About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

మహాభరతకథ-12

                                            తల్లి శాపానికి బాధపడిన శేషుడు - వాసుకి

   పాములకి తెలియకుండా ఇంద్రుడు అమృతాన్ని తీసుకుని వెళ్లిపోయాడు. అమృతం తాగే యోగం పాములకి లేకుండా పోయింది. జరిగినదానికి శేషుడు బాధపడ్డాడు. తన తల్లి, తమ్ముళ్లు ధర్మవిరుద్ధమైన పనులు చెయ్యడం వల్ల ఇంత అవమానాన్ని పొందవలసి వచ్చింది.

   దు:ఖంతో ఇల్లు వదిలి తపస్సు చేసుకోడానికి గంధమాదన పర్వతానికి వెళ్లిపోయాడు.  గోకర్ణక్షేత్రం, పుష్కరారణ్యం, హిమాచలం మొదలైన పుణ్యక్షేత్రాల్లో అనేక వేల సంవత్సరాలు బ్రహ్మ గురించి తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. ఏ వరాలు కావాలో కోరుకోమన్నాడు.

   “బ్రహ్మదేవా! నా తల్లి కద్రువ, తమ్ముళ్లు కలిసి, నా సవతి తల్లి  వినతని, సోదరుడు గరుత్మంతుణ్ని అనేక విధాలుగా అవమానించారు. వాళ్లు ఎప్పటికీ మారరు. ఇవన్నీ చూస్తూ వాళ్లతో కలిసి ఉండడం నాకు ఇష్టం లేదు. తపస్సు చేస్తూ ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తాను!” అన్నాడు.

   అతడి మాటలు విని బ్రహ్మ “నాయనా! నువ్వు ఎప్పుడూ సత్యాన్ని మాట్లాడతావు. ధర్మబద్ధంగా జీవిస్తావు. దేన్నైనా భరించగల శక్తి, ఓర్పు కలవాడివి. ఈ భూమి మొత్తం భారాన్ని నువ్వే పద్ధతిగా మొయ్యాలి. వినత కుమారుడు గరుత్మంతుడు చాలా గొప్ప పరాక్రమవంతుడు. కశ్యపుడు, వాలఖిల్యులు మొదలైన  మునులతో వరాలు పొందిన పక్షిరాజు. ఇంద్రుణ్ని కూడా ఓడించి అందరితో పొగడ్తలు అందుకున్నాడు. నువ్వు తెలివిగా ఉండి అతడితో స్నేహంగా ఉండడం నీ విధిగా అనుకో!” అని నచ్చ చెప్పాడు బ్రహ్మ.

   శేషుడు బ్రహ్మ చెప్పినట్టుగా భూమి యొక్క సమస్త భారాన్ని మోస్తున్నాడు. గరుత్మంతుడితో స్నేహంగా మెలుగుతూ ప్రశాంతంగా జీవిస్తున్నాడు.

   తమ తల్లి కద్రువ ఇచ్చిన శాపం వల్ల జనమేజయుడు సర్పయాగం చెయ్యబోతున్నాడని పాముల్లో ముఖ్యుడైన వాసుకి అనే పేరుగల పాము తెలుసుకున్నాడు. సర్పయాగంలో తమకు కలగబోయే వినాశనాన్ని తలుచుకుని బాధపడుతున్నాడు. చుట్టాలందర్నీ పిలిపించాడు. ఐరావతుడు అనే పేరు గల తన సోదరులందరినీ కూడా పిలిచి తన బాధ చెప్పుకున్నాడు.

   శేషుడు చాలాకాలం తపస్సు చేసి విశాలమైన  భూమిని మొయ్యడం అనే గొప్ప పనిలో ఉండిపోయాడు. మనతో స్నేహాన్ని బంధుత్వాన్ని విడిచి పెట్టి తనంతట తాను ఒంటరిగా ఉండిపోయాడు. మనందరికీ ఆపద రాబోతోందని తెలిసి కూడా మన భయాన్ని పోగొట్టే పని ఏదయినా చెయ్యాలన్న ఆలోచనే అతడి మనసుకి కలగడం లేదు.

   అమృతం కోసం సముద్రాన్ని చిలికినప్పుడు మంథర పర్వతానికి అల్లెత్రాడుగా ఉండి నేను పడిన కష్టానికి అందరూ మెచ్చుకుని నాకు ఏ భయమూ లేకుండా ఉండేట్టు వరం ఇచ్చారు. నా గురించి నాకు భయం లేదు.

    కాని, మన తల్లి కద్రువ ఇచ్చిన శాపం వల్ల మన నాగజాతికే వినాశనం కలుగబోతోంది. అందుకే నేను చాలా దు:ఖపడుతున్నాను. మన జాతికి కలగబోయే ఉపద్రవాన్ని ఆపడానికి ఏదైనా ఉపాయం ఉందా? ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? అని వాసుకి మిగిలిన పాముల్ని సలహా అడిగాడు.

   వాసుకి కంటే చిన్నవైన పాములు కొన్ని “అంత భయమెందుకు? జనమేజయుడు యాగం మొదలుపెట్టినప్పుడు అది జరగకుండా అడ్డు పడదాం. జనమేజయుడు ధర్మపరుడు కనుక మనం బ్రాహ్మణ రూపాల్లో వెళ్లి ఈ యాగాన్ని ఆపమని చెప్తే వింటాడు. ఈ యాగం చెయ్యడం వల్ల ఇహపర సౌఖ్యాలకి అనేక ఆటంకాలు కలుగుతాయని నచ్చచెప్దాం.

   మనమందరం ఒకే మాట మీద ఉండి ఋత్విక్కులు కూడా యాగాన్ని వదిలి పారిపోయేలా చేద్దాం. యాగానికి వచ్చిన వాళ్లందరికీ పెట్టే భక్ష్యాలు, భోజ్యాలు, లేహ్యాలు, పానీయాలు అనబడే నాలుగు రకాలైన ఆహార పదార్థాల మీద విషాన్ని చిమ్ముదాం. సభలో ఉండే బ్రాహ్మణుల మీద పరుగులు పెడదాం. ఋత్విక్కులు యాగం చెయ్యడం మానేసి భయంతో పారిపోయేలా చేద్దాం! అన్నాయి.

   వాళ్ల మాటలు విన్న పెద్ద పాములు అది అంత తేలికైన పని కాదు. బ్రాహ్మణులు మంత్రాలు చదువుతూ అగ్నిలో నెయ్యి వేసేటప్పుడు పైకి లేచే అగ్ని జ్వాలలు ఎంత ఎత్తున లేస్తాయో మనం ఊహించలేం. ఆ సమయంలో మనం అనుకున్నట్టు జరుగుతుందని ఊహించవద్దు! అన్నాయి.

   వాటిలో ఏలాపుత్రుడు అనే నాగ కుమారుడు కద్రువ పాములకి శాపం ఇచ్చే రోజున నేను ఆమె ఒడిలో నిద్ర రాకపోయినా నిద్రపోతున్నట్టు కళ్లు మూసుకుని ఉన్నాను. అప్పుడు గొప్ప గొప్ప దేవతలు, బ్రహ్మ ఒకళ్లతో ఒకళ్లు మాట్లాడుకున్న మాటలు విన్నాను. అవి మీకు వివరంగా చెప్తాను వినండి.

   తల్లి కద్రువ పాములకి శాపం ఇచ్చిన వెంటనే దేవతలందరూ బ్రహ్మతో తండ్రీ! కద్రువ ఎంతో బలపరాక్రమాలు కలిగిన తన కుమారుల్ని భయంకరంగా శపించింది. దాన్ని ఎవరూ అడ్డుకోలేదు. ఈ శాపానికి వేరే మార్గం ఏమైనా ఉందా? అని అడిగారు.

   వాళ్లు అడిగినదానికి బ్రహ్మ లోకానికి హాని కలిగించే క్రూరమైన పాములు భూమాతకి బరువుగా అనిపిస్తున్నాయి. అందుకే భూమికి భారం తగ్గించడం కోసం సర్పయాగం చెయ్యడం వల్ల పాములకు కలిగే నాశనానికి అంగీకరించ వలసి వచ్చింది.

   వాసుకి చెల్లెలైన జరత్కారువుకీ, జరత్కారుడు అనే గొప్ప మహర్షికీ వివాహం జరగాలి. వాళ్లిద్దరికీ గొప్ప తేజస్సుతో పుట్టే ఆస్తీకుడు అనే మహర్షి జనమేజయుడి యాగాన్ని ఆపగలడు. అలా జరిగినప్పుడు లోకానికి మంచిని చేసే ప్రముఖులైన నాగులు రక్షింపబడతారు అని దేవతలకి చెప్పిన విషయాన్ని చెప్పాడు.

