About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

మహాభారత కథ-10-

 

గరుత్మంతుడు కథలు

గరుత్మంతుడు-అమృతము

   గరుత్మంతుడు తన తల్లిని దాసీతనం నుంచి విముక్తురాల్ని చెయ్యాలని అనుకున్నాడు. పాములతో సంప్రదించాడు. విముక్తుల్ని చెయ్యాలంటే తమకి అమృతం తెచ్చి ఇవ్వాలని చెప్పాయి. గరుత్మంతుడు అందుకు అంగీకరించాడు.     పాములకి ఇవ్వడానికి అమృతం తీసుకుని వస్తానని చెప్పి తల్లికి నమస్కరించి ఆమె ఆశీర్వాదం తీసుకున్నాడు. నాయనా! నీ పెద్ద శరీరరాన్ని సూర్యుడు రక్షిస్తాడు. పెద్ద పెద్ద రెక్కల్ని వాయువు, వీపుని చంద్రుడు, తలని అగ్ని రక్షిస్తారు. విజయాన్ని కీర్తిని పొందుతావు! అని దీవించింది తల్లి వినత.

   తల్లి దగ్గర ఆశీర్వాదం తీసుకుని వెడుతున్న గరుడుడు తల్లితో అమ్మా! నేను చెయ్యబోతున్న పని చాలా కష్టమైంది. నాకు చాలా బలం కావాలి కనుక, తినడానికి ఏదేనా చూపించు! అని అడిగాడు. వినత నాయనా! సముద్రగర్భంలో ఉన్న బోయల సమూహం వల్ల ప్రజలకి హాని కలుగుతోంది. వాళ్లని నువ్వు ఆహారంగా తీసుకో! దాని వల్ల నీకు ఆకలి తీరుతుంది. ప్రజలకి మేలు కలుగుతుంది. వాళ్లని తినేప్పుడు నువ్వు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్లల్లో ఎవరికీ హాని తలపెట్టని బ్రాహ్మణులు ఉంటారు. వాళ్లని మాత్రం తినకుండా విడిచిపెట్టు!” అని చెప్పింది.

   అది విని గరుత్మంతుడు అమ్మా! వాళ్లల్లో బ్రాహ్మణుడు ఎవరో తెలుసుకోవడం ఎలా?” అని అడిగాడు.  నాయనా! గాలం అనే సాధనం మింగేటప్పుడు కంఠం దగ్గర గుచ్చుకుని బాధ పెడుతుంది కదా! అలాగే బ్రాహ్మణుడు కంఠం దగ్గర గుచ్చుకుంటూ నిప్పులా వేడిగా కాలుస్తుంటాడు.  కోపం వచ్చినప్పుడు బ్రాహ్మణుడు పదునైన ఆయుధంగాను, విషంగాను, నిప్పుగాను మారిపోతాడు.  బ్రాహ్మణుణ్ని గౌరవంగా చూస్తే ప్రజలకు మంచి కలిగేలా చేస్తాడు, గురువుగా ఉంటాడు, ఇష్టాన్ని నెరవేరుస్తాడు! అని బ్రాహ్మణుడి లక్షణాల్ని అతడికి అర్థమయ్యేలా చెప్పింది వినత. తల్లి చెప్పినట్టు గరుత్మంతుడు సముద్రం మధ్యలో ఉన్న బోయల్ని అందర్నీ తినేసి మళ్లీ అమృతం కోసం బయలుదేరాడు. అతడికి ఆకలి మాత్రం తీరలేదు.

గరుత్మంతుడు-ఏనుగు-తాబేలు

     అమృతం కోసం వెడుతున్న గరుత్మంతుడు మధ్యలో తపస్సు చేసుకుంటున్న తండ్రి దగ్గరికి వెళ్లి  తండ్రీ! నాకు చాలా ఆకలిగా ఉంది. తినడానికి ఏదయినా కావాలి! అని అడిగాడు.  అతడి తండ్రి కశ్యపబ్రహ్మ నాయనా! అగ్నితో సమానమైనవాడు, నియమనిష్ఠలు కలిగినవాడు విభావసుడు అనే పేరుగల బ్రాహ్మణుడు ఉన్నాడు. అతడు తన పెద్దలు సంపాదించి పెట్టిన ధనంతో సుఖంగా జీవిస్తున్నాడు.   అతడి తమ్ముడు సుప్రతీకుడు. ఒకరోజు అతడు తన అన్న విభావసుడి దగ్గరికి వెళ్లి తాత తండ్రులు సంపాదించి ఇచ్చిన ధనంలో తనకు కూడా భాగం పంచి ఇమ్మని అడిగాడు.

   ధనం మొత్తం తనకే కావాలని తమ్ముడికి ఇవ్వకూడదని అనుకున్న విభావసుడు తమ్ముణ్ని  ఏనుగుగా మారమని శపించాడు. తమ్ముడు సుప్రతీకుడు అన్నని తాబేలుగా మారిపొమ్మని శపించాడు.  ఇద్దరూ ఒకళ్లని ఒకళ్లు శపించుకోవడంవల్ల సుప్రతీకుడు మూడు ఆమడల పొడవు, పది ఆమడల పరిధితో తాబేలుగాను, విభావసుడు ఆరు ఆమడల పొడవు, పన్నెండు ఆమడల వెడల్పుతో ఏనుగుగాను మారిపోయారు. మారినవెంటనే ఏనుగు అడవిలోకి, తాబేలు చెరువులోకి వెళ్లిపోయాయి.

   పూర్వజన్మలో ఇద్దరి మధ్య ఉన్న విరోధం వల్ల వాళ్లిద్దరూ ఇప్పటికీ పోట్లాడుకుంటూనే ఉన్నారు. వాళ్లిద్దరి వల్ల వాళ్లకే కాదు ఎవరికీ ఉపయోగంలేదు. వాళ్లని తినేసి నీ ఆకలి తీర్చుకో!” అని చెప్పాడు.  వెంటనే గరుత్మంతుడు తన బలమైన రెక్కలతో ఏనుగుని, తాబేల్ని వెతికి పట్టుకుని రెండింటినీ ఒకేసారి పైకి ఎత్తి పాదాలతో బంధించి ఆకాశంలోకి ఎగిరిపోయాడు.   ఆకాశ మార్గంలో వెడుతున్న అతడికి సంపంగి పూల తీగలు చుట్టుకుని, దేవతా వృక్షాలతో ఎంతో మనోహరంగా ఉన్న ’అలంబ’ అనే పర్వతం కనిపించింది. ఆ పర్వతం మీద రోహిణము అనే పెద్ద దేవతా వృక్షం ఉంది. ఆ దేవతా వృక్షం గరుత్మంతుణ్ని గౌరవంగా పిలిచి వినతకుమారా! వంద ఆమడల పొడవుతో ఉన్న నా చెట్టు కొమ్మ మీద ఆగి ఏనుగుని, తాబేలుని తిని నీ ఆకలిని తీర్చుకుని వెళ్లు!” అని చెప్పింది.

   గరుత్మంతుడు అది చెప్పినట్టు ముందు కొమ్మ మీద కూర్చుని ఆకలి బాధ తీర్చుకుని వెడదామనుకుని కొమ్మ మీద కాలు మోపాడు. అతడి బరువుకి  ఫెళ్లుమని పెద్ద శబ్దం చేస్తూ కొమ్మ విరిగిపోయింది. ఆ ధ్వనికి దిక్కులు కంపించి పోయాయి.  చెట్టు మీద నివసిస్తున్న పక్షుల గుంపులు భయంతో పారిపోయాయి. సూర్యకిరణాలని ఆహారంగా తీసుకుంటూ వాలఖిల్యులు అనే మహర్షులు అదే కొమ్మని ఆధారంగా చేసుకుని తలకిందులుగా ఉండి తపస్సు చేసుకుంటున్నారు. ఆ కొమ్మ భూమి మీద పడితే మహర్షులకి బాధ కలుగుతుంది. అందువల్ల గరుత్మంతుడు ఆ కొమ్మని నోటికి కరుచుకుని, ఏనుగుని తాబేలుని పాదాలతో పట్టుకుని ఆకాశంలోకి ఎగిరాడు.

