానికి  తను గురుపత్ని దగ్గరికి చేరుకోవాలి. ఈ రోజు తను అక్కడికి చేరలేకపోతే ఇప్పటి వరకు పడ్డ శ్రమంతా వ్యర్థమవుతుందని బాధ పడుతున్నాడు.

   దివ్యపురుషుడు ఉదంకుడికి తన గుర్రాన్ని ఇచ్చి దీని మీద వెడితే నువ్వు గాలి కంటే, మనస్సు కంటే కూడా వేగంగా వెళ్లగలవు అని చెప్పాడు.  దివ్యపురుషుడు ఇచ్చిన గుర్రాన్ని ఎక్కి ఉదంకుడు అదే రోజు గురువుగారి ఇంటికి చేరుకున్నాడు. అక్కడ గురువుగారి భార్య పవిత్ర స్నానం చేసి, కొత్త బట్టలు కట్టుకుని కర్ణాభరణాలు ధరించాలని ఉదంకుడి కోసం ఎదురు చూస్తోంది. కుండలాల్ని ధరించి, బ్రాహ్మణుల్ని పూజించి తను తలపెట్టిన వ్రతాన్ని పూర్తి చేసుకుంది.

   వచ్చిన ఉదంకుణ్ని చూసి గురువు పైలుడు నాయనా!  పౌష్య మహారాజు పట్టణం ఇక్కడికి దగ్గరగానే ఉంది కదా? అక్కడికి వెళ్లి రావడానికి నీకు నాలుగు రోజులు ఎందుకు పట్టింది? అని ఆడిగాడు. ఉదంకుడు గురువర్యా! కాని, దుష్టుడైన నాగరాజు తక్షకుడు అడ్డుపడ్డం వల్ల ఆలస్యమైంది. మీ దగ్గర్నుంచి వెడుతున్నప్పుడు ఒక దివ్య పురుషుడు ఎదురయ్యాడు. అతడిచ్చిన ఎద్దు పేడ తిని వెళ్లి పౌష్య మహారాజుని అడిగి కుండలాలు తీసుకుని వస్తున్నాను. మధ్యలో తక్షకుడు నా దగ్గరున్న కుండలాల్ని ఎత్తుకుని పోయాడు. నేను తక్షకుడి వెనకాలే నాగలోకానికి వెళ్లి సర్పరాజుల్ని పొగిడాను.

   పాతాళ లోకంలో తెలుపు, నలుపు రంగుల దారాలతో వస్త్రాలు నేస్తున్న ఇద్దరు స్త్రీలని, పన్నెండు అకులు గల చక్రాన్ని తిప్పుతున్న ఆరుగురు యువకుల్ని, ఎత్తైన గుర్రాన్నిఎక్కిన ఒక దివ్యపురుషుణ్ని చూశాను. అతడు అనుగ్రహించి ఇచ్చిన గుర్రాన్ని ఎక్కి కుండలాలు తీసుకుని సమయానికి రాగలిగాను. అసలు ఇంతవరకూ జరిగినదేమిటో నాకు అర్థం కాలేదు అని చెప్పాడు.

   పైలుడు ఉదంకా! ఎద్దుని ఎక్కి వచ్చిన దివ్య పురుషుడు ఇంద్రుడు. అతడు ఎక్కిన ఎద్దు దేవతల ఏనుగు ఐరావతం. పేడ అమృతం. ఇద్దరు స్త్రీలు ధాత, విధాత. వాళ్లు నేస్తున్న తెలుపు, నలుపు దారాల మగ్గం దినరాత్రులకి రూపం. పన్నెండు కులు గల చక్రం నెలల రూపమైన సంవత్సరం. దాన్ని తిప్పుతున్న ఆరుగురు యువకులు ఆరు ఋతువులు (వసంతం, గ్రీష్మం, వర్షం, శరత్తు, హేమంతం, శిశిరం).    గుర్రం అగ్ని; దాన్ని ఎక్కిన దివ్య పురుషుడు ఇంద్రుడి స్నేహితుడు పర్జన్యుడు. మొదట ఇంద్రుణ్ని చూసి అమృతం తిన్నావు కనుక, నువ్వు కోరుకున్నది దొరికింది. నువ్వు చెయ్యాలనుకున్న పని నెరవేరింది. నీకు కుండలాలు దొరికాయి.

   గురువుగారి పని నెరవేర్చి గురువు ఋణం తీర్చుకున్నావు. ఇంక నువ్వు నీ ఇష్టం ప్రకారం జీవించు!” అని దీవించి పంపించాడు. ఉదంకుడు గురువుగారి అనుమతి తీసుకుని అక్కడ నుంచి వెళ్లి చాలాకాలం తపస్సు చేశాడు. తక్షకుడు తనకి చేసిన అపకారానికి బదులు తీర్చుకోవాలని ఉదంకుడు జనమేజయమహారాజు దగ్గరికి వెళ్లాడు.

  జనమేజయ మహారాజుని కలిసిన ఉదంకుడు భూమి మీద ఉన్న ప్రజలందరితో కీర్తింపబడేవాడా! జనమేజయుడా! నేను నా గురువుగారి పని మీద వెడుతుంటే సర్పరాజు తక్షకుడు అజ్ఞానంతో నాకు హాని చేశాడు. దానాలు, యజ్ఞాలు చేస్తూ, భరత వంశాన్ని వృద్ధిపరుస్తూ, ప్రజలందరికీ మేలు చేస్తూ అర్జునుడితో సమానమైన, ఇంద్రియ నిగ్రహం కలిగిన నీ తండ్రి పరీక్షిత్తు మహారాజుని క్రూరుడైన తక్షకుడు తన భయంకరమైన విషంతో చంపేశాడు.

   తక్షకుడు నీకు ఇంత కీడు చెయ్యడానికి కారణం శమీకుడి కుమారుడు శృంగి అనే ఒక బ్రాహ్మణుడు. అందుకు ప్రతీకారంగా నువ్వు కూడా  బ్రాహ్మణులతో సర్పయాగాన్ని నిర్వహించి, భయంకరమైన అగ్నిజ్వాలల్లో తక్షకుడు మొదలైన పాములన్నింటినీ నాశనం చెయ్యి. బ్రాహ్మణుల అనుమతి తీసుకుని సర్పయాగం చెయ్యి”  అని చెప్పి జనమేజయుడికి సర్పయాగం చెయ్యాలనే బుద్ధి కలిగేలా మాట్లాడాడు. పరీషిత్తుమహారాజు కొడుకు జనమేజయమహారాజు సర్పయాగం చెయ్యడానికి ఉదంకుడు కారకుడయ్యాడు.