   నాగులందరు అది విని సంతోషంతో ఏలాపుత్రుణ్ని ఎత్తుకుని పొగిడారు. ఎప్పుడు జరత్కారుడు వస్తాడో ఎప్పుడు తన చెల్లెలు జరత్కారువుని భార్యగా స్వీకరిస్తాడో అని వాసుకి ఎదురు చూస్తున్నాడు.

 

మహాభారతకథ-12


మహాభారతకథ-11

 

                                                         గరుత్మంతుడు-దేవతలు యుద్ధము

    మనస్సుకంటే మించిన వేగంతో గరుత్మంతుడు అమృతం దగ్గర కాపలాగా ఉన్న దేవ ప్రముఖుల దగ్గరకు వచ్చాడు. విశాలమైన రెక్కలు గలవాడు, పక్షిజాతికి రాజు, గొప్ప బలవంతుడు అయిన గరుత్మంతుణ్ని చూసి అమృతం దగ్గర కాపలాగా ఉన్న దేవతలు  భయపడి బాణాలతోను, రకరకాలైన శస్త్రాస్త్రాలతోను యుద్ధం మొదలుపెట్టారు.

   గరుడుడు తన రెక్కల్ని విదిలించి వర్షం కురిపించినట్టు దుమ్ము వర్షం కురిపించాడు. స్వర్గలోకం మొత్తం ధూళితో కప్పబడి దేవతలకి ఎదీ కనిపించకుండా చీకటిగా అయిపోయింది.అమృతానికి కావలిగా ఉన్న దేవతలు ఇంద్రుడికి మొర పెట్టుకున్నారు. ధూళి మొత్తం పోయేలా చెయ్యమని ఇంద్రుడు వాయుదేవుణ్ని పంపించాడు. వాయుదేవుడు గాలి గట్టిగా వీచేలా చేసి దుమ్మంతా పోగొట్టాడు.

   అక్కడ కావలిగా ఉన్న భౌమనుడు గొడ్డలి, వజ్రం, ఈటె, విల్లు, బాణం, కంపం, చక్రం అనే అయుధాలు ధరించిన తన సైన్యాన్ని తీసుకుని గరుత్మంతుణ్ని ఎదుర్కున్నాడు. కాని, అగ్నిలా మండిపోతున్న గరుత్మంతుడి కోపాగ్నిలో పడి మాడిన మిడతలా కాలి బూడిదయ్యాడు. అతడి సైన్యాన్ని కూడా రెక్కలతోను, ముక్కు కొనతోను, కాళ్ల గోళ్లతోను రక్తం ధారలు కట్టేట్టు చేస్తున్నాడు గరుత్మంతుడు.  దేవతలందరూ పరుగులు పెడుతూ ఇంద్రుడి దగ్గరికి వెళ్లారు.

   సాధ్యులు అనే దేవతాగణం తూర్పు దిక్కుకి పారిపోయారు. వసువులు, రుద్రులు దక్షిణ దిక్కుని ఆశ్రయించారు. పన్నెండు మంది సూర్యులు దిగులుతో పడమటి దిక్కుకి జారిపోయారు. అగ్ని, వరుణుడు, వాయువు, కుబేరుడు, యముడు రాక్షసుడైన  నైర్రుతి అనే దిక్పాలకుడు దిక్కు తెలియకుండా పారిపోయారు.

   రేణువు,  క్రథనుడు, ప్రలిహుడు, ప్రరుజుడు, అశ్వకృంతుడు, పదనఖుడు, అనే కావలివాళ్లని తన వజ్రం వంటి గోళ్లతో గరుత్మంతుడు చీల్చి ముక్కలుగా చేసాడు. చివరికి యుద్ధం ముగిసింది. దేవతా ప్రముఖులందర్నీ ఓడించాడు గరుత్మంతుడు. అమృతం ఎక్కడ ఉందో తెలుసుకుని అక్కడికి వెళ్లాడు.

  ఆకాశాన్నే మింగ కలిగినంత  పెద్ద పెద్ద మంటలతో తన నాలుకలు చాపి అగ్ని అమృతాన్ని కాపలా కాస్తున్నాడు. అగ్నిని చూసిన గరుత్మంతుడు వేగంగా వెళ్లి అన్ని నదుల్లో ఉన్న నీటిని తన నోటిలో ఉంచుకుని తీసుకుని వచ్చి అగ్ని మీద పోసి చల్లార్చాడు.

   పదునైన అంచులతో వేగంగా తిరుగుతున్న యంత్రానికి అడుగున అమృతం చాలా జాగ్రత్తగా ఉంచబడింది. గరుడుడు తన పెద్ద ఆకారాన్ని తగ్గించుకుని చిన్నగా మారి యంత్రం అంచుల కిందకి దూరి వెళ్లాడు. అతి ఎవరేనా అమృతం దగ్గరికి వస్తే విషాన్ని చిమ్ముతూ అమితమైన కోపంతో నిప్పుకణాల్లా ఎర్రగా ఉన్న కళ్లతో కాపలా కాస్తున్న రెండు భయంకరమైన పాములు కనిపించాయి.

   గరుత్మంతుడు తన రెండు రెక్కల్ని వేగంగా విదిలించాడు. వాటి నుంచి వచ్చిన దుమ్ముకి పాములకి కళ్లు కనిపించలేదు. అదే సమయంలో వాటి తలల మీద కొట్టి అతి బలవంతుడైన గరుత్మంతుడు అమృతాన్ని తీసుకుని ఆకాశంలోకి ఎగిరిపోయాడు.

గరుత్మంతుడు-విష్ణుమూర్తి- ఇంద్రుడు

   ఇంతమంది దేవప్రముఖుల్ని, అతి వీరుల్ని ఓడించి అమృతాన్ని తీసుకుని వెడుతున్న గరుత్మంతుడికి దాన్ని తాగాలని కొంచెం కూడా అనిపించలేదు. దాని వైపు కూడా చూడకుండా దాన్ని ఎవరి కోసం సంపాదించాడో వాళ్లకి ఇవ్వడానికి ఆకాశంలో ఎగురుతూ వెళ్లిపోతున్న గరుత్మంతుణ్ని చూశాడు విష్ణుమూర్తి.

   అతడి అంకితభావానికి, శౌర్యానికి , వేగానికి, అనాసక్తికి, మంచితనానికి ఆనందించిన విష్ణుమూర్తి  గరుత్మంతుణ్ని  కావలసిన వరాలు కోరుకోమన్నాడు. గరుత్మంతుడు శ్రీమహావిష్ణువుకి నమస్కరించి “దేవా! అమృతం తాగకుండానే ముసలితనం, మరణం రాకుండా ఉండేట్లు, అన్ని లోకాల్లోను పూజింపబడే నీయందు భక్తి కలిగి ఉండేటట్టు అనుగ్రహించు!” అని వేడుకున్నాడు.

   విష్ణుమూర్తి అతడు అడిగిన వరాలు ఇచ్చి తనకు వాహనంగాను, జండాగాను ఉండేటట్లు కూడా అనుగ్రహించాడు. తరువాత విష్ణుమూర్తికి నమస్కరించి గరుత్మంతుడు ఆకాశంలోకి ఎగిరిపోయాడు.

   ఇంద్రుడు అతడి మీదకి తన వజ్రాయుధాన్ని విసిరాడు. గరుత్మంతుడి రెక్కలు నరికెయ్యడానికి ఆకాశంలో నిప్పుకణాలు ఎగురుతున్నాయేమో అనిపించేంత వేగంగా వెళ్లింది వజ్రాయుధం. దాన్ని చూసి గరుత్మంతుడు నవ్వి “నువ్వు నన్ను కనీసం తాకలేవు కూడా! గొప్ప తపస్సంపన్నుడైన దధీచి మహర్షి వెన్నెముకతో చెయ్యబడిన నీ మీద గౌరవంతో, నీకు అవమానం జరగకూడదని ఒక్క ఈక మాత్రం తీసుకుని వెళ్లిపోడానికి అవకాశమిస్తున్నాను. ఇంతకంటే నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు” అన్నాడు.

   అతడి రెక్కల బలానికి అబ్బురపడి వజ్రాయుధం అతణ్ని సువర్ణుడు’ అని స్తుతించింది. ఇంద్రుడు  పక్షిరాజు గొప్పతనానికి ఆశ్చర్యపడి “సాటిలేని పరాక్రమం కలిగిన గరుత్మంతుడా! ఇంత బలపరాక్రమాలు కలిగిన వాడిని ఇంతవరకు నేను చూడలేదు. నాకు నీతో స్నేహం చెయ్యాలని ఉంది. నువ్వు ముసలితనం, మరణము లేనివాడివని; ఇంతటివాడివి, అంతటివాడివి అని పొగడడానికి కూడా అందనివాడివి. నీకు అమృతం ఎందుకు?