   తను నిలబడడానికి ఎక్కడేనా చోటు దొరుకుతుందేమోనని ఎంత వెతికినా ఎక్కడా కనిపించ లేదు.  గంధ మాదన పర్వతం మీద తపస్సు చేసుకుంటున్న తన తండ్రి దగ్గరికి వెళ్లి నమస్కరించాడు.  మేరుపర్వతంతో సమానమైన శరీరము, వాయువునే జయించ కలిగినంత గొప్ప వేగము, ఊహించలేనంత శక్తి, వెలుగుతున్న అగ్నికి ఉండేంత తేజస్సు కలిగిన వినత కుమారుడు గరుత్మంతుణ్ని, అతడి నోటిలో ఉన్న చెట్టు కొమ్మని, దానికి అతుక్కుని తలకిందులుగా వేలాడుతున్న పవిత్రులైన వాలఖిల్యులు అనే మహర్షుల్ని చూశాడు కశ్యపబ్రహ్మ.

   వాలఖిల్య మహర్షుల్ని చూసి “మహానుభావులారా! ఈ గరుత్మంతుడు లోక రక్షకుడు, గొప్ప బలవంతుడు. మీకు బాధ కలగకూడదని ఈ చెట్టుకొమ్మని వదలి పెట్టకుండా నోటికి కరుచుకుని తిరుగుతున్నాడు. దయతలచి మీరే ఈ కొమ్మని వదిలి వేరొక చోటికి వెళ్లి అతణ్ని అనుగ్రహించండి!” అని వేడుకున్నాడు. వాలఖిల్యమునులు కశ్యపుడి ప్రార్థన విని ఆ చెట్టు కొమ్మని వదిలి పెట్టి హిమాలయ పర్వతానికి వెళ్లిపోయారు.

    గరుత్మంతుడు చెట్టు కొమ్మ నోటిలో ఉండడం వల్ల మాటలు సరిగా పలక లేక పలుకుతూ తండ్రీ! ఈ చెట్టుకొమ్మ నా నోటికి అడ్డుగా ఉంది. బ్రాహ్మణులు లేని అడవి ప్రాంతం ఎక్కడ ఉందో చెప్పండి. అక్కడకి వెళ్లి దీన్ని వదిలి పెట్టాలి! అని అడిగాడు.  అతడి మాటలు విన్న కశ్యపబ్రహ్మ “నాయనా! హిమాలయాల్లో నిష్పురుష అనే కొండ ఉంది. అక్కడికి వెళ్లడం ఈశ్వరుడికి కూడా కష్టమే. ఆ కొండ గంధమాదన పర్వతానికి లక్ష ఆమడల దూరంలో ఉంది. ఈ చెట్టు కొమ్మని అక్కడ విడిచిపెట్టు! అని చెప్పాడు. తండ్రి మాటలు విని గరుత్మంతుడు మనో వేగం కంటే మించిన వేగంతో ఎగురుతూ వెళ్లి ఆ చెట్టు కొమ్మని  నిష్పురుషం అనే పర్వతం మీద విడిచి పెట్టాడు. తరువాత హిమాచల పర్వతం మీదకి వెళ్లి ఏనుగుని, తాబేలుని తిని  బలాన్ని పెంచుకుని తన పని మీద స్వర్గలోకానికి బయలుదేరాడు.  అతడు రెక్కలు విదిలించగానే  రెక్కల వేగం నుంచి వచ్చిన గాలికి ఆ పర్వతం మీద ఉన్న వృక్షాలకు పూసిన పువ్వులన్నీ జయం కలగాలని ఆశీర్వదిస్తూ జలజలా గరుత్మంతుడి మీద వర్షంలా పడ్డాయి.

వాలఖిల్య మహర్షుల వృత్తాంతము

   గరుత్మంతుడు ఆకాశమార్గంలో ఇంద్రుడి రక్షణలో ఉన్న అమృతం తీసుకుని రావడం కోసం  బయలుదేరాడు. ఆ సమయంలో స్వర్గలోకంలో అనేక దుశ్శకునాలు కనిపించాయి.  వాటిని చూసి ఇంద్రుడు దేవతల గురువైన బృహస్పతిని కలుసుకుని మహర్షీ! ఇటువంటి దుశ్శకునాలు కలగడానికి కారణం ఏమిటి? అని అడిగాడు.   బృహస్పతి ఇంద్రుడితో “గరుత్మంతుడు బ్రహ్మజ్ఞానం కలిగిన కశ్యప ప్రజాపతి ఇచ్చిన వరం వల్ల వినతకి పుట్టిన కొడుకు. ఇతడు వాలఖిల్యులు అనే మహర్షుల దయతో పక్షి జాతికి రాజుగా ప్రసిద్ధి పొందాడు.  సముద్రం లోపల నివసించే అతి భయంకరులైన బోయల్ని పూర్తిగా తినేసిన వీరుడు. ఏనుగుని, తాబేలుని, రోహిణమనే వృక్షం యొక్క కొమ్మని ఒకేసారి పట్టుకుని ఆకాశంలో ఎగరకలిగిన బలము, వాయువేగము కలవాడు.

   తన తల్లి యొక్క దాసితనాన్ని పోగొట్టడం కోసం అమృతాన్ని తీసుకుని వెళ్లడానికి సాహసంతో వస్తున్నాడు. తనకిష్టమైన రూపాన్ని ధరించ గలడు, ఇష్టమైన ప్రదేశానికి  వెళ్లగలడు. అతణ్ని నువ్వు జయించలేవు. గరుత్మంతుడి గొప్పతనం నీకు కూడా తెలుసు.  పూర్వం కశ్యప ప్రజాపతి సంతానం పొందడం కోసం పుత్రకామేష్టి చేశాడు. అప్పుడు నీతో సహా అందరు దేవతలు, వాలఖిల్యులు అనే మహర్షులు ఆయనకి సహాయపడ్డారు. ఆ యజ్ఞం జరుగుతున్న సమయంలో నువ్వు నీ బలానికి తగినట్టు సమిధల్ని వీపుమీద మోసుకుని వచ్చావు. అదే సమయంలో బొటనవేలంత ఆకారంలో బలహీనులుగా ఉన్న వాలఖిల్యులు అనే మహర్షులు మోదుగ కట్టెల మోపుల్ని, దర్భల మోపుల్ని మొయ్యలేక, శ్రమతో వణుకుతూ తీసుకుని రావడం చూసి నువ్వు నవ్వావు.

   ఆ మహర్షులు కోపంతో  “ఎప్పుడూ యుద్ధంలో విజయాన్నే పొందేవాడు, అగ్నికి ఉన్నంత తేజస్సు కలవాడు, అణిమాది గుణాలు కలిగినవాడు, వీరులకే వీరుడైనవాడు, ఇంద్రుడికంటే వంద రెట్లు ఎక్కువ బలం కలవాడు, ఎవరితోను జయింపబడనివాడు అయిన బలవంతుడు జన్మిస్తాడు. అతడు రెండవ ఇంద్రుడుగా ప్రకాశిస్తాడు” అని అగ్నిహోత్రంలో హోమం చేశారు.  అది తెలుసుకున్న నువ్వు అలా జరగకుండ ఉండేలా చూడమని కశ్యప ప్రజాపతిని ప్రార్థించావు. వాలఖిల్య మహర్షులతో కశ్యపుడు మహర్షులారా! తన బాహుబలంతో అన్ని జీవరాసుల్నీ కాపాడడం కోసం బ్రహ్మ ఇంద్రుణ్ని నియమించాడు. రెండవ ఇంద్రుడు ఏర్పడితే అన్నీ తారుమారవుతాయి. ఇలా చెయ్యడం తగిన పని కాదు.