మహాభారతకథ - 5

 

మహాభారతాన్ని ప్రశంసించిన సూతమహర్షి

      శౌనకుడు మొదలైన మహర్షులు అడిగినదాన్ని విని రోమహర్షణుడి కుమారుడు ఉగ్రశ్రవసుడు అనే పేరుగల సూతమహర్షి  సంతోషంతోను, వినయంతోను మొదట తపస్సంపన్నులైన ఆ మహర్షులకి మస్కారం చేసాడు. తరువాత వ్యాసుడు మొదలైన గురువుల్ని మనస్సులో స్మరించాడు. వాగ్దేవి అయిన సరస్వతిని, విఘ్న నాశకుడైన వినాయకుణ్ని స్తుతించాడు. పవిత్రము, పంచమ వేదమైన  మహాభారతకథ గొప్పతనాన్ని భక్తితోను వినయంతోను ప్రశంసించాడు.

   అనేక ఉపాఖ్యానాలతో; వేదాల్లో ఉండే అర్థంతో; గొప్పవైన నాలుగు పురుషార్థాలతో; కృష్ణార్జునుల మంచి గుణాల్ని కీర్తించడం వల్ల కలిగిన  ప్రయోజనంతో; వ్యాసుడు రచించిన, కవిత్రయం అనువాదం చేసిన మహాభారత ఇతిహాసము ఇప్పటికీ అందరితో పూజింపబడుతోంది.

   చాలా రకాలైన శబ్దాలు, అర్థాలతో.. నూరు ఉపపర్వాలతో... పద్ధెనిమిది మహాపర్వాలతో.. ప్రకాశించేదాన్ని, చిన్నా పెద్దా ద్వీపాలతో.. ఉన్న ప్రపంచాన్ని బ్రహ్మ సృష్టించినట్లు.. కృష్ణద్వైపాయనుడు అనే వ్యాసమహర్షి అన్ని లోకాల ప్రజలకి మంచి జరగాలని నిశ్చలమైన మనస్సుతో మూడు సంవత్సరాలు రచించాడు.

   ఆ మహాభారతాన్ని స్వర్గలోకంలో ఉన్న వాళ్లకి చెప్పడానికి నారదమహర్షిని; పితృలోకంలో ఉన్న వాళ్లకి చెప్పడానికి అసితుడు’ అనే దేవలమహర్షిని; గరుడ, గంధర్వ, యక్ష రాక్షస లోకాల్లో చెప్పడానికి తన కుమారుడు శుకమహర్షిని; సర్పలోకమైన పాతాళ లోకంలో చెప్పడానికి తన శిష్యుడైన సుమంతుణ్ని; మానవ లోకంలో పరీక్షిత్తు కుమారుడైన జనమేజయుడికి చెప్పడానికి మరొక శిష్యుడు వైశంపాయనుణ్ని పంపించాడు.

   వైశంపాయన మహర్షి నాకు  ఈ మహాభారత కథ చెప్పాడు. కథ విని ఇక్కడికి వచ్చాను. కృతయుగం చివరలో దేవతలకీ, రాక్షసులకీ;  త్రేతా యుగంలో రాముడికీ, రావణుడికీ యుద్ధాలు జరిగాయి. అదే విధంగా ద్వాపర యుగం చివర కూడా పాండవులకీ కౌరవులకీ మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది.

   పద్ధెనిమిది రోజులు జరిగిన ఆ కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు పదిరోజులు, గురువైన ద్రోణాచార్యుడు అయిదు రోజులు, కర్ణుడు రెండు రోజులు, అమితమైన పరాక్రమం గల శల్యుడు ఒకరోజులో సగభాగం సేనానాయకులుగా ఉన్నారు. మిగిలిన సగం రోజులో గదాయుద్ధంలో గొప్ప వీరులైన భీముడు దుర్యోధనుల మధ్య గదా యుద్ధం జరిగింది.

   ఆ మహా భయంకరమైన యుద్ధంలో పాండవుల సేన ఏడు అక్షౌహిణులు... కౌరవసేన సంఖ్య పదకొండు అక్షౌహిణులు. ఈ రెండు సేనలు రెండు వైపుల ఉన్న రథాల్ని, ఏనుగుల్ని, వీరుల్ని చంపుకుంటూ వెనక్కి తగ్గకుండా భయంకరంగా పద్ధెనిమిది రోజులు యుద్ధం చేశారు. అందువల్ల శమంతపంచకము’ అనే ప్రదేశంలో భూమి కంపించింది.

   కృష్ణద్వైపాయనుడు లేక వ్యాసమహర్షితో రచింపబడి పూజలందుకుంటున్న ఈ మహాభారతాన్ని నిశ్చలమైన మనస్సుతో వింటూ లేదా చదువుతూ ఉంటే ధర్మప్రవర్తనతో జీవిస్తారు. నాలుగు వేదాలు, ప్రధానమైన పద్ధెనిమిది పురాణాలు, వాటితో నిరూపించబడిన ధర్మాన్ని బోధించే శాస్త్రాలు, మోక్షమార్గాన్ని తెలియచేసే శాస్త్రాల అసలు స్వరూపం గురించి తెలుసుకున్న ఫలితం కలుగుతుంది.

   దానాలు, వివిధ యజ్ఞాలలో చెయ్యబడే హోమాలు, జపాలు, బ్రహ్మచర్య వ్రతం ఆచరించడం వల్ల కలిగే ఫలితం దక్కుతుంది. పాపాలన్నీ నాశనమవుతాయి. అంతా మంచే కలుగుతుంది అని సూతమహర్షి మహాభారతం గొప్పతనాన్ని వివరిస్తున్నాడు.