   అమృతాన్ని తీసుకుని వెళ్లి నువ్వు ఎవరికి ఇస్తావో వాళ్లని దేవతలు కూడా జయించలేరు. నువ్వు ఈ అమృతాన్ని ఇతరులెవ్వరికీ ఇవ్వకూడదు. దాన్ని నాకు ఇచ్చేస్తే నీకు కావలసింది నేనే చేసి పెడతాను” అన్నాడు.

   దేవేంద్రుడి మాటలు విని “దేవేంద్రా! అమృతం తీసుకుని వస్తానని కద్రువ పిల్లలు పాములకి మాట ఇచ్చాను. దీన్ని పాములకి ఇస్తే నా తల్లి  వినతకి దాస్యం తొలగి పోతుంది. నేను ఈ అమృతం తీసుకుని వెళ్లి నా తల్లిని దాస్యం నుంచి విడిపించాలి. నేను దీన్ని తీసుకుని వెళ్లి పాములకి ఇస్తాను. అవి తాగక ముందే నువ్వు వచ్చి అమృతాన్ని తీసుకుని వెళ్లిపో!” అని ఇంద్రుడికి ఉపాయం చెప్పాడు గరుత్మంతుడు.

   అతడు చెప్పిన ఉపాయానికి ఇంద్రుడు మెచ్చుకుని “నీ బలపరాక్రమాలు చెప్తావా? వింటాను” అని అడిగాడు. అది విని గరుడుడు “ఇంద్రా! ఇతరుల్ని నిందించడం, తనను తాను మెచ్చుకోవడం సజ్జనులు చేసే పని కాదు కదా! అయినా నువ్వు అడిగావు కనుక చెప్తాను. అవి విన్నాక నువ్వు ఆశ్చర్యపోతావు. నాకు నిజంగా ఉన్న లక్షణాల్నే నీకు చెప్తాను.

    కదలగలిగిన, కదలలేని పదార్థాలతో నిండి ఉన్న ఈ భూమండలాన్ని నాకున్న బలంతో మొయ్యగలను. నా బలమైన రెక్కల నుంచి వచ్చే గాలితో అన్ని సముద్రాల్లో ఉన్న నీళ్లని, అందులో ఉన్న రత్నాలతో సహా బయటికి వెదజల్లగలను. ముల్లోకాల్ని ఒక్క క్షణంలో చుట్టి రాగలను!” అని చెప్పాడు.

  ఇంద్రుడు అతడు చెప్పినది విని అతడి వేగానికి, బలానికి, శక్తికి మెచ్చుకుని “నువ్వు నాతో స్నేహంగా ఉంటావా? నువ్వు నాకు ఇష్టమైన పని చేశావు. నేను కూడా నీకు ఇష్టమైన పని చేస్తాను. నీకు ఏం కావాలో అడుగు” అన్నాడు.

   ఇంద్రుడి మాటలు విని గరుత్మంతుడు “అమితమైన గర్వంతో నా తల్లికి అపకారం చేసిన కద్రువ కుమారులు పాముల్ని నాకు ఆహారంగా చెయ్యి!  నేను తినలేక నిన్ను అడగట్లేదు. నువ్వు రక్షిస్తున్న లోకాల్లోనే పాములు  తిరుగుతున్నాయి. నీ ఆజ్ఞ తీసుకోవడం ధర్మం కనుక అడుగుతున్నాను” అని చెప్పాడు. పాములు తనకు ఆహారంగా ఉండేలా  ఇంద్రుడి దగ్గర అనుజ్ఞ తీసుకుని ఇంద్రుడితో సహా పాముల దగ్గరికి వచ్చాడు. తను తెచ్చిన అమృతాన్ని మరకతమణుల్లా పచ్చగా మెరిసిపోతున్న దర్భల మీద పెట్టాడు.

   పాముల్ని పిలిచి “దేవేంద్రుడి దగ్గరికి వెళ్లి అమృతాన్ని తెచ్చాను. కనుక సూర్యుడు, అగ్ని, గాలి, చంద్రుడు మొదలైన వాళ్లందరి సాక్షిగా నా తల్లి వినత దాసితనం పోయింది. మీరందరు పవిత్రంగా స్నానం చేసి వచ్చి ఈ అమృతాన్ని తాగండి” అని చెప్పాడు. తరువాత  పక్షిరాజు గరుత్మంతుడు తల్లి వినతని తన వీపు మీద కూర్చోబెట్టుకుని, ఎవరికీ కనిపించకుండా దాక్కుని ఉన్న దేవేంద్రుడి వైపు చూసి వెళ్లిపోయాడు.

    పాములన్నీ అమృతం తాగాలని ఉత్సహంతో స్నానం చెయ్యడానికి వెళ్లాయి. అవి అటు వెళ్లగానే ఇంద్రుడు అమృతాన్ని తీసుకుని స్వర్గలోకం వెళ్లిపోయి దాన్ని ఒక సురక్షిత ప్రాంతంలో పెట్టాడు.

   దర్భల మీద ఉన్న అమృతం తాగాలని స్నానం చేసి వచ్చిన పాములు తమ నాలుకలతో దర్భల మీద నాకాయి. అందువల్ల పాముల నాలుకలు రెండుగా చీలిపోయాయి. అమృతాన్ని త మీద ఉంచడం వల్ల దర్భలు మాత్రం పవిత్రమయ్యాయి.

   పాముల నాలుకలు చీలి ఉండడానికి కారణం, దర్భలు పవిత్రత పొందడానికి కారణం తెలిసిందిగా!

 

మహాభారత కథ-10-

 

గరుత్మంతుడు కథలు

గరుత్మంతుడు-అమృతము

   గరుత్మంతుడు తన తల్లిని దాసీతనం నుంచి విముక్తురాల్ని చెయ్యాలని అనుకున్నాడు. పాములతో సంప్రదించాడు. విముక్తుల్ని చెయ్యాలంటే తమకి అమృతం తెచ్చి ఇవ్వాలని చెప్పాయి. గరుత్మంతుడు అందుకు అంగీకరించాడు.     పాములకి ఇవ్వడానికి అమృతం తీసుకుని వస్తానని చెప్పి తల్లికి నమస్కరించి ఆమె ఆశీర్వాదం తీసుకున్నాడు. నాయనా! నీ పెద్ద శరీరరాన్ని సూర్యుడు రక్షిస్తాడు. పెద్ద పెద్ద రెక్కల్ని వాయువు, వీపుని చంద్రుడు, తలని అగ్ని రక్షిస్తారు. విజయాన్ని కీర్తిని పొందుతావు! అని దీవించింది తల్లి వినత.

   తల్లి దగ్గర ఆశీర్వాదం తీసుకుని వెడుతున్న గరుడుడు తల్లితో అమ్మా! నేను చెయ్యబోతున్న పని చాలా కష్టమైంది. నాకు చాలా బలం కావాలి కనుక, తినడానికి ఏదేనా చూపించు! అని అడిగాడు. వినత నాయనా! సముద్రగర్భంలో ఉన్న బోయల సమూహం వల్ల ప్రజలకి హాని కలుగుతోంది. వాళ్లని నువ్వు ఆహారంగా తీసుకో! దాని వల్ల నీకు ఆకలి తీరుతుంది. ప్రజలకి మేలు కలుగుతుంది. వాళ్లని తినేప్పుడు నువ్వు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్లల్లో ఎవరికీ హాని తలపెట్టని బ్రాహ్మణులు ఉంటారు. వాళ్లని మాత్రం తినకుండా విడిచిపెట్టు!” అని చెప్పింది.

   అది విని గరుత్మంతుడు అమ్మా! వాళ్లల్లో బ్రాహ్మణుడు ఎవరో తెలుసుకోవడం ఎలా?” అని అడిగాడు.  నాయనా! గాలం అనే సాధనం మింగేటప్పుడు కంఠం దగ్గర గుచ్చుకుని బాధ పెడుతుంది కదా! అలాగే బ్రాహ్మణుడు కంఠం దగ్గర గుచ్చుకుంటూ నిప్పులా వేడిగా కాలుస్తుంటాడు.  కోపం వచ్చినప్పుడు బ్రాహ్మణుడు పదునైన ఆయుధంగాను, విషంగాను, నిప్పుగాను మారిపోతాడు.  బ్రాహ్మణుణ్ని గౌరవంగా చూస్తే ప్రజలకు మంచి కలిగేలా చేస్తాడు, గురువుగా ఉంటాడు, ఇష్టాన్ని నెరవేరుస్తాడు! అని బ్రాహ్మణుడి లక్షణాల్ని అతడికి అర్థమయ్యేలా చెప్పింది వినత. తల్లి చెప్పినట్టు గరుత్మంతుడు సముద్రం మధ్యలో ఉన్న బోయల్ని అందర్నీ తినేసి మళ్లీ అమృతం కోసం బయలుదేరాడు. అతడికి ఆకలి మాత్రం తీరలేదు.