   మీరు అన్న మాటలు జరిగే తీరతాయి. కనుక, నాకు పుట్టబోయే కుమారుడు పక్షి జాతికే ఇంద్రుడు(రాజు) అవుతాడు!” అని చెప్పి వాలఖిల్య మహర్షుల్ని అంగీకరించేలా చేశాడు. ఇంద్రుడు ఒక్కడే ఉండేట్లు చేశాడు.

    కశ్యప ప్రజాపతి చేసిన పుత్రకామేష్టి యాగ ఫలితంవల్ల, వాలఖిల్యుల చేసిన తపస్సు యొక్క ఫలితం వల్ల జన్మించినవాడు గరుత్మంతుడు. పక్షులకు రాజైన ఆ గరుత్మంతుడే ఇప్పుడు అమృతాన్ని తీసుకుని వెళ్లడానికి వస్తున్నాడు. అందువల్లనే స్వర్గలోకంలో ఇన్ని దుశ్శకునాలు కనిపిస్తున్నాయి” అని చెప్పాడు.   బృహస్పతి చెప్పింది విని ఇంద్రుడు అమృతాన్ని రక్షిస్తున్న వాళ్లని అందర్నీ రప్పించి అమృతాన్ని జాగ్రత్తగా కాపాడమని ఆజ్ఞాపించి పంపించాడు. అనేక రకాల రూపాలు కలిగిన వీరులు, పదునైన కత్తులు మొదలైన ఆయుధాలు, నలుపు, ఎరుపు, తెలుపు, పసుపు మొదలైన రంగుల్లో ఉన్న కవచాలు ధరించి అమృతానికి కాపలాగా ఉన్నారు.  వాళ్లందరూ రాత్రి, పగలు కంటిమీద కునుకు లేకుండా అమృతం చుట్టూ ఉండి కాపలా కాస్తున్నారు.

 

మహాభారత కథ-9

 

సముద్ర మథనము

    అమృతం తాగడం వల్ల మరణం ఉండదని దేవతలకి తెలిసింది. ఏమయినా సరే అది ఎలా దొరుకుతుందో తెలుసుకుని దాన్ని తాగాలని అనుకున్నారు. పాలసముద్రాన్ని చిలికితే అందులోంచి అమృతం వస్తుంది. కాని, అది అంత తేలికైన పని కాదు. రాక్షసులకి కూడా నచ్చచెప్పి తమతో కలుపుకుంటే సముద్రాన్ని చిలకడం తేలిక అవుతుంది.

   అమృతం దొరికాక దాన్ని రాక్షసులే తాగేస్తేనో? దేవతలకి సందేహం వచ్చింది. అప్పటి సంగతి అప్పుడు చూసుకోవచ్చు. ముందు పాలసముద్రాన్ని చిలకడానికి రాక్షసుల సాయం అడగాలని అనుకున్నారు. దేవతలకీ రాక్షసులకీ ఎప్పుడూ పడదు. ఒకళ్లతో ఒకళ్లు పోట్లాడుకుంటూనే ఉంటారు. అయినా సరే, అమృతం తాగాలన్న కోరిక దేవతల్ని ఒకచోట నిలబడనియ్యడం లేదు.

  ఒకరోజు దేవతలందరూ రాక్షసుల దగ్గరికి వెళ్లారు. అమృతం తాగితే మరణం ఉండదని, ఎప్పుడూ హాయిగా జీవించే ఉండచ్చని నచ్చ చెప్పారు. చివరికి పాలసముద్రాన్ని చిలికి అమృతాన్ని పొందడానికి తాము సహాయం చేస్తామన్నారు రాక్షసులు.

   ఇంద్రుణ్ని తీసుకుని అందరూ కలిసి మేరు పర్వతం మీదకి వెళ్లారు. పాలసముద్రాన్ని చిలకడానికి సన్నాహాలు మొదలుపెట్టారు. అంత పెద్ద సముద్రాన్ని చిలకాలంటే దానికి సరిపడినంత కవ్వం కావాలి. కవ్వం దొరికినా దానికి తిరగడానికి తాడు కావాలి. ఈ రెండూ దొరికినా కవ్వం భూమిలో కూరుకుని పోకుండా దానికి కింద ఆధారం కావాలి. ఏం చెయ్యాలా.. అని అనేక విధాలుగా ఆలోచిస్తున్నారు.

   ఏదయినా సాధించాలి అనుకుంటే ముందు పట్టుదల ఉండాలి, తరువాత దానికి తగిన జ్ఞానం ఉండాలి, అవసరమైన పరికరాలు ఉండాలి. దేవతలు, రాక్షసులు అమృతం తాగాలన్న పట్టుదలతో ఉన్నారు. ఎలా చేస్తే అమృతాన్ని పొందవచ్చో ముందుగా తెలుసుకున్నారు. పరికరాల కోసం ఆలోచిస్తూ బ్రహ్మ,  విష్ణువుల్ని కలిసి సలహా అడిగారు.

   అన్ని పర్వతాల్నీ కలిపితే ఎంత పొడవు ఉంటుందో అంత పొడవుతోను, వంకర లేకుండాను, కదలకుండా స్థిరంగాను, తన మీద పెరిగే మూలికల రసంతో దృఢంగాను, అన్ని పర్వతాల కంటే పెద్దదిగాను ఉన్న  మంథర పర్వతాన్ని పాలసముద్రం చిలకడానికి కవ్వంగా ఉపయోగించమని సలహా ఇచ్చారు.

   భూమి పైకి పదకొండు యోజనాలు, భూమి లోపలికి పదకొండు యోజనాలు ఉన్న మంథర పర్వతాన్ని సర్పరాజు ఆది శేషుడు పెల్లగించాడు. దేవతలు రాక్షసులు కలిసి దాన్ని మోసుకుని వచ్చి సముద్రంలో పడేశారు. వెంటనే అది సముద్రంలో పైకి నిలవకుండా లోపలికి కూరుకుని పోయింది.

   పర్వతం కదలకుండా ఉండడానికి ఏం చెయ్యాలని విష్ణుమూర్తిని సలహా అడిగారు. మంథర పర్వతం సముద్రంలో కూరుకుని పోకుండా దాని అడుగున కూర్మావతారంతో తనే ఆధారంగా ఉంటానన్నాడు.

   మంథర పర్వతాన్ని కవ్వంగాను, కూర్మావతారంలో ఉన్న విష్ణుమూర్తిని దానికి ఆధారంగాను ఏర్పాటు చేసుకున్నారు.  కాని, కవ్వాన్ని తిప్పాలంటే తాడు కావాలిగా? బాగా ఆలోచించి... చాలా పొడవుగా ఉండే వాసుకి అనే పేరుగల పాముని తెచ్చి తాడుగా చేసుకున్నారు. వాసుకి మంథర పర్వతాన్ని చుట్టలుగా చుట్టుకున్నాడు.

   రాక్షసులు సర్పరాజు తలవైపు బలంగా పట్టుకున్నారు. దేవతలు వాసుకి తోక భాగాన్ని పట్టుకున్నారు. దేవతలు, రాక్షసులు కూడా అమృతాన్ని తాగే తీరాలి అనే పట్టుదలతో పాలసముద్రాన్ని చిలకడం మొదలు పెట్టారు.

   వాళ్లు పడుతున్న శ్రమని చూసి వాళ్లకి ఉన్న శక్తి సరిపోదనుకున్నాడు విష్ణుమూర్తి. అందుకని వాళ్లకి ఇంకా కొంత శక్తిని, వేగాన్ని ఇచ్చాడు. ఒకళ్లనొకళ్లు జబ్బలు చరుచుకుంటూ; ఉత్సాహ పరుచుకుంటూ; అంతకు ముందు కంటే ఎక్కువ వేగంతో కవ్వాన్ని తిప్పుతూ; పాలసముద్రాన్ని చిలుకుతున్నారు.  