    మహర్షులందరు ఉత్సాహంగా వింటూ..  ముందుగా మాకు శమంతకపంచకం గురించి కూడా వివరించమని అడిగారు. అంటే ఏమిటో... అక్షౌహిణి అనే సైన్య విభాగంలో రథాలు, గజాలు మొదలైన సైన్యం ఎంత ఉంటుందో...ఆ సంఖ్యని తెలియ చెయ్యండి. తరువాత మహాభారతంలో కథ పుట్టడానికి గల కారణము, దానిలో ఉన్న మాటల గొప్పతనము, పాండవులు విజృంభించిన విధానము, భీష్ముడు మొదలైన కురువంశ వీరుల గొప్పతనము గురించి తెలియచెయ్యండి!” అని అడిగారు.

   సూతమహర్షి చెప్తున్నాడు మిగిలిన మహర్షులు, మహారాజు జనమేజయుడు వింటున్నారు. త్రేతాయుగము, ద్వాపర యుగాల మధ్య కాలంలో గొప్ప పరాక్రమం కలిగిన పరశురాముడు కోపంతో వజ్రాయుధం వంటి తన గండ్ర గొడ్డలితో క్షత్రియుల మీద యుద్ధం చేశాడు. ఇరవై ఒక్క సార్లు యుద్ధం చేసి కనిపించిన క్షత్రియులందర్నీ చంపేశాడు.

   యుద్ధంలో చంపబడిన క్షత్రియుల రక్తంతో అయిదు మడుగులు ఏర్పరిచాడు. క్షత్రియుల రక్తంతో తర్పణాలు ఇచ్చి పితృదేవతల్ని తృప్తి పరిచాడు. పితృదేవతలు అతడి కోపాన్ని తగ్గించి శాంత పరిచారు. క్షత్రియుల రక్తంతో ఐదు మడుగులు ఏర్పరిచి, ఆ రక్తంతో  పితృతర్పణం చేసిన ప్రదేశాన్ని శమంతక పంచకం అన్నారు” అని చెప్పాడు.

   తరువాత అక్షౌహిణి అనే సేనావిభాగంలో ఉన్న రథాలు, గుర్రాలు మొదలైన వాటి సంఖ్య చెప్పడం మొదలుపెట్టాడు. ఒక గొప్పదైన రథము, ఒక ఏనుగు, మూడు గుర్రాలు, అయిదుగురు కాలిబంట్లు గలిగిన సేనా విభాగాన్ని  పత్తి అంటారు.

   పత్తికి మూడురెట్లు ఉన్నసేనని సేనాముఖం అని, సేనాముఖానికి మూడురెట్లు ఉండే సేనని గుల్మం అని, గుల్మానికి మూడు రెట్లు ఉండే సేన  గణం అంటారు. గణానికి మూడు రెట్లు ఉంటే దాన్ని  వాహిని అని పిలుస్తారు. వాహినికి మూడు రెట్లు ఉంటే ఆ సేన  పృతన అనబడుతుంది. పృతనకి మూడురెట్లు ఉండే సేనని  చమువు అంటారు.

   చమువుకి మూడు రెట్లు ఉంటే అనీకిని’ అని, అనీకినికి పదిరెట్లు ఉండే  పెద్ద సేనని అక్షౌహిణి అని పిలుస్తారు. కౌరవుల పాండవుల మధ్య జరిగిన యుద్ధం శమంతక పంచకంలోనే జరిగింది. అందువల్ల ఆ ప్రదేశానికి  కురుక్షేత్రము అని పేరు వచ్చింది.

   శత్రువుల పరాక్రమాన్ని అరికట్టినవాడు, పాండవ వంశాన్ని వృద్ధి చేసినవాడు, పుణ్యకార్యాలు నిష్ఠగా చేసినవాడు, పరీక్షిత్తుకి కుమారుడు, పాపపు పనులు చెయ్యనివాడు, అనేక యజ్ఞాలు చేసి కీర్తిని పెంచినవాడు, మంచివాళ్లతో బుద్ధిమంతుడు అనిపించుకున్నవాడు, ఓటమి ఎరుగనివాడు జనమేజయుడు అనే రాజు తనకి,  ప్రజలకి, దేశానికి మంచి జరగాలన్న కోరికతో ఎక్కువ కాలం జరిగే యజ్ఞాన్ని చేశాడు.

  జనమేజయుడు యజ్ఞం చేస్తున్నాడు. దేవతల కుక్క సరమ కొడుకు సారమేయుడు ఆడుకుంటూ అక్కడ తిరుగుతున్నాడు. జనమేజయుడి తమ్ముళ్లు శ్రుతసేనుడు, భీమసేనుడు, ఉగ్రసేనుడు కోపంతో దాన్ని కొట్టారు. అది ఏడుస్తూ వెళ్లి తన తల్లి  సరమకి చెప్పింది.

   సరమ కోపంతో జనమేజయుడి దగ్గరికి వెళ్లింది. ఓ రాజా! నీ తమ్ముళ్లు ఏ తప్పు చెయ్యని నా కొడుకుని చిన్నవాడని కూడా చూడకుండా కొట్టారు. తను చేస్తున్న పని మంచిదా కాదా అని ఆలోచించకుండా బీదవాళ్లకి, శక్తిలేనివాళ్లకి, మంచివాళ్లకి బాధ కలిగిస్తే వాళ్లకి  ఏదో విధంగా ఆపదలు కలుగుతాయి” అని చెప్పి మళ్లీ కనిపించకుండా వెళ్లిపోయింది.

  జనమేజయుడు తను అనుకున్న యజ్ఞాన్ని పూర్తిచేసి హస్తినాపురానికి వెళ్లి సుఖంగా జీవిస్తున్నాడు. కాని ఒకరోజు అతడికి దేవతల కుక్క సరమ తనతో చెప్పిన మాటలు గుర్తుకి వచ్చాయి. నిజంగానే ఆపదలు కలుగుతాయేమో అనే భయంతో శాంతి కర్మలు చేయించాలని అనుకున్నాడు. అందుకు తగిన పురోహితుల కోసం మునులు నివసించే ఆశ్రమాలకి వెళ్లాడు.