గరుత్మంతుడు-ఏనుగు-తాబేలు

     అమృతం కోసం వెడుతున్న గరుత్మంతుడు మధ్యలో తపస్సు చేసుకుంటున్న తండ్రి దగ్గరికి వెళ్లి  తండ్రీ! నాకు చాలా ఆకలిగా ఉంది. తినడానికి ఏదయినా కావాలి! అని అడిగాడు.  అతడి తండ్రి కశ్యపబ్రహ్మ నాయనా! అగ్నితో సమానమైనవాడు, నియమనిష్ఠలు కలిగినవాడు విభావసుడు అనే పేరుగల బ్రాహ్మణుడు ఉన్నాడు. అతడు తన పెద్దలు సంపాదించి పెట్టిన ధనంతో సుఖంగా జీవిస్తున్నాడు.   అతడి తమ్ముడు సుప్రతీకుడు. ఒకరోజు అతడు తన అన్న విభావసుడి దగ్గరికి వెళ్లి తాత తండ్రులు సంపాదించి ఇచ్చిన ధనంలో తనకు కూడా భాగం పంచి ఇమ్మని అడిగాడు.

   ధనం మొత్తం తనకే కావాలని తమ్ముడికి ఇవ్వకూడదని అనుకున్న విభావసుడు తమ్ముణ్ని  ఏనుగుగా మారమని శపించాడు. తమ్ముడు సుప్రతీకుడు అన్నని తాబేలుగా మారిపొమ్మని శపించాడు.  ఇద్దరూ ఒకళ్లని ఒకళ్లు శపించుకోవడంవల్ల సుప్రతీకుడు మూడు ఆమడల పొడవు, పది ఆమడల పరిధితో తాబేలుగాను, విభావసుడు ఆరు ఆమడల పొడవు, పన్నెండు ఆమడల వెడల్పుతో ఏనుగుగాను మారిపోయారు. మారినవెంటనే ఏనుగు అడవిలోకి, తాబేలు చెరువులోకి వెళ్లిపోయాయి.

   పూర్వజన్మలో ఇద్దరి మధ్య ఉన్న విరోధం వల్ల వాళ్లిద్దరూ ఇప్పటికీ పోట్లాడుకుంటూనే ఉన్నారు. వాళ్లిద్దరి వల్ల వాళ్లకే కాదు ఎవరికీ ఉపయోగంలేదు. వాళ్లని తినేసి నీ ఆకలి తీర్చుకో!” అని చెప్పాడు.  వెంటనే గరుత్మంతుడు తన బలమైన రెక్కలతో ఏనుగుని, తాబేల్ని వెతికి పట్టుకుని రెండింటినీ ఒకేసారి పైకి ఎత్తి పాదాలతో బంధించి ఆకాశంలోకి ఎగిరిపోయాడు.   ఆకాశ మార్గంలో వెడుతున్న అతడికి సంపంగి పూల తీగలు చుట్టుకుని, దేవతా వృక్షాలతో ఎంతో మనోహరంగా ఉన్న ’అలంబ’ అనే పర్వతం కనిపించింది. ఆ పర్వతం మీద రోహిణము అనే పెద్ద దేవతా వృక్షం ఉంది. ఆ దేవతా వృక్షం గరుత్మంతుణ్ని గౌరవంగా పిలిచి వినతకుమారా! వంద ఆమడల పొడవుతో ఉన్న నా చెట్టు కొమ్మ మీద ఆగి ఏనుగుని, తాబేలుని తిని నీ ఆకలిని తీర్చుకుని వెళ్లు!” అని చెప్పింది.

   గరుత్మంతుడు అది చెప్పినట్టు ముందు కొమ్మ మీద కూర్చుని ఆకలి బాధ తీర్చుకుని వెడదామనుకుని కొమ్మ మీద కాలు మోపాడు. అతడి బరువుకి  ఫెళ్లుమని పెద్ద శబ్దం చేస్తూ కొమ్మ విరిగిపోయింది. ఆ ధ్వనికి దిక్కులు కంపించి పోయాయి.  చెట్టు మీద నివసిస్తున్న పక్షుల గుంపులు భయంతో పారిపోయాయి. సూర్యకిరణాలని ఆహారంగా తీసుకుంటూ వాలఖిల్యులు అనే మహర్షులు అదే కొమ్మని ఆధారంగా చేసుకుని తలకిందులుగా ఉండి తపస్సు చేసుకుంటున్నారు. ఆ కొమ్మ భూమి మీద పడితే మహర్షులకి బాధ కలుగుతుంది. అందువల్ల గరుత్మంతుడు ఆ కొమ్మని నోటికి కరుచుకుని, ఏనుగుని తాబేలుని పాదాలతో పట్టుకుని ఆకాశంలోకి ఎగిరాడు.

   తను నిలబడడానికి ఎక్కడేనా చోటు దొరుకుతుందేమోనని ఎంత వెతికినా ఎక్కడా కనిపించ లేదు.  గంధ మాదన పర్వతం మీద తపస్సు చేసుకుంటున్న తన తండ్రి దగ్గరికి వెళ్లి నమస్కరించాడు.  మేరుపర్వతంతో సమానమైన శరీరము, వాయువునే జయించ కలిగినంత గొప్ప వేగము, ఊహించలేనంత శక్తి, వెలుగుతున్న అగ్నికి ఉండేంత తేజస్సు కలిగిన వినత కుమారుడు గరుత్మంతుణ్ని, అతడి నోటిలో ఉన్న చెట్టు కొమ్మని, దానికి అతుక్కుని తలకిందులుగా వేలాడుతున్న పవిత్రులైన వాలఖిల్యులు అనే మహర్షుల్ని చూశాడు కశ్యపబ్రహ్మ.

   వాలఖిల్య మహర్షుల్ని చూసి “మహానుభావులారా! ఈ గరుత్మంతుడు లోక రక్షకుడు, గొప్ప బలవంతుడు. మీకు బాధ కలగకూడదని ఈ చెట్టుకొమ్మని వదలి పెట్టకుండా నోటికి కరుచుకుని తిరుగుతున్నాడు. దయతలచి మీరే ఈ కొమ్మని వదిలి వేరొక చోటికి వెళ్లి అతణ్ని అనుగ్రహించండి!” అని వేడుకున్నాడు. వాలఖిల్యమునులు కశ్యపుడి ప్రార్థన విని ఆ చెట్టు కొమ్మని వదిలి పెట్టి హిమాలయ పర్వతానికి వెళ్లిపోయారు.

    గరుత్మంతుడు చెట్టు కొమ్మ నోటిలో ఉండడం వల్ల మాటలు సరిగా పలక లేక పలుకుతూ తండ్రీ! ఈ చెట్టుకొమ్మ నా నోటికి అడ్డుగా ఉంది. బ్రాహ్మణులు లేని అడవి ప్రాంతం ఎక్కడ ఉందో చెప్పండి. అక్కడకి వెళ్లి దీన్ని వదిలి పెట్టాలి! అని అడిగాడు.  అతడి మాటలు విన్న కశ్యపబ్రహ్మ “నాయనా! హిమాలయాల్లో నిష్పురుష అనే కొండ ఉంది. అక్కడికి వెళ్లడం ఈశ్వరుడికి కూడా కష్టమే. ఆ కొండ గంధమాదన పర్వతానికి లక్ష ఆమడల దూరంలో ఉంది. ఈ చెట్టు కొమ్మని అక్కడ విడిచిపెట్టు! అని చెప్పాడు. తండ్రి మాటలు విని గరుత్మంతుడు మనో వేగం కంటే మించిన వేగంతో ఎగురుతూ వెళ్లి ఆ చెట్టు కొమ్మని  నిష్పురుషం అనే పర్వతం మీద విడిచి పెట్టాడు. తరువాత హిమాచల పర్వతం మీదకి వెళ్లి ఏనుగుని, తాబేలుని తిని  బలాన్ని పెంచుకుని తన పని మీద స్వర్గలోకానికి బయలుదేరాడు.  అతడు రెక్కలు విదిలించగానే  రెక్కల వేగం నుంచి వచ్చిన గాలికి ఆ పర్వతం మీద ఉన్న వృక్షాలకు పూసిన పువ్వులన్నీ జయం కలగాలని ఆశీర్వదిస్తూ జలజలా గరుత్మంతుడి మీద వర్షంలా పడ్డాయి.