   వాళ్ల కష్టానికి ఫలితం దక్కలేదు. ముందు విషం పుట్టి లోకాలన్నింటినీ దహించేస్తూ అన్ని వైపులకీ వ్యాపించించడం మొదలుపెట్టింది. భయపడి పరుగులు పెడుతూ అందరూ శివుడి దగ్గరికి వెళ్లారు.

   శివుడు ఆ విషాన్ని తన కఠంలో బంధించి ఉంచాడు. దేవతలు, రాక్షసులు పాలసముద్రం దగ్గరికి వెళ్లి మళ్లీ చిలకడం మొదలు పెట్టారు. వాళ్లల్లో అమృతాన్ని తాగాలన్న పట్టుదల ఇంకా పెరిగిపోయింది.

   ఈసారి జ్యేష్టాదేవి, చంద్రుడు, లక్ష్మీదేవి, ఉచ్ఛైశ్రవము అనే పేరుతో తెల్లని గుర్రము, కౌస్తుభమణి, అమృతంతో నిండిన కమండలంతో దేవ వైద్యుడు, ఐరావతమనే పేరుగల తెల్లని ఏనుగు ఇంకా అనేకమంది వ్యక్తులు, వస్తువులు, జంతువులు మొదలైనవన్నీ పుట్టాయి.

   వాటిలో ముల్లోకాలతో పూజింపబడుతున్న లక్ష్మీదేవి, సూర్యకిరణాల కాంతి కంటే ఎక్కువ కాంతితో ప్రకాశించే కౌస్తుభమణి విష్ణుమూర్తి వక్షస్థలం మీదకీ; ఉచ్ఛైశ్రమనే గుర్రము, ఐరావతమనే ఏనుగు ఇంద్రుడి దగ్గరికీ చేరుకున్నాయి.

   ఇంకా పట్టుదలతో పాలసముద్రాన్ని చిలుకుతూనే ఉన్నారు. చివరికి అమృతాన్ని సాధించారు. వాళ్ల ఆనందానికి అవధులు లేవు. సంతోషంతో ఉప్పొంగిపోయారు.

   అమృతం సాధించిన తరువాత దేవదానవుల మధ్య యుద్ధం జరిగింది. దాన్ని గురించి తెలుసుకుందాం...

   పాలసముద్రాన్ని చిలికినప్పుడు వచ్చిన అమృతాన్ని రాక్షసులు తీసేసుకున్నారు. దేవతలు ఊరుకుంటారా? ఆ విషయం విష్ణుమూర్తికి చెప్పారు. విష్ణుమూర్తి తక్కువవాడా? వెంటనే అందమైన మోహిని రూపంలో రాక్షసుల దగ్గరికి వచ్చాడు. రాక్షసులు అందంగా ఉన్న మోహినిని చూసి అమృతం గురించి మర్చిపోయి మోహిని వెంట పడ్డారు. అమృతం విష్ణుమూర్తి చేతికి వచ్చింది.

   మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి దేవతల్ని ఒకవైపు, రాక్షసుల్ని ఒకవైపు కూర్చోమన్నాడు. తనే స్వయంగా అందరికీ అమృతం పంచుతానని చెప్పాడు. దేవతలు, రాక్షసులు మోహిని చెప్పినట్టే కూర్చున్నారు. 

   మోహిని దేవతల వైపు అమృతం పంచుతుంటే వాళ్లు తాగుతున్నారు. రాక్షసుడు రాహువు కూడా దేవతల వరుసలో కూర్చున్నాడు. చంద్రుడు, సూర్యుడు అతణ్ని చూసి విషయం మోహినికి చెప్పారు. అప్పటికే మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి రాహువుకి అమృతం పోసేశాడు.

   సూర్య చంద్రులు చెప్పింది విని విష్ణుమూర్తి వెంటనే తన చక్రంతో రాహువు తల నరికేశాడు. అతడు తాగుతూ ఉన్న అమృతం అతడి కంఠం దగ్గరే ఉండిపోయింది. అప్పటికి ఇంకా రాహువు అమృతాన్ని మింగలేదు.

   రాహువు శరీరం భూమి మీద పడిపోయింది. తల భాగం మాత్రం అమృతం తాకడం వల్ల నాశనం లేకుండా ఉండిపోయింది. అప్పటినుంచే రాహువుకి సూర్య చంద్రులతో విరోధం ఏర్పడింది. అది ఇప్పటికీ నడుస్తూనే ఉంది.

   అమృతం తమకి పొయ్యలేదని రాక్షసులకి కోపం వచ్చింది. అందరూ కలిసి తమకు రాజైన బలిచక్రవర్తిని కలుసుకుని జరిగిన విషయం మొత్తం చెప్పుకున్నారు. బలిచక్రవర్తితో సంప్రదించి చివరికి ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ దేవతలతో మనకి స్నేహం వద్దు, యుద్ధం చేసి అమృతాన్ని తెచ్చుకుందామని అనుకున్నారు.

  యుద్ధమంటే రాక్షస జాతికి చాలా ఇష్టం. వెంటనే రథాలు, గుర్రాలు, ఏనుగులు, కాలిబలం సిద్ధం చేసుకున్నారు. భయంకరమైన ఆకారాలతో పెద్ద పెద్ద కేకలు వేస్తూ దేవతల మీదకి యుద్ధానికి వెళ్లారు.

   దేవతల మీద ఆపకుండా బాణాలు వేశారు. ఆ బాణాలు దేవతల్ని భయంకరంగా చుట్టుముట్టాయి. అది చూసిన దేవతలు విష్ణుమూర్తితో సహా యుద్ధానికి దిగారు.  పెద్ద పెద్ద పర్వత శిఖరాల మీద ఎక్కి రాక్షసుల మీద బాణవర్షం కురిపించారు.

   పై నుంచి ఆగకుండా మీద పడుతున్న బాణాలకి రాక్షసులు పెద్ద పెద్ద కేకలు వేస్తూ కూలబడి పోతున్నారు. విష్ణుమూర్తి ప్రయోగించిన చక్రానికి రాక్షసుల తలలు తెగి పడుతున్నాయి. యుద్ధరంగం మొత్తం రాక్షసుల రక్తంతో నిండి పోయింది.

   సముద్రపు ఒడ్డు దగ్గర జరుగుతున్న యుద్ధంలో రాక్షసులు ఓడిపోయారు. మరణించగా మిగిలిన రాక్షసులు సముద్రం అడుగుకి వెళ్లిపోయారు. అమృతాన్ని జాగ్రత్తగా కాపాడమని ఇంద్రుడికి అప్పగించి దేవతలందరూ తమ ప్రదేశాలకి వెళ్లిపోయారు.

 

మహాభారతకథ-8

 

ఆదిపర్వము రెండవ ఆశ్వాసము నుండి

నాగజాతి అనూరుడు గరుత్మంతుల జననం

   అప్పటి వరకు సూతమహర్షి చెప్పినదాన్ని విని శౌనకుడు మొదలైన మహర్షులు మహర్షీ! పాములకి కద్రువ తల్లి కదా! ఆమె తన పిల్లలకి నాశనం జరగాలని ఎందుకు శపించింది? అని అడిగి, సూతమహర్షి తరువాత చెప్పబోయే కథల్ని వినడానికి సిద్ధంగా ఉన్నారు.

నాగజాతి జననం

   కశ్యపబ్రహ్మకి ఇద్దరు భార్యలు. వాళ్ల పేర్లు కద్రువ, వినత. సంతానం కోసం కొన్నివేల సంవత్సరాలు ఆయనకి సేవ చేశారు.   ఒకరోజు కశ్యపుడు వాళ్లిద్దర్నీ పిలిచి  మీకు ఏ వరం కావాలో కోరుకోండి ఇస్తాను! అన్నాడు. తమ కోరిక తీరుతున్నందుకు వాళ్లిద్దరు చాలా సంతోష పడ్డారు.

   కద్రువ  “నాథా! నాకు అగ్నిలా గొప్ప కాంతి, చాలా పొడవైన శరీరము, అమితమైన పరాక్రమము కలిగిన వెయ్యి మంది కొడుకుల్ని ప్రసాదించండి! అని అడిగింది.