   అక్కడ ఒక మునిపల్లెలో శ్రుతశ్రవసుడు అనే ఒక మహర్షిని చూసి ఆయనకి నమస్కారం చేసి మహర్షీ! తపస్సంపన్నుడు, పవిత్రుడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు మీ కుమారుడు  సోమశ్రవసుణ్ని నాకు పురోహితుడిగా పంపించండి” అని వినయంగా అడిగాడు.

   ఆయన అనుమతి తీసుకుని సోమశ్రవసుణ్ని పూజించి, సత్కరించి తనకు పురోహితుడుగా చేసుకున్నాడు. జనమేజయుడు దేవతల్ని అహూతులతోను, బ్రాహ్మణుల్ని విశేషమైన దక్షిణలతోను తృప్తి కలిగిస్తూ అనేక యాగాలు చేస్తూ పురోహితుడి మాటల్ని గౌరవిస్తూ రాజ్యపాలన చేస్తున్నాడు.

   సూతమహర్షి మహాబారత కథ చెప్పడానికి ఉద్యుక్తుడై ముందుగా మాహాభారతాన్ని, మహాభారత యుద్ధాన్ని, మహాసైన్యాన్ను కీర్తించి తరువాత మహాభారతకతకథ చెప్పడం మొదలుపెట్టాడు.

 

 

 

మహాభారతకథ-౩

శ్రీరాజరాజనరేంద్రుడు

    శ్రీ వ్యాసభగవానుడు ఎంత వేగంగా చెప్పాడో దాన్ని అంత వేగంగానూ రాసిన ఆది దంపతుల కుమారుడు విఘ్నేశ్వరుడు... అంత గొప్ప  మహాభారతాన్ని తెనిగించినది కవిత్రయమే అయినా ప్రోత్సహించింది శ్రీరాజరాజనరేంద్రుడు. అందుకే ఆయన గురించి తెలియచెయ్యడం నా ధర్మంగా భావించి వ్యాసభగవనులవారికి, కవిత్రయానికి, నా తల్లితండ్రులకు నమస్కరిస్తూ ఈ మహాభారతకథలు  ఆరంభిస్తున్నాను.  

   ముందుగా శ్రీవేదవ్యాసులవారు సంస్కృతంలో రచించిన మహాభారతాన్ని తెలుగులోకి అనువదించాలన్న సంకల్పం కలిగిన శ్రీరాజరాజనరేంద్రుణ్ని, అనువదించడానికి ప్రారంభించిన ఆదికవి నన్నయ గారిని గురించి కొంత తెలుసుకుందాం.  

అన్ని లోకాల్ని రక్షించడంలో సమర్థత కలిగినవాళ్లు, సృష్టికి మొదటి వాళ్లు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. వాళ్ల ధర్మపత్నులు సరస్వతి, లక్ష్మి, పార్వతులు. వాళ్లని సేవించి వాళ్ల అనుగ్రహంతో శత్రువులే లేని గొప్ప రాజ్యసంపద పొంది...అన్ని లోకాల్లో ఉన్న ప్రజలతో కీర్తింపబడి ...మణులతో నిండిన సముద్రంలా మంచి గుణాలు కలిగి...రాజ్యాన్ని పాలించాడు తూర్పు చాళుక్య వంశానికి చెందిన రాజరాజనరేంద్రుడు.

   చంద్రవంశానికి అలంకారంగాను, చంద్రుడిలా అందంగాను, ఇతర రాజులందర్నీ జయించ గలిగినంత పరాక్రమంతోను, ఓటమి తెలియని గొప్ప బాహుబలంతోను, అన్ని లోకాల్లోను కీర్తితో ప్రకాశించాడు రాజరాజనరేంద్రుడు.

   విమలాదిత్యుడు, రాజరాజచోళుడి కుమార్తె కుందవాంబ దంపతులకి కుమారుడు. పవిత్రమైన మనస్సు, అస్త్రవిద్యలో గొప్ప నేర్పరితనము కలిగి చాళుక్య వంశానికి దీపంలా ప్రకాశించాడు.  శాస్త్రాలన్నీ పరిపూర్ణంగా తెలుసుకున్నాడు. చంద్రకాంతితో ప్రకాశించే దేహంతో బుద్ధిబలము, ధర్మప్రవర్తనలతో అనేక సంపదలు పొందాడు.

    ’’సర్వలోకాశ్రయుడు’’ అనే వంశానికి చెందిన బిరుదుకి అర్హత పొందాడు. ధర్మాల్ని రక్షించడం రాజు ధర్మం. మనువు, నలుడు, నృగుడు, నహుషుడు, రంతిదేవుడు, భగీరథుడు, రాముడు మొదలైన పూర్వపు రాజులు అతడికి ఆదర్శం. వాళ్ళతో సమానమైన ధర్మ ప్రవర్తన కలవాడు రాజరాజనరేంద్రుడు.

   తన రాజ్యంలో ఉండే ప్రజల్ని ప్రేమగా చూసేవాడు. సామంతరాజుల దగ్గరనుంచి పన్నులు ధన రూపంలో తీసుకునేవాడు. బలగర్వంతో కప్పాలు ఇవ్వని రాజుల్నితన పరాక్రమంతో ఓడించి వసూలు చేసేవాడు.

   బ్రాహ్మణుల్ని రక్షిస్తూ, వాళ్ళకి అగ్రహారాలు ఇస్తూ, గొప్ప వైభవంతో దైవ కార్యాలు జరిగేలా చూస్తూ, తనను ఆశ్రయించినవాళ్లని కాపాడుతూ పూర్వం మనువు అనుసరించిన మార్గంలో నడిచి వంశ గౌరవాన్ని పెంచాడు రాజరాజనరేంద్రుడు.

   నాలుగు సముద్రాల మధ్య ఉన్న మొత్తం భూభాగాన్ని తూర్పు చాళుక్యులు పరిపాలించారు. ఆ వేంగీ దేశానికి రాజధాని రాజమహేంద్ర నగరం. సంతోషంగా రాజ్యభారాన్ని వహిస్తూ.. దానివల్ల కలిగిన సుఖాలు అనుభవిస్తూ.. ఇంద్రుడికి ఉన్నంత గొప్ప వైభవము, అన్ని లోకాలకి సంబంధించిన సంపదలు, విలాసాలు, అందమైన భవనాలు, మంత్రులు, పురోహితులు, సేనానాయకులు, ద్వారపాలకులు, మహామంత్రులు, సామంతరాజులు, అంత:పురస్త్రీలతో కొలువై ఉండేవాడు రాజరాజనరేంద్రుడు.