వాలఖిల్య మహర్షుల వృత్తాంతము

   గరుత్మంతుడు ఆకాశమార్గంలో ఇంద్రుడి రక్షణలో ఉన్న అమృతం తీసుకుని రావడం కోసం  బయలుదేరాడు. ఆ సమయంలో స్వర్గలోకంలో అనేక దుశ్శకునాలు కనిపించాయి.  వాటిని చూసి ఇంద్రుడు దేవతల గురువైన బృహస్పతిని కలుసుకుని మహర్షీ! ఇటువంటి దుశ్శకునాలు కలగడానికి కారణం ఏమిటి? అని అడిగాడు.   బృహస్పతి ఇంద్రుడితో “గరుత్మంతుడు బ్రహ్మజ్ఞానం కలిగిన కశ్యప ప్రజాపతి ఇచ్చిన వరం వల్ల వినతకి పుట్టిన కొడుకు. ఇతడు వాలఖిల్యులు అనే మహర్షుల దయతో పక్షి జాతికి రాజుగా ప్రసిద్ధి పొందాడు.  సముద్రం లోపల నివసించే అతి భయంకరులైన బోయల్ని పూర్తిగా తినేసిన వీరుడు. ఏనుగుని, తాబేలుని, రోహిణమనే వృక్షం యొక్క కొమ్మని ఒకేసారి పట్టుకుని ఆకాశంలో ఎగరకలిగిన బలము, వాయువేగము కలవాడు.

   తన తల్లి యొక్క దాసితనాన్ని పోగొట్టడం కోసం అమృతాన్ని తీసుకుని వెళ్లడానికి సాహసంతో వస్తున్నాడు. తనకిష్టమైన రూపాన్ని ధరించ గలడు, ఇష్టమైన ప్రదేశానికి  వెళ్లగలడు. అతణ్ని నువ్వు జయించలేవు. గరుత్మంతుడి గొప్పతనం నీకు కూడా తెలుసు.  పూర్వం కశ్యప ప్రజాపతి సంతానం పొందడం కోసం పుత్రకామేష్టి చేశాడు. అప్పుడు నీతో సహా అందరు దేవతలు, వాలఖిల్యులు అనే మహర్షులు ఆయనకి సహాయపడ్డారు. ఆ యజ్ఞం జరుగుతున్న సమయంలో నువ్వు నీ బలానికి తగినట్టు సమిధల్ని వీపుమీద మోసుకుని వచ్చావు. అదే సమయంలో బొటనవేలంత ఆకారంలో బలహీనులుగా ఉన్న వాలఖిల్యులు అనే మహర్షులు మోదుగ కట్టెల మోపుల్ని, దర్భల మోపుల్ని మొయ్యలేక, శ్రమతో వణుకుతూ తీసుకుని రావడం చూసి నువ్వు నవ్వావు.

   ఆ మహర్షులు కోపంతో  “ఎప్పుడూ యుద్ధంలో విజయాన్నే పొందేవాడు, అగ్నికి ఉన్నంత తేజస్సు కలవాడు, అణిమాది గుణాలు కలిగినవాడు, వీరులకే వీరుడైనవాడు, ఇంద్రుడికంటే వంద రెట్లు ఎక్కువ బలం కలవాడు, ఎవరితోను జయింపబడనివాడు అయిన బలవంతుడు జన్మిస్తాడు. అతడు రెండవ ఇంద్రుడుగా ప్రకాశిస్తాడు” అని అగ్నిహోత్రంలో హోమం చేశారు.  అది తెలుసుకున్న నువ్వు అలా జరగకుండ ఉండేలా చూడమని కశ్యప ప్రజాపతిని ప్రార్థించావు. వాలఖిల్య మహర్షులతో కశ్యపుడు మహర్షులారా! తన బాహుబలంతో అన్ని జీవరాసుల్నీ కాపాడడం కోసం బ్రహ్మ ఇంద్రుణ్ని నియమించాడు. రెండవ ఇంద్రుడు ఏర్పడితే అన్నీ తారుమారవుతాయి. ఇలా చెయ్యడం తగిన పని కాదు.

   మీరు అన్న మాటలు జరిగే తీరతాయి. కనుక, నాకు పుట్టబోయే కుమారుడు పక్షి జాతికే ఇంద్రుడు(రాజు) అవుతాడు!” అని చెప్పి వాలఖిల్య మహర్షుల్ని అంగీకరించేలా చేశాడు. ఇంద్రుడు ఒక్కడే ఉండేట్లు చేశాడు.

    కశ్యప ప్రజాపతి చేసిన పుత్రకామేష్టి యాగ ఫలితంవల్ల, వాలఖిల్యుల చేసిన తపస్సు యొక్క ఫలితం వల్ల జన్మించినవాడు గరుత్మంతుడు. పక్షులకు రాజైన ఆ గరుత్మంతుడే ఇప్పుడు అమృతాన్ని తీసుకుని వెళ్లడానికి వస్తున్నాడు. అందువల్లనే స్వర్గలోకంలో ఇన్ని దుశ్శకునాలు కనిపిస్తున్నాయి” అని చెప్పాడు.   బృహస్పతి చెప్పింది విని ఇంద్రుడు అమృతాన్ని రక్షిస్తున్న వాళ్లని అందర్నీ రప్పించి అమృతాన్ని జాగ్రత్తగా కాపాడమని ఆజ్ఞాపించి పంపించాడు. అనేక రకాల రూపాలు కలిగిన వీరులు, పదునైన కత్తులు మొదలైన ఆయుధాలు, నలుపు, ఎరుపు, తెలుపు, పసుపు మొదలైన రంగుల్లో ఉన్న కవచాలు ధరించి అమృతానికి కాపలాగా ఉన్నారు.  వాళ్లందరూ రాత్రి, పగలు కంటిమీద కునుకు లేకుండా అమృతం చుట్టూ ఉండి కాపలా కాస్తున్నారు.

 

మహాభారత కథ-9

 

సముద్ర మథనము

    అమృతం తాగడం వల్ల మరణం ఉండదని దేవతలకి తెలిసింది. ఏమయినా సరే అది ఎలా దొరుకుతుందో తెలుసుకుని దాన్ని తాగాలని అనుకున్నారు. పాలసముద్రాన్ని చిలికితే అందులోంచి అమృతం వస్తుంది. కాని, అది అంత తేలికైన పని కాదు. రాక్షసులకి కూడా నచ్చచెప్పి తమతో కలుపుకుంటే సముద్రాన్ని చిలకడం తేలిక అవుతుంది.

   అమృతం దొరికాక దాన్ని రాక్షసులే తాగేస్తేనో? దేవతలకి సందేహం వచ్చింది. అప్పటి సంగతి అప్పుడు చూసుకోవచ్చు. ముందు పాలసముద్రాన్ని చిలకడానికి రాక్షసుల సాయం అడగాలని అనుకున్నారు. దేవతలకీ రాక్షసులకీ ఎప్పుడూ పడదు. ఒకళ్లతో ఒకళ్లు పోట్లాడుకుంటూనే ఉంటారు. అయినా సరే, అమృతం తాగాలన్న కోరిక దేవతల్ని ఒకచోట నిలబడనియ్యడం లేదు.

  ఒకరోజు దేవతలందరూ రాక్షసుల దగ్గరికి వెళ్లారు. అమృతం తాగితే మరణం ఉండదని, ఎప్పుడూ హాయిగా జీవించే ఉండచ్చని నచ్చ చెప్పారు. చివరికి పాలసముద్రాన్ని చిలికి అమృతాన్ని పొందడానికి తాము సహాయం చేస్తామన్నారు రాక్షసులు.

   ఇంద్రుణ్ని తీసుకుని అందరూ కలిసి మేరు పర్వతం మీదకి వెళ్లారు. పాలసముద్రాన్ని చిలకడానికి సన్నాహాలు మొదలుపెట్టారు. అంత పెద్ద సముద్రాన్ని చిలకాలంటే దానికి సరిపడినంత కవ్వం కావాలి. కవ్వం దొరికినా దానికి తిరగడానికి తాడు కావాలి. ఈ రెండూ దొరికినా కవ్వం భూమిలో కూరుకుని పోకుండా దానికి కింద ఆధారం కావాలి. ఏం చెయ్యాలా.. అని అనేక విధాలుగా ఆలోచిస్తున్నారు.