    అమె అడిగిన తరువాత వినత స్వామీ! నాకు కద్రువకు కలిగే కొడుకులకంటె ఎక్కువ పరాక్రమము, ముఖ్యంగా బాహుబలం ఎక్కువగా కలిగిన ఇద్దరు కొడుకుల్ని ప్రసాదించండి! అని కోరుకుంది.

   తపస్సంపన్నుడైన కశ్యప మహర్షి మంచి సంతానం కోసం పుత్రకామేష్టి అనే యాగం చేశాడు. కద్రువకి వెయ్యిమంది కొడుకుల్ని, వినతకి ఇద్దరు కొడుకుల్ని వాళ్లు కోరుకున్నట్టుగా అనుగ్రహించాడు. గర్భాల్ని జాగ్రత్తగా కాపాడుకోమని చెప్పాడు.

   కొంతకాలం గడిచాక వాళ్ల గర్భాలు అండాలుగా మారాయి. వాటిని నెయ్యితో నిండిన కుండల్లో ఉంచి కాపాడుకుంటున్నారు. అయిదు వందల సంవత్సరాలు అలాగే గడిచిపోయాయి.

  కద్రువ కుండల్లో పెట్టిన అండాలు పగిలి:-  శేషుడు, వాసుకి, ఐరావతుడు, తక్షకుడు, కర్కోటకుడు, ధనంజయుడు, కాళీయుడు, మణినాగుడు, ఆపూరణుడు, పింజరకుడు, ఏలాపుత్రుడు, వామనుడు, నీలుడు, అనీలుడు, కల్మాషుడు, శబలుడు, ఆర్యకుడు, ఉగ్రకుడు, కలశపోతకుడు, సురాముఖుడు, దధిముఖుడు, విమలపిండకుడు, ఆప్తుడు, కర్కోటకుడు, శంఖుడు, వాలిశిఖుడు, నిష్ఠానకుడు, హేమగుహుడు, నహుషుడు, పింగళుడు, బాహ్యకర్ణుడు, హస్తిపదుడు, ముద్గరుడు, పిండకుడు, కంబలుడు, అశ్వతరుడు, కాళీయకుడు, వృత్తుడు, సంవర్తకుడు, పద్ముడు, శంఖముఖుడు, కూష్మాండకుడు, క్షేమకుడు, పిండారకుడు, కరవీరుడు, పుష్పదంష్ట్రుడు, బిల్వకుడు, బిల్వపాండరుడు, మూషకాదుడు, శంఖశిరుడు, పూర్ణభద్రుడు, హరిద్రకుడు, అపరాజితుడు, జ్యోతికుడు, శ్రీవహుడు, కౌరవ్యుడు, ధృతరాష్ట్రుడు, శంఖపిండుడు, వీర్యవంతుడు, విరజుడు, సుబాహువు, శాలిపిండుడు, హస్తిపిండుడు, పిఠరకుడు, సుముఖుడు, కౌణపాశనుడు, కుఠరుడు, కుంజరుడు, ప్రభాకరుడు, కుముదుడు, కుముదాక్షుడు, తిత్తిరి, హలికుడు, కర్దముడు, బహుమూలకుడు, కర్కరుడు, అకర్కరుడు, కుండోదరుడు, మహోదరుడు  మొదలైన పేర్లతో వెయ్యిమంది గొప్ప బలవంతులైన, పొడవైన సర్ప రాజులు జన్మించారు. కద్రువకి కలిగిన సంతానం పాములన్నమాట!

అనూరుడు జననం

   తన గర్భం నుంచి వచ్చిన అండాలు ఇంకా పగలలేదని, తను కోరుకున్నట్టుగా తనకి సంతానం కలగలేదని వినత బాధ పడింది. తన సవతి కద్రువ తనకంటే ముందు తల్లయింది. తనని అందరూ ఏమనుకుంటారో అని సిగ్గుపడింది. తన అండాలు వాటంతట అవి పగలక ముందే కంగారుగా ఒక అండాన్ని పగుల కొట్టింది.  ఆ అండం నుంచి శరీరంలో కింద భాగం లేకుండా, పై శరీరం మాత్రమే ఉన్న గొప్ప నీతివంతుడైన కుమారుడు జన్మించాడు.

  అతడి పేరు అనూరుడు. శరీరం పూర్తిగా ఏర్పడకుండా జన్మించిన అనూరుడు (తొడలు లేనివాడు) తల్లి మీద కోపగించాడు. తల్లీ! నాకు పూర్తిగా శరీరం ఏర్పడకుండానే అండాన్ని పగలకొట్టి పొరపాటు చేశావు. నన్ను వికలాంగుడిగా పుట్టించావు. కనుక, నువ్వు అయిదు వందల సంవత్సరాలు నీ సవతి కద్రువకి దాసిగా జీవించు!” అని తల్లిని శపించాడు.

   అనూరుడు కోపంతో శపించినా అంతలోనే దయ కలిగి  అమ్మా!  రెండవ అండం నుంచి గొప్ప బలము, పరాక్రమము కలిగినవాడు పుడతాడు. నీ దాసీత్వాన్ని అతడే పోగొడతాడు. తొందరపడి ఆ గుడ్డుని మాత్రం పగలకొట్టద్దు!” అని చెప్పాడు.

    వినత మళ్లీ పొరపాటు  చెయ్యకుండా తన రెండవ అండాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటోంది. ఆమె పెద్ద కుమారుడు అనూరుడు సూర్యుడికి సారథిగా వెళ్లిపోయాడు.

కద్రువ వినతల పందెము

   కద్రువ వినతలు పాలసముద్రం ఒడ్డు దగ్గర కూర్చుని ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తున్నారు. మొసళ్లు, నీటి ఏనుగులు బలంగా నీళ్లమీద పడి ఎగురుతున్నప్పుడు నీటి బిందువులు పైకి లేచి సముద్రపు అలల మీద వర్షం కురుస్తున్నట్టు, పైకి లేచిన అలలు ఆకాశాన్ని కప్పేస్తున్నట్టు కనిపిస్తోంది.

   పాములు, చేపలు, మొసళ్లతో నిండిన సముద్రం ఎగిసిపడే అలలతో అందంగా కనిపిస్తుంటే చూస్తూ కూర్చున్నారు. మధ్య మధ్య ఒడ్డు మీద ఉన్న వనాల్లో నడుస్తూ... ఏలకిలతలు, లవలీలతలు, మాదీలతలు, లవంగలతల్ని; తెల్లటి పద్మాలు, సముద్రపు అంచుకి చేరిన నురుగుతో అందంగా ఉన్న ప్రదేశాల్ని అసక్తిగా చూస్తున్నారు.

      పాలసముద్రాన్ని చిలికినప్పుడు అమృతంతో పాటు పుట్టిన ఉచ్ఛైశ్రవము అనే అందంగా బలంగా ఉన్న ఇంద్రుడి తెల్లటి గుర్రం పాలసముద్ర తీరంలో హాయిగా తిరుగుతూ కనిపించింది.  దాన్ని చూసి కద్రువ శరీరమంతా నిండు చంద్రుడిలా తెల్లగా ఉన్నా కూడా ఆ గుర్రానికి తోక మాత్రం నల్లగా ఉంది చూడు!” అంది.

   అది విని వినత నవ్వి “కద్రువా! నీకు నలుపు ఎలా కనిపించిందో గానీ, గొప్పవాళ్ల కీర్తి ప్రపంచమంతా వ్యాపించినట్టు దాని శరీరమంతా తెలుపు రంగు కాంతితో ప్రకాశిస్తోంది. దాని శరీరంలో అసలు నలుపు మచ్చ ఎక్కడ ఉంది?” అంది.