   వ్యాకరణ శాస్త్రాన్ని మొదటినుంచి చివరి వరకు చదివిన వ్యాకరణ పండితులు; భారతము, రామాయణము మొదలైన పురాణాలు ఇతిహాసాలు చెప్పడంలో నేర్పరులైన పండితులు; గొప్ప భావాలు, కొత్త అర్థాలతో వాక్యాలు రాయగల కవులు; అన్ని తర్కశాస్త్రాలకి సంబంధించిన శాఖలతో  రూపొందించబడిన శాస్త్రాలన్నింటిలోను ప్రవేశం కలిగిన ప్రజ్ఞావంతులైన తర్కశాస్త్ర పండితులు...చుట్టూ కూర్చుని ఉండగా చర్చలతోను, వినోదాలతోను గడిపేవాడు.

   ఒకరోజు పరమ ధర్మవేత్త, “వంశ పారంపర్యంగా వస్తున్న బ్రాహ్మణుడు, తన మీద ప్రేమ కలవాడు, జపాలు హోమాలు మానకుండా చేసేవాడు, శబ్దాల స్వరూపాన్ని అందరికీ అర్థమయ్యేలా వివరంగా చెప్పగలిగిన వాడు, వేదమంత్ర భాగాన్ని అధ్యయనం చేసినవాడు, పురాణ విజ్ఞానాన్ని ఔపాసన పట్టినవాడు, అర్హత కలిగినవాడు, ఆపస్తంబసూత్రుడు, ముద్గలముని గోత్రంలో పుట్టినవాడు, ప్రజలతోను, పండితులతోను కీర్తింపబడినవాడు, లోకజ్ఞానం మెండుగా కలిగినవాడు, ఎప్పుడూ సత్యమే పలికేవాడు, బుద్ధిలో బృహస్పతి వంటి వాడు, మంచివాడు” అయిన నన్నయభట్టుతో చాళుక్య వంశానికి అలంకారమైన రాజరాజనరేంద్రుడు ఇలా చెప్పాడు.

   “నిర్మలమైన మనస్సుతో అనేక పురాణలు విన్నాను. అర్థ, ధర్మ శాస్త్రాల పద్ధతుల్ని తెలుసుకున్నాను. ప్రౌఢాలు, రసవత్తరమైన రఘువంశ కావ్యాలు, శకుంతల మొదలైన నాటకాల తీరులు అనేకం పరిశీలించాను. లోకంలో ఎక్కువగా పూజించబడే శైవ, ఆగమ శాస్త్రాల్లో నా చిత్తాన్ని భక్తితో నిలకడగా ఉంచాను. అయినా కూడా నాకు శ్రీమత్ భారతంలో ఉన్న తత్త్వమే గొప్పగా అనిపిస్తోంది.

   బ్రాహ్మణులకి తృప్తి కలిగించడం, భారతాన్ని వినడం, శివుడి పాదపద్మాల్ని ధ్యానించడం, పూజించడం, దానాలు ఇవ్వడం, మంచివాళ్లతో సహవాసం నాకు ఇష్టమైన విషయాలు.  చంద్రుడు మొదలు పూరువు, భరతుడు, కురురాజు, పాండురాజు వరుసగా వంశాన్ని స్థాపించి నడిపించారు. ఈ భూమి మీద ప్రసిద్ధికెక్కిన మా వంశంలో మంచి గుణాలు, మంచి చరిత్ర కలిగిన పాండవుల చరిత్ర వినడం నాకు ఇంకా ఇష్టం.

   వేదాధ్యయనం చేసిన బ్రాహ్మణులకి బంగారపు తొడుగుతో ఉన్న కొమ్ములు, గిట్టలు కలిగిన కపిలవర్ణం కలిగిన వంద ఆవుల్ని దానంగా ఇస్తే ఎంత ఫలితం కలుగుతుందో భారత కథని వినడం వల్ల కూడా అంతే ఫలితం కలుగుతుంది. నాకు ఎప్పుడూ భారత కథని వినాలనే ఉంటుంది.

   ప్రజలందరూ మెచ్చుకుంటున్న నన్నయకవీ! వ్యాసమహర్షి  మహాభారతంలో చెప్పిన విషయాల్ని అందరికీ అర్థమయ్యేలా మీకు గల పాండిత్యంతో తెలుగులో వ్రాయండి.  అన్ని భాషల్లోను, ప్రక్రియల్లోను చెప్పగలిగిన వాళ్లు ఉంటే భారత కథని విన్నవాళ్లు కూడా అనేక యజ్ఞాలు చేసినంత ఫలితాన్ని పొందుతారు” అని రాజు నన్నయని ఆజ్ఞాపించాడు.

   “నన్నయ రాజరాజనరేంద్రుడితో  రాజా! ఆకాశంలో ఉన్న నక్షత్రాల్ని లెక్కపెట్టడం, అన్ని శాస్త్రాల్లో ఉన్న మొత్తం సారాన్ని గ్రహించడం, భుజబలంతో పొందలేని  భారతవాజ్ఞ్మయాన్ని తెలుసుకోవడం బ్రహ్మకు కూడా సాధ్యం కాదు కదా!   వ్యాసుడు సంస్కృతంలో రాసిన అటువంటి భారతాన్ని తెలుగులోకి అనువదించడం అసాధ్యమే! అయినా కూడా నువ్వు ఆజ్ఞాపించావు కనుక మిగిలిన పండితుల సహాయంతో నాకు తెలిసిన విధంగా అనువదిస్తాను అన్నాడు.

   విష్ణువు, శివుడు, బ్రహ్మ, వినాయకుడు, సూర్యుడు, కుమారస్వామి; తల్లులైన లక్ష్మి, పార్వతి, సరస్వతి మొదలైన దేవతలందరికీ మొక్కాడు.

    తప్పస్సంపన్నుడు, అజ్ఞానాన్ని పోగొట్టే ఆచార్యుడు, శ్లోక రచనా సంప్రదాయాన్ని మొదట ప్రారంభించిన ఆది కవి,  బ్రహ్మతో సమానమైనవాడు, ప్రచేతన మహర్షి కుమారుడు వాల్మీకిమహర్షిని భక్తితో స్మరించాడు.