   ఏదయినా సాధించాలి అనుకుంటే ముందు పట్టుదల ఉండాలి, తరువాత దానికి తగిన జ్ఞానం ఉండాలి, అవసరమైన పరికరాలు ఉండాలి. దేవతలు, రాక్షసులు అమృతం తాగాలన్న పట్టుదలతో ఉన్నారు. ఎలా చేస్తే అమృతాన్ని పొందవచ్చో ముందుగా తెలుసుకున్నారు. పరికరాల కోసం ఆలోచిస్తూ బ్రహ్మ,  విష్ణువుల్ని కలిసి సలహా అడిగారు.

   అన్ని పర్వతాల్నీ కలిపితే ఎంత పొడవు ఉంటుందో అంత పొడవుతోను, వంకర లేకుండాను, కదలకుండా స్థిరంగాను, తన మీద పెరిగే మూలికల రసంతో దృఢంగాను, అన్ని పర్వతాల కంటే పెద్దదిగాను ఉన్న  మంథర పర్వతాన్ని పాలసముద్రం చిలకడానికి కవ్వంగా ఉపయోగించమని సలహా ఇచ్చారు.

   భూమి పైకి పదకొండు యోజనాలు, భూమి లోపలికి పదకొండు యోజనాలు ఉన్న మంథర పర్వతాన్ని సర్పరాజు ఆది శేషుడు పెల్లగించాడు. దేవతలు రాక్షసులు కలిసి దాన్ని మోసుకుని వచ్చి సముద్రంలో పడేశారు. వెంటనే అది సముద్రంలో పైకి నిలవకుండా లోపలికి కూరుకుని పోయింది.

   పర్వతం కదలకుండా ఉండడానికి ఏం చెయ్యాలని విష్ణుమూర్తిని సలహా అడిగారు. మంథర పర్వతం సముద్రంలో కూరుకుని పోకుండా దాని అడుగున కూర్మావతారంతో తనే ఆధారంగా ఉంటానన్నాడు.

   మంథర పర్వతాన్ని కవ్వంగాను, కూర్మావతారంలో ఉన్న విష్ణుమూర్తిని దానికి ఆధారంగాను ఏర్పాటు చేసుకున్నారు.  కాని, కవ్వాన్ని తిప్పాలంటే తాడు కావాలిగా? బాగా ఆలోచించి... చాలా పొడవుగా ఉండే వాసుకి అనే పేరుగల పాముని తెచ్చి తాడుగా చేసుకున్నారు. వాసుకి మంథర పర్వతాన్ని చుట్టలుగా చుట్టుకున్నాడు.

   రాక్షసులు సర్పరాజు తలవైపు బలంగా పట్టుకున్నారు. దేవతలు వాసుకి తోక భాగాన్ని పట్టుకున్నారు. దేవతలు, రాక్షసులు కూడా అమృతాన్ని తాగే తీరాలి అనే పట్టుదలతో పాలసముద్రాన్ని చిలకడం మొదలు పెట్టారు.

   వాళ్లు పడుతున్న శ్రమని చూసి వాళ్లకి ఉన్న శక్తి సరిపోదనుకున్నాడు విష్ణుమూర్తి. అందుకని వాళ్లకి ఇంకా కొంత శక్తిని, వేగాన్ని ఇచ్చాడు. ఒకళ్లనొకళ్లు జబ్బలు చరుచుకుంటూ; ఉత్సాహ పరుచుకుంటూ; అంతకు ముందు కంటే ఎక్కువ వేగంతో కవ్వాన్ని తిప్పుతూ; పాలసముద్రాన్ని చిలుకుతున్నారు.  

   వాళ్ల కష్టానికి ఫలితం దక్కలేదు. ముందు విషం పుట్టి లోకాలన్నింటినీ దహించేస్తూ అన్ని వైపులకీ వ్యాపించించడం మొదలుపెట్టింది. భయపడి పరుగులు పెడుతూ అందరూ శివుడి దగ్గరికి వెళ్లారు.

   శివుడు ఆ విషాన్ని తన కఠంలో బంధించి ఉంచాడు. దేవతలు, రాక్షసులు పాలసముద్రం దగ్గరికి వెళ్లి మళ్లీ చిలకడం మొదలు పెట్టారు. వాళ్లల్లో అమృతాన్ని తాగాలన్న పట్టుదల ఇంకా పెరిగిపోయింది.

   ఈసారి జ్యేష్టాదేవి, చంద్రుడు, లక్ష్మీదేవి, ఉచ్ఛైశ్రవము అనే పేరుతో తెల్లని గుర్రము, కౌస్తుభమణి, అమృతంతో నిండిన కమండలంతో దేవ వైద్యుడు, ఐరావతమనే పేరుగల తెల్లని ఏనుగు ఇంకా అనేకమంది వ్యక్తులు, వస్తువులు, జంతువులు మొదలైనవన్నీ పుట్టాయి.

   వాటిలో ముల్లోకాలతో పూజింపబడుతున్న లక్ష్మీదేవి, సూర్యకిరణాల కాంతి కంటే ఎక్కువ కాంతితో ప్రకాశించే కౌస్తుభమణి విష్ణుమూర్తి వక్షస్థలం మీదకీ; ఉచ్ఛైశ్రమనే గుర్రము, ఐరావతమనే ఏనుగు ఇంద్రుడి దగ్గరికీ చేరుకున్నాయి.

   ఇంకా పట్టుదలతో పాలసముద్రాన్ని చిలుకుతూనే ఉన్నారు. చివరికి అమృతాన్ని సాధించారు. వాళ్ల ఆనందానికి అవధులు లేవు. సంతోషంతో ఉప్పొంగిపోయారు.

   అమృతం సాధించిన తరువాత దేవదానవుల మధ్య యుద్ధం జరిగింది. దాన్ని గురించి తెలుసుకుందాం...

   పాలసముద్రాన్ని చిలికినప్పుడు వచ్చిన అమృతాన్ని రాక్షసులు తీసేసుకున్నారు. దేవతలు ఊరుకుంటారా? ఆ విషయం విష్ణుమూర్తికి చెప్పారు. విష్ణుమూర్తి తక్కువవాడా? వెంటనే అందమైన మోహిని రూపంలో రాక్షసుల దగ్గరికి వచ్చాడు. రాక్షసులు అందంగా ఉన్న మోహినిని చూసి అమృతం గురించి మర్చిపోయి మోహిని వెంట పడ్డారు. అమృతం విష్ణుమూర్తి చేతికి వచ్చింది.

   మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి దేవతల్ని ఒకవైపు, రాక్షసుల్ని ఒకవైపు కూర్చోమన్నాడు. తనే స్వయంగా అందరికీ అమృతం పంచుతానని చెప్పాడు. దేవతలు, రాక్షసులు మోహిని చెప్పినట్టే కూర్చున్నారు. 

   మోహిని దేవతల వైపు అమృతం పంచుతుంటే వాళ్లు తాగుతున్నారు. రాక్షసుడు రాహువు కూడా దేవతల వరుసలో కూర్చున్నాడు. చంద్రుడు, సూర్యుడు అతణ్ని చూసి విషయం మోహినికి చెప్పారు. అప్పటికే మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి రాహువుకి అమృతం పోసేశాడు.

   సూర్య చంద్రులు చెప్పింది విని విష్ణుమూర్తి వెంటనే తన చక్రంతో రాహువు తల నరికేశాడు. అతడు తాగుతూ ఉన్న అమృతం అతడి కంఠం దగ్గరే ఉండిపోయింది. అప్పటికి ఇంకా రాహువు అమృతాన్ని మింగలేదు.

   రాహువు శరీరం భూమి మీద పడిపోయింది. తల భాగం మాత్రం అమృతం తాకడం వల్ల నాశనం లేకుండా ఉండిపోయింది. అప్పటినుంచే రాహువుకి సూర్య చంద్రులతో విరోధం ఏర్పడింది. అది ఇప్పటికీ నడుస్తూనే ఉంది.

   అమృతం తమకి పొయ్యలేదని రాక్షసులకి కోపం వచ్చింది. అందరూ కలిసి తమకు రాజైన బలిచక్రవర్తిని కలుసుకుని జరిగిన విషయం మొత్తం చెప్పుకున్నారు. బలిచక్రవర్తితో సంప్రదించి చివరికి ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ దేవతలతో మనకి స్నేహం వద్దు, యుద్ధం చేసి అమృతాన్ని తెచ్చుకుందామని అనుకున్నారు.

  యుద్ధమంటే రాక్షస జాతికి చాలా ఇష్టం. వెంటనే రథాలు, గుర్రాలు, ఏనుగులు, కాలిబలం సిద్ధం చేసుకున్నారు. భయంకరమైన ఆకారాలతో పెద్ద పెద్ద కేకలు వేస్తూ దేవతల మీదకి యుద్ధానికి వెళ్లారు.