   అది విని కద్రువ “అయితే, ఆ తెల్లని గుర్రానికి నల్లటి మచ్చ ఉంటే నువ్వు వెంటనే నాకు దాసిగా ఉండాలి. ఒకవేళ దాని శరీరం మీద నల్ల మచ్చ లేదనుకో నేనే నీకు దాసిగా ఉంటాను! అంది.

   ఇద్దరూ ఒకళ్లకి ఒకళ్లు దాసిగా ఉండేట్టు పందెం వేసుకున్నారు. “అయితే దగ్గరగా వెళ్లి ఆ గుర్రాన్ని చూసి వద్దాం రా!” అంది వినత.

   కద్రువ “ఇప్పుడు సమయం చాలదు. రేపు ఉదయాన్నే వచ్చి చూద్దాం!” అంది. ఆ రోజు ఇద్దరూ ఇంటికి వెళ్లిపోయారు.

   ఇంటికి వెళ్లిన తర్వాత కద్రువ తన పాము పిల్లల్ని పిలిచి జరిగిన విషయం చెప్పి నేను, వినత పందెం వేసుకున్నాం. కనుక, మీరు ఆ గుర్రం తోకని నలుపు చెయ్యండి. లేకపోతే నేను వినత దగ్గర దాసిగా పడి ఉండాలి! అని చెప్పింది.

   అది ధర్మం కాదని వాళ్లు ఎవరూ అందుకు అంగీకరించలేదు. కద్రువకి తన కుమారుల మీద కోపం వచ్చింది. “నా మాట మీద మీకు గౌరవం లేదు. నేను చెప్పిన పని చెయ్యడం మీకు ఇష్టం లేదు. కనుక, పరీక్షిత్తు కుమారుడైన జనమేజయ మహారాజు చేసే సర్పయాగంలో మీరందరు మరణిస్తారు! అని శపించింది.

   అందరికంటే చిన్నవాడైన కర్కోటకుడు మాత్రం తల్లి ఇచ్చిన శాపానికి భయపడ్డాడు. మర్నాడు ఉదయాన్నే వెళ్లి గుర్రం తోకకి నల్లని మచ్చలా కనిపించేట్లు దాని తోకని పట్టుకుని వ్రేలాడుతూ ఉండిపోయాడు.

    కద్రువ, వినత గుర్రాన్ని చూడ్డానికి వెళ్లారు. కర్కోటకుడు గుర్రం తోకని చుట్టుకుని ఉండడం వల్ల గుర్రం తోక నల్లగా కనిపించింది. పందెంలో ఓడిపోయిన వినత కద్రువకి దాసిగా వచ్చింది.

గరుత్మంతుడు జననం

   అనూరుడు తల్లి వినతకి శాపం ఇచ్చి అయిదు వందల సంవత్సరాలు గడిచింది. శాప ఫలాన్ని అనుభవిస్తున్న వినత తన సవతి కద్రువ దగ్గర దాసిగానే జీవిస్తోంది.

    ఒకరోజు వినత పెట్టిన రెండవ గుడ్డు పగిలింది. సూర్యుడి కాంతే తక్కువగా ఉందేమో అనిపించేంత గొప్ప కాంతి; పర్వతాల్ని కూడా కదిలించ కలిగినంత వేగము, బలము ఉన్న రెండు రెక్కలతో అతిపెద్ద శరీరం కలిగిన  గరుత్మంతుడు జన్మించాడు.  గొప్ప బలశాలి, పెద్ద శరీరం ఉన్న కుమారుణ్ని చూసుకుని ఆనందపడింది వినత. అతడు వెంటనే ఆకాశంలోకి ఎగిరిపోయాడు. ఇంద్రుడు వజ్రాయుధానికి కూడా తెగనంత పెద్దపెద్ద రెక్కలతో ఉన్నాడు. పర్వతంలా ఆకాశ మార్గంలో ఎగురుతూ వెళ్లి, వెంటనే కిందకి దిగి వచ్చి తల్లి వినతకి నమస్కరించాడు.

   పుడుతూనే తన పెద్ద శరీరంతో ఆకాశంలోకి ఎగిరి, తిరిగి వచ్చి తల్లికి నమస్కరిస్తున్న గరుడుణ్ని చూసిన కద్రువకి అసూయ కలిగింది. వెంటనే “నీ తల్లి వినత నాకు దాసి. నువ్వు కూడా నేను చెప్పినట్టే వినాలి. నా పిల్లల్ని అందర్నీ ఎత్తుకుని తీసుకుని వెళ్లి ప్రదేశాలన్నీ చూపించు!” అని ఆజ్ఞాపించింది.

   సవతి తల్లి కద్రువ చెప్పిన పనులన్నీ గరుత్మంతుడు వినయంగా చేస్తున్నాడు. ఒకరోజు గరుత్మంతుడు పాముల్ని వీపు మీద ఎక్కించుకుని, అతి వేగంతో ఎగురుతూ సూర్యమండలం వరకు వెళ్లాడు.  సూర్యుడి తీక్ష్ణమైన కిరణాల వేడిని భరించలేక పాములు జారి నేలమీద పడి మూర్ఛపోయాయి.

    అది చూసిన కద్రువ కోపంతో గరుత్మంతుణ్ని నిందించింది. తన పిల్లల్ని బ్రతికించమని ఇంద్రుణ్ని ప్రార్థించింది. ఇంద్రుడు ఆ పాముల మీద పెద్ద వాన కురిపించి వాటికి వేడి తగ్గేట్టు చేశాడు. కద్రువ ఇంతకు ముందు కంటే ఎక్కువగా వినతకి, గరుత్మంతుడికి పనులు చెప్పి చేయించుకుంటోంది.

   ఒకరోజు గరుత్మంతుడు తల్లి దగ్గరికి వెళ్లి “మనం కద్రువకి దాసులుగా ఎందుకు ఉంటున్నాము? అని అడిగాడు.

   తను కద్రువ పందెం వేసుకున్నామనీ; అందులో తను ఓడిపోడం వల్ల అమెకి దాసీగా ఉండవలసి వచ్చిందనీ; తన పెద్దకుమారుడు అనూరుడు కూడా తనను శపించాడనీ వివరంగా చెప్పింది వినత. గరుత్మంతుడు చాలా బాధ పడ్డాడు.

     “నాయనా! తల్లితండ్రులయందు భక్తి, శక్తి, మంచి బుద్ధి కలిగిన కుమారులు ఉంటే ఏ తల్లితండ్రులకీ కష్టాలు ఉండవు. నీ వంటి యోగ్యుడైన కుమారుణ్ని పొందిన నాకు ఈ దాస్యం ఎంతకాలమో ఉండదు. తప్పకుండా విముక్తి కలుగుతుంది బాధపడకు అని ఆత్మ విశ్వాసంతో చెప్పింది.

 

 

మహాభారతకథ-7

 

భృగువంశము యొక్క గొప్పతనము

    మహాభారత కథ వింటున్న మహర్షులకి ఒక సందేహం కలిగింది. సూతమహర్షిని అడిగారు మహర్షీ! పాములకి లోకాలన్నింటినీ భయపెట్ట కలిగినంత పరాక్రమము, అగ్నితో సమానమైన భయంకరమైన విషము ఉంది. సర్పయాగంలో భయంకరమైన అగ్ని జ్వాలల్లో పడి నశించ వలసిన అవసరం ఎందుకు వచ్చింది? అని అడిగారు.

   శౌనకుడు మొదలైన మహర్షుల సందేహాన్ని తీర్చడం కోసం సూతమహర్షి చెప్తున్నాడు..  పాముల తల్లి కద్రువ ఇచ్చిన శాపం వల్లే జనమేజయుడు సర్పయాగం చేసినప్పుడు పాములన్నీ అగ్నిలో పడి  మరణించాయి.  భృగువంశంలో పుట్టిన రురుడు చేసిన సర్ప నాశనాన్ని సహస్రపాదుడు అనే మహర్షి   ఆపించాడు. అదే విధంగా జరత్కారు దంపతుల కుమారుడు ఆస్తీకుడు అనే మహర్షి జనమేజయుడు చేసిన సర్పయాగాన్ని మాన్పించాడు. ఆ వృత్తాంతాన్ని మీకు చెప్తాను అని ఆస్తీకుడు కథ చెప్తున్నాడు.