   పండితుల్ని సంతోషపెట్టగలిగినవాడు, యోగ్యుడు, దేవతలతో సమానమైనవాడు, మహర్షులతో పూజింపబడేవాడు, గొప్ప కీర్తితో ప్రకాశించేవాడు అయిన వ్యాసుణ్ని పూజించాడు.

   గొప్ప జ్ఞానమనే సువాసనతో, మంచి గుణాలు కలిగినవాళ్లు, పూజ్యులు అయిన పండితులతో నిండిన సభల్ని ప్రశంసించాడు.

   భారతవీరుల మధ్య జరిగిన భయంకరమైన కురుక్షేత్ర మహా యుద్ధంలో అర్జునుడిని విడవకుండా ఉన్న కృష్ణుడిలా... వానస అనే బ్రాహ్మణ వంశానికి అలంకారమైనవాడు, అనేక సారస్వతాల్లో సమర్థుడూ, తనకు ప్రియమిత్రుడు, సహపాఠి, అయిన నారాయణభట్టు అనే పండితుడి సహాయాన్ని పొందాడు.

   గొప్ప గొప్ప కవులు “చాలా బాగుంది అని ప్రశంసించే విధంగాను; సామాన్య ప్రజలు కూడా విని ఆనందించే విధంగాను; అక్షరాల కూర్పులో ఉన్న అందాన్ని అందరూ మెచ్చుకునే విధంగాను; హృదయానికి హత్తుకుపోయే అర్థాలతో, వివిధ రకాల నీతులకి, జాతీయాలకి, నానుడులకి నిలయమై ఉండేలా లోకానికి మంచి చెయ్యడం కోసం సంస్కృతంలో వ్యాసమహర్షి రాసిన మహాభారతాన్ని తెలుగులోకి అనువదించి నన్నయభట్టు ప్రజలందరికీ పూజ్యుడయ్యాడు.

   శ్రీమదాంధ్రమహాభారతాన్ని ప్రజలకు చేరువచేసి శ్రీరాజరాజనరేంద్రుడు కీర్తిమంతుడయ్యాడు!!

 


మహాభారతకథ-సంచికలో ధారావాహికంగా నడుస్తున్న ప్రచురణ

 

మహాభారతంలో  వ్యాసమహర్షి

      మన దేశం భారతదేశం. ధర్మాధర్మాల్ని బోధించిన గ్రంథం.. వ్యాసమహర్షి చెప్పగా విఘ్నేశ్వరుడు రాసిన గ్రంథం మహాభారతం. సంస్కృతంలో రచించిన ఈ గ్రంథాన్ని నన్నయ తెలుగులో అనువదించడానికి ఉపక్రమించి వెయ్యి సంవత్సరాలు పూర్తయింది. ఇప్పటికీ అదే ప్రమాణాలతో.. అదే పవిత్రతతో.. అదే గౌరవంతో నిలిచి ఉన్న శ్రీమదాంధ్ర మహాభారతంలో మనం తెలుసుకోవలసిన ఎంతో మంది మహర్షులు, గురువులు, రాజులు, ధర్మాత్ములు, దానపరులు, వీరులు, ధీరులు ఉన్నారు. వాళ్లందరి గురించి తెలుసుకోడం మన ధర్మం. ఆ ధర్మమే మనల్ని మంచి మార్గం వైపు నడిపిస్తుంది.. ధర్మాన్ని రక్షిస్తుంది.

   మొదట మహాభారతాన్ని రచించిన కారణ జన్ముడు, పరమేశ్వర స్వరూపుడు, మహర్షుల్లో గొప్పవాడు అయిన వ్యాస మహర్షి గురించి తెలుసుకుందాం. ఆయన్ని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే పెద్ద గ్రంథమే ఉంది. ప్రస్తుతం మహాభారతంలో వ్యాసమహర్షిని గురించి మాత్రమే తెలుసుకుందాం.

   ఆదికాలంలో విష్ణుమూర్తి ప్రజల్ని సృష్టించడం కోసం నాభి నుంచి బ్రహ్మని సృష్టించాడు. మిగిలిన సృష్టి  మొత్తాన్ని బ్రహ్మకి అప్పగించాడు. విష్ణుమూర్తి ముఖం నుంచి వేదాలు ఆవిర్భవించాయి. తన మనస్సు నుంచి అపాంతరతముణ్ని సృష్టించి వేదాలన్నీ నేర్చుకోమని చెప్పాడు విష్ణుమూర్తి.

   అపాంతరతముడు విష్ణుమూర్తి చెప్పినట్లు చేశాడు. విష్ణుమూర్తి అతణ్ని మన్వంతరాల్లో పుట్టి వేదాలు వ్యాపింపచేస్తాడని, విష్ణుతత్త్వం గ్రహించి ముల్లోకాల ధర్మాల్ని తెలుసుకుని గొప్ప ఋషి అవుతాడని, తరువాత కాలంలో వసిష్ఠుడికి మనుమడయిన పరాశరుడికి పుట్టి వేదాలు వ్యాప్తి చేసి, అందరి ధర్మ సందేహాలు తీర్చి లోకహితం కోసం శ్లోకాలుగా రాస్తాడని చెప్పాడు.

   పూర్వం పరాశర మహర్షి తీర్థయాత్రలు చేస్తూ యమునానదీ తీరంలో దాశరాజు కూతురు సత్యవతి నడుపుతున్న నావ ఎక్కి, ఆమెని చూసి ఇష్టపడ్డాడు. దివ్యదృష్టితో ఆమె జన్మవృత్తాంతాన్ని తెలుసుకుని తన కోరిక ఆమెకి చెప్పాడు. వాళ్లకి వేదమయుడైన వ్యాసుడు కలిగాడు. పరాశరుడు కుమారుణ్ని దీవించి సత్యతికి చెప్పి తీర్థయాత్రలకి వెళ్లిపోయాడు.

   వ్యాసుడు లోక కళ్యాణం కోసం తపస్సు చెయ్యడానికి బయలుదేరి తల్లికి నమస్కరించి అమ్మా! మీకు అవసరమైనప్పుడు నన్ను తల్చుకోగానే నేను వస్తాను అని చెప్పి వెళ్లిపోయాడు.