   దేవతల మీద ఆపకుండా బాణాలు వేశారు. ఆ బాణాలు దేవతల్ని భయంకరంగా చుట్టుముట్టాయి. అది చూసిన దేవతలు విష్ణుమూర్తితో సహా యుద్ధానికి దిగారు.  పెద్ద పెద్ద పర్వత శిఖరాల మీద ఎక్కి రాక్షసుల మీద బాణవర్షం కురిపించారు.

   పై నుంచి ఆగకుండా మీద పడుతున్న బాణాలకి రాక్షసులు పెద్ద పెద్ద కేకలు వేస్తూ కూలబడి పోతున్నారు. విష్ణుమూర్తి ప్రయోగించిన చక్రానికి రాక్షసుల తలలు తెగి పడుతున్నాయి. యుద్ధరంగం మొత్తం రాక్షసుల రక్తంతో నిండి పోయింది.

   సముద్రపు ఒడ్డు దగ్గర జరుగుతున్న యుద్ధంలో రాక్షసులు ఓడిపోయారు. మరణించగా మిగిలిన రాక్షసులు సముద్రం అడుగుకి వెళ్లిపోయారు. అమృతాన్ని జాగ్రత్తగా కాపాడమని ఇంద్రుడికి అప్పగించి దేవతలందరూ తమ ప్రదేశాలకి వెళ్లిపోయారు.

 

మహాభారతకథ-8

 

ఆదిపర్వము రెండవ ఆశ్వాసము నుండి

నాగజాతి అనూరుడు గరుత్మంతుల జననం

   అప్పటి వరకు సూతమహర్షి చెప్పినదాన్ని విని శౌనకుడు మొదలైన మహర్షులు మహర్షీ! పాములకి కద్రువ తల్లి కదా! ఆమె తన పిల్లలకి నాశనం జరగాలని ఎందుకు శపించింది? అని అడిగి, సూతమహర్షి తరువాత చెప్పబోయే కథల్ని వినడానికి సిద్ధంగా ఉన్నారు.

నాగజాతి జననం

   కశ్యపబ్రహ్మకి ఇద్దరు భార్యలు. వాళ్ల పేర్లు కద్రువ, వినత. సంతానం కోసం కొన్నివేల సంవత్సరాలు ఆయనకి సేవ చేశారు.   ఒకరోజు కశ్యపుడు వాళ్లిద్దర్నీ పిలిచి  మీకు ఏ వరం కావాలో కోరుకోండి ఇస్తాను! అన్నాడు. తమ కోరిక తీరుతున్నందుకు వాళ్లిద్దరు చాలా సంతోష పడ్డారు.

   కద్రువ  “నాథా! నాకు అగ్నిలా గొప్ప కాంతి, చాలా పొడవైన శరీరము, అమితమైన పరాక్రమము కలిగిన వెయ్యి మంది కొడుకుల్ని ప్రసాదించండి! అని అడిగింది.

    అమె అడిగిన తరువాత వినత స్వామీ! నాకు కద్రువకు కలిగే కొడుకులకంటె ఎక్కువ పరాక్రమము, ముఖ్యంగా బాహుబలం ఎక్కువగా కలిగిన ఇద్దరు కొడుకుల్ని ప్రసాదించండి! అని కోరుకుంది.

   తపస్సంపన్నుడైన కశ్యప మహర్షి మంచి సంతానం కోసం పుత్రకామేష్టి అనే యాగం చేశాడు. కద్రువకి వెయ్యిమంది కొడుకుల్ని, వినతకి ఇద్దరు కొడుకుల్ని వాళ్లు కోరుకున్నట్టుగా అనుగ్రహించాడు. గర్భాల్ని జాగ్రత్తగా కాపాడుకోమని చెప్పాడు.

   కొంతకాలం గడిచాక వాళ్ల గర్భాలు అండాలుగా మారాయి. వాటిని నెయ్యితో నిండిన కుండల్లో ఉంచి కాపాడుకుంటున్నారు. అయిదు వందల సంవత్సరాలు అలాగే గడిచిపోయాయి.

  కద్రువ కుండల్లో పెట్టిన అండాలు పగిలి:-  శేషుడు, వాసుకి, ఐరావతుడు, తక్షకుడు, కర్కోటకుడు, ధనంజయుడు, కాళీయుడు, మణినాగుడు, ఆపూరణుడు, పింజరకుడు, ఏలాపుత్రుడు, వామనుడు, నీలుడు, అనీలుడు, కల్మాషుడు, శబలుడు, ఆర్యకుడు, ఉగ్రకుడు, కలశపోతకుడు, సురాముఖుడు, దధిముఖుడు, విమలపిండకుడు, ఆప్తుడు, కర్కోటకుడు, శంఖుడు, వాలిశిఖుడు, నిష్ఠానకుడు, హేమగుహుడు, నహుషుడు, పింగళుడు, బాహ్యకర్ణుడు, హస్తిపదుడు, ముద్గరుడు, పిండకుడు, కంబలుడు, అశ్వతరుడు, కాళీయకుడు, వృత్తుడు, సంవర్తకుడు, పద్ముడు, శంఖముఖుడు, కూష్మాండకుడు, క్షేమకుడు, పిండారకుడు, కరవీరుడు, పుష్పదంష్ట్రుడు, బిల్వకుడు, బిల్వపాండరుడు, మూషకాదుడు, శంఖశిరుడు, పూర్ణభద్రుడు, హరిద్రకుడు, అపరాజితుడు, జ్యోతికుడు, శ్రీవహుడు, కౌరవ్యుడు, ధృతరాష్ట్రుడు, శంఖపిండుడు, వీర్యవంతుడు, విరజుడు, సుబాహువు, శాలిపిండుడు, హస్తిపిండుడు, పిఠరకుడు, సుముఖుడు, కౌణపాశనుడు, కుఠరుడు, కుంజరుడు, ప్రభాకరుడు, కుముదుడు, కుముదాక్షుడు, తిత్తిరి, హలికుడు, కర్దముడు, బహుమూలకుడు, కర్కరుడు, అకర్కరుడు, కుండోదరుడు, మహోదరుడు  మొదలైన పేర్లతో వెయ్యిమంది గొప్ప బలవంతులైన, పొడవైన సర్ప రాజులు జన్మించారు. కద్రువకి కలిగిన సంతానం పాములన్నమాట!

అనూరుడు జననం

   తన గర్భం నుంచి వచ్చిన అండాలు ఇంకా పగలలేదని, తను కోరుకున్నట్టుగా తనకి సంతానం కలగలేదని వినత బాధ పడింది. తన సవతి కద్రువ తనకంటే ముందు తల్లయింది. తనని అందరూ ఏమనుకుంటారో అని సిగ్గుపడింది. తన అండాలు వాటంతట అవి పగలక ముందే కంగారుగా ఒక అండాన్ని పగుల కొట్టింది.  ఆ అండం నుంచి శరీరంలో కింద భాగం లేకుండా, పై శరీరం మాత్రమే ఉన్న గొప్ప నీతివంతుడైన కుమారుడు జన్మించాడు.

  అతడి పేరు అనూరుడు. శరీరం పూర్తిగా ఏర్పడకుండా జన్మించిన అనూరుడు (తొడలు లేనివాడు) తల్లి మీద కోపగించాడు. తల్లీ! నాకు పూర్తిగా శరీరం ఏర్పడకుండానే అండాన్ని పగలకొట్టి పొరపాటు చేశావు. నన్ను వికలాంగుడిగా పుట్టించావు. కనుక, నువ్వు అయిదు వందల సంవత్సరాలు నీ సవతి కద్రువకి దాసిగా జీవించు!” అని తల్లిని శపించాడు.

   అనూరుడు కోపంతో శపించినా అంతలోనే దయ కలిగి  అమ్మా!  రెండవ అండం నుంచి గొప్ప బలము, పరాక్రమము కలిగినవాడు పుడతాడు. నీ దాసీత్వాన్ని అతడే పోగొడతాడు. తొందరపడి ఆ గుడ్డుని మాత్రం పగలకొట్టద్దు!” అని చెప్పాడు.

    వినత మళ్లీ పొరపాటు  చెయ్యకుండా తన రెండవ అండాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటోంది. ఆమె పెద్ద కుమారుడు అనూరుడు సూర్యుడికి సారథిగా వెళ్లిపోయాడు.

కద్రువ వినతల పందెము

   కద్రువ వినతలు పాలసముద్రం ఒడ్డు దగ్గర కూర్చుని ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తున్నారు. మొసళ్లు, నీటి ఏనుగులు బలంగా నీళ్లమీద పడి ఎగురుతున్నప్పుడు నీటి బిందువులు పైకి లేచి సముద్రపు అలల మీద వర్షం కురుస్తున్నట్టు, పైకి లేచిన అలలు ఆకాశాన్ని కప్పేస్తున్నట్టు కనిపిస్తోంది.