    భృగు మహర్షి భార్య  పులోమ గర్భవతి. ఆమెకి హోమానికి అగ్నిని సిద్ధం చెయ్యమని చెప్పి మహర్షి స్నానానికి వెళ్లాడు. అదే సమయంలో పులోముడు అనే భయంకరమైన రాక్షసుడు వచ్చాడు. అతడు అగ్నికి పులోమని చూపించి ఈమె ఎవరు? అని అడిగాడు.

   అబద్ధం చెప్పకూడదు కనుక అబద్ధం చెప్పలేక, నిజం చెప్తే భృగుమహర్షి శాపం ఇస్తాడు కనుక నిజం చెప్పలేక అగ్ని భయపడ్డాడు. శాపం వల్ల కలిగిన అపద నుంచి తప్పించుకోవచ్చు. అసత్యం చెప్పడం వల్ల కలిగే పాపం నుంచి తప్పించుకోడం కుదరదు. తనలో తను ఆలోచించుకున్న అగ్ని చివరికి ఆమె మహాపతివ్రత భృగుమహర్షి భార్య అని రాక్షసుడికి నిజం చెప్పేశాడు.  పులోముడు పంది రూపంలో వచ్చి పులోమని ఎత్తుకుని పోయాడు. అతడు పరుగెత్తుకుంటూ వెళ్లేటప్పుడు ఆమె కడుపులో ఉన్న బిడ్డ జారి కింద పడ్డాడు. అతడి పేరు చ్యవనుడు.

    వెయ్యి మంది సూర్యుల తేజస్సుతో సమానమైన తేజస్సు, ప్రళయ సమయంలో అగ్నికి ఉండేంత వెలుగు కలవాడు చ్యవనుడు. భృగుమహర్షి కుమారుడు చ్యవనుడి తేజస్సు చూడగానే రాక్షసుడు పులోముడు కాలి బూడిదయ్యాడు. భృగువంశ కీర్తిని ఇనుమడింప చేసే ఆ బిడ్డని ఎత్తుకుని పులోమ తన ఆశ్రమానికి వచ్చింది.

   రాక్షసుడు ఎత్తుకుని పోతున్నప్పుడు మె ఏడ్చింది.  ఆ సమయంలో ఆమె కళ్లనుంచి కారిన కన్నీళ్లు ఆశ్రమం దగ్గర పెద్ద నదిగా ప్రవహించాయి. ఆ నదికి బ్రహ్మదేవుడు వధూసర అని పేరు పెట్టాడు. భృగుమహర్షి కొడుకుని ఎత్తుకుని వచ్చిన భార్యని ఆ రాక్షసుడు నిన్ను ఎలా తెలుసుకున్నాడు?” అని అడిగాడు.

   పులోమ అగ్నిని చూపించి  ఇతడే నా గురించి చెప్పాడు. నేను పరుగెడుతున్నప్పుడు నా గర్భంలో ఉన్న ఈ కుమారుడు గర్భంలోంచి జారి కింద పడ్డాడు.  ఇతడి తేజస్సుని చూసి తట్టుకోలేక రాక్షసుడు చచ్చిపోయాడు. తన తేజస్సుతో రాక్షసుణ్ని చంపి ఈ బిడ్డే నన్ను కాపాడాడు అని చెప్పింది.

   భృగు మహర్షి అగ్నిని చూసి నువ్వు చాలా తప్పు చేసావు. అన్ని వస్తువుల్నీ తినేసే స్వభావాన్ని పొందు” అని శపించాడు.  అగ్ని మహర్షీ! తనకు తెలిసిన విషయాన్ని తెలియదు అని అబద్ధం చెప్పినవాడు నరకానికి వెడతాడు. అందుకే నేను అబద్ధం చెప్పకుండా నిజమే చెప్పాను.  నేను కూడా నీకు శాపం ఇవ్వగలను. కాని, బ్రాహ్మణుల్ని అందరూ గౌరవించాలి. వాళ్లకి హాని చెయ్య కూడదు. నేను బ్రాహ్మణుల్ని భక్తితో పూజిస్తాను కనుక, నేను నిన్ను శపించను.

   నాకు శాపమిచ్చి నువ్వు లోకాలకే హాని కలిగించావు. వేదాల్లో చెప్పబడిన వస్తువులతో బ్రాహ్మణులు నా యందు హోమం చేస్తారు. అన్నము మొదలైన వస్తువులు దేవతలకీ, పితృదేవతలకీ నా ద్వారానే అందుతాయి. అటువంటి నేను అన్నీ తింటూ అపవిత్రుణ్ని అయితే కర్మలు సరిగా జరగవు. దానివల్ల లోక గమనం ఆగిపోతుంది అని చెప్పి అగ్ని దేవుడు అన్ని లోకాల్లోను వ్యాపించిన తన కాంతిమయమైన రూపానికి కాంతి లేకుండా చేశాడు.

   ఆహవనీయం, దక్షిణాగ్ని, గార్హపత్యం అనే మూడు అగ్నులు ప్రకాశించక పోవడం వల్ల యాగాలు ఆగిపోయాయి. అగ్నుల్లో ఉదయం సాయంకాలం జరిగే ఉపాసం మొదలైన హోమాలు జరగడం లేదు. భూమి మీద పితృదేవతలకి ఇచ్చే పిండాలు, యజ్ఞకార్యాలు ఆగిపోయాయి.

   ప్రజలందరు భయంతో మహర్షుల దగ్గరికి వెళ్లారు. మహర్షులందరూ దేవతల దగ్గరికి వెళ్లారు. దేవతలు, మునులూ కలిసి బ్రహ్మ దగ్గరికి వెళ్లారు. భృగుమహర్షి ఇచ్చిన శాపం వల్ల అగ్నికి తేజస్సు లేకుండా పోయిందని, దాని వల్ల అన్ని లోకాల్లోను కర్మలు లేకుండా పోయాయని బ్రహ్మదేవుడికి చెప్పారు.

   ఆయన అగ్నిని పిలిపించి కనిపించే భూతాలన్నింటికీ నువ్వే అధిపతివి. కదలడం, కదలక పోవడం, లోకాల్ని పవిత్రం చెయ్యడం నీ వల్లే జరుగుతోంది. ఇన్ని మంచి గుణాలు కలిగి ప్రపంచాన్ని రక్షించవలసిన నువ్వు ఆ పనిని లక్ష్య పెట్టకుండా ఉండడం మంచిది కాదు. భృగుమహర్షి శాపం జరగక మానదు. నువ్వు అన్నీ తినేవాడివే అయినా పవిత్రులందరికంటే పవిత్రుడివి; అర్హత కలవాళ్లందరి కంటే అర్హత కలిగినవాడివి; పూజింప తగ్గ వాళ్లందరిలో మొదట పూజింపతగ్గ వాడివి.  వేదాల్లో చెప్పినట్లు బ్రాహ్మణులకి కర్మలు చెయ్యడంలో సహాయపడి లోకాలు నడిచేలా చెయ్యి. నీ పవిత్రత ఎప్పటిలాగే ఉంటుంది అని అగ్నికి చెప్పి మహర్షి శాపాన్ని వ్యర్థం కాకుండా చేశాడు.

   తపస్సంపన్నుడైన భృగుమహర్షి తన కుమారుడు చ్యవనుడికి శర్యాతిమహారాజు కుమార్తె  సుకన్యని ఇచ్చి వివాహం చేశాడు. ఆ దంపతులకి  గొప్పవాడైన  ప్రమతి పుట్టాడు.  ప్రమతికీ అమృతంతో పాటు పుట్టిన ఘృతాచి అనే అప్సరసకి వివాహం జరిపించాడు. భృగువంశంలో గొప్పడుగా గొప్ప కాంతి కలిగిన రురుడు పుట్టాడు. అతడు గొప్ప మహర్షి.

   విశ్వావసుడు అనే పేరు గల గంధర్వరాజుకి మేనక అనే అప్సరసకీ పుట్టినవాడు  స్థూలకేశుడు.  రూపము, గుణము, సౌందర్యము కలిగిన ప్రమద్వర స్థూలకేశమహర్షి  ఆశ్రమంలో పెరుగుతోంది.  ప్రమద్వరని చూసిన రురుడు ఆమెని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు.

    ఒకరోజు ప్రమద్వర తన తోటివాళ్లతో ఆడుకుంటూ చూసుకోకుండా పాముని తొక్కింది. వెంటనే ఆ పాము ప్రమద్వరని కరిచింది. మిగిలినవాళ్లు భయంతో కేకలు పెట్టారు. విషయం తెలుసుకున్న గౌతముడు, కణ్వుడు, కుత్సుడు, విశ్వామిత్రుడు, శంఖుడు, మేఖలుడు, భరద్వాజుడు, వాలఖిల్యులు, ఉద్దాలకుడు, శ్వేతకేతుడు, మైత్రేయుడు, ప్రమతి, రురుడు అనే మహర్షులందరూ స్థూలకేశుడి ఆశ్రమానికి వచ్చి చచ్చిపోయిన ప్రమద్వరని చూసి బాధ పడ్డారు.

   రురుడు బాధపడుతూ ఒంటరిగా అడవికి వెళ్లి దేవతలారా! బ్రాహ్మణులారా! నేను దేవతల్ని పూజించడం, యజ్ఞాలు చెయ్యడం, వేదాలు పఠించడం, వ్రతాలు ఆచరించడం, పుణ్యకార్యాలు చెయ్యడం, గురువుల్ని బ్రాహ్మణుల్ని గౌరవించడం, తపస్సు చెయ్యడం వంటివి ఆచరిస్తున్నవాడినైతే నా ప్రాణంగా అనుకుంటున్న ప్రమద్వరని బ్రతికించండి. మీ దయ వల్ల ఆమె విష ప్రభావం నుంచి బయట పడాలి!  మహాత్ములు తమ తపో ప్రభావంతోను, విషతత్త్వాన్ని తెలిసినవాళ్లు మంత్ర తంత్రాలతోను విష ప్రభావం వల్ల  ప్రాణాలు పోగొట్టుకున్న నా ప్రమద్వరని తిరిగి బ్రతికించండి. అమెని బతికించిన వాళ్లకి నాకు తపస్సు వల్ల కలిగిన ఫలితాన్ని, వేదాధ్యయనం చెయ్యడం వల్ల కలిగిన ఫలితాన్ని, దానంగా ఇస్తాను అని చెప్తూ గట్టిగా ఏడుస్తున్నాడు.

   అకాశం నుంచి ఒక దేవదూత మహర్షీ! మరణం కలిగితే దాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదు. అయినా ఒక ఉపాయం చెప్తాను. నీ ఆయుర్దాయంలో సగం భాగాన్ని నువ్వు ఆమెకి ఇయ్యగలిగితే ఆమె బ్రతుకుతుంది అని చెప్పాడు. ఆ మాటలు విని రురుడు తన ఆయుర్దాయంలో సగ భాగం ప్రమద్వరకి ఇవ్వడానికి సంతోషంగా అంగీకరించాడు. దేవదూత యముడి అనుమతి తీసుకుని ప్రమద్వరని బ్రతికించాడు. రురుడు ప్రమద్వరని పెళ్లి చేసుకుని అనేక భోగాలు అనుభవించాడు.

   రురుడు తన భార్యకి హాని చేసిన పాముల మీద కక్ష పెట్టుకున్నాడు. పెద్ద కర్ర పట్టుకుని అడవిలో తిరుగుతూ చెట్లల్లోను, పుట్లల్లోను, పొదల్లోను వెతికి వెతికి కనిపించిన ప్రతి పాముని చంపేస్తున్నాడు.   ఒకచోట విషం లేని డుండుబము అనే పెద్ద పాము కనిపించింది. దాన్ని కొట్టడానికి కర్రని పైకి ఎత్తాడు.

   అది హరినామాన్ని స్మరిస్తూ మనుష్య భాషలో మాట్లాడుతూ  గొప్ప తేజస్సు కలవాడివి, బ్రాహ్మణుడివి. నువ్వు పాముల మీద ఇంత కోపాన్ని ఎందుకు పెంచుకున్నావు? అని అడిగింది. రురుడు నేను భార్గవ వంశంలో పుట్టిన రురుడు అనే పేరు కలవాణ్ని. నా భార్యకి పాము హాని చేసింది కనుక చంపుతున్నాను. ఇప్పుడు నిన్ను కూడ వదిలిపెట్టను” అంటూనే కర్రని పైకి ఎత్తాడు.  వెంటనే మహర్షి రూపంలో కనిపించిన డుండుబాన్ని చూసి రురుడు ఇప్పటి వరకు సర్పరూపంలో  ఇప్పుడు మహర్షి రూపంలో ఉన్నావు... ఏమిటిదంతా?” అని అడిగాడు.

    డుండుబము మహర్షి రురుడితో నేను సహస్రపాదుడు అనే మహర్షిని. ఖగముడు నాతో కలిసి చదువుకున్నాడు. అతడు హోమశాలలో ఉన్నప్పుడు ఒక గడ్డి పాముని చేసి సరదాగా అతడి మీదకి వేశాను. అతడు భయపడి నా మీద కోపగించి నువ్వు శక్తిలేని పాముగా మారు! అని శపించాడు.  నేను క్షమించమని అడిగాను.

    ఖగముడు శాంతించి నా శాపం నువ్వు అనుభవించక తప్పదు. కొంతకాలం విషం లేని పాముగా ఉంటావు. తరువాత భృగువంశంలో భార్గవవంశాన్ని వృద్ధి చేసే రురుడు నీకు కనిపిస్తాడు. అతడు కనిపించగానే నీకు శాప విమోచనం జరుగుతుంది అని చెప్పాడు. ఇప్పుడు నువ్వు కనిపించగానే నాకు శాపవిమోచనం జరిగింది.

   ప్రజలతో కీర్తింపబడే బ్రాహ్మణుడివి, గొప్ప జ్ఞానం కలవాడివి, అందరికీ మంచి జరగాలని కోరుకునే మనస్సు కలవాడివి, శాంతస్వభావుడివి, వేదాల్లో చెప్పబడిన కర్మల్ని  క్రమం తప్పకుండా ఆచరించేవాడివి, దయ కలవాడివి, సత్యాన్నే పలికేవాడివి, గొప్పదైన భృగు వంశంలో పుట్టినవాడివి, అన్ని మంచి గుణాలు కలిగిన నువ్వు ఇటువంటి పని ఎందుకు చేస్తున్నావు? ఇటువంటి హింసా స్వభావం క్షత్రియులకి ఉంటుంది.  బ్రాహ్మణులకి హింస పనికిరాదు. పూర్వం పాములకి తల్లి అయిన కద్రువ పాములకి శాపం ఇచ్చింది. అందువల్ల జనమేజయుడు చేసిన సర్పయాగంలో పాములకి హాని జరిగింది. ఆ సమయంలో నీ తండ్రికి శిష్యుడైన ఆస్తీకుడు అనే బ్రాహ్మణుడే ఆ యాగాన్ని ఆపించి పాముల్ని రక్షించాడు” అని చెప్పాడు.  సహస్రపాదుడు చెప్పిన మాటలు విని రురుడు తను పాములకి చేస్తున్న హింసని ఆపేశాడు అని చెప్పి సూతమహర్షి అక్కడ ఉన్న మహర్షులకి మహాభారత కథని వినిపిస్తున్నాడు.

ఇక్కడివరకు మహాభారతకథ ఆదిపర్వం మొదటి ఆశ్వాసం పూర్తయింది