   వ్యాసుడు యమునానదీ తీరంలో పుట్టాడు కనుక కృష్ణద్వైపాయనుడనీ, వేదాలు విభజించాడు కనుక వేదవ్యాసుడనీ, పరాశరుడి కుమారుడు కనుక పారాశర్యుడనీ, సత్యవతి కుమారుడు కనుక సాత్యవతేయుడని పిలవబడ్డాడు. వ్యాసుడు ఒక ఆశ్రమం నిర్మించుకుని శిష్యులకి వేదం నేర్పిస్తున్నాడు.

   కొంతకాలం తర్వాత కురువంశానికి రాజయిన శంతన మహారాజు సత్యవతిని పెళ్లిచేసుకోవాలని అనుకున్నాడు. అతడి మొదటి కొడుకు భీష్ముడు సత్యవతీ శంతనులకి వివాహం జరిపించాడు. శంతనమహారాజుకి చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అని ఇద్దరు కొడుకులు కలిగారు. వాళ్లు పెరిగి పెద్దవాళ్లయ్యాక శంతనుడు మరణించాడు. వాళ్లల్లో చిత్రాంగదుడు గంధర్వులతో యుద్ధం చేసి మరణించాడు. భీష్ముడు విచిత్రవీర్యుడికి పట్టాభిషేకం చేసి పెళ్లి కూడా జరిపించాడు. కొంతకాలానికి విచిత్ర వీర్యుడు కూడా మరణించాడు. ఇద్దరికీ సంతానం లేదు.

      సత్యతి తన కుమారుడు వ్యాసమహర్షిని పిలిచి తన కోడళ్లకి సంతానం కలిగేలా చూడమని లేకపోతే వంశం నాశనం అయిపోతుందని చెప్పి బాధపడింది. వ్యాసమహర్షి అందుకు అంగీకరించి ఒక సంవత్సరం సత్యవతి కోడళ్లు అంబిక అంబాలికల్నిపవిత్రులుగా చెయ్యడానికి వ్రతం చేయించమన్నాడు. తరువాత సత్యవతి కోడళ్లని వ్యాసమహర్షి దగ్గరికి పంపించింది. వ్యాసుడి రూపం చూసి భయపడి కళ్లు మూసుకున్న అంబాలికకి పుట్టుకతో గ్రుడ్డివాడయిన ధృతరాష్ట్రుడు పుట్టాడు. వ్యాసమహర్షి రూపాన్ని చూసి కదలిక లేకుండా నిలబడి పోయిన అంబాలికకి పాండురోగంతో పాండురాజు పుట్టాడు.

   సత్యవతి అంబికకి భయపడవద్దని నచ్చచెప్పి వ్యాసమహర్షి దగ్గరికి మళ్లీ పంపించింది. కాని అంబిక వ్యాసమహర్షి రూపానికి భయపడి తన దాసిని పంపించింది. దాసి వ్యాసమహర్షిని భక్తి శ్రద్ధలతో పూజించింది. ఆమెకి విదురుడు అనే పేరుతో యమధర్మరాజు మహాజ్ఞానిగా పుట్టాడు.

    తరువాత కౌరవులు పాండవులు పుట్టడం పాండురాజు మరణించడం జరిగింది. వ్యాసమహర్షి వచ్చి తల్లితో రాబోయే రోజుల్లో అన్నీ కష్టాలే ఉంటాయి. సంసారం మీద ప్రేమ వదిలి పెట్టి కోడళ్లతో కలిసి తపస్సు చేసుకుని పుణ్యలోకాలకి చేరుకో అన్నాడు. సత్యవతి వ్యాసమహర్షి చెప్పినట్లు తపస్సు చేసుకుని శరీరాన్ని విడిచి పెట్టింది.

   శాలిహోత్రుడి ఆశ్రమంలో ఉన్న కొలనులో స్నానం చేస్తే ఆకలి దాహం ఉండవని, అలా చెయ్యమని లక్క ఇంట్లోంచి బయటపడిన పాండవులతో చెప్పాడు. మత్స్య యంత్రం పడగొట్టిన తరువాత ద్రౌపదిని పాండవులు అయిదుగురికి ఇచ్చి పెళ్లి చెయ్యడానికి ఆలోచిస్తున్న ద్రుపదుడికి ద్రౌపది జన్మ వృత్తాంతం చెప్పి పాండవులతో ద్రౌపది పెళ్లి జరిపించాడు వ్యాసమహర్షి.

   ద్వైతవనంలో ఉన్న పాండవులు భీష్మ, ద్రోణ, కృపాచార్యుల్ని ఓడించడం కష్టమని సందేహిస్తున్న సమయంలో ధర్మరాజుకి ప్రతిస్మృతిఅనే విద్య ఉపదేశం చేశాడు. అదే విద్యని ధర్మరాజు అర్జునుడికి ఉపదేశించాడు. అర్జునుడు తపస్సు చేసి దేవతల నుంచి అస్త్రాల్ని పొందాడు.

   కురుక్షేత్రంలో మహాభారతయుద్ధం జరుగుతున్నప్పుడు కౌరవ పాండవుల్లో జయం ఎవరికి కలుగుతుంది అని ధృతరాష్ట్రుడు అడిగినప్పుడు పాండవులే జయిస్తారని చెప్పాడు. శ్రీకృష్ణుడు చెప్పినట్లు సంధి చేసుకోమని లేకపోతే యుద్ధం తప్పదని చెప్పాడు. యుద్ధ సమయంలో ఎప్పటికప్పుడు యుద్ధ విశేషాలు తెలియచేసే శక్తి సంజయుడికి ఇచ్చి అతడి ద్వారా విషయాలు తెలుసుకోమని కూడా చెప్పాడు.