   పాములు, చేపలు, మొసళ్లతో నిండిన సముద్రం ఎగిసిపడే అలలతో అందంగా కనిపిస్తుంటే చూస్తూ కూర్చున్నారు. మధ్య మధ్య ఒడ్డు మీద ఉన్న వనాల్లో నడుస్తూ... ఏలకిలతలు, లవలీలతలు, మాదీలతలు, లవంగలతల్ని; తెల్లటి పద్మాలు, సముద్రపు అంచుకి చేరిన నురుగుతో అందంగా ఉన్న ప్రదేశాల్ని అసక్తిగా చూస్తున్నారు.

      పాలసముద్రాన్ని చిలికినప్పుడు అమృతంతో పాటు పుట్టిన ఉచ్ఛైశ్రవము అనే అందంగా బలంగా ఉన్న ఇంద్రుడి తెల్లటి గుర్రం పాలసముద్ర తీరంలో హాయిగా తిరుగుతూ కనిపించింది.  దాన్ని చూసి కద్రువ శరీరమంతా నిండు చంద్రుడిలా తెల్లగా ఉన్నా కూడా ఆ గుర్రానికి తోక మాత్రం నల్లగా ఉంది చూడు!” అంది.

   అది విని వినత నవ్వి “కద్రువా! నీకు నలుపు ఎలా కనిపించిందో గానీ, గొప్పవాళ్ల కీర్తి ప్రపంచమంతా వ్యాపించినట్టు దాని శరీరమంతా తెలుపు రంగు కాంతితో ప్రకాశిస్తోంది. దాని శరీరంలో అసలు నలుపు మచ్చ ఎక్కడ ఉంది?” అంది.

   అది విని కద్రువ “అయితే, ఆ తెల్లని గుర్రానికి నల్లటి మచ్చ ఉంటే నువ్వు వెంటనే నాకు దాసిగా ఉండాలి. ఒకవేళ దాని శరీరం మీద నల్ల మచ్చ లేదనుకో నేనే నీకు దాసిగా ఉంటాను! అంది.

   ఇద్దరూ ఒకళ్లకి ఒకళ్లు దాసిగా ఉండేట్టు పందెం వేసుకున్నారు. “అయితే దగ్గరగా వెళ్లి ఆ గుర్రాన్ని చూసి వద్దాం రా!” అంది వినత.

   కద్రువ “ఇప్పుడు సమయం చాలదు. రేపు ఉదయాన్నే వచ్చి చూద్దాం!” అంది. ఆ రోజు ఇద్దరూ ఇంటికి వెళ్లిపోయారు.

   ఇంటికి వెళ్లిన తర్వాత కద్రువ తన పాము పిల్లల్ని పిలిచి జరిగిన విషయం చెప్పి నేను, వినత పందెం వేసుకున్నాం. కనుక, మీరు ఆ గుర్రం తోకని నలుపు చెయ్యండి. లేకపోతే నేను వినత దగ్గర దాసిగా పడి ఉండాలి! అని చెప్పింది.

   అది ధర్మం కాదని వాళ్లు ఎవరూ అందుకు అంగీకరించలేదు. కద్రువకి తన కుమారుల మీద కోపం వచ్చింది. “నా మాట మీద మీకు గౌరవం లేదు. నేను చెప్పిన పని చెయ్యడం మీకు ఇష్టం లేదు. కనుక, పరీక్షిత్తు కుమారుడైన జనమేజయ మహారాజు చేసే సర్పయాగంలో మీరందరు మరణిస్తారు! అని శపించింది.

   అందరికంటే చిన్నవాడైన కర్కోటకుడు మాత్రం తల్లి ఇచ్చిన శాపానికి భయపడ్డాడు. మర్నాడు ఉదయాన్నే వెళ్లి గుర్రం తోకకి నల్లని మచ్చలా కనిపించేట్లు దాని తోకని పట్టుకుని వ్రేలాడుతూ ఉండిపోయాడు.

    కద్రువ, వినత గుర్రాన్ని చూడ్డానికి వెళ్లారు. కర్కోటకుడు గుర్రం తోకని చుట్టుకుని ఉండడం వల్ల గుర్రం తోక నల్లగా కనిపించింది. పందెంలో ఓడిపోయిన వినత కద్రువకి దాసిగా వచ్చింది.

గరుత్మంతుడు జననం

   అనూరుడు తల్లి వినతకి శాపం ఇచ్చి అయిదు వందల సంవత్సరాలు గడిచింది. శాప ఫలాన్ని అనుభవిస్తున్న వినత తన సవతి కద్రువ దగ్గర దాసిగానే జీవిస్తోంది.

    ఒకరోజు వినత పెట్టిన రెండవ గుడ్డు పగిలింది. సూర్యుడి కాంతే తక్కువగా ఉందేమో అనిపించేంత గొప్ప కాంతి; పర్వతాల్ని కూడా కదిలించ కలిగినంత వేగము, బలము ఉన్న రెండు రెక్కలతో అతిపెద్ద శరీరం కలిగిన  గరుత్మంతుడు జన్మించాడు.  గొప్ప బలశాలి, పెద్ద శరీరం ఉన్న కుమారుణ్ని చూసుకుని ఆనందపడింది వినత. అతడు వెంటనే ఆకాశంలోకి ఎగిరిపోయాడు. ఇంద్రుడు వజ్రాయుధానికి కూడా తెగనంత పెద్దపెద్ద రెక్కలతో ఉన్నాడు. పర్వతంలా ఆకాశ మార్గంలో ఎగురుతూ వెళ్లి, వెంటనే కిందకి దిగి వచ్చి తల్లి వినతకి నమస్కరించాడు.

   పుడుతూనే తన పెద్ద శరీరంతో ఆకాశంలోకి ఎగిరి, తిరిగి వచ్చి తల్లికి నమస్కరిస్తున్న గరుడుణ్ని చూసిన కద్రువకి అసూయ కలిగింది. వెంటనే “నీ తల్లి వినత నాకు దాసి. నువ్వు కూడా నేను చెప్పినట్టే వినాలి. నా పిల్లల్ని అందర్నీ ఎత్తుకుని తీసుకుని వెళ్లి ప్రదేశాలన్నీ చూపించు!” అని ఆజ్ఞాపించింది.

   సవతి తల్లి కద్రువ చెప్పిన పనులన్నీ గరుత్మంతుడు వినయంగా చేస్తున్నాడు. ఒకరోజు గరుత్మంతుడు పాముల్ని వీపు మీద ఎక్కించుకుని, అతి వేగంతో ఎగురుతూ సూర్యమండలం వరకు వెళ్లాడు.  సూర్యుడి తీక్ష్ణమైన కిరణాల వేడిని భరించలేక పాములు జారి నేలమీద పడి మూర్ఛపోయాయి.

    అది చూసిన కద్రువ కోపంతో గరుత్మంతుణ్ని నిందించింది. తన పిల్లల్ని బ్రతికించమని ఇంద్రుణ్ని ప్రార్థించింది. ఇంద్రుడు ఆ పాముల మీద పెద్ద వాన కురిపించి వాటికి వేడి తగ్గేట్టు చేశాడు. కద్రువ ఇంతకు ముందు కంటే ఎక్కువగా వినతకి, గరుత్మంతుడికి పనులు చెప్పి చేయించుకుంటోంది.

   ఒకరోజు గరుత్మంతుడు తల్లి దగ్గరికి వెళ్లి “మనం కద్రువకి దాసులుగా ఎందుకు ఉంటున్నాము? అని అడిగాడు.

   తను కద్రువ పందెం వేసుకున్నామనీ; అందులో తను ఓడిపోడం వల్ల అమెకి దాసీగా ఉండవలసి వచ్చిందనీ; తన పెద్దకుమారుడు అనూరుడు కూడా తనను శపించాడనీ వివరంగా చెప్పింది వినత. గరుత్మంతుడు చాలా బాధ పడ్డాడు.

     “నాయనా! తల్లితండ్రులయందు భక్తి, శక్తి, మంచి బుద్ధి కలిగిన కుమారులు ఉంటే ఏ తల్లితండ్రులకీ కష్టాలు ఉండవు. నీ వంటి యోగ్యుడైన కుమారుణ్ని పొందిన నాకు ఈ దాస్యం ఎంతకాలమో ఉండదు. తప్పకుండా విముక్తి కలుగుతుంది బాధపడకు అని ఆత్మ విశ్వాసంతో చెప్పింది.