About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

కవిత సాహితీ రస స్రవంతి

 

శీర్షిక  భగవంతుడే బాధితుడు

బాధితురాలు భూదేవి భూభారం మొయ్యలేక

దుర్మార్గుల భారం తగ్గించమని వేడుకుంది భగవంతుణ్ని!

నారాయణుడు శ్రీకృష్ణుడిగా అవతారమెత్తాడు

భూలోకంలో దుర్మార్గపు భక్తుల కోసం బాధితుడయ్యాడు!

దుర్మార్గుల చేతిలో దెబ్బలు తిన్నాడు.. తిరిగి తన్నాడు..

భక్తి ప్రేమపాశానికి.. బద్ధుడై పూదోటలో బందీగా ఉన్నాడు!

వేణువును ఊదాడు.. గోవులను కాచాడు..

ఆటలాడాడు, పాటలూ పాడాడు.. చిలిపి చేష్టలు చేసి

కొంటెవాడనీ  అనిపించుకొన్నాడు!

భక్తులకోసం బాధితుడవడం తనకు ఆనందమన్నాడు!

భక్తులతో కలిసి పప్పు రుబ్బాడు.. పిండి విసిరాడు.

ఆర్తితో ఆపదలో మొరపెట్టుకొన్న ద్రౌపది కష్టాలకి

బాధ పడ్డాడు.. వలువలిచ్చి ఆదుకున్నాడు..

బాల్యంలో వెన్న దొంగిలించాడు.. గోపికల వస్త్రాలు

అపహరించి.. చోరుడుగా పేరుపడ్డాడు!

భక్తులకోసం బాధితుడవడం తనకు ఆనందమన్నాడు!

ద్వారకాధీశుడై శమంతకమణిని అపహరించి...

ప్రసేనుడిని సంహరించాడనే నింద మోశాడు!

శిశుపాలుడు, కంసుడు,జరాసంధుడు, బాణాసురుడు..

వంటి దుష్ట రాజులెందరినో  సంహరించాడు..

పాండవ పక్షపాతిగా ముద్ర వేయించుకున్నాడు..

భక్తులకోసం బాధితుడవడం తనకు ఆనందమన్నాడు!

ఎంగిళ్ళు తిన్నాడు.. క్షవర కర్మ కూడ చేశాడు

సంసారిగా జీవించాడు.. భోగిగా కనిపించాడు

మహాయోగీశ్వరుడిగా పరిగణింపబడ్డాడు

గురుసేవలు చేశాడు.. బ్రాహ్మణుల పాదాలు కడిగాడు

భక్తులకోసం బాధితుడవడం తనకు ఆనందమన్నాడు!

నిందలను మోసాడు.. దూషింపబడ్డాడు

సామాన్యుడిగా మసలాడు.. జగద్గురువుగా వినుతికెక్కాడు

ఆనందరూపుడై అలరించాడు.. ఆనందాన్ని పంచిపెట్టాడు..

ఙ్ఞాన స్వరూపుడై ఙ్ఞానకాంతులను విరజిమ్మాడు..

శాంతికాముడై ధర్మ స్థాపనకు ఉద్యమించాడు..

భక్తులకోసం బాధితుడవడం తనకు ఆనందమన్నాడు!

ప్రహ్లాదుడి బాధలు స్వయంగా అనుభవించాడు..

గజేంద్రుడి మోక్షం కోసం  తాపత్రయపడ్డాడు!

భక్తుల బాధ తానే అనుభవించి..భక్తికి లొంగి ఆదున్నాడు!

వేలమంది రాచకన్యల్ని వివాహమాడాడు

జారుడుగా, బహుపెద్ద సంసారిగా పరిహసింపబడ్డాడు!

భక్తులకోసం బాధితుడవడం తనకు ఆనందమన్నాడు!

రాజనీతిని పాటించాడు.. రాజకీయ వ్యవహారాలూ..

నడిపించాడు.. రాయబారం చేశాడు..

మహాభారత యుద్ధానికి కారకుడన్న నింద మోశాడు!

తానెన్నో ఇక్కట్లు పడ్డాడు.. మంచి చెడులకి అక్కరకి వచ్చాడు

భక్తులకోసం బాధితుడవడం తనకు ఆనందమన్నాడు!

భూదేవి కోరిక గౌరవించాడు.. భూమికి భారం తగ్గించాడు

వచ్చిన పని పూర్తి చేశాడు... అవతార సమాప్తికి సిద్ధమయ్యాడు

పిలిస్తే  పరమాత్మ పరుగెత్తి వస్తాడు ... భక్తులకోసం బాధితుడవుతాడు!

 

No comments:

Post a Comment