   యుద్ధంలో అభిమన్యుడి మరణానికి బాధపడుతున్న పాండవుల్ని ఓదార్చాడు వ్యాసమహర్షి. అశ్వత్థామ నారాయణాస్త్రం వ్యర్థమయిందని బాధపడుతున్నప్పుడు నారాయణుడే శ్రీకృష్ణుడని అతడి అంశ అయిన అర్జునుడి మీద పనిచెయ్యదని అతడి అజ్ఞానాన్ని పోగొట్టాడు. అర్జునుడు యుద్ధం చేస్తుంటే తనకంటే ముందు ఒక మహాపురుషుడు శూలంతో రాజుని చంపుతున్నట్లు తను ఊరకే బాణాలు వేస్తున్నట్లు కనిపించింది దానికి అర్థం చెప్పమని అడిగాడు. వ్యాసమహర్షి శంకరుడే కరుణించి అర్జునుడికి సహాయపడ్డడని చెప్పి అర్జునుడిలో శివభక్తి పెంచి శివుణ్ని మనస్సులో తల్చుకుంటూ యుద్ధం చెయ్యమని చెప్పాడు.

   కౌరవులు యుద్ధంలో మరణించినప్పుడు పుత్రుల మీద ప్రేమతో ధృతరాష్ట్రుడు, గాంధారి పాండవుల్నిశపించకుండా కాపాడాడు.  యుద్ధం తరువాత బంధుమిత్రులు, రాజులు పోయినందుకు బాధపడుతున్న ధర్మరాజుకి రాజ్యాన్ని అనాధగా వదిలి బాధపడ్డం ధర్మం కాదని సుద్యుమ్నుడి చరిత్ర, సేనజిత్తుడి మాటలు, ధర్మాధర్మాలు, ప్రాయిశ్చిత్త విశేషాలు, మరుత్తుడి కథ చెప్పి అశ్వమేథయాగం కూడా చేయించాడు వేదవ్యాసుడు.

   వ్యాసుడి ఉపదేశం ప్రకారం ధృతరాష్ట్రుడు ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకుని గాంధారితో కలిసి ఉన్నాడు. పాండవులతో కలిసి ఉన్న ధృతరాష్ట్రుడికి దివ్యదృష్టితో చనిపోయిన వాళ్ళందర్నీ చూడగలిగేలా చేసి ఎవరెవరు ఎక్కడెక్కడికి చేరారో చూపించాడు.

   యాదవస్త్రీలని రక్షించడానికి అస్త్రం తీసిన అర్జునుడికి అస్త్రాలు పనిచెయ్యలేదు. అర్జునుడు వేదవ్యాసుడి పాదాల మీద పడి తన అవమానం గురించి చెప్పి దుఃఖించాడు.

   నాయనా! కృష్ణావతారం అయిపోయాక ఆయన ప్రభావం నీ మీద లేదు. కాలం మనది కానప్పుడు మనం ఏం చేసినా అది కలిసిరాదు. జ్ఞానమున్నవాడివి కనుక విషయాలు తెలుకుని నువ్వు కూడా సర్వసంగ పరిత్యాగం చేసి నీ వాళ్లతో కలిసి ఉత్తమ గతులు పొందుని చెప్పాడు.

   పాండవులు  అందరు శరీరాలు విడిచిపెట్టాక పాండవుల కీర్తి విస్తరింప చెయ్యడానికి రాజుల చరిత్రలు ప్రజలకు తెలియ చెయ్యడానికి, దేవదేవుడి లీలలు, సర్వదేవతల జన్మలు వంటివి ఎన్నో తెలియపరుస్తూ సర్వజ్ఞుడు, సత్యదర్శి సర్వవిజ్ఞానభవుడు అయిన వేదవ్యాసుడు మహాభారతాన్ని పంచమ వేదంగా రచించి మనకి అందించాడు.

   వేదవ్యాసుడు నడిచి వెడుతున్నప్పుడు ఒక పురుగు భయంతో పరుగెడుతూ కనిపించింది. వ్యాసుడు ఆ పురుగుని నీ బతుకే నికృష్టం కదా!  బతికి ప్రయోజనం ఏముంది? చచ్చిపోవడమే సుఖం కదా! భయపడతావెందుకు? అని అడిగాడు.

   పురుగు మహాత్మా! నేను పురుగుని కదా! నాకు అంత విషయ పరిజ్ఞానం ఎక్కడ ఉంటుంది? బతకడమంటే సుఖం, చావడమంటే భయం తప్ప ఇంకేమీ తెలియవు. అన్ని జీవులకి తెలిసేది ఇదే కదా? అంది.  ఆ పురుగు మీద దయ చూపించి  శూద్ర, వైశ్య, క్షత్రియ జన్మలు వరుసగా వచ్చేలా వరమిచ్చాడు.

   విష్ణుప్రభావం వల్ల పుట్టిన వ్యాసమహర్షి బ్రహ్మ చెప్పగా వేదాల్ని నాలుగు భాగాలుగా చేసి ఋగ్వేదం పైలుడికి, యజుర్వేదం వైశంపాయనుడికి, సామవేదం జైమినికి, అధర్వణవేదం సుమంతుడికి చెప్పి, వాళ్ల వాళ్ల శిష్యులతో వ్యాప్తి పొందేలా చేశాడు.

   చతుర్వేదాలు, అష్టాదశ పురాణాలు, చతుర్దశ విద్యలు అన్నీ నేర్చుకుని, బ్రహ్మర్షులు, దేవర్షులు, రాజర్షులు చదివి అందరికీ చెప్పగలిగేలా చేశాడు వేదవ్యాసమహర్షి. పరమేశ్వరుణ్ణి ఆరాధించి పక్షి రూపంలో ఉన్న ఘృతాచి అనే అప్సరసయందు ఒక కొడుకుని పొందాడు. అతడి పేరు శుకుడు. పుడుతూనే అన్ని వేదాలు నేర్చుకున్న శుకుడు తండ్రి దగ్గర సమస్త విషయాలు తెలుసుకుని చివరికి యోగమార్గంలో అంతర్థానమయ్యాడు. ఇంత వరకు మహాభారంలో వ్యాసమహర్షి గురించి తెలుసుకున్నాం. వ్యాసమహర్షి చరిత్ర తెలుసుకోవాలంటే ఒక పెద్ద గ్రంథమే చదవాలి. వ్యాస రచనలు వ్యాససంహిత, వ్యాసస్మృతి. వీటిలో నిత్యకర్మల గురించి అనేక విషయాల చెప్పబడ్డాయి